Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా కేరళ తిరూవల్లా లోని శ్రీ రామకృష్ణ వచనామృత సత్రంను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం

వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా కేరళ తిరూవల్లా లోని శ్రీ రామకృష్ణ వచనామృత సత్రంను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం


నమస్కారం. ప్రతి ఒక్కరికీ అభినందనలు.

స్వామి నిర్వినానంద జీ తో పాటు, ఈ రోజు ఇక్కడకు వచ్చిన శ్రీ శ్రీ ఠాకూర్ రామకృష్ణ పరమహంస భక్తులందరికీ అభినందనలు.

శ్రీ రామకృష్ణ వచనామృత సత్రం 7వ రోజు సదస్సు ఆరంభ కార్యక్రమంలో మీతో కలసి పాలుపంచుకొనే భాగ్యం నాకు దక్కింది.

ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాటలు బెంగాలీ భాషలో నుండి మలయాళం లోనికి అనువాదమై, కేరళలో ఆ మాటల పఠనం, ఆ ప్రబోధాలపై చర్చలు జరుగుతూ ఉండటాన్ని గురించి నేను ఆలోచిస్తూ ఉంటే- మన దేశమంతటా ఆలోచనలను ఎలా పంచుకొంటున్నారో, వాటిని ఎలా ఆచరిస్తున్నారో అన్న తెలివిడి కలిగి, నేను వినమ్రుడినయ్యాను.

‘ఏక్ భారత్.. శ్రేష్ట భారత్’కు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది ?

మీరు మొదలుపెట్టిన ఈ అభ్యాసం గొప్ప గురువుల బోధలను, పవిత్ర గ్రంథాలలోని సూక్తులను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలన్న ఒక సుదీర్ఘమైన సంప్రదాయాన్ని నెలకొల్పుతోంది.

భారతదేశంలో ఎంతో కాలంగా నిలకడగా కొనసాగుతూ వస్తున్న మౌఖిక సంప్రదాయంలో ఇది ఒక భాగం. మారుతున్న కాలానికీ, పరిస్థితులకు అనుగుణంగా శాశ్వత విలువలను ఇది పదిలంగా ఉంచుతోంది.

ఈ సంప్రదాయం శ్రుతుల నుంచి, స్మృతుల నుంచి పరిణామం చెందినటువంటిది.

శ్రుతులు, నాలుగు వేదాలు మరియు ఉపనిషత్తులు ధర్మానికి మూలం. భారతీయ ఋషులు ఈ పవిత్రమైన విజ్ఞానాన్ని ఒక తరం నుంచి మరొక తరానికి అందజేశారు.

శ్రుతులు దివ్య జ్ఞానాన్ని చాటేవీ, మౌఖిక ప్రసారాలూ అని మనమంతా నమ్ముతున్నాము.

శ్రుతి అంటే- జ్ఞాపక శక్తి పైన, భాష్యం పైన ఆధారపడ్డ ఒక రకమైన పాఠాల కోవకు చెందినది.

వేదాలు, ఉపనిషత్తులు సామాన్య ప్రజలు అర్థం చేస్తుకోడానికి కష్టంగా ఉండటం చేత, వాటిని కథలు, నీతి పాఠాల రూపంలో ప్రాథమికంగా వివరించి, విశదీకరించి చెప్పడం కోసం శ్రుతులను రచించడం జరిగింది.

అలాగ.. ఇతిహాసాలు, పురాణాలు, కౌటిల్యుని అర్ధ శాస్త్రం – ఇవన్నీ కూడా శ్రుతులేనన్నది సుస్పష్టం.

ప్రతి మనిషికి వారికి సరిపోయే విధానం ద్వారా వీటిని చేరవేయడానికి చేసిన ప్రయత్నాలు కాలక్రమంలో కొనసాగుతూ వచ్చాయి.

