పిఎంఇండియా
వాణిజ్య న్యాయస్థానాలు, వాణిజ్య విభాగం, ఉన్నత న్యాయస్థానాలలో వాణిజ్య విభాగం (సవరణ) బిల్లు, 2018 ను పార్లమెంటు లో ప్రవేశ పెట్టడానికిగాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దిగువన ప్రస్తావించిన లక్ష్యాలను అందుకోవడానికి ఈ బిల్లును రూపొందించడం జరిగింది:
ఒక వాణిజ్యపరమైన వివాదం యొక్క నిర్దిష్ట విలువను ప్రస్తుతమున్న ఒక కోటి నుండి 3 లక్షలకు ఈ బిల్లు తగ్గిస్తుంది. ఈ కారణంతో, ఒక ఓ సముచితమైన విలువను కలిగివున్న వాణిజ్య వివాదాలను వాణిజ్య న్యాయస్థానాలు నిర్ణయించగలుగుతాయి. దీని కారణంగా తక్కువ విలువ వున్న వాణిజ్య తగాదాల పరిష్కారానికి అయ్యే సమయం (ప్రస్తుతం 1445 రోజులుగా ఉంది) తగ్గుతుంది. తద్వారా సులువుగా వ్యాపారాన్ని చేయడానికి సంబంధించిన ర్యాంకింగులో భారతదేశం యొక్క ర్యాంకు మరింతగా మెరుగుపడగలదు.
ఈ సవరణతో జిల్లా న్యాయమూర్తి స్థాయిలో వాణిజ్య న్యాయస్థానాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. చెన్నై, ఢిల్లీ, కోల్ కాతా, ముంబయి నగరాలలోను, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోను ఉన్నత న్యాయస్థానాల సాధారణ సిసలు సివిల్ జ్యూరిస్ డిక్షన్ గల ప్రాంతాలలో ఈ సవరణతో వాణిజ్య న్యాయస్థానాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి ప్రాంతాలకు చెందిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా జిల్లా స్థాయిలో తీర్పునివ్వాల్సిన వాణిజ్య తగాదాలకు సంబంధించిన ఆర్ధిక విలువను ప్రత్యేకంగా పేర్కొనవచ్చు. అయితే ఈ విలువ మూడు లక్షల రూపాయల కంటే తక్కువయి ఉండకూడదు. జిల్లా కోర్టు న్యాయ పరిధి లోని ఆర్ధిక విలువ కంటే ఎక్కువగా ఉండకూడదు. సాధారణ న్యాయ పరిధి గల హైకోర్టులను మినహాయించి మిగతా హైకోర్టుల న్యాయ పరిధిలో వాణిజ్య తగాదా అపీలు ను వాణిజ్య న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. ఇవి జిల్లా న్యాయమూర్తి స్థాయి కంటే తక్కువలో ఉండేలా చూస్తారు. జిల్లా న్యాయమూర్తి స్థాయి లో వాణిజ్య అపెలిట్ కోర్టులు ఉంటాయి.
అత్యవసర పరిస్థితి లేని, తాత్కాలిక ఉపశమనం కోరుకొనే కేసులలో మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కారం చేసుకొనే విధానాన్ని అనుసరిస్తారు. దీని ద్వారా ఆయా పార్టీలకు వాటి వాణిజ్య తగాదాలను న్యాయస్థానం వెలుపల పరిష్కరించుకొనే అవకాశం లభిస్తుంది. అయితే న్యాయ సేవల అధికారాల చట్టం, 1987 కింద ఏర్పాటు చేసిన అధికారుల సమక్షం లోనే వీటిని పరిష్కరించుకోవాలి. దీని కారణంగా వాణిజ్య తగాదాల పరిష్కారంపైన పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది.
కొత్త సెక్షన్ 21 ఎ ను చేర్చడం కారణంగా కేంద్ర ప్రభుత్వం పిఐఎమ్ కొరకు విధి విధానాలను తయారు చేసే అధికారం లభిస్తుంది. అంతే కాదు, ఇది సవరణకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. తద్వారా ప్రస్తుతం అమలు లోని చట్టం ప్రొవిజన్స్ ప్రకారం వాణిజ్య తగాదాల్లో తీర్పులను ఇస్తున్న న్యాయ వేదిక అధికారానికి ఎలాంటి ఇబ్బందులు కలగవు.
పూర్వరంగం:
ఆర్ధిక అభివృద్ధి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో వాణిజ్య కార్యక్రమాలు గణనీయంగా పెరిగాయి. ఈ పూర్వరంగంలో జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య వివాదాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డిఐ) పెరుగుతున్నాయి. అంతే కాకుండా విదేశీ వాణిజ్య లావాదేవీల కారణంగా కూడా వాణిజ్య వివాదాల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది.
ఈ సమస్యకు పరిష్కారంగా వాణిజ్య తగాదాలను వేగంగా పరిష్కరించాలని ప్రభుత్వం భావించింది. అంతే కాదు భారతదేశం లోని స్వేచ్ఛాయుత, బాధ్యతాయుత న్యాయ వ్యవస్థ పైన విదేశీ పెట్టుబడిదారులలో సవ్య దృక్పథం కలిగించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఇందుకోసం వాణిజ్య న్యాయస్థానాలను, వాణిజ్య న్యాయ విభాగాన్ని, వాణిజ్య అపెలిట్ డివిజన్ హైకోర్టుల చట్టం, 2015 ను అమలులోకి తేవడం జరిగింది. తద్వారా అన్ని న్యాయ పరిధులలో జిల్లా న్యాయమూర్తి స్థాయిలో వాణిజ్య న్యాయస్థానాలను ఏర్పాటు చేసుకున్నాం. కానీ సాధారణ సిసలు పౌర న్యాయ పరిధి గల హైకోర్టుల పరిధిలో ఈ పని చేయ లేదు. ఈ ఐదు హైకోర్టులు ఏవంటే.. బాంబే హైకోర్టు, ఢిల్లీ, కోల్ కతాత్తా, మద్రాస్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు లు. ఇవి ముంబయి, ఢిల్లీ, కోల్ కాతా, చెన్నై నగరాల పరిధుల్లోను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పరిధి లోను ఉన్నాయి. ఈ హైకోర్టుల పరిధిలో సెక్షన్ 3 సబ్ సెక్షన్ 1 ప్రకారం జిల్లా స్థాయిలో వాణిజ్య న్యాయస్థానాలు లేవు. అయితే వాటికి బదులు ఈ హైకోర్టులలో వాణిజ్య డివిజన్ లను ఏర్పాటు చేయడం జరిగింది. వాణిజ్య కోర్టులు లేదా హైకోర్టు వాణిజ్య డివిజన్ తీర్పునిస్తున్న వాణిజ్య తగాదాలలో ప్రత్యేకంగా పేర్కొన్న విలువ ప్రస్తుతం రూ.కోటి గా ఉంది.
వ్యాపారాన్ని సులువుగా చేయగలగడం అనేది ప్రపంచ బ్యాంకు ప్రకటించే ఒక సూచిక ద్వారా స్పష్టమవుతుంది. ఆయా దేశాల్లో గల తగాదాల పరిష్కార వాతావరణాన్ని ఇది సూచిస్తుంది. తద్వారా ఆయా దేశాల్లో వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలను నిర్వహించాలా వద్దా అని పెట్టుబడిదారులు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సూచిక ను 2002 నుండి ప్రపంచ బ్యాంకు రూపొందిస్తోంది. ఇది ప్రపంచం లోని అన్ని దేశాల వాణిజ్య వాతావరణాన్ని మదింపు చేస్తోంది. సులభతరంగా వ్యాపారం చేసుకొనే దేశాల జాబితా లో మెరుగైన స్థానంలో ఉండే దేశాలలో నియంత్రణ వాతావరణం పెట్టుబడిదారులకు అనువుగా ఉన్నట్టు లెక్క. తద్వారా వారు వ్యాపార కార్యక్రమాలను మొదలుపెడతారు. గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన ప్రపంచ బ్యాంకు సులభతర వాణిజ్య దేశాల నివేదిక ను ప్రచురించింది. ఇది 2018 కి సంబంధించినది. ఇందులో భారతదేశం 30 స్థానాలను ఎగబాకి, వందో ర్యాంకు కు చేరుకొంది. 190 దేశాల సరసన మనకు ఈ ర్యాంకు వచ్చింది. అలాగే మెరుగుపరచుకొంటున్న దేశాల విషయాన్ని తీసుకొంటే, ఇందులో అగ్రగామి 10 దేశాల లో ఉండడం గమనార్హం. సులభతర వ్యాపార దేశాల నియమ నిబంధనలను భారతదేశం చాలా వేగంగా పాటిస్తోందని, అమలులోకి తెస్తోందనడానికి ఇదే నిదర్శనం.