పిఎంఇండియా
మానవ వనరుల అభివృద్ధి రంగంలో భారతదేశానికి, అఫ్గానిస్తాన్ కు మధ్య సహకారానికి సంబంధించి కుదిరిన అవగాహన ఒప్పంద పత్రానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన కేబినెట్ సమావేశం ఈ ఆమోదాన్ని తెలిపింది.
ఈ ఎంఒయు కారణంగా అఫ్గానిస్తాన్ లోని విద్యార్థులు, అధ్యాపకులు స్వయం కోర్సుల్లో తమ పేర్లను నమోదు చేసుకొని వాటిని పూర్తి చేయవచ్చు. అంతే కాదు ఈ ఎంఒయు కారణంగా అఫ్గానిస్తాన్ లో అభివృద్ధి చేసిన కోర్సులను స్వయంలో అప్ లోడ్ చేయవచ్చు. భారత ప్రభుత్వానికి చెందిన హెచ్ ఆర్ డి మంత్రిత్వ శాఖ ఆప్ఘనిస్థాన్ విద్యార్థులకు, అధ్యాపకులకు అవసరమైన శిక్షణను అందిస్తుంది.
ఐసిటి కార్యక్రమాలైన జాతీయ డిజటల్ గ్రంథాలయం ( నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, ఎన్ డి ఎల్ ఐ), విర్చువల్ ల్యాబ్స్, స్పోకన్ ట్యుటోరియల్స్ లాంటి ప్రధానమైన విద్యారంగ కార్యక్రమాలకు సంబంధించిన సాంకేతికత… ఈ ఎంఒయు ద్వారా అఫ్గానిస్తాన్ కు అందుబాటులోకి వస్తుంది. అంతే కాదు దీనిని వారితో పంచుకోవవడం జరుగుతుంది. భారతదేశ, అఫ్గానిస్తాన్ లలోని విశ్వవిద్యాలయాలు,విద్యాసంస్థల మధ్యన ఉమ్మడిగా మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాములను ప్రారంభించాలనే ప్రతిపాదనను కూడా చేయడం జరిగింది. పాఠ్యప్రణాళిక రూపకల్పన, ఉపాధ్యాయుల సమర్థతను పెంచడం మొదలైన అంశాల్లో అఫ్గానిస్తాన్ ఉన్నత విద్యాశాఖకు భారతదేశ మానవవనరుల అభివృద్ధి శాఖ సాయం చేస్తుంది.
విద్యా సంబంధిత అర్హతలని పరస్సరం గుర్తించాలనే ఒప్పందం మీద ఇరు దేశాలు సంతకాలు చేయాలని ఈ ఎంఓయులో అంగీకరించడం జరిగింది. భారతదేశంలో విద్యను అభ్యసించండి అనే భారతదేశ కార్యక్రమంపట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడాన్ని ఇది ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు అఫ్గానిస్తాన్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించడానికి వీలుగా విదేశీ విద్యార్థులను ఆకర్షించడం జరుగుతుంది.
ఈ ఎంఒయు ఇరుదేశాల విద్యారంగం సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయిలాగా నిలిచిపోతుంది.
పూర్వరంగం:
విద్యా రంగంతోపాటు పలు రంగాల్లో భారతదేశం, అఫ్గానిస్తాన్ దేశాల మధ్యన బలమైన దౌత్యసంబంధాలున్నాయి. దీన్ని మరింత బలోపేతం చేయడానికిగాను ఎంఓయు మీద సంతకాలు చేయడం ద్వారా మానవ వనరుల అభివృద్ధి రంగంలో సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
భారత ప్రభుత్వానికి చెందిన మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేక సాంకేతిక ఆధారిత కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఐసిటి ద్వారా జాతీయ విద్యా మిషన్ కింద ఈ కార్యక్రమాలను చేపట్టడంజరిగింది. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమైనది స్వయం. ఇది భారతదేశానికి చెందిన మాసివ్ ఓపన్ ఆన్ లైన్ కోర్సెస్ ప్లాట్ఫామ్. భారతదేశ వ్యాప్తంగా వున్న ఉత్తమ అధ్యాపకులు తయారు చేసిన ఆన్ లైన్ కోర్సులను ఈ ప్లాట్ ఫామ్ ద్వారా అందించడం జరుగుతోంది. ఇంతవరకూ స్వయంద్వారా అందిస్తున్న రెండు వేల కోర్సుల్లో 35 లక్షల మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీటిలో తొమ్మిదో తరగతినుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు ప్రతి విద్యార్థి అభ్యసించే కోర్సులతోపాటు జీవితాంతం నేర్చుకునే సదుపాయం కూడా వుంది. స్వయంద్వారా చేసే కోర్సులకోసం 20 శాతం క్రెడిట్ బదిలీని ఆయా విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. ఉన్నత విద్యారంగ అధ్యాపకులకు యాన్యువల్ రిఫ్రెషర్ కోర్సులను అందించడానికిగాను ఈ ప్లాట్ ఫామ్ ను ఉపయోగించడం జరుగుతోంది.