సామాన్య ప్రజానీకానికి చేరడం కోసం ధర్మాన్ని లేదా సరి అయిన పద్ధతిలో మనుగడ సాగించడాన్ని, మరింత అందుబాటులో ఉండే లాగాను, అది వారి దైనందిన జీవితాలకు సన్నిహితంగా ఉండే లాగాను చేయవలసివచ్చింది.

దేవఋషి నారదుడు భగవంతుని ఇలాగ వర్ణిస్తున్నాడు:

అహో దేవర్షిర్ధన్యోయం యత్కీర్తి శార్ జ్ఞ‌ధన్వనః |

గాయన్మాద్యన్నిదం తంత్రయా రమయత్యాతురం జగత్ ||

“అహో ! యే దేవర్షి నారదజీ ధన్యహై జో వీణా బజాతే,

హరిగుణ్ గాతే ఔర్ మస్త్ హోతే హువే ఇస్ దుఃఖీ సంసార్ కో

ఆనందిత్ కర్ తే రహ్ తే హై | ”

దైవాన్ని ప్రజలకు దగ్గరగా తీసుకురావటం కోసం భక్తి సాధువులు సంగీతాన్ని, కవిత్వాన్ని, స్థానిక భాషలను ఉపయోగించుకున్నారు. కులాలను, తరగతులను, ప్రాంత, లింగభేద సదృశావరోధాలను వారు ఛేదించారు.

సాధువులిచ్చిన సందేశాన్ని జానపద గాయకులు, కథా వాచకులు, దాస్తాంగోయీలు మరింత ముందుకు తీసుకువెళ్లారు.

కబీరు దోహాలు, మీరా భజనలను గాయకులు పల్లె పల్లెకూ చేరవేశారు.

భరత భూమి సాంస్కృతికంగానూ, మేధాపరంగానూ సుసంపన్నమైన క్షేత్రం.

మన దేశం రచయితలకు, మేధావులకు, పండితులకు, సాధువులకు, స్వేచ్ఛగా, నిర్భయంగా తమను తాము ఆవిష్కరించుకున్న బుుషులకు పుట్టినిల్లు.

మానవ నాగరికత చరిత్ర విజ్ఞానం వైపు మళ్లినప్పుడల్లా వారికి మార్గం చూపించింది భారతదేశమే.

బయటి నుంచి వచ్చిన వారు మొదలుపెట్టిన సాంఘిక, రాజకీయ, ఆర్ధిక సంస్కరణలు భారతదేశానికి అవసరమైనాయంటూ భారతదేశాన్ని గురించి ఒక తప్పుడు ఎరుక స్థాపితమైంది.

ఇది వలసవాదాన్ని సమర్ధించడానికి ఒక కారణమైంది.

అటువంటి భావాలు పూర్తిగా తప్పు భావాలు. దీనికి కారణం భారతదేశపు నేల ఎప్పటికీ మార్పు అంకురించిన నేలయే.

సమాజాన్ని పరివర్తన దిశగా మార్చడాన్ని తమ ధ్యేయంగా చేసుకున్న ఋషులు, మేధావుల మార్గదర్శనంలో ఈ మార్పు అనేది అంతర్గతంగా ప్రారంభమైంది. అంతే కాదు, మన సమాజంలోకి చొచ్చుకురాగల అవకాశమున్న దుశ్చర్యలను నిర్మూలించేందుకు భారీ ఉద్యమాలను చేపట్టింది.

మన ఋషులు సంఘంలో మార్పును తీసుకురావాలన్న తమ తపనను సాకారం చేసుకొనే క్రమంలో ప్రతి ఒక్క పౌరుడిని సమైక్యపరచారు.

ఈ పరిధికి ఆవల ఎవ్వరినీ ఉంచలేదు.

ఇందువల్లే మన నాగరికత అవరోధాలను అధిగమిస్తూ సమున్నతంగా నిలబడగలిగింది.

కాలంతో పాటు మారని నాగరికతలు, కాలగర్భంలో కలసిపోయాయి.

మనం, మరో వైపు శతాబ్దాలుగా ఉన్న అలవాట్లలో సైతం మార్పులు చేసుకున్నాం .

కొన్ని శతాబ్దాల క్రితం కొన్ని అలవాట్లు అమలులో ఉండి ఉండవచ్చు; అయితే, అవి పనికి రావనిపించినప్పుడు, అలాంటి వాటిని సవరించుకోవడం జరిగింది.

మనం కొత్త ఆలోచనలను ఎల్లప్పుడూ ఆహ్వానిస్తూనే వస్తున్నాం.

మన చరిత్ర పరంగా చూస్తే మన ఋషులు చేసింది చాలా తక్కువగా అనిపించవచ్చు. కానీ దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అది మన చరిత్ర గతినే మార్చివేసింది.

చాలా కాలం క్రితమే అప్పటి నమ్మకాలకు, సంస్కృతికి వ్యతిరేకంగా మన మహిళా సాధువులు లింగ సమానత్వం సమస్యను చేపట్టినట్టు తెలుస్తోంది.

వారు నిర్భయంగా వారి భావాలను తమ శక్తివంతమైన రచనల ద్వారా వ్యక్తం చేశారు.

హిందూ తత్వంలో కాలం ఒక అత్యంత ముఖ్యమైన అంశంగా ఆమోదించబడింది. మనం దిక్ -కాల్- బాధిత్.. అంటే, అంతరిక్షానికి, కాలానికి మనం లోబడి ఉంటున్నామన్నమాట.

కాలాలకు సంబంధించిన శాశ్వతమైన విలువలకు భాష్యాన్ని చెప్పడమే గురువు పోషించవలసిన పాత్ర. అది ఎలాగంటే, పారే నది ఏ విధంగా అయితే ప్రవాహ క్రమంలో తనను తాను పునర్ నవీకరించుకొంటుందో అదే విధంగా జ్ఞాన ప్రవాహం కూడా ఎప్పటికీ నిత్యనూతనంగాను, ఉజ్జ్వలంగాను సాగుతూపోతుంది.

ప్రాచీన గ్రంథాలు ఈ విధంగా చెబుతున్నాయి.

ప్రేరకః సూచకాశ్వైవ వాచకో దర్శకస్తథా |

శిక్షకో బోధకశ్చైవ షడేతే గురవ: స్మృతాహ: ||

ఎవరైతే నిన్ను ప్రేరేపిస్తారో, ఎవరైతే నీకు తెలియజేస్తారో, ఎవరైతే నీకు సత్యాన్ని చెబుతారో, ఎవరైతే నీకు బోధిస్తారో – వారు నీకు సరైన మార్గాన్ని చూపిస్తారు.;నిన్ను మేల్కొల్పుతారు. వారందరూ నీ గురువులు అని దీనికి అర్థం.

కేరళలో పరివర్తనను తీసుకురావడంలో శ్రీ నారాయణ గురు పోషించిన పాత్రను మనం అందరం గుర్తు పెట్టుకున్నాం.

ఒక వెనుకబడిన వర్గం నుండి వచ్చిన సాధువు, సంఘ సంస్కర్త కులం అనే అవరోధాన్ని అధిగమించి, సామాజిక న్యాయాన్ని వృద్ధిపరచారు.

శివగిరి తీర్ధయాత్ర ప్రారంభ సమయంలో విద్య, శుభ్రత, భగవంతునిపై భక్తి, సంస్థ, వ్యవసాయం, వ్యాపారం, హస్త కళలు, సాంకేతిక శిక్షణలను అభివృద్ధి చేయాలనేది దాని లక్ష్యమని ఆయన ప్రకటించారు.

సమాజం ముందంజలు వేయడానికని ఒక ఉపాధ్యాయుడు ప్రమాణాలను రూపొందించడం కంటే ఉత్తమమైన ఉదాహరణ అంటూ మరొకటి ఉంటుందా ?

ఈ కూటములో శ్రీ రామకృష్ణ ను గురించి మాట్లాడటం ఒక కొత్త కోటకు బొగ్గులను తీసుకువెళ్లిన చందంగా ఉండవచ్చు. అయినా సరే ప్రస్తుత కాలానికి ఎంతో అనుగుణంగా ఉన్న ఆయన బోధనలను గురించి ఇక్కడ ప్రస్తావించకుండా నేను ఉండబట్టలేకపోతున్నాను.

భక్తి సంప్రదాయ సాధువులలో ఆయన కూడా ఒక భాగం. కథామృతంలో చైతన్య మహాప్రభు యొక్క ప్రస్తావనలను- ఆయన పారవశ్యాలను, ఆయన గేయాలను, ఆయన పూర్ణ నిష్ఠను- ఎన్నింటినో మనం గమనిస్తాం.

అయితే ఆయన సంప్రదాయాన్ని పునరుద్ధరించారు, సంప్రదాయాన్ని పటిష్టపరచారు.

మతాలకు, కులాలకు మధ్యనున్న అవరోధాలను పక్కన పెట్టి, మానసిక అడ్డంకులను భేదించారు.

ఆయన సామాజిక సామరస్యంతో కూడిన సాధువులా మెలగారు.

సహనంతోను, భక్తి తోను, జ్ఞాని, యోగి, భక్తుడు.. ఇలా వేరు వేరు పేర్లతో ఉన్న వ్యక్తి తనను తాను ఏకైక దైవం యొక్క దివ్యత్వానికి.. “అదే అస్తిత్వం దేనినైతే జ్ఞానులు బ్రహ్మ- పరమము అని అంటారో, యోగులు ఆత్మ- విశ్వ ఆత్మ అని అంటారో, భక్తులు – దివ్య మహిమలు కలిగిన భగవాన్ గా చెబుతారో ఆ శక్తి”కి అర్పణ చేసుకోవాలనేదే ఆయన ఇచ్చినటువంటి సందేశం.

ఆయన ముస్లిముల జీవన విధానాన్ని అవలంబించి చూపారు. క్రైస్తవ జీవన సరళిని సైతం ఆచరించారు. తాంత్రిక విద్యను కూడా అభ్యసించారు.

దైవాన్ని చేరుకొనేందుకు పలు మార్గాలు ఉన్నాయని ఆయన కనుగొన్నారు. కానయితే, నిష్ఠతో కొలిచినప్పుడు అవి అన్నీ ఒకే గమ్యానికి చేర్చుతాయి.

“వాస్తవం ఒకటే; అది ఒకే విధంగా ఉంటుంది” అని ఆయన చెప్పారు. తేడా అల్లా పేరులో, రూపంలో మాత్రమే ఉన్నది.

అది జలం లాంటిది. జలం అన్నా, నీరు అన్నా, పానీ అన్నా, ఇంకా మరేవేవో భాషలలో వేరే వేరే పేర్లతో పిలిచినా జలం జలమే కదా.

అలాగే, జర్మన్ లో ‘Wasser’ అనీ, ఫ్రెంచ్ లో ‘Eau’ అనీ, ఇటాలియన్ లో ‘Acqua’ అనీ, జాపనీస్ లో ‘Mizu’ అనీ పిలుస్తారు. కేరళ లో అయితే మీరు దీనిని ‘వెళ్లామ్’ అని వ్యవహరిస్తారు.

అవి అన్నీ ఒకటే విషయాన్ని సూచిస్తాయి; ఒక్క పేరులోనే వ్యత్యాసం.

అదే విధంగా, కొందరు ఆ యథార్థాన్ని ‘అల్లా’ అనీ, మరికొందరు ‘దేవుడు’ అనీ, కొంతమంది ‘బ్రహ్మ’ అనీ, ఇంకొందరు ‘కాళి’ అనీ, ఇంకాకొందరు ‘రామా’, ‘జీసస్’, ‘దుర్గా’, ‘హరి’ అనీ సంబోధిస్తారు.

ఆయన బోధనలు మరీముఖ్యంగా ప్రజలను విడదీయడానికి, వారిలో ద్వేషాన్ని సృష్టించడానికి మతాన్ని, కులాన్ని ఉపయోగించుకొనే వారు మనకు ఎదురుపడుతున్న ఈ రోజులలో ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి.

గాంధీ మహాత్ముడు చెప్పారు రామకృష్ణ జీవితం మనం దైవాన్ని ముఖాముఖి చూడటానికి వీలు కల్పిస్తుంది అని.

దైవం ఒక్కటే వాస్తవం. మిగిలినవన్నీ భ్రాంతి అని ఒప్పుకోకుండా ఎవ్వరూ కూడా ఆయన జీవితాన్ని చదవలేరు.

ప్రాచీనతకు, ఆధునికతకూ మధ్య శ్రీ రామకృష్ణ ఒక లంకె లాంటి వారు.

ఆధునిక జీవన విధానాన్ని అనుసరిస్తూనే ప్రాచీన ఆదర్శాలు, అనుభవాలను ఏ విధంగా అనుభూతించవచ్చో ఆయన చేసి చూపించారు.

చిన్న చిన్న పిట్టకథలతో, సాదా సందేశాలు- సరళంగా చెప్పినవి.

అయితే వాటి సరళత్వం కారణంగానే అవి శ్రోతల మనసులలో ముద్రించుకుపోయాయి. ఇటువంటి ఉపాధ్యాయుడే గనుక మనకు దొరకకపోతే, స్వామి వివేకానంద లాంటి శిష్యుడు ఉండే వారా ?

ఆ గొప్ప కర్మయోగి తన గురువు గారి ఆలోచనను ముందుకు తీసుకు వెళ్లారు.

జత్ర జీవ్, తత్ర శివ్ – ఎక్కడైతే జీవం ఉంటుందో – అక్కడ శివుడు ఉంటాడు;

ఇంకా

“జీవే దయా నోయ్, శివ్ జ్ఞానే జీవ్ సెబా” – జీవుల పట్ల ప్రేమగా ఉండటం కాదు,

జీవులనే శివునిగా సేవించాలి.

జీవితాంతం వరకు దారిద్ర నారాయణుల సేవకే ఆయన అంకితం అయ్యారు.

“దైవాన్ని పొందటానికి నీవు ఎక్కడికి వెళతావు ? ” – అని స్వామి వివేకానంద అన్నారు.

పేదలు, దు:ఖపూరితులు, దుర్బలులు దైవం కాదా ? మొదట వారిని ఎందుకు ఆరాధించకూడదు ? ఈ ప్రజలను నీ దైవంగా ఎంచు.

హృదయంలో అవధులు లేని ధైర్యం, పట్టు వదలని శక్తితో కూడిన తీవ్రమైన కర్మ యోగం ఇప్పుడు కావాలి. అదే మనం కార్యోన్ముఖులు కావడానికి స్ఫూర్తినిస్తుంది. మనకు ధైర్యాన్ని ఇస్తుంది.

రామకృష్ణ మిషన్ అందిస్తున్న సేవా కార్యక్రమాలే ఈ నిబద్ధతకు నిదర్శనం.

పేదలు నివసించే ప్రాంతాలలోను, గిరిజనుల ఆవాసాలలోను, అవసరాలతో ఎదురుచూస్తున్న ప్రాంతాలలోను, లేదా విపత్తు సంభవించిన ప్రాంతాలలోని బాధితుల కష్టాలను తగ్గించే ప్రయత్నంలో మనం మిషన్ ను కనుగొంటాం.

ఆ వ్యక్తి ఏ సముదాయానికి చెందిన వారు, అతడి లేదా ఆమె యొక్క కులం, వారి విశ్వాసాలు ఏవీ గణనకు రావు.

అతడికి లేదా ఆమెకు నిస్వార్ధంగా సేవచేయడమే అన్నింటికన్నా ముఖ్యం.

మిషన్ వెబ్ సైట్ లో మనం ఒక బ్రహ్మవాక్యాన్ని గమనించవచ్చు; అది – ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయ చ అనేది.

ఒకరి స్వీయ మోక్షం కోసం- విశ్వ శ్రేయం కోసం అని దీని అర్థం.

సేవా పరమో ధర్మ:

పృథవిం ధర్మణా ఘృతామ్ శివామ్ స్యోనామను చరేమ విశ్వహా |

(ధర్మం ద్వారా ఏర్పడిన ఈ మాతృభూమిని మనం ఎల్లప్పటికీ సేవిస్తాము)

మైత్రీ కరుణా ముదితోపేక్షాణాం | సుఖ్ దు:ఖ్ పుణ్యాపుణ్య విషయాణాం |

వనాతశ్చిత్తప్రాసాదనమ్ |

(ఇతరుల దు:ఖం చూసి మనసులో కరుణ, ఇతరుల పుణ్యం (సమాజ సేవ వంటివి) చూసి ఆనంద భావన, ఇంకా.. ఎవరైనా పాపం చేసి ఉంటే మనసులో ఉపేక్ష భావం (చేసి ఉంటాడు వదిలేయండి) వంటి ప్రతిక్రియలు ఉత్పన్నం కావాలి)

ఈ రోజు వెలిగించిన జ్యోతి- ప్రారంభమైన ఈ సత్రం- మన హృదయాలలో వెలుగులు నింపాలి; ‘ఏక్ దీప్ సే జలే దూస్ రా, జల్ తే దీప్ హజార్’ ।

(ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగిస్తే అలా వేయి దీపాలు వెలుగుతాయి).

మన ప్రియతమ శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి గారి మాటలలో చెప్పాలంటే –

ఆవో ఫిర్ సే దీయా జలాయే

భరీ దుపహరీ మే అంధియారా

సూరజ్ పర్ ఛాయీ సె హారా

అంతరతమ్ కా నేహ్ నిచోడే-

బుఝీ హుయీ బాతీ సుల్ గాయే।

ఆవో ఫిర్ సే దీయా జలాయే।

శ్రీ శ్రీ ఠాకూర్ రామకృష్ణ ఆడిన మాటలు మనకు స్ఫూర్తి నివ్వాలి గాక. ఆయన అంటారు కదా.. అన్నింట్లోనూ దివ్యత్వాన్ని చూడాలి, పేదలలోకెల్లా నిరుపేదలకు, అత్యంత బలహీనులకు సేవ చేయడంలో స్వార్ధాన్ని, అహంభావాన్ని తొలగించుకోవాలి, అలా చేయడం ద్వారా మనం గొప్ప సత్యాన్ని.. ఏదయితే అన్ని మతాల సారాంశమో.. అన్వేషించగలుగుతాము.

మరొక్క మారు, గొప్ప శిష్యుని మాటలను నేను మార్గదర్శకంగా స్వీకరిస్తాను: మనం పని చేస్తూనే ఉందాం. ఫలితం ఎలా ఉన్నప్పటికీ, మన కర్తవ్యంగా దానిని చేస్తూనే వెళ్దాం. చక్రానికి మన భుజాన్ని ఉంచి పని చేయడానికి ఎల్లప్పుడూ మనం సంసిద్ధులమై ఉందాం.

అప్పుడు తప్పక మనం వెలుగును చూడగలం!

మీకు ధన్యవాదాలు. మీకు మరీ మరీ కృతజ్ఞతలు.