పిఎంఇండియా
మెల్బోర్న్లో ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ శ్రీమతి సామ్ మోస్టిన్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సమావేశమయ్యారు.
భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం రోజురోజుకూ మరింత బలోపేతం కావడం, వైవిధ్యభరితంగా మారడంపై ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక బంధాన్ని వారు స్వాగతించారు. వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, ఆవిష్కరణల రంగాల్లో సంబంధాల విస్తరణ కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ద్వైపాక్షిక సంబంధాల వల్ల రెండు దేశాల ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య క్రీడా సంబంధాలు సైతం మెరుగుపడటంపై ఇరు నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో క్రీడా రంగంలో మరింత పటిష్టమైన సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ముఖ్యంగా భారత్ ఆతిథ్యమివ్వనున్న 2030 కామన్వెల్త్ క్రీడలు, ఆస్ట్రేలియాలో జరగబోయే 2032 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ దిశగా ఇరు దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన సామాజిక సంబంధాలే ఆ ధ్వైపాక్షిక బంధానికి నిరంతర శక్తినిచ్చే ప్రధాన వనరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో గవర్నర్ జనరల్ సామ్ మోస్టిన్ అందిస్తున్న నిరంతర మద్దతును ప్రధానమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.