Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వచ్చే వారం స్పెయిన్‌ లో వాతావరణ మార్పుపై ఐక్య‌ రాజ్య‌ స‌మితి స‌ద‌స్సు సందర్భం గా భార‌త్ విధానానికి కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదం


వాతావరణ మార్పుపై ఐక్య రాజ్య సమితి చట్రం భాగస్వామ్య దేశాల 25వ సదస్సు (సిఒపి 25) సందర్భం గా సంప్రదింపుల లో భారత్ విధానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరంలో చిలీ అధ్యక్షతన 2019 డిసెంబరు 2 నుంచి 13వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది.

ఈ సదస్సు లో పాల్గొనే భారత ప్రతినిధి బృందాని కి గౌరవనీయులైన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ నాయకత్వం వహిస్తారు. వివిధ దేశాలు 2020కి మునుపటి కాలానికి చెందిన క్యోటో ఒప్పందం నుంచి 2020 తర్వాతి కాలానికి వర్తించే పారిస్ ఒప్పందం వైపు పయనించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ‘కాప్ 25’ సదస్సుకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ తాజా సదస్సు సందర్భంగా భారత్ అనుసరించే విధానం వాతావరణ మార్పుపై ఐక్య రాజ్య సమితి చట్రంతోపాటు పారిస్ ఒప్పందం నిర్దేశిస్తున్న సూత్రాలు, నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ప్రత్యేకించి ‘‘సమానత్వం-ఉమ్మడి సహా విభిన్న బాధ్యతలతో పాటు క్రమానుగత సామర్థ్యం’’ (సిబిడిఆర్-ఆర్ సి) సంబంధిత సూత్రావళి పరిధిలో ఉంటుంది.

వాతావరణ మార్పు సమస్య విషయం లో భారత నాయకత్వ పాత్ర జగమెరిగినది మాత్రమేగాక, సర్వత్రా ప్రశంసార్హమైనదిగా గుర్తింపు పొందింది. ఆ మేరకు వాతావరణ మార్పు సమస్యల పరిష్కారం కోసం గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన భారత ప్రభుత్వం అనేక వినూత్న చర్యలు చేపడుతున్నది. వాతావరణ మార్పుపై కార్యాచరణతోపాటు, సమస్యల పరిష్కారంలో భారత్ చిత్తశుద్ధిని, ఆకాంక్షను ఈ చర్యలు పూర్తిగా ప్రతిబింబిస్తున్నాయి. వాతావరణ మార్పు కార్యాచరణ పై ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఇటీవల శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 450 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం సాధించడాన్ని భారత్ లక్ష్యం గా పెట్టుకున్నదని ప్రధాన మంత్రి ప్రకటించారు. అదేవిధంగా సిబిడిఆర్-ఆర్ సి కి, సమానత్వ సూత్రావళికి లోబడి అన్ని దేశాలూ బాధ్యతాయుత ఆచరణకు దిగాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా, సౌరశక్తి ఉత్పాదన సామర్థ్యం పెంపు దిశగా కృషికి అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఎ)ద్వారా భారత్ నాయకత్వం వహిస్తోంది.

అంతేకాకుండా, వాతావరణ మార్పుపై కార్యాచరణ దిశగా ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేలా రెండు వినూత్న చర్యలకు భారత్ శ్రీకారం చుట్టింది. ఇందులో విపత్తులను ఎదుర్కొనగల మౌలిక వసతుల కూటమి ఏర్పాటు ఒకటి. విపత్తులను ఎదుర్కొనగల మౌలిక వసతులతోపాటు, వివిధ వాతావరణాంశాల లో విజ్ఞానాభివృద్ధి, ఆదానప్రదానాలకు ఇదొక వేదికగా ఉపకరిస్తుంది. అలాగే స్వీడన్ ‘తో సంయుక్తంగా ‘పారిశ్రామిక పరివర్తన కోసం నాయకత్వ కూటమి’ని భారత్ ఏర్పాటు చేసింది. వేర్వేరు దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రామిక రంగాలు కర్బన ఉద్గారాల పెరుగుదలను కనీస స్థాయిలో ఉంచడంతోపాటు సాంకేతిక ఆవిష్కరణల రంగంలో సమష్టిగా సహకరించుకునే వేదికగా ఇది నిలుస్తుంది. భారతదేశం ప్రతిష్టాత్మక కార్యాచరణ ద్వారా ముందుకు సాగుతోంది.

అదే విధంగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రతిష్టాత్మక కార్యాచరణ దిశగా నేతృత్వం వహించాలని ఆకాంక్షిస్తోంది. అంతేకాకుండా 2020 నాటికి ఏటా 100 బిలియన్ డాలర్లు సమీకరిస్తామన్న తమ వాగ్దానాన్ని నెరవేర్చాల్సిందిగా గుర్తు చేస్తోంది. జాతీయ నిర్దేశిత లక్ష్యాల ద్వారా అన్ని దేశాలకూ భవిష్యత్ కార్యాచరణ ను తెలియజేసేలా తమ ఆర్థిక మద్దతును క్రమంగా, గణనీయంగా పెంచాలని కోరుతోంది. అదే సమయంలో 2020 ముందు కాలానికి ప్రకటించిన హామీలను అభివృద్ధి చెందిన దేశాలు నెరవేర్చాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. ఆ మేరకు సదరు హామీల అమలులోని వ్యత్యాసాలు 2020 తర్వాతి కాలంలో అదనపు భారంగా మారకుండా చూడాలని సూచిస్తోంది.

మొత్తం మీద నిర్మాణాత్మక, సానుకూల దృక్పథంతో చర్చల లో పాల్గొనడం ద్వారా తన దీర్ఘకాలిక ప్రగతి ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయాలని భారతదేశం ఎదురుచూస్తోంది.

***