Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి తో కలసి ఓ ఉన్నత స్థాయి సమావేశంలో కరవు, నీటి ఎద్దడి పరిస్థితి ని సమీక్షించిన ప్రధాన మంత్రి

మహారాష్ట్ర ముఖ్యమంత్రి తో కలసి ఓ ఉన్నత స్థాయి సమావేశంలో కరవు, నీటి ఎద్దడి పరిస్థితి ని సమీక్షించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో తలెత్తిన కరవు, నీటి ఎద్దడి స్థితి పై ఈ రోజు ఏర్పాటైన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు, మహారాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రధాన మంత్రి చర్చను ప్రారంభిస్తూ అనావృష్టి వల్ల నెలకొన్న సమస్యల పరిష్కారానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం , స్థానిక సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు మరియు పౌరులు కలసికట్టుగా పని చేయాలని పేర్కొన్నారు. కరవు నివారణ దిశగా చేపట్టవలసిన మధ్యకాలిక, దీర్ఘకాలిక పరిష్కారాలపైన దృష్టి పెట్టాలని ఆయన పిలుపు నిచ్చారు.

బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి పద్ధతులలో నీటి వినియోగ సామర్ధ్యాన్ని పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉందని, చెరకు సాగులో బిందు సేద్యాన్ని అవలంబించడం చక్కెర నాణ్యతను పెంచుతుందని ప్రధాన మంత్రి తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో చెరకు పండించే ప్రాంతాలు రానున్న మూడు సంవత్సరాలలో పూర్తిగా బిందు సేద్యం పరిధి లోకి వచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.

జల సంరక్షణ, నీటి నిల్వ లలో సంప్రదాయ విధానాలను, ఆధునిక విధానాలను కూడా అవలంబించవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఛత్రపతి శివాజీ అనుసరించిన నీటి నిర్వహణ పద్దతులు, చర్యల నుంచి ఎంతో నేర్చుకోవచ్చునని ఆయన అన్నారు. ఆ కాలం నాటి జల వనరులను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.

‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ అమలుకు తగిన సన్నాహక చర్యలను చేపట్టడంలో మంచి పురోగతిని సాధించినట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు.

పట్టణ ప్రాంతాలలో తడి, పొడి వ్యర్ధ పదార్ధాల నిర్వహణలో ఆధునిక పద్దతులను పాటించాలని దీని ద్వారా పట్టణ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామీణ ప్రాంతాలలో నీటి లభ్యతను, సేంద్రియ ఎరువుల లభ్యతను పెంపొందించవచ్చని ప్రధాన మంత్రి అన్నారు.

వాతావరణ మార్పులకు తట్టుకొని నిలచే వ్యవసాయంపైన రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకొంటోందని ముఖ్యమంత్రి వివరించారు. వ్యవసాయక్షేత్ర స్థాయిలో జల లభ్యతను పెంపొందించేందుకు గాను వాతావరణ మార్పులను తట్టుకొని నిలచే విధంగా ఉండగల వ్యవసాయాన్ని ఆధునికీకరించే పథకాన్ని ప్రతిపాదిస్తూ ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణానికి యత్నించాలన్నారు. ఈ ప్రాజెక్టును ప్రపంచ బ్యాంకుకు భారత ప్రభుత్వం అత్యంత శీఘ్రంగా సిఫారసు చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

జల సంరక్షణ, నీటి నిల్వల కోసం చేపట్టిన జల్ యుక్త్ శివిర్ అభియాన్ పురోగతిని గురించి ప్రధాన మంత్రి కి ముఖ్యమంత్రి వివరించారు. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో 51,500 వ్యవసాయ చెరువులను ఈ పథకం కిందకు తేవాలని తమ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకొన్నదని, రైతులు ఉత్సాహంతో ప్రతిస్పందిస్తే ఈ లక్ష్యాన్ని మరింత విస్తరించగలమని కూడా ఆయన చెప్పారు.

మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాలలో కీలకమైన సాగు నీటి ప్రాజెక్టులను ఒక నిర్ణీత కాలం లోపల పూర్తి చేసేటట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. మరింత మంది రైతులను సంస్థాగత రుణ పరిధిలోకి తీసుకురావడానికి చేపట్టిన ప్రయత్నాలను గురించి ఆయన వివరించారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, కరవుకు తావు లేని విధంగా మహారాష్ట్ర ను తీర్చిదిద్దే లక్ష్యం దిశగా పయనించేందుకు చేస్తున్న ప్రయత్నాలను గురించి ముఖ్యమంత్రి సమావేశం దృష్టికి తీసుకువ‌చ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను ప్రధాన మంత్రి అభినందించారు. పంటల వివిధీకరణ, అదనపు విలువ జోడింపు, రైతుల ఆదాయ మార్గాలను విస్తృతపరచేందుకు పాడి పెంపకం, చేపల పెంపకం, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి వ్యాపకాలతో వారికి అనుబంధాన్ని ఏర్పరచాల్సిందిగా ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. ప్రకృతిలో సంభవించే మార్పుల నుండి సహజ రక్షణను పొందడానికి ఆదాయ వనరులను విస్తృత పరచుకోవడం తోడ్పడగలదని ఆయన సూచించారు.