Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మన్ కీ బాత్ – మనసులో మాట


నా ప్రియమైన దేశప్రజలారా నమస్కారం! వర్షాకాలంలో మనిషి మనసు చాలా పారవశ్యంగా ఉంటుంది. పశువులు, పక్షులు, మెక్కలు, ప్రకృతి, ప్రతి ఒక్కరూ వర్షాగమనం వల్ల ఉల్లాసంగా మారిపోతారు. కానీ ఎప్పుడైనా వర్షం వికృతరూపాన్ని ధరిస్తే మాత్రం వినాశనాన్ని సృష్టించే శక్తి నీటికి ఎంత ఉందో తెలుస్తుంది. ప్రకృతి మనకి జీవితాన్ని ఇస్తుంది. మన భాధ్యతల్ని స్వీకరిస్తుంది. కానీ అప్పుడప్పుడు భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తన భయంకరమైన స్వరూపంతో ఎంతో వినాశనాన్ని సృష్టిస్తుంది. మారుతున్న ఋతుచక్రంతో పర్యావరాణంలో మార్పులు వస్తున్నాయి. దాని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంటోంది. గత కొన్ని రోజుల్లో భారతదేశంలోని అస్సాం, ఈశాన్య ప్రాంతాలు, గుజరాత్, రాజస్థాన్, బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి కారణంగా ప్రాకృతిక ఆపదల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వరద ప్రాంతాల్లో ఎంతో పర్యవేక్షణ జరుగుతోంది. విస్తృతంగా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంత్రి మండలిలోని నా మిత్ర సభ్యులు కూడా ఏ ప్రాంతానికి వీలైతే ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ పధ్ధతుల్లో వరద బాధితులకు వీలైనంత ఉత్తమ సహాయాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సహాయార్థం సామాజిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, సేవాభావంతో పని చేసే పౌరులు తమకు వీలైనంతగా సహాయపడుతున్నారు. భారత ప్రభుత్వం తరఫున మిలటరీ జవానులైనా, వాయు ఫోర్స్ వారైనా, NDRF వారైనా, పారామిలిటరీ దళాలైనా ఇలాంటి సమయాల్లో ఆపదలో చిక్కుకున్న వారిని తమ ప్రాణాలొడ్డి సహాయపడడానికి సంతోషంగా ఏకమౌతారు. వరదల వల్ల జన జీవితం చాలా అస్థవ్యస్థంగా తయారౌతుంది. పంటలు, పశువులు, మౌలిక సదుపాయాలు, రోడ్లు, విద్యుత్తు, సమాచార మాధ్యమాలు మొదలైనవన్నీ ప్రభావితమౌతాయి. ముఖ్యంగా మన రైతు సోదరులకూ, పంటలకూ నష్టం జరిగినప్పుడు వారు నష్టపోకుండా ఇన్సురెన్స్ కంపెనీలకు, ముఖ్యంగా పంటల బీమా కంపెనీలు రైతులకు క్లైమ్ సెట్టిల్మెంట్ వెంటనే చేసేలా, వారు ముందస్తుగా అప్రమత్తంగా ఉండేలా ప్రణాలికలు తయారు చేసాము. వరద పరిస్థితులను ఎదుర్కోవడానికి 24 గంటలు control room helpline number 1078 నిరంతరం పనిచేస్తోంది. ప్రజలు తమ కష్టాలు చెప్తున్నారు కూడా. వర్షాకాలానికి ముందరే అత్యధిక ప్రాంతాల్లో ముందస్తు అప్రమత్తత తో ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ సిధ్ధంగా ఉంచాము. NDRF బృందాలను పనిలో పెట్టాము. వారు, ప్రతి చోటా ఆపదమిత్రులను తయారుచెయ్యటం, వారికి ఏమేమి చెయ్యాలో ఏమేమి చెయ్యకూడదో శిక్షణనివ్వడం, వాలంటీర్లను నిర్ణయించడం, ఒక వైపు ప్రజా సంస్థల్ని నిలబెట్టడం మొదలైన పనులన్నీ చేస్తారు. ఈరోజుల్లో మనకు ముందుగానే వాతావరణ సూచనలు లభిస్తున్నాయి. సాంకేతికత అబివృధ్ధి చెందడం వల్ల అంతరిక్ష విజ్ఞానం కూడా వాతావరణ అంచనాలు సరిగ్గా వెయ్యడంలో పెద్ద పాత్ర వహిస్తోంది. నెమ్మది నెమ్మదిగా మనం కూడా ఈ వాతావరణ సూచనల ప్రకారంగా మన పనులను చేసుకుంటూ ఉంటే నష్టాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

నేను మనసులో మట కోసం తయారయ్యేప్పుడు, నాకన్నా ఎక్కువగా దేశ ప్రజలు ఎక్కువ తయారవడాన్ని నేను గమనిస్తున్నాను. ఈసారి జిఎస్ టి గురించి ఎన్ని ఉత్తరాలు, ఫోన్ కాల్స్ వచ్చాయంటే ఇప్పటికీ ప్రజలు తమ ఆనందాన్ని, కుతూహలాన్నీ వ్యక్తపరుస్తున్నారు. ఒక ఫోన్ కాల్ మీకు వినిపిస్తాను..

“నమస్కారం ప్రధానమంత్రి గారూ, నేను గుర్గావ్ నుండి నీతూ గర్గ్ ను మాట్లాడుతున్నాను. నేను మీ చార్టెడ్ అకౌంటెంట్స్ డే నాటి ప్రసంగాన్ని విని చాలా ప్రభావితమయ్యాను. క్రిందటి నెల ఇదే తేదీన మన దేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్- జి ఎస్ టి అమలులోకి వచ్చింది. దానివల్ల గత నెలరోజులుగా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తున్నాయో లేదో మీరు చెప్పగలరా? ఈ విషయంలో మీ ఆలోచనలను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ధన్యవాదాలు”

జి ఎస్ టి అమలులోకి వచ్చి దాదాపు నెల రోజులు గడిచింది. లాభాలు కూడా కనిపించడం మొదలైంది. జి ఎస్ టి కారణంగా వారు అవసరంగా కొనుగోలు చేస్తున్న వస్తువుల్లో ధర ఎలా తగ్గిందో, వస్తువులు ఎలా చవకగా లభిస్తున్నాయో చెప్తూ ఎవరైనా పేదల నుండి నాకు ఉత్తరాలు వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం, ఆనందం కలుగుతున్నాయి. మొదట్లో ఎలా ఉంటుందో ఏమో అని భయపడ్డాను కానీ ఇప్పుడు నెమ్మదిగా అన్ని విషయాలూ నేర్చుకుంటూ తెలుసుకుంటున్నారు, వ్యాపారం మునుపటి కంటే సులభమైందని ఈశాన్య ప్రదేశాలు, సుదూర కొండ ప్రదేశాల్లో, అడవుల్లో నివసించే వ్యక్తులు నాకు ఉత్తరం రాసినప్పుడు ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా వినియోగదారుడికి వ్యాపారస్థుడిపై నమ్మకం పెరుగుతోంది. రవాణా మరియు లాజిస్టిక్స్ రంగంలో జి ఎస్ టి ప్రభావం ఎంతగా పడిందో నేనూ గమనిస్తున్నాను. ట్రక్కుల రాకపోకలు పెరిగాయి. దూరాన్ని నిర్ణయించడం ఇప్పుడు సులభమైపోయింది. హైవే లు cluster free అయిపోయాయి. ట్రక్కుల వేగం పెరగడం వల్ల కాలుష్యం కూడా తగ్గింది. సరుకులు కూడా త్వరగా చేరుతున్నాయి. ఈ సౌలభ్యం వల్ల ఆర్థిక ద్రవ్య వేగానికి కూడా బలం చేకూరుతుంది. ఇంతకు ముందు పన్నులు విడివిడిగా ఉండడం వల్ల రవాణా మరియు లాజిస్టిక్స్ రంగంలో ఎక్కువ వనరులు రాత పని చెయ్యడానికే చాలా సమయం పట్టేది. అందుకోసం ప్రతి రాష్ట్రంలోనూ కొత్త కొత్త గోదాములు కట్టాల్సి వచ్చేది. నేను గుడ్ అండ్ సింపుల్ టాక్స్ అని పిలిచే జి ఎస్ టి నిజంగానే మన ఆర్థిక వ్యవస్థ మీద చాలా తక్కువ సమయంలోనే ఒక అనుకూల ప్రభావాన్ని ఉత్పన్నం చేసింది. ఎంతో వేగంగా వచ్చిన చక్కని మార్పు , వేగంగా జరిగిన మైగ్రేషన్ రిజిస్టేషన్ యావత్ దేశంలో ఒక కొత్త నమ్మకాన్ని పుట్టించాయి. ఆర్థిక వ్యవస్థ లోని పండితులు, సాంకేతిక నిపుణులు భారతదేశంలో జి ఎస్ టి ప్రయోగాన్ని గురించి పరిశోధన చేసి ఒక నమూనాలాగ ప్రపంచం ముందర ఎప్పుడో ఒకప్పుడు తప్పక నిలబెడతారు. ఇది ప్రపంచంలోని విశ్వవిద్యాలయాలన్నింటికీ ఒక కేస్ స్టడీ అవుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున, ఇంత గొప్ప మార్పు, ఇన్ని కోట్ల ప్రజల ప్రమేయంతో ఈ విశాల దేశంలో దానిని అమలుపరచడం, విజయవంతంగా ముందుకు నడిపించడం అన్నది చాలా పెద్ద కార్యం. ప్రపంచం తప్పకుండా ఈ విషయంపై పరిశోధన చేస్తుంది. ఇప్పుడు జి ఎస్ టి అమలులోకి వచ్చింది. అన్ని రాష్ట్రాలకీ అందులో భాగమూ ఉంది. బాధ్యతా ఉంది. అన్ని నిర్ణయాలనీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఏకగ్రీవంగా తీసుకున్నాయి. పేదవాడి కంచంలో ఏ రకమైన బరువు పడకూడదన్నదే ఆ ఏకగ్రీవ నిర్ణయాల పరిణామం. జి ఎస్ టి కి ముందర ఏ వస్తువు ధర ఎంత ఉండేది, ఇప్పటి కొత్త పరిస్థితుల్లో ఆ ధర ఎంత ఉంది అన్న సంగతులన్నీ జి ఎస్ టి యాప్ లో మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు చక్కగా తెలుసుకోవచ్చు. వన్ నేషన్ వన్ టాక్స్ అనే పెద్ద కల నిజమైంది. జి ఎస్ టి విషయంలో ఏ రకంగా తాలూకా స్థాయి నుండి భారత ప్రభుత్వం వరకూ నిమగ్నమై ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎంత కష్టపడి పనిచేసారో నేను గమనించాను. ప్రభుత్వానికీ వ్యాపారస్థులకూ మధ్యన ఎంతో చక్కని స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడింది. వినియోగదారుడి ప్రభుత్వానికీ మధ్యన విశ్వాసం పెంపొందించడానికి ఇది ఎంతో ముఖ్య పాత్ర వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని మంత్రిత్వ శాఖలకూ, అన్ని విభాగాలకూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరికీ నా హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నాను. జి ఎస్ టి భారత దేశ సమిష్ట శక్తికి ఒక గొప్ప ఉదాహరణ. ఇది ఒక చారిత్రాత్మక ఘనకార్యం. ఇది కేవలం ఒక టాక్స్ రిఫార్మ్- పన్నుల సంస్కరణ మాత్రమే కాదు, ఇది ఒక కొత్త నిజాయితీ సంస్కృతికి బలాన్నిచ్చే ఆర్థిక వ్యవస్థ. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక సామాజిక సంస్కరణా ఉద్యమం. ఇంత పెద్ద ప్రయత్నాన్ని సులువుగా విజయవంతం చేసినందుకు గానూ మరోసారి నేను కోట్లాది దేశవాసులందరికీ కోటి కోటి ప్రణామాలు చేస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, ఆగస్టు నెల అంటే విప్లవ నెల. 1920 ఆగస్టు 1 న సహాయనిరాకరణోద్యమం మొదలైందని సహజంగానే మనం చిన్నప్పటి నుండీ వింటూ వస్తున్నాం . 1942 ఆగస్టు తొమ్మిది న క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. దీనిని ఆగస్టు విప్లవమని కూడా అంటారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఒకరకంగా చూస్తే ఆగస్టు నెలలో జరిగిన ఘటనలన్నీ కూడా స్వాతంత్రపోరాట చరిత్రతో ముఖ్యంగా ముడిపడి ఉన్నాయి. ఈ ఏడాది మనం క్విట్ ఇండియా ఉద్యమం తాలూకూ వజ్రోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. కానీ ఈ “క్విట్ ఇండియా” అనే నినాదాన్ని డాక్టర్. యూసుఫ్ మెహ్రర్ అలీ అనే ఆయన ఇచ్చారన్న సంగతి చాలా కొద్దిమందికే తెలుసు. ఆగస్టు తొమ్మిది 1942లో ఏం జరిగిందో మన కొత్త తరం వారు తెలుసుకోవాలి. 1857 నుండీ 1942 వరకూ స్వాతంత్రం కోసం ఏ స్వాతంత్ర ఉద్దీపనతో దేశ ప్రజలు ముడిపడి ఉన్నారో, ఏ ఉద్రేకాన్ని పంచుకున్నారో అది మన భావి భారత నిర్మాణానికి ప్రేరణ. మన స్వాతంత్ర సమర యోధులు చేసిన త్యాగం, తపస్సు, ఇచ్చిన బలిదానాలకూ మించిన ప్రేరణ ఏమి ఉంటుంది మనకి?

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో క్విట్ ఇండియా ఉద్యమం ఒక ముఖ్యమైన నినాదం. బ్రిటిష్ ప్రభుత్వపు సంకెళ్లను విడిపించుకోవడానికి యావత్ దేశానికీ ఈ ఉద్యమమే ప్రేరణను ఇచ్చింది. ఆంగ్లేయులకు విరుధ్ధంగా భారతీయ ప్రజలు ప్రతి మూల నుండీ, పల్లెల నుండీ, పట్టణాల నుండీ, చదువుకున్న వారైనా, నిరక్ష్యరాస్యులైనా, పేదవారైనా, ధనికులైనా, ప్రతి ఒక్కరూ చేయీ చేయీ కలిపి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగమైన సమయం ఇదే! జనాక్రోశం చిట్టచివరి దశ కు చేరుకున్న తరుణమది. మహాత్మా గాంధీ ఆహ్వానంపై లక్షలమంది భారతీయులు “డూ ఆర్ డై” అనే మంత్రంతో తమ జీవితాన్ని ఉద్యమ ప్రవాహంలోకి నడిపించారు. లక్షల మంది యువకులు తమ చదువులను సైతం ఆపివేసి, పుస్తకాలను వదిలేసారు. స్వాతంత్ర్యమనే మంత్రజపంతో ముందుకు నడిచారు. క్విట్ ఇండియాఉద్యమానికి ఆగస్టు తొమ్మిదిన మహాత్మాగాంధీ పిలుపునైతే ఇచ్చారు కానీ పెద్ద పెద్ద నేతలందరినీ బ్రిటిష్ ప్రభుత్వం జైళ్ళలో బంధించేసింది. అదే సమయంలో రెండవ తరం నేతలైన డాక్టర్. లోహియా, జయ ప్రకాశ్ నారాయణ్, లాంటి మహాపురుషులు ఉద్యమంలో పెద్ద పాత్ర పోషించారు.

1920 లో సహాయనిరాకరణ ఉద్యమం, 1942 లో క్విట్ ఇండియా ఉద్యమం, రెండూ కూడా మహాత్మా గాంధీ గారి రెండు స్వరూపాలను మనకు చూపెడతాయి. సహాయనిరాకరణ ఉద్యమం స్వరూపమే వేరు. 1942 లో ఉద్యమ తీవ్రత ఎంతగా పెరిగిపోయిందంటే మహాత్మాగాంధీ లాంటి మహా పురుషుడు కూడా “డూ ఆర్ డై” అనే మంత్రాన్ని అందుకున్నారు. దీనంతటికీ వెనుక ప్రజల మద్దతు ఉంది. ప్రజల తోడు ఉంది. ప్రజల సంకల్పం ఉంది. ప్రజల సంఘర్షణ ఉంది. యావత్ దేశం ఒక్కటై పోరాటం చేసింది. ఒక్కసారి గనుక భారతదేశ చరిత్రను తిరగేస్తే, అసలు భారతదేశ మొదటి స్వాతంత్ర్య సంగ్రామం 1857 లోనే మొదలైందని నేను అప్పుడప్పుడు అనుకుంటాను. అప్పుడు ప్రారంభమైన స్వాతంత్ర్య సంగ్రామం 1942 వరకూ దేశంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉంది. ఈ సుదీర్ఘకాలం దేశప్రజల మనసుల్లో స్వాతంత్రమనే ఉద్రేకాన్ని పుట్టించింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెయ్యాలనే నిర్ణయానికి నిబధ్ధులైపోయారు. తరాలు మారుతున్నా ప్రజల సంకల్పంలో మార్పు రాలేదు. ప్రజలు వస్తున్నారు.. ఏకమౌతున్నారు. వెళ్తున్నారు.. కొత్తవారు వస్తున్నారు. మళ్ళీ వారంతా ఏకమౌతున్నారు. ఆంగ్ల సామ్రాజ్యాన్ని వేళ్లతో పెకలించి పారేయడానికి దేశం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంది. 1857 నుండీ 1942 వరకూ జరిగిన ఈ పరిశ్రమ, సంగ్రామాలు కల్పించిన ఒక కొత్త పరిస్థితి, 1942 నాటికి చివరి దశ కి చేరుకుంది. క్విట్ ఇండియా ఉద్యమం ఎంతగా మారుమ్రోగిపోయిందంటే మరో ఐదేళ్ల లోపునే 1947లో ఆంగ్లేయులు దేశం వదిలి వెళ్ళాల్సివచ్చింది. 1857 నుండీ 1942 వరకూ ఈ స్వాతంత్ర ఉద్దీపన ప్రజలందరి వద్దకూ చేరింది. ఇక 1942 నుండీ 1947 వరకూ ఐదేళ్ల పాటు ప్రజలందరూ ఒకే మనసుతో, సంకల్పంతో నిర్ణయాత్మకంగా ఉంటూ సఫలపూర్వకంగా దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించడానికి ఈ ఐదేళ్ళ కాలం కారణమయ్యింది. ఈ ఐదేళ్ళూ ఒక మలుపు లాంటివి.

ఇప్పుడు మిమ్మల్నొక గణితంతో కలుపుతాను. 1947లో మనకి స్వాతంత్ర్యం వచ్చింది. ఇప్పుడు 2017. దాదాపు డెభ్భై ఏళ్లు గడిచిపోయాయి. ప్రభుత్వాలు వచ్చాయి.. వెళ్ళాయి. వ్యవస్థలు తయారయ్యాయి, మారాయి, పెంపొందాయి, పెరిగాయి. దేశాన్ని సమస్యల్లోంచి బయట పడెయ్యటానికి ప్రతి ఒక్కరూ తమ తమ పధ్ధతుల్లో ప్రయత్నించారు. దేశంలో ఉపాధి అవకాశాలు పెంచడానికీ, పేదరికాన్ని నిర్మూలించడానికీ, అభివృధ్ధిని పెంచడానికీ ప్రయత్నాలు జరిగాయి. వారి వారి పధ్ధతుల్లో శ్రమించారు. విజయం లభించింది కూడా. అపేక్షలు పుట్టాయి. 1942 నుండి 1947 వరకూ ఈ ఐదేళ్ళూ కూడా సంకల్పసిధ్ధి కి ఒక మలుపులాంటివి. నేను గమనించినంతవరకూ 2017 నుండీ 2022 వరకూ ఉన్న ఐదేళ్ళు కూడా అప్పటి ఐదేళ్ల లాగ సంకల్పసిధ్ధికి తోడ్పడేలాంటివే. ఈ 2017 ఆగస్టు 15ని మనం ఒక సంకల్ప పర్వంగా జరుపుకుందాం. 2022 లో స్వాతంత్ర్య వజ్రోత్సవాల సమయానికల్లా మనం ఆ సంకల్పాన్ని సాధించి తీరతాం. నూట పాతిక కోట్ల దేశ ప్రజలు గనుక ఆగస్టు తొమ్మిది నాటి విప్లవ దినాన్ని గుర్తు చేసుకుని, ఈ ఆగస్టు 15న ప్రతి భారతీయుడూ వ్యక్తిగా, పౌరుడిగా దేశానికి ఈ సేవ చేస్తాను, కుటుంబపరంగా ఇది చేస్తాను, సమాజపరంగా ఇది చేస్తాను, పల్లెలు పట్నాల పరంగా ఇది చేస్తాను, ప్రభుత్వ విభాగం రూపంలో ఇది చేస్తాను, ప్రభుత్వపరంగా ఇది చేస్తాను అని సంకల్పించుకోవాలి. కోట్లాది కోట్ల సంకల్పాలు ఏర్పడాలి. అవి సంపూర్ణమవ్వడానికి ప్రయత్నించాలి. ఎలాగైతే 1942 నుండి 1947 వరకూ ఐదేళ్ళు దేశ స్వాతంత్ర్యానికి మైలురాళ్ళయ్యాయో; ఈ ఐదేళ్ళు, అంటే 2017 నుండీ 2022 వరకూ భారత దేశ భవిష్యత్తు కోసం అలాగే మైలురాళ్లవ్వాలి, అలానే చెయ్యాలి కూడా. ఐదేళ్ల తరువాత దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటాము. అందుకని మనందరము ఇవాళ ఒక ధృఢసంకల్పాన్ని చేసుకోవాలి. 2017ని మన సంకల్ప సంవత్సరంగా చేసుకోవాలి. ఈ ఆగస్టు నెలని సంకల్పంతో ముడి పెట్టి ధృఢపరుచుకోవాలి. మురికి – క్విట్ ఇండియా, పేదరికం – క్విట్ ఇండియా, లంచగొండితనం – క్విట్ ఇండియా, ఉగ్రవాదం – క్విట్ ఇండియా, జాత్యహంకారం -క్విట్ ఇండియా, శాఖాభిమానం -క్విట్ ఇండియా!

ఇవాళ్టి అవస్యకత “డూ ఆర్ డై ” ది కాదు సంకల్పంతో ముడిపడడానికి. కలవడానికి. అత్యుత్తమ ఫలితాలను సాధించడానికి సంకల్పించడం అవసరం. సంకల్పం కోసమే జీవించాలి. పోరాడాలి. రండి, ఈ ఆగస్టు నెల తొమ్మిదవ తేదీ నుండి సంకల్పసిధ్ధి కోసం ఒక మహోద్యమాన్ని నడుపుదాం. ప్రతి భారతీయుడూ, సామాజిక సంస్థ, స్థానిక సంస్థల ప్రాంతీయ విభాగాలు, పాఠశాలలూ, కళాశాలలూ, వివిధ సంస్థలు, ప్రతి ఒక్కరం కూడా నూతన భారత్ కోసం సంకల్పిద్దాం. రాబోయే ఐదేళ్లలో మనం సాధ్యపరుచుకునే సంకల్పం కావాలది. యువత సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఎన్ జి వో మొదలైనవారు సామూహిక చర్చలను జరిపించవచ్చు. కొత్త కొత్త ఆలోచనలను వెలికి తీయవచ్చు. మనం దేశాన్ని ఏ స్థాయికి చేర్చవచ్చు, ఒక వ్యక్తిగా ఆ కార్యక్రమంలో నేను ఎటువంటి సహకారాన్ని అందించగలను అని ఆలోచించాలి. రండి, ఈ సంకల్ప పర్వంలో మనమూ భాగమౌదాం.

మనం ఎక్కడ ఉన్నా లేకపోయినా,మనం ఆన్లైన్ లో తప్పకుండా ఉంటాము కాబట్టి, ఇవాళ నేను ముఖ్యంగా ఆన్లైన్ ప్రపంచంతో, నా యువ మిత్రులని, నా యువ సహచరులని నవ భారత నిర్మాణానికి వారు సృజనాత్మక పధ్ధతులతో సహకారాన్ని అందించడానికి ముందుకురావాలని ఆహ్వానిస్తున్నాను. సాంకేతికతని ఉపయోగిస్తూ వీడియోలు, పోస్ట్ లు, బ్లాగ్ లు, వ్యాసాలు, కొత్త కొత్త ఆలోచనలు తీసుకుని రండి. ఈ ప్రచారాన్ని ఒక జనాందోళనగా మనం మలుద్దాం. నరేంద్ర మోడీ యాప్ లో కూడా యువ మిత్రుల కోసం క్విట్ ఇండియా క్విజ్ ఆవిష్కరించబోతున్నాం. ఈ క్విజ్ యువతను మన దేశ ఘన చరిత్రతో జోడించి, స్వాతంత్ర్యోద్యమ నాయకులను పరిచయం చెయ్యడానికి ఉపయోగపడుతుంది. మీరు ఈ ప్రయత్నానికి తప్పకుండా విస్తృతమైన ప్రచారం కల్పించి, అన్నిదిశలా వ్యాపింపజేస్తారని నేను నమ్ముతున్నాను.

నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు పదిహేను న దేశ ప్రధాన సేవకుడిగా ఎర్ర కోట నుండి దేశ ప్రజలతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. నేనొక నిమిత్త మాత్రుడిని మాత్రమే. అక్కడ మాట్లాడేది ఒక వ్యక్తి కాదు. ఎర్ర కోట నుండి నూటపాతిక కోట్ల ప్రజల స్వరం ప్రతిధ్వనిస్తుంది. వాళ్ల కలలకు మాటల రూపాన్ని ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. గత మూడేళ్లుగా వరుసగా దేశం నలుమూలల నుండీ ఆగస్టు పదిహేను నాడు నేను ఏం మాట్లాడాలి, ఏ విషయాలను గురించి చెప్పాలి అనే సూచనలు, సలహాలు అందుతూనే ఉన్నాయి.

ఈసారి కూడా మై గౌ యాప్ లేదా నరేంద్ర మోదీ యాప్ లకు మీరు మీ ఆలోచనలను తప్పక పంపవలసిందిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేను స్వయంగా వాటిని చదువుతాను. ఆగస్టు పదిహేనున నాకు దొరికినంత సమయంలో వాటిని ప్రస్తావించడానికి కూడా ప్రయత్నిస్తాను. గత మూడేళ్ళ ఆగస్టు పదిహేను ప్రసంగాలలో నాకు వినబడ్డ ఫిర్యాదు ఏమిటంటే నా ప్రసంగాలు ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాయని. అందుకని ఈసారి నా ప్రసంగం సమయాన్ని తగ్గిద్దామని నేను నిర్ణయించుకున్నాను. మొత్తంమీద నలభై ఐదు, ఏభై నిమిషాల్లో పూర్తి చెయ్యడానికి ప్రయత్నిస్తాను. నేను నా కోసం నియమాన్ని పెట్టుకున్నాను కానీ నిలబెట్టుకోగలనో లేదో తెలీదు. కానీ తప్పకుండా నా ప్రసంగ సమయాన్ని తగ్గించాలనే ప్రయత్నంలో ఉన్నాను.

దేశ ప్రజలారా, నేను మరో విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక సామాజిక అర్థశాస్త్రం ఇమిడి ఉంది. దానిని మనం ఎప్పుడూ తక్కువగా పరిగణించకూడదు. మన పండుగలూ, మన ఉత్సవాలూ కేవలం ఆనందదాయకాలే కాదు. మన పండుగలూ, మన ఉత్సవాలూ సామాజిక సంస్కరణోద్యమాలు కూడా. కానీ దానితో పాటుగా మన ప్రతి పండుగ నిరుపేద పౌరుడి ఆర్థిక జీవనంతో కూడా నేరుగా ముడిపడి ఉంటుంది. కొన్ని రోజుల్లో రక్షాబంధనం, జన్మాష్టమి, వినాయక చవితి, దాని తర్వాత చవితి చంద్రుడు, అనంత చతుర్దశి, దుర్గా పూజ, దీపావళి..ఇలా వరుసగా పండుగలున్నాయి. ఇవన్నీ కూడా పేదవారికి ఆర్థిక సంపాదనకు తోడ్పడతాయి. పండుగలన్నింటిలో ఒక సహజమైన ఆనందం ఇమిడి ఉంటుంది. అనుబంధాల్లో తియ్యదనాన్నీ, కుటుంబంలో స్నేహాన్నీ, సమాజంలో సౌభ్రాతృత్వాన్నీ పండుగలు తీసుకువస్తాయి. వ్యక్తినీ , సమాజాన్నీ ముడిపెడతాయి. వ్యక్తి నుండి సమిష్టి దాకా ఒక సహజప్రయాణం జరుగుతుంది. ’ అహం నుండి వయమ్’ వైపుకు వెళ్ళే ఒక అవకాశం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంత వరకూ రాఖీ కి కొన్ని నెలల ముందు నుండీ లక్షల కుటుంబాల్లో చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లో రాఖీల తయారీ మొదలైపోతుంది. ఖాదీ మొదలుకొని పట్టు దారాల వారకూ ఎన్నో రకాల రాఖీలు తయారౌతున్నాయి. ఇటీవల కాలంలో ప్రజలు హోమ్ మేడ్ రాఖీలనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. రాఖీలు తయారు చేసేవారు, రాఖీలు అమ్మేవారు, మిఠాయిలు తయారు చేసేవారు, వేల- లక్షల ప్రజల రోజువారీ వ్యాపారం ఒక పండుగతో ముడిపడిఉంటుంది. మన పేద సోదరీ,సోదరీమణుల కుటుంబాలు వీటివల్లే కదా గడిచేది. మనం దీపావళికి దీపాలు వెలిగిస్తాము. అదొక వెలుగుల పండుగ మాత్రమే కాదు. ఇంటికి శోభనిచ్చే పండుగ మాత్రమే కాదు. దాని సంబంధం నేరుగా చిన్న చిన్న మట్టి ప్రమిదలు తయారు చేసే పేద కుటుంబాలతో ముడిపడి ఉంది. కానీ ఇవాళ నేను పండుగలు, ఆ పండుగలతో ముడి పడి ఉన్న పేదవారి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడేప్పుడు, వాటితో పాటూ పర్యావరణం గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను.

నాకన్నా దేశప్రజలు ఎక్కువ అప్రమత్తులూ, చురుకైనవారు అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. గత నెలరోజులుగా పర్యావరణ విషయమై అప్రమత్తమైన ప్రజలు నాకు ఉత్తరాలు రాశారు. వినాయకచవితి కి బాగా ముందుగానే eco-friendly గణేశుడి విషయం చెప్పాలని రాసారు . అందువల్ల వారు ముందుగానే మట్టి గణేషుడి విషయమై ఇప్పటి నుండీ ప్రణాళికలు చేసుకోగలుగుతారు. సమయానికి ముందు గానే నేను ఈ విషయం ప్రస్తవించాలని చెప్పిన ప్రజలకు నేను ఎంతో ఋణపడి ఉంటాను. ఈసారి సామూహిక గణేశ్ ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ గొప్ప సాంప్రదాయాన్ని లోకమాన్యతిలక్ గారు ప్రారంభించారు. సామూహిక గణేశ్ ఉత్సవాలు మొదలై ఈ ఏడాది కి 125 ఏళ్ళైంది. 125 ఏళ్ళూ, 125 కోట్ల దేశప్రజలు. లోకమాన్యతిలక్ గారు ఏ సదుద్దేశంతో సమాజంలో ఏకత్వం కోసం, అవగాహన కోసం, సామూహిక ఉత్సవాల కోసం ఈ సామూహిక గణేశ్ ఉత్సవాలను ప్రారంభించారు. మళ్ళీ ఈ ఏడాది గణేశోత్సవాలలో ప్రజలంతా ఖచ్చితంగా ఏకమై, చర్చా కార్యక్రమాలు నిర్వహించి, లోకమాన్య తిలక్ గారి కృషిని మరోసారి గుర్తుచేసుకుని, తిలక్ గారి భావన ఏదైతే ఉందో దాన్ని బలపరుద్దాం. దానితో పాటుగా పర్యావరణ పరిరక్షణ కోసం eco-friendly గణేశ్ ని, అంటే మట్టి గణపతిని పూజిద్దామని మనం సంకల్పం చేద్దాం. ఈసారి నేను ముందుగానే చెప్పాను కాబట్టి మీరంతా నాతో ఏకీభవిస్తారని నాకు నమ్మకం ఉంది. దానివల్ల విగ్రహాలు తయారు చేసే మన పేద కళాకరులకు, కార్మికులకు రోజువారీ పని దొరుకుతుంది. కడుపు నిండుతుంది. రండి, మన ఉత్సవాలను పేదవారి ఆర్థిక వ్యవస్థతో ముడి పెడదాం. మన పండుగల ఆనందాన్ని పేదవారి ఇంటి ఆర్థిక పండుగ గా మార్చడమే మన ప్రయత్నం కావాలి. దేశవాసులందరికీ రాబోయే వేరు వేరు పండుగల ఉత్సవాలకు గానూ అనేకానేక అభినందనలు తెలుపుకుంటున్నాను.

నా ప్రియమైన దేశ ప్రజలారా, విద్యా రంగమైనా, ఆర్థిక రంగమైనా, సామాజిక క్షేత్రమైనా, ఆటపాటలైనా, మన ఆడపిల్లలు దేశం పేరును నిలబెడుతుండడం, కొత్త కొత్త లక్ష్యాలను అందుకోవడం మనం నిరంతరం గమనిస్తున్నాం. మన దేశ ప్రజలందరం కూడా మన ఆడపిల్లలను చూసి గర్వపడుతున్నాం. కొద్ది రోజుల క్రితం మన దేశ మహిళా క్రికెట్ టీమ్ ప్రపంచ కప్ పోటీలలో అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. ఈ వారంలోనే ఆ క్రీడాకారిణులను కలిసే అవకాశం నాకు లభించింది. వారితో మాట్లాడటం నాకు చాలా ఆనందాన్నిచ్చింది కానీ ప్రపంచ కప్ ను గెలవలేకపోవడం వారికి చాలా భారంగా ఉందన్న సంగతి నేను గమనించాను. వారి మొహాల్లో కూడా ఆ నిరాశ, వత్తిడి తొంగిచూశాయి. ఆ ఆడపిల్లలతో నేను నాదైన లెఖ్ఖ చూపించాను. వారితో నేనేమన్నానంటే ” ఈమధ్య మీడియా తీరు ఎలా ఉందంటే, అపేక్షలను ఎంతగా నో పెంచేస్తున్నారు , అంటే సాఫల్యాన్ని పొందకపోతే అది ఆక్రోశంగా మారుతోంది కూడా. భారతదేశ క్రీడాకారులు ఓడిపోతే దేశప్రజలు కోపంతో వారిపై విరుచుకుపడడం మనం ఎన్నో ఆటలలో చూశాము. కొందరు కనీస మర్యాద లేకుండా చాలా బాధ కలిగించేలా మాట్లాడతారు, రాస్తారు. కానీ మొదటిసారిగా జరిగినదేమిటంటే, మన క్రీడాకారిణులు ప్రపంచ కప్ లో విజయాన్ని పొందలేకపోయినా, 125కోట్ల ప్రజలూ ఆ వైఫల్యాన్ని తమ భుజాలపై వేసుకున్నారు. కాస్త భారం కూడా మన ఆడపిల్లలపై పడనీయలేదు. ఇంతేకాక ఈ ఆడపిల్లలను మెచ్చుకుని గౌరవించారు. దీనిని ఒక శుభకరమైన మార్పుగా నేను భావిస్తున్నాను.” ఇంకా ఈ ఆడపిల్లలతో నేనేమన్నానంటే, “చూడండి.. ఇలాంటి అదృష్టం కేవలం మీకే లభించింది. మీరు గెలవలేకపోయారన్న భావనను మనసులోంచి తీసేయండి. మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా, మీరు 125కోట్ల ప్రజల మనసులను గెలుచుకున్నారు ” అని నేను ఆ క్రీడాకారిణులతో చెప్పాను. నిజంగా మన దేశంలో యువతరం, ముఖ్యంగా మన ఆడపిల్లలు నిజంగా దేశం పేరుని నిలబెట్టడానికి ఎంతో చేస్తున్నారు. మరోసారి దేశ యువతరానికి, ప్రత్యేకంగా మన ఆడపిల్లలకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, మరోసారి మీకు గుర్తుచేస్తున్నాను. ఆగస్టు విప్లవాన్ని , ఆగస్టు తొమ్మిదిని మరోసారి గుర్తుచేస్తున్నాను. ఆగస్టు పదిహేను ని మరోసారి గుర్తుచేస్తున్నాను. మరోసారి గుర్తు చేస్తున్నాను 2022 నాటికి, మన స్వాతంత్రానికి 75 వసంతాలు. ప్రతి దేశ పౌరుడూ సంకల్పించి, తన సంకల్పసిధ్ధి కోసం ఐదేళ్ళ road map ను తయారుచేసుకోవాలి. మనందరమూ దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలి. చేర్చాలి.. చేర్చాలి. రండి, మనందరమూ కలిసి నడుద్దాం, ఏదో ఒక ప్రయత్నం చేస్తూ నడుద్దాం. దేశ సౌభాగ్యం, భవిష్యత్తు ఉత్తమంగా ఉంటాయన్న నమ్మకంతో ముందుకు నడుద్దాం. మీ అందరికీ అనేకానేక శుభాభినందనలు, ధన్యవాదాలు.