Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మన్ కీ బాత్ – (43వ సంచిక) ప్రసారణ తేదీ : 29-04-2018


నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ఇటీవల ఏప్రిల్ 4వ తేదీ నుండీ ఏప్రిల్ 15వ తేదీ వరకూ ఆస్ట్రేలియా లో 21వ కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. భారతదేశంతో పాటుగా ప్రపంచంలోని మరో 71దేశాలు ఈ ఆటలలో  పాల్గొన్నాయి. ఇంత పెద్ద కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల కొద్దీ క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారంటే, అక్కడ ఎటువంటి వాతావరణం అక్కడ ఉంటుందో ఊహించగలరా? ఉత్సాహం, ఆసక్తి, సరదా, ఆశలు, ఆకాంక్షలు, ఏదో సాధించాలనే సంకల్పం .. ఇటువంటివన్నీ ఉన్న వాతావరణం నుండి ఎవరు మాత్రం దూరంగా ఉండగలరు? ఇటువంటి సమయంలోనే దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా రోజూ ఉదయాన్నే ఇవాళ ఎవరి ఆట ఉందీ? భారతదేశం ప్రదర్శన ఎలా ఉండబోతోంది? ఎవరెవరు మెడల్స్ గెలుచుకుంటారు? అని ఆసక్తిగా ఎదురుచూశారు. ఇలా అనుకోవడమూ సహజమే. మన భారతీయ క్రీడాకారులందరూ కూడా దేశవాసులందరి ఆశలనూ వమ్ము చెయ్యకుండా అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తూ, ఒకదాని తర్వాత మరొక పతకాన్ని గెలుస్తూనే ముందుకు సాగారు. షూటింగ్ లో, కుస్తీ పోటీలో, వెయిట్ లిఫ్టింగ్ లో, టేబుల్ టెన్నిస్ , బ్యాడ్మెంటన్ మొదలైన ఆటల్లో భారతదేశం రికార్డ్ స్థాయిలో ఆటను ప్రదర్శించింది. 26 బంగారు పతకాలు, 20 వెండి పతకాలు, 20 కాంస్య పతకాలు సాధించి, మొత్తమ్మీద దాదాపు 66 పతకాలను భారతదేశం సాధించింది. ఈ విజయం ప్రతి భారతీయుడూ గర్వించతగ్గది. క్రీడాకారులకు కూడా పతకాలు సాధించడం గర్వంగానూ, ఆనందంగానూ ఉంటుంది. యావత్ దేశానికీ, దేశవాసులందరికీ కూడా ఇది అత్యంత గౌరవపూర్వక పండుగలాంటిది. మేచ్ పూర్తయిన తరువాత భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అథ్లెట్లు అక్కడ పతకాలతో నిలబడి ఉండగా, మన మువ్వన్నెల జండాను కప్పుకుని ఉండగా, మన జాతీయ గీతం వినిపిస్తూ ఉంటే, సంతోషం, ఆనందం, గౌరవం, ఘనత కలగలిసిన ఆ భావన ఎంతో అపురూపమైనది. ప్రత్యేకమైనది. తనువునీ, మనసునీ కూడా కదిలించే భావన అది. ఉత్సాహంతోనూ, సమభావంతోనూ మనందరి హృదయాలూ నిండిపోతాయి. అసలలాంటి భావాలను వ్యక్తపరచడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. కానీ నేను ఈ క్రీడాకారుల నుండి విన్నది మీకు కూడా వినిపించాలని అనుకుంటున్నాను. నాకు గర్వంగా ఉంది. మీలో కూడా ఆ భావన కలగాలని నా కోరిక.

౧) “కామన్వెల్త్ గేమ్స్ లో నాలుగు మెడల్స్ సాధించిన మనికా బాత్రా ని నేను. రెండు బంగారు పతకాలూ, ఒక వెండి పతకం, ఒక కాంస్య పతకం సాధించాను. “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని వినే శ్రోతలకు నేను చెప్పాలనుకున్నదేమిటంటే, మొదటిసారిగా భారతదేశంలో టేబుల్ టెన్నిస్ ఇంత ప్రజాదరణ పొందినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పోటీలలో నేను నా బెస్ట్ టేబుల్ టెన్నిస్ ఆటను ప్రదర్శించాననే అనుకుంటున్నాను. మొత్తం జీవితానికి సరిపడేంత బెస్ట్ టేబుల్ టెన్నిస్ ఆటను ఆడాను. కానీ అంతకు ముందు నేను ఎంతగా సాధన చేసానో మీతో చెప్తాను. నేను నా కోచ్ సందీప్ సార్ తో పాటుగా ఎంతో సాధన చేసాను. కామన్వెల్త్ గేమ్స్ కన్నా ముందర పోర్చుగల్ లో జరిగిన క్యాంప్స్ కీ, టోర్నమెంట్స్ కీ ప్రభుత్వం మమ్మల్ని పంపించినందుకు, మాకు చక్కని అంతర్జాతీయ అవగాహనను కల్పించినందుకు గానూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. యువతరానికి నేనిచ్చే సందేశం ఒకటే – ఓటనిమి ఎప్పుడూ అంగీకరించద్దు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి.

 

౨) నా పేరు పి.గురురాజ్. ” మన్ కీ బాత్” కార్యక్రమాన్ని వినేవారందరికీ నేను చెప్పదలుచుకున్నదేమిటంటే – 2018 కామన్వెల్త్ గేమ్స్ లో పతకాన్ని గెలవాలన్నది నా కల.  మొదటిసారిగా ఈ ఆటల్లో పాల్గొని, మొదటి రోజున, భారతదేశానికి మొదటి పతకాన్ని అందించినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. నా ఈ పతకాన్ని మా ఊరు కుందాపూర్ కీ, నా కర్నాటక రాష్ట్రానికీ, నా దేశానికీ అంకితం చేస్తున్నాను.

 

౩) నా పేరు మీరాబాయ్ చానూ

21వ కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొని భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని అందించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. మణిపూర్ నుంచి భారతదేశం కోసం ఒక ఉత్తమ క్రీడాకారిణిని అవ్వాలన్నది నా కల. మణిపూర్ ప్రజలు, మా అక్క, మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా నాకెంతో ప్రేరణను అందించిన తరువాత నేను మణిపూర్ నుండి భారతదేశం కోసం, ఎలాగైనా క్రీడాకారిణిగా నిలవాలని కోరుకున్నాను.  క్రమశిక్షణ, నిజాయితీ, సమర్పణా భావం, ఇంకా నా శ్రమ నేను విజయవంతంగా నిలబడడానికి మిగిలిన కారణాలు.

 

కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశ ప్రదర్శన ఉత్తమమైనదిగానూ, ప్రత్యేకమైనది గానూ నిలిచింది. ప్రత్యేకమైనది ఎందుకంటే ఈసారి ఎన్నో విషయాలు మెదటిసారిగా జరిగాయి. ఈసారి కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశం తరఫున పాల్గొన్న కుస్తీ పోటీదారులందరూ పతకాలు గెలుచుకుని వచ్చారని మీకు తెలుసా? మనికా బాత్రా తను పాల్గొన్న అన్ని పోటీల లోనూ పతకాలను సాధించారు. ఇండివిడ్జువల్ టేబుల్ టెన్నిస్ లో బంగారు పతకాన్ని సాధించిన మొదటి భారతీయ మహిళ ఆమె. భారతదేశానికి అన్నింటికన్నా ఎక్కువ పతకాలు షూటింగ్ లో లభించాయి. 15ఏళ్ళ భారతీయ షూటర్ అనీష్ భాన్వాలా కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశం తరఫున బంగారు పతకాన్ని సంపాదించుకున్న అతి చిన్న వయస్కుడైన క్రీడాకారుడు.

కామన్వెల్త్ గేమ్స్ లో మరో పతకాన్ని సాధించిన సచిన్ చౌదరి భారతీయ ఏకైక పారా పవర్ లిఫ్టర్. ఈసారి గేమ్స్ ప్రత్యేకమైనవి ఎందుకంటే, ఈసారి అధికంగా పతకాలు సాధించినది మహిళా అథ్లెట్ లే. స్క్వాష్ అయినా, బాక్సింగ్ అయినా, వెయిట్ లిఫ్టింగ్ అయినా , షూటింగ్ అయినా సరే మహిళా క్రీడాకారులు చిత్రాలు చేసి చూపారు. బేట్మెంటన్ లో చివరి పోటీ భారత్ కి చెందిన ఇద్దరు క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి.సింధూ ల మధ్యన జరిగింది. ఈ ఆటను దేశవాసులందరూ ఆసక్తికరంగా చూసారు. నాక్కూడా చాలా ఆనందం కలిగింది. గేమ్స్ లో పాల్గొనడానికి వచ్చిన అథ్లెట్స్ దేశం లోని వివిధ ప్రాంతాల నుండి, చిన్న చిన్న పట్టణాల్లోంచీ వచ్చారు. అనేక కష్టాలనూ, బాధలనూ ఎదుర్కొని ఇక్కడి దాకా చేరారు. వారంతా ఇవాళ అందుకున్న స్థాయి, వారు చేరుకున్న లక్ష్యాలు, అన్నీ కూడా వారి వారి జీవితంలో వారి తల్లిదండ్రులు, వారి సంరక్షకులు; కోచ్ లేదా సపోర్ట్ స్టాఫ్ ; పాఠశాల, పాఠశాలలోని ఉపాధ్యాయులు; స్కూల్లోని వాతావరణం మొదలైనవారందరి సహకారం వల్లనే సాధ్యమయ్యాయి. అన్ని పరిస్థితుల్లోనూ వారి వెంట నిలబడి వారి ధైర్యాన్ని నిలబెట్టి ఉంచిన వారి స్నేహితుల సహకారం కూడా ఉంది. నేను ఈ క్రీడాకారులందరితో పాటూ ,వారికి సహకరించినవారందరికీ కూడా అనేకానేక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

 

క్రితం నెల ’మన్ కీ బాత్ ’ లో నేను దేశప్రజలందరితోనూ, ముఖ్యంగా యువతతో ఫిట్ ఇండియాని నిర్మించాల్సిందిగా కోరాను. రండి, ఫిట్ ఇండియాలో పాల్గొనండి..ఫిట్ ఇండియాను నడిపించండి అని నేను ప్రతి ఒక్కరినీ నేను ఆహ్వానించాను. ప్రజలు ఈ ఉద్యమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. చాలామంది ప్రజలు దీనికి తమ సహకారాన్ని తెలుపుతూ ఉత్తరాలు రాసారు, సోషల్ మీడియా లో తమ ఫిట్నెస్ మంత్రాన్నీ, ఫిట్ ఇండియా కథలను షేర్ చేసారు. శశికాంత్ భోంస్లే గారు ఈతకొలను దగ్గర తన చిత్రంతో పాటుగా “నా శరీరమే నా ఆయుధం , నా మూలపదార్థం నీళ్ళు, ఈతే నా ప్రపంచం” అని రాసి పంపారు.

 

రుమా దేవనాథ్ ఏమ్ రాసారంటే, “మార్నింగ్ వాక్ వల్ల నేను చాలా ఆరోగ్యంగానూ, ఆనందంగానూ ఉన్నాను. ఆమె ఇంకా ఏమంటున్నారంటే ““For me – fitness comes with a smiles and we should smile, when we are happy.” దేవనాథ్ గారూ, ఫిట్నెస్ వల్లనే ఆనందం కలిగుతుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.

 

ధవల్ ప్రజాపతి : తన ట్రెక్కింగ్ అనుభవాలను పంచుకుంటూ ఆయన ఏం రాసారంటే “నా దృష్టిలో ట్రావెలింగ్, ట్రెక్కింగ్ చెయ్యడమే ఫిట్ ఇండియా. చాలామంది పేరుప్రతిష్ఠలు ఉన్నవారు కూడా ఎంతో ఆసక్తికరమైన విధంగా మన యువతను ఫిట్ ఇండియా కోసం ఉత్తేజపరచడం చూసి నాకు చాలా ఆనందం కలిగింది. సినీ కళాకారుడు అక్షయ్ కుమార్ ట్విట్టర్ లో ఒక వీడియో ను పంచుకున్నారు. నేనూ అది చూశాను. మీఅంతా కూడా ఆ వీడియోను చూడండి. అందులో ఆయన ఉడెన్ బీడ్స్ తో ఎక్సర్సైజ్ చేస్తూ కనిపిస్తారు.  ఆ వ్యాయామం వీపు, పొట్టలలోని కండరాలకి ఎంతో లాభదాయకమైనది అని ఆయన తెలిపారు. బహుళ ప్రచారం పొందిన మరో వీడియోలో ఆయన వాలీబాల్ ఆడుతూ కనిపించారు. చాలామంది యువత పిట్ ఇండియా ఎఫర్ట్స్ తో పాటుగా జతపడి, తమ అనుభవాలను పంచుకున్నారు. ఇలాంటి ఉద్యమాలు మనందరికీ, దేశమంతటికీ కూడా ఎంతో లాభదాయకమైనవి. నేను చెప్పే మరో ముఖ్యమైన మాట ఏమిటంటే, ఖర్చులేని ఫిట్ ఇండియా ఉద్యమం పేరే యోగా. ఫిట్ ఇండియా ప్రచారంలో యోగా కి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారని అనుకుంటున్నాను. జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం మహత్యాన్ని ప్రపంచం అంతా స్వీకరించింది. మీరు కూడా ఇప్పటి నుండే తయారు కండి.  ఒంటరిగా కాకుండా, మీ నగరం , మీ గ్రామం, మీ ప్రాంతం, మీ పాఠశాల, మీ కళాశాల, ఏ వయసు వారైనా, పురుషులైనా, స్త్రీలైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా యోగాతో జతపడడానికి ప్రయత్నం చెయ్యాలి. సంపూర్ణమైన శారీరిక ఉల్లాసం కోసం, మానసిక ఆనందం కోసం, మానసిక సంతులత కోసం యోగా ఎంత ఉపయోగకరమో ఇప్పుడిక భారతదేశానికీ, ప్రపంచానికీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను యోగా చేస్తున్నట్లు తయారు చేసిన యానిమేటెడ్ వీడియో ఈమధ్యన చాలా ప్రచారం పొందింది. ఒక టీచర్ చెయ్యాల్సిన పనిని, అది యానిమేషన్ ద్వారా పూర్తయ్యేలా ఎంతో శ్రధ్ధగా ఈ యానిమేషన్ చేసినవారిని నేను అభినందిస్తున్నాను. మీకు కూడా ఇందువల్ల లాభం చేకూరుతుంది.

నా యువ మిత్రులారా, మీరంతా ఇప్పుడు పరీక్షలు,పరీక్షలు, పరీక్షలు అనే ఆందోళన నుండి బయటపడి శెలవుల ఆలోచనల్లో మునిగి ఉంటారు. శెలవులను ఎలా గడపాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండి ఉంటారు. నేను ఒక కొత్త పని కోసం మిమ్మల్ని ఆహ్వానించదలుచుకున్నాను. ఈమధ్యన చాలా మంది యువకులు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి తమ సమయాన్ని వినియోగిస్తున్నారు. Summer Internship ప్రాముఖ్యత కూడా పెరుగుతోంది. యువత కూడా దానికై వెతుకుతూ ఉంటారు. Internship అనేదే ఒక కొత్త అనుభవం. ఇందువల్ల నాలుగు గోడలకు బయట, పెన్నూ కాయితమూ , కంప్యూటర్ నుండి దూరంగా జీవితాన్ని కొత్తగా జీవించడానికి సరిపడా అనుభవాలను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. నా యువ మిత్రులారా, ఒక ప్రత్యేకమైన Internship కోసం నేను మిమ్మల్ని ఇవాళ ఆహ్వానిస్తున్నాను. భారత ప్రభుత్వానికి చెందిన విభాగాలు – క్రీడా శాఖ, మానవ వనరుల శాఖ, త్రాగు నీటిశాఖ, మొదలైన మూడు నాలుగు విభాగాలు కలిసి ఒక ” స్వఛ్ఛ భారత్ Summer Internship – 2018″ ని ప్రారంభించారు. కళాశాలలకు చెందిన విద్యార్థినీ,విద్యార్థులు, ఎన్.సి.సి కి చెందిన యువత, ఎన్.ఎస్.ఎస్. కి చెందిన యువత, నెహ్రూ యువ కేంద్రానికి చెందిన యువత, సమాజం కోసం, దేశం కోసం, ఏదో నేర్చుకోవాలనుకునే వారు, సమాజంలో మార్పు తేవడానికి తమ వంతు సహాయం చెయ్యలనుకునేవారు, ఒక అనుకూలమైన శక్తితో సమాజసేవలో పాలుపంచుకోవాలనుకునే వారందరికీ కూడా ఇదెంతో గొప్ప అవకాశం. దీనివల్ల పరిశుభ్రత కు కూడా బలం లభిస్తుంది. అక్టోబర్ 2వ తేదీ నుండీ మనం జరుపుకోబోయే మహాత్మా గాంధీ గారి 150 వ జయంతి ఉత్సవాల కంటే ముందుగానే మనకు ఏదో చేశామన్న తృప్తి మిగులుతుంది. కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయాలలోనూ ఉత్తమమైన పనులు చేసిన ఉత్తమమైన interns కి రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు లభిస్తాయి. ఈ  Internship ని విజయవంతంగా పూర్తిచేసే ప్రత్యేకమైన  Intern కి ’స్వఛ్ఛ భారత మిషన్” ద్వారా ఒక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఇంతేకాక ఏ  Intern అయితే ఈ పనిని బాగా చేస్తారో వారికి యు.జి.సి రెండు క్రెడిట్ పాయింట్స్ కూడా ఇస్తుంది. ఈ  Internship నుండి లబ్ధిని పొందవలసిందిగా నేను విద్యార్థులనూ, యువతనూ మరొకసారి ఆహ్వానిస్తున్నాను. మీరు మై గౌ యాప్ నుండే ’Swachh Bharat Summer Internship’ కోసం నమోదులు చేసుకోవచ్చు. ఇందులో పాల్గొనడం ద్వారా మన యువత స్వఛ్ఛభారత ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలదని ఆశిస్తున్నాను. మీరు మీ తాలూకూ సమాచారాన్ని తప్పక పంపించండి, కథను రాయండి, చిత్రాలను పంపండి, వీడియోలను పంపండి. రండి..ఒక కొత్త అనుభూతి కోసం, ఏదైనా నేర్చుకునేందుకు ఈ శెలవులను వినియోగిద్దాం.

 

నా ప్రియమైన దేశ ప్రజలారా, ఎప్పుడు అవకాశం లభించినా నేను దూరదర్శన్ లో ’ గుడ్ న్యూస్ ఇండియా ’ కార్యక్రమాన్ని తప్పకుండా చూస్తుంటాను. ఈ కార్యక్రమాన్ని చూడవలసిందిగా దేశప్రజలను నేను కోరుతున్నాను. ఇందువల్ల దేశంలో ఏ ఏ ప్రాంతంలలో, ఏటువంటి మనుషులు ఎలాంటి మంచి పనులు చేస్తున్నారో తెలుస్తుంది.

కొద్ది రోజుల క్రితం నేను ఈ కార్యక్రమంలో పేద విద్యార్థుల చదువు కోసం నిస్వార్థ సేవ చేస్తున్న ఢిల్లీ కి చెందిన కొందరు యువకుల కథను చూపిస్తుండడం చూశాను. ఈ యువ సమూహం కలిసి వీధి పిల్లలనూ, మురికివాడల్లో నివసించే పిల్లల చదువు కోసం ఒక పెద్ద ప్రచారాన్ని చేపట్టారు. మొదట్లో వీరు రోడ్లపై భిక్షాటన చేసే పిల్లలను, చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతికే పిల్లల పరిస్థితులను చూసి ఎంతగా కదిలిపోయారంటే, వెంఠనే ఇటువంటి సృజనాత్మకమైన పనిలో నిమగ్నమైపోయారు. ఢిల్లీ లోని గీతా కాలనీ దగ్గర్లో ఉన్న మురికివాడల్లోని పదిహేనుమంది పిల్లలతో ప్రారంభమైన ఈ ప్రచారం ఇప్పుడు రాజధానిలో పన్నెండు స్థానాల్లో రెండువేలమంది పిల్లలను కలుపుకుంది. ఈ ప్రచారంతో ముడిపడిఉన్న యువకులు, శిక్షకులు తమ తీరుబడిలేని దినచర్య నుండే రెండు గంటల సమయాన్ని కేటాయించుకుంటూ, సామాజంలో మార్పు కోసం ఈ భగీరథ ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు.

సోదర సోదరీమణులారా, ఇదే విధంగా ఉత్తరాఖండ్ లోని పర్వత ప్రాంతాలకు చెందిన కొందరు రైతులు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రేరణాత్మకంగా నిలిచే పని చేశారు. వారంతా తమ సంఘటిత ప్రయత్నాలతో తమదే కాకుండా తమ ప్రాంతపు విధినే మార్చేసారు. ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ లో ముఖ్యంగా బుల్గురు గోధుమలు, తోటకూర, మొక్కజొన్న, బార్లీ మొదలైన పంటలు మాత్రమే పండుతాయి. కొండప్రాంతం కావడం చేత రైతులకు ఈ పంటల తాలూకూ సరైన ధర లభించేది కాదు. కప్కోట్ ప్రాంతానికి చెందిన రైతులు ఈ పంటలను నేరుగా బజారులో అమ్మి నష్టపడేకన్నా విలువ పెంచే (ధర పెరుగుదల) మార్గాన్ని కనుగొన్నారు. వారేం చేశారంటే, ఈ పండించిన వాటితో బిస్కెట్లు తయారు చేసి, అమ్మడం మొదలుపెట్టారు. ఈ పంటలన్నింటిలో ఇనుప ఖనిజం ఎక్కువగా ఉన్నందువల్ల ఈ ఇనుము తత్వమున్న బిస్కెట్లు గర్భవతి మహిళలకు చాలా ఉపయోగకరమైనవి. మునార్ గ్రామంలో ఈ రైతులందరూ కలిసి ఒక ప్రభుత్వ సంస్థను ఏర్పాటుచేసి, అక్కడ ఈ బిస్కెట్లు తయారు చేసే ఫ్యాక్టరీని తెరిచారు. రైతుల ధైర్యాన్ని చూసి ప్రభుత్వం కూడా ఆ సంస్థను ’ రాష్ట్రీయ ఆజీవిక మిషన్’(National Rural Livelihood Mission (NRLM))కు జతపరిచింది. ఇప్పుడీ బిస్కెట్లను కేవలం బాగేశ్వర్ జిల్లా లోని దాదాపు ఏభై అంగన్వాడి కేంద్రాలలోనే కాకుండా అల్మోడా, కౌసానీ వరకూ అందిస్తున్నారు. రైతుల శ్రమ వల్ల ఈ సంస్థ ఏడాదికి పది,పదిహేను లక్షల అమ్మకపు మొత్తాన్ని చేరుకోవడమే కాకుండా 900 కన్నా అధికంగా కుటుంబాలకు రోజువారీ పనులను కల్పిస్తోంది. ఇందువల్ల జిల్లా నుండి ఎక్కువగా ఉన్న వలసలు కూడా ఆగాయి.

 

నా ప్రియమైన దేశ ప్రజలారా, భవిష్యత్తులో ప్రపంచంలో నీటి కోసం యుధ్ధాలు జరుగుతాయి అని మనం వింటున్నాం. ప్రతివారు ఈ మాట అంటున్నారు కానీ ఎవరూ బాధ్యతగా ఉండటం లేదు. నీటి పరిరక్షణ అనేది ఒక సామాజిక బాధ్యతగా పరిగణించాలని మనకి అనిపించదా? ఒక్కొక్క వర్షపు చుక్కనీ మనం ఎలా భద్రపరుచుకోవాలి అనిపించదా?మనందరికీ తెలుసు భారతీయులందరికీ నీటి పరిరక్షణ అనేది కొత్త విషయం కాదు. కేవలం పుస్తకాల్లోని విషయం కాదు. భాషకు అందని విషయం కాదు. శతాబ్దాలుగా మన పూర్వీకులు దీనిని మనకు చేసి చూపెట్టారు. ఒక్కొక్క నీటి చుక్కకూ వారు ఎంతటి ప్రాముఖ్యతనిచ్చారో మనకు తెలుసు. ఒక్కొక్క నీటి చుక్కనీ ఎలా సంరక్షించాలో వారు కొత్త కొత్త ఉపాయాలు కనుక్కుని చేసి చూపెట్టారు. మీలో ఎవరికన్నా తమిళ్నాడు వెళ్ళే అవకాశం వస్తే అక్కడ కొన్ని ఆలయాలలో ఏర్పాటుచేసి ఉన్న పెద్ద పెద్ద శిలాశాసనాలలో నీటిపారుదల వ్యవస్థ, నీటి పరిరక్షణ వ్యవస్థ, పొడి నిర్వహణ ఎలా చెయ్యాలో రాయబడి ఉంటుంది. మనార్ కోవిల్, చిరాన్ మహాదేవీ, కోవిల్ పట్టీ లేదా పుదుకొట్టయి మొదలైన ఆలయాలలోకి వెళ్తే, అన్ని చోట్లా పెద్ద పెద్ద శిలాశాసనాలు మీకు కనబడతాయి. ఇవాళ్టికి కూడా రకరకాల దిగుడుబావి లు(stepwells) పర్యాటక స్థలాల్లో మనకు పరిచితమే. కానీ ఇవన్నీ కూడా నీటి సంరక్షణార్థం మన పూర్వీకులు చేసిన ప్రయత్నాలకు సజీవ నిదర్శనాలు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. గుజరాత్ లోని  ’అడాలజ్ దిగిడుబావి’, ఇంకా పాటన్ లోని ’పాటన్ రాణి దిగుడుబావి’ లను UNESCO World Heritage sites గా గుర్తించింది. వీటి వైభవము చూడగానే తెలుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే దిగుడుబావులంటే నీటి ఆలయాలే కదా. మీరు రాజస్థాన్ వెళ్తే గనుక జోధ్ పూర్ లోని చాంద్ బావడీ తప్పకుండా చూడండి. ఇది భారతదేశంలోని దిగుడుబావులు అన్నింటికన్నా పెద్దది, ఇంకా అందమైన దిగుడుబావులలో ఒకటి. గమనించాల్సిన విషయం ఏమిటంటే అది నీటి కొరత ఉన్న ప్రాంతంలో నిర్మించబడి ఉంది. ఏప్రిల్, మే, జూన్ ,జూలై నెలలలో వర్షపునీటిని సేకరించడానికి గొప్ప అవకాశం ఉంటుంది. మనం ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటే గనుక మనకు లాభం కలుగుతుంది. ఉపాధి కొరకు కేటాయించిన బడ్జెట్ కూడా ఈ నీటి పరిరక్షణకు పనికివస్తుంది. గత మూడేళ్ళుగా నీటి పరిరక్షణ, నీటి నిర్వహణ దిశగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ప్రయత్నాలు చేశారు. ప్రతి ఏడూ ఉపాధి కొరకు కేటాయించిన బడ్జెట్ నుండి నీటి పరిరక్షణ, నీటి నిర్వహణపై సగటున 32 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబడ్డాయి. 2017-18 గురించి చెప్పాలంటే , నేను 64 వేల కోట్ల రూపాయిల మొత్తంలో 55% అంటే దాదాపు 35వేల కోట్ల రూపాయిలను నీటి పరిరక్షణ వంటి పనుల కోసం ఖర్చుపెట్టడం జరిగింది. గత మూడేళ్ల కాలంలో ఇటువంటి నీటి పరిరక్షణ, నీటి నిర్వాహణ ఉపాయాల మాధ్యమం ద్వారా 150 లక్షల హెక్టార్ల భూమికి అధికంగా లాభం చేకూరింది. నీటి పరిరక్షణ, నీటి నిర్వాహణ ల కోసం భారత ప్రభుత్వం ద్వారా ఉపాధికి లభించే ధనాన్ని కొందరు చాలా లాభదాయకంగా వాడుకోవడం జరిగింది. కేరళ లోని కుట్టెం పేరూర్ (kuttemperoor) నదిపై ఉపాధి పనులు చేసుకునే 7వేల మంది 70రోజుల వరకూ ఎంతో కష్టపడి ఆ నదిని పునరుద్ధరించారు. గంగా, యమునలు నీటితో నిండి ఉండే నదులు. కానీ ఉత్తర్ ప్రదేశ్ లోనూ, మరి కొన్ని ప్రాంతాల్లోనూ, ఫతేపూర్ జిల్లా లో ససుర్ ఖదేరీ పేరుతో ఉన్న నదీ మొదలైన రెండు చిన్న చిన్న నదులు ఎండిపోయాయి. జిల్లా యంత్రాంగం ఉపాధిలో భాగంగా పెద్ద మొత్తంలో మట్టి, నీటి పరిరక్షణ కార్యక్రమాలను చేపట్టే భారాన్ని తమపై వేసుకున్నారు. దాదాపు 40-45 గ్రామాల ప్రజల సహాయంతో ఈ ఎండిపోయిన ససుర్ ఖదేరీ నదిని పునరుద్ధరించారు. పశువులకైనా, పక్షులకైనా, రైతులకైనా, పొలాలకైనా, గ్రామాలకైనా ఉపయోగపడే ఈ పునరుధ్ధరణ ఎంతో దీవెనలతో నిండిన విజయం. మరోసారి ఏప్రిల్, మే, జూన్, జులై నెలలు మన ముందర ఉన్నాయి. నీటి పారుదల వ్యవస్థ, నీటి పరిరక్షణ కోసం మనందరమూ కూదా బాధ్యత వహించి, కొన్ని ప్రణాళికలు తయారు చేసుకుని, మనం కూడా జల సంరక్షణకు ఏదైనా సాధించి చూపెడదాం.

నా ప్రియమైన దేశ ప్రజలారా, ’మన్ కీ బాత్ ’ సమయానికల్లా నాకు ఎన్నో ప్రాంతాల నుండి సందేశాలు వస్తాయి. ఉత్తరాలు వస్తాయి. ఫోన్ కాల్స్ వస్తాయి. పశ్చిమ బెంగాల్ లో ఉత్తరం వైపున 24వ సబ్ డివిజన్ తాలూకూ దేవీతోలా గ్రామానికి చెందిన ఆయన్ కుమార్ బెనర్జీ మై గౌ యాప్ ద్వారా తన సందేశాన్ని రాశారు. ఆయన ఏమంటారంటే – “మనం ప్రతి సంవత్సరం రవీంద్ర జయంతి జరుపుకుంటాం. కానీ నోబుల్ పురస్కార గ్రహీత అయిన రవీంద్రనాథ్ టాగూర్ అనుసరించిన ప్రశాంతతతో, అందమైన, సమైక్యతతో నిండిన జీవితాన్ని గడపాలన్న జీవన వేదాంతం ఎవరికీ తెలియనే తెలియదు. మీరు దయ ఉంచి మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ విషయం గురించి చర్చించండి. అందువల్ల ప్రజలకు ఈ సంగతి తెలుస్తుంది.”

 

’మన్ కీ బాత్ ’ వినే మిత్రులందరి దృష్టికీ ఈ విషయాన్ని తెచ్చినందుకు నేను ఆయన గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గురుదేవులు రవీంద్రనాథ్ టాగూర్ జ్ఞానము, వివేకము నిండిన సంపూర్ణ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వారి రచనల్లు ప్రతి ఒక్కరి మనసుపై తమదైన చెరిగిపోలేని ముద్రను వేస్తాయి. రవీంద్రనాథ్ ఒక ప్రతిభావంతుడైన వ్యక్తిత్వం కలిగినవారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. కానీ వారిలో దాగి ఉన్న ఒక అధ్యాపకుడిని ప్రతి క్షణం  మనం గుర్తించవచ్చు. వారు గీతాంజలి లో రాశారు – ’He, who has the knowledge has the responsibility to impart it to the students.’ అంటే “జ్ఞానం ఎవరివద్ద ఉంటుందో, దానిని జిజ్ఞాసులైనవారికి పంచడం అనేది వారి బాధ్యత”.

 

నాకు బెంగాలీ భాష రాదు కానీ చిన్నప్పుడు నాకు త్వరగా నిద్ర లేచే అలవాటు ఉండేది. తూర్పు భారతదేశంలో రేడియో ప్రసారం త్వరగా మొదలైపోయేది. పశ్చిమ భారతదేశంలో లేటుగా మొదలౌతుంది. నాకు కొద్ది కొద్దిగా గుర్తుంది..దాదాపు ఐదున్నరకి కాబోలు రేడియోలో రవీంద్ర సంగీతం ప్రారంభం అయ్యేది. అది వినే అలవాటు ఉండేది. భాష రాకపోయినా పొద్దున్నే త్వరగా లేచి రేడియోలో రవీంద్ర సంగీతం వినడం నాకు బాగా అలవాటై పోయింది. ఆనంద లోకే, ఆగునేర్, పోరోష్మణి – మొదలైన కవితలు వినే అవకాశం వచ్చినప్పుడు మనసులో ఎంతో చైతన్యం కలిగేది. మిమ్మల్ని కూడా రవీంద్ర సంగీతం , వారి కవితలు ఎంతో ప్రభావితం చేసి ఉంటాయి. నేను రవీంద్రనాథ్ టాగూర్ కి ఆదరపూర్వకమైన అంజలిని ఘటిస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, కొద్దిరోజుల్లోనే పవిత్రమైన రంజాన్ నెల మొదలవబోతోంది. ప్రపంచవ్యాప్తంగా రంజాన్ మాసాన్ని పూర్తి శ్రధ్ధ, గౌరవాలతో జరుపుకుంటారు. ఉపవాసపు సమిష్టి అంశం ఏమిటంటే మనిషి స్వయంగా ఆకలిగా ఉంటేనే తప్ప ఎదుటివారి ఆకలి అర్థం కాదు అని. తాను దాహంగా ఉంటేనే ఇతరుల దాహం మనిషికి అర్థం అవుతుంది. పైగంబర్ మొహమ్మద్ సాహెబ్ గారి విద్య, సందేశాలను గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. సమానత్వం, సహోదరత్వపు మార్గాలపై నడవడం మన బాధ్యత. ఒకసారి ఒక వ్యక్తి పైగంబర్ సాహెబ్ ను అడిగారట -“ఇస్లాం మతం లో ఏ పని అన్నింటికన్నా మంచిది? అని. దానికి పైగంబర్ సాహెబ్ గారు -“ఎవరైనా పేదవారికి, అవసరం ఉన్నవారికి తిండి పెట్టడం, పరిచయమున్నా, లేకపోయినా అందరినీ సద్భావంతో పలకరించాలి” పైగంబర్ మొహమ్మద్ సాహెబ్ జ్ఞానము, కరుణ లపై విశ్వాసం ఉంచేవారు. వారికి ఎటువంటి అహంకారమూ ఉండేది కాదు. అహంకారమే జ్ఞానాన్ని పరాజితమయ్యేలా చేస్తుంది అంటారు. పైగంబర్ మొహమ్మద్ సాహెబ్ ప్రకారం మన వద్ద ఏదైనా వస్తువు అవసరానికి మించి ఉన్నప్పుడు, దానిని ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వాలి. అందుకే పవిత్రమైన రంజాన్ మాసంలో దానం ఇస్తు ఉంటారు. పైగంబర్ మొహమ్మద్ సాహెబ్ గారి ప్రకారం వ్యక్తి తన పవిత్ర ఆత్మ వల్ల ధనవంతుడౌతాడు. ధనం వల్ల కాదు. దేశవాసులందరికీ నేను పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ అవకాశం ప్రజలను మొహమ్మద్ సాహెబ్ గారి శాంతి, సద్భావాల సందేశాలపై నడిచేందుకు ప్రేరణను ఇవ్వాలని కోరుకుంటున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, బుద్ధపూర్ణిమ ప్రతి భారతీయుడికీ ముఖ్యమైన రోజు. కరుణ, సేవ,త్యాగం ఈ మూడింటి శక్తినీ చూపెట్టిన మహామనీషి, బుధ్ధభగవానుడు నడిచిన నేల ఈ భారతదేశం అని మనం గర్వపడాలి. విశ్వవ్యాప్తంగా ఆయన ఎన్నోలక్షల మందికి మార్గనిర్దేశం చేసారు. బుధ్ధ భగవానుడిని తలుచుకుంటూ, వారు చూపెట్టిన మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తూ, సంకల్పం చేసుకుంటూ, నడవాల్సిన మనందరి బాధ్యతనూ మరొక్కసారి గుర్తుచేస్తుంది ఈ బుధ్ధపూర్ణిమ. బుధ్ధభగవానుడు సమానత్వం, శాంతి, సద్భావం, సహోదరత్వాల ప్రేరణా శక్తి. ఇటువంటి మానవత్వపు విలువల అవసరం నేడు ప్రపంచంలో అధికంగా ఉంది. బాబాసాహెబ్ డా. అంబేద్కర్ గారు తన సోషల్ ఫిలాసఫీ లో బుధ్ధ భగవానుడి నుండే ఎక్కువ ప్రేరణ ఉందని గట్టిగా చెప్పేవారు. వారన్నారు ““My Social philosophy may be said to be enshrined in three words; liberty, equality and fraternity. My Philosophy has roots in religion and not in political science. I have derived them from the teaching of my master, The Buddha.”

 

బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా దళితులు, పీడితులు, దోపిడీకి గురైనవారు, వంచితులు, మొదలైన కొన్ని పరిమితులకు లోబడి జీవిస్తున్న కోట్ల కొద్దీ ప్రజలను ధృఢమైనవారిగా తయారు చేసారు. ఇంతకు మించి కరుణకు గొప్ప ఉదాహరణ ఉండదు. ఇటువంటి కరుణే ప్రజల బాధల పట్ల బుధ్ధ భగవానుడు చూపిన అన్ని గొప్ప గుణాలలో ఒకటి. బౌధ్ధ భిక్షువులు రకరకాల దేశాలలో సంచరిస్తూ ఉంటారని అంటారు. వారు తమతో పాటూ బుధ్ధ భగవానుని సంపన్నకరమైన ఆలోచనలను తీశుకుని తిరుగుతూ ఉంటారు. ఇది అన్ని కాలాల్లోనూ జరుగుతూనే వస్తోంది. యావత్ ఆసియా ఖండంలో వ్యాపించిన బుధ్ధ భగవానుని బోధలు మనకు వారసత్వంగా లభించాయి. అనేక ఆసియా దేశాలైన చైనా, జపాన్, కొరియా, థాయిలాండ్,కాంబోడియా,మాయన్మార్ మొదలైన అనేక దేశాల్లో ఈ బౌధ్ధ సంప్రదాయం, బౌధ్ధ బోధనలు వారి వారి మూలాల్లో కలిసిపోయి ఉన్నాయి. అందు కోసమే మనం బౌధ్ధ పర్యాటకుల కోసం ప్రాధమిక సదుపాయాలను అభివృధ్ధి పరుస్తున్నాము. ఆగ్నేయ ఆసియా లోని ముఖ్యమైన ప్రాంతాలూ, భారతదేశం లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలూ ఈ బౌధ్ధ  పర్యాటనలో భాగమైయ్యాయి. ఎన్నో బౌధ్ధ ఆలయాల పునరుధ్ధరణ కార్యక్రమాల్లో భారతదేశానికి కూడా ఇప్పుడు భాగస్వామ్యం లభించడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఇందులో మయన్మార్ లోని బాగాన్ లో ఉన్న శతాబ్దాల క్రితంనాటి వైభవపూర్వమైన ఆనంద్ మందిర్ కూడా ఉంది. ఇవాళ ప్రపంచంలో ప్రతి చోటా సంఘర్షణ, అనాగరిక హింస కనబడుతోంది. ద్వేషాన్ని దయతో జయించాలన్నది బుధ్ధ భగవానుని బోధన. కరుణా సూత్రాలను నమ్ముతూ, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న బుధ్ధ భగవానుని భక్తితో పూజించే భక్తులందరికీ బుధ్ద పూర్ణిమ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. బుధ్ధుని భోధనలతో ఒక శాంతియుత, కరుణాపూరిత ప్రపంచాన్ని నిర్మించడానికి తమవంతు బాధ్యతను నిర్వర్తించేలా చేయమని, బుధ్ధ భగవానుని యావత్ ప్రపంచాన్నీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇవాళ మనం బుధ్ధ భగవానుని గుర్తు చేసుకుంటున్న సమయంలో మరో సంగతి – మీరు లాఫింగ్ బుధ్ధా విగ్రహాల గురించి వినే ఉంటారు. లాఫింగ్ బుధ్ధా విగ్రహాలు అదృష్టాన్ని తెస్తాయని అంటూంటారు. కానీ ఈ స్మైలింగ్ బుధ్ధా విగ్రహాలు భారతదేశ రక్షణ చరిత్రలోని ఒక ముఖ్యమైన ఘటనతో ముడిపడి ఉన్నదని చాల కొద్దిమందికే తెలుసు. స్మైలింగ్ బుధ్ధా కీ, భారతీయ సైనిక శక్తీ కీ ఏం సంబంధం ఉందీ అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. ఇరవై ఏళ్ల క్రితం మే 11, 1998 సాయంత్రం అప్పటి భారత ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారు దేశాన్ని సంబోధిస్తూ చెప్పిన మాటలు యావత్ దేశాన్నీ గర్వమూ, పరాక్రమమూ, అనందమయ క్షణాలతో నింపేసాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న భారతీయ సముదాయాల్లో కొత్త ఆత్మవిశ్వాసం వెల్లివిరిసింది. ఆ రోజు కూడా బుధ్ధ పూర్ణిమ. మే 11, 1998 లో భారత పశ్చిమ సరిహద్దుల్లో రాజస్థాన్ లోని పోఖరణ్ లో పరమాణు ప్రయోగం జరిగింది. అది జరిగి ఇరవై ఏళ్ళు అయ్యింది. ఈ ప్రయోగం బుధ్ధ భగవానుని ఆశీర్వాదంతో బుధ్ధ పూర్ణిమ నాడు జరిగింది. భారతదేశ ప్రయోగం విజయవంతమైంది. ఒకరకంగా చెప్పాలంటే విజ్ఞానం, సాంకేతికత క్షేత్రాల్లో భారతదేశం తనకున్న బలాన్ని ప్రదర్శించింది. ఆ రోజు భారతదేశ చరిత్రలో, దేశ సైనికశక్తి ప్రదర్శన రూపంలో అంకితమైంది. inner strength అంటే అంత:శక్తి శాంతికి ఎంతో అవసరం అని బుధ్ధ భగవానుడు ప్రపంచానికి చూపెట్టాడు. ఇలాగే మనం ఒక బలమైన దేశం గా నిలబడినప్పుడు మనం అందరితో శాంతిపూర్వకంగా ఉండగలరు. 1998 మే నెల  కేవలం పరమాణు ప్రయోగం జరిగినందుకు మాత్రమే దేశానికి ముఖ్యమైనది కాదు. అది ఎలా జరిపారో అన్నది ముఖ్యమైనది. భరత భూమి ఎందరో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలతో నిండిన భూమి అని ప్రపంచానికి చూపెట్టింది. ఒక బలమైన నాయకత్వం ఉంటే భారతదేశం నిత్యం కొత్త మజిలీలను, ఉన్నత శిఖరాలనూ సాధించగలదు అని నిరూపించింది. అటల్ బిహారీ వాజపేయి గారు “జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్” అనే మంత్రాన్ని ఇచ్చారు. ఈసారి మే 11, 1998 నాటికి ఆ ప్రయోగం జరిగి ఇరవై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మనం విజయోత్సవం చేసుకోబోతున్నాం. ఈ సందర్భంగా అటల్ జీ ఇచ్చిన “జై విజ్ఞాన్” మంత్రాన్ని అనుసంధానించుకుంటూ ఆధునిక భారతదేశాన్ని తయారుచేయడానికి, శక్తివంతమైన భారతదేశాన్ని తయారు చేయాడానికి, సమర్థవంతమైన భారతదేశాన్ని తయారుచేయడానికి ప్రతి యువకుడూ తోడ్పాటుని అందివ్వాలని సంకల్పించాలి. తమ సామర్ధ్యాన్ని భారతదేశ సామర్థ్యానికి భాగస్వామిని చెయ్యాలి. చూస్తూండగానే అటల్ గారు ప్రారంభించిన యాత్రను ముందుకు నడిపించడానికి కొత్త ఆనందాన్ని, కొత్త సంతోషాన్నీ మనం కూడా పొందగలం.

 

నా ప్రియమైన దేశ ప్రజలారా, వచ్చే మన్ కీ బాత్ లో మళ్ళీ కలుద్దాం. ఎన్నో కబుర్లు చెప్పుకుందాం. అనేకానేక ధన్యవాదాలు.