పిఎంఇండియా
అర్హులైన నాన్- గెజెటెడ్ రైల్వే ఉద్యోగులకు (ఆర్పిఎఫ్/ఆర్పిఎస్ఎఫ్ సిబ్బంది మినహా) 2016 -17 ఆర్థిక సంవత్సరానికి గాను 78 రోజుల వేతనంతో సమంగా ఉండే ఉత్పాదకతతో జోడించిన బోనస్ ను (పిఎల్ బి ని) చెల్లించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తన ఆమోదాన్ని తెలియజేసింది. ఈ నిర్ణయం ఫలితంగా దాదాపు 12.30 లక్షల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. దసరా/‘పూజ’ పండుగ సెలవుదినాల కన్నా ముందే జరిపే ఈ చెల్లింపు లక్షలాది కుటుంబాల మోములలో చిరునవ్వును తీసుకురానుంది.
పిఎల్బి చెల్లింపు పెద్ద సంఖ్యలో ఉన్న రైల్వే ఉద్యోగులకు- మరీ ముఖ్యంగా రైల్వేల కార్యకలాపాల ఆచరణలో పాలుపంచుకొనే వారికి- ప్రేరణనిస్తుంది; వారి ఉత్పాదక సామర్ధ్యాన్ని ఇది మెరుగు పరచడంతో పాటు రైల్వే వినియోగదారులకు వారు వేగవంతమైన, భద్రమైన సేవలను అందించేందుకు కూడా తోడ్పడగలదు. గరిష్ఠ సంఖ్యలో ప్రజల సంక్షేమానికి కృషి చేయాలన్న సిద్ధాంతం పై నడుస్తున్నభారతీయ రైల్వేల విషయంలో ఈ బోనస్ చెల్లింపు అనేది రైల్వేల కార్యకలాపాలలో దక్షతను మరియు జవాబుదారీతనాన్ని మెరుగుపరచడంలో దోహదం చేయనుంది.
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పిఎల్బి చెల్లింపు తాలూకు ఆర్థిక ప్రభావం 2,245.45 కోట్ల రూపాయల మేరకు ఉండవచ్చని ఒక అంచనా. పిఎల్బి చెల్లింపునకు నిర్దేశించిన వేతన గణన పరిమితి నెలకు 7,000/- రూపాయలుగా ఉంది. అర్హత కలిగిన రైల్వే ఉద్యోగికి చెల్లించే గరిష్ఠ మొత్తం 78 రోజులకు గాను 17,951 రూపాయలుగా ఉంటుంది.
***