పిఎంఇండియా
భారతదేశం, ఇరాన్ ల మధ్య వ్యవసాయ రంగం మరియు అనుబంధిత రంగాలలో సహకారానికి ఉద్దేశించిన అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వెనుకటి తేదీ నుండి అమలులోకి వచ్చే విధంగా ఆమోదం తెలిపింది. భారతదేశంలో ఇరాన్ అధ్యక్షుని పర్యటన సందర్భంగా 2018 ఫిబ్రవరి 17వ తేదీన ఈ ఎమ్ఒయు పై సంతకాలయ్యాయి.
వ్యవసాయ పంటలు, వ్యవసాయ విస్తరణ, పండ్ల తోటలు, యంత్ర పరికరాలు, పంట కోతల అనంతర సాంకేతిక పరిజ్ఞానం, సస్య రక్షణ చర్యలు, రుణం, ఇంకా తదితర రంగాలలో పరస్పర సహకారానికి ఈ ఎమ్ఒయు వీలు కల్పిస్తుంది. భూ సార పరిరక్షణ, నీటి యాజమాన్యం, సమీకృత పోషకాల యాజమాన్యం, విత్తన సంబంధి సాంకేతికత, వ్యవసాయ మార్కెటింగ్ రంగాలలో సహకారానికి కూడా ఇది ఉపకరిస్తుంది. పశుగణాభివృద్ధి, పాడి పరిశ్రమాభివృద్ధి, పశువుల ఆరోగ్యం, ఇంకా ఎమ్ఒయు పరిధిలో ఉభయ పక్షాలకూ అంగీకారం కుదిరినటువంటి అంశాలకు సంబంధించిన సహకారానికీ ఇది మార్గాన్ని సుగమం చేస్తుంది. నిపుణుల సేవలు, సామగ్రి, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, శిక్షణార్ధులను, పరిశోధనల కోసం శాస్త్రవేత్తలను ఇరు దేశాలూ పంపుకోవడం, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ ల వంటి విషయాలలోనూ పరస్పర సహకారానికి ఈ ఎమ్ఒయు రంగాన్ని సిద్ధం చేస్తుంది. సదస్సులు, కార్యశాలల నిర్వహణ, అలాగే పరస్పరం అంగీకరించిన విషయాలలో కార్యకలాపాలు చేపట్టడం వంటివి ఇందులో ఉన్నాయి.
ఈ ఎమ్ఒయు లో భాగంగా, ఎమ్ఒయు ను అమలపరచేందుకు చేపట్టిన కార్యకలాపాల అమలును పర్యవేక్షించేందుకు ఒక సంయుక్త కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సంయుక్త కార్యనిర్వాహక బృందం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశం , ఇరాన్ లలో మార్చి మార్చి సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. తొలుత ఐదు సంవత్సరాల కాలం పాటు ఈ అవగాహనపూర్వక ఒప్పందం అమలులో ఉంటుంది. ఉభయ పక్షాలలో ఏదైనా పక్షం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే అభిమతాన్ని అవతలి పక్షానికి నోటిఫై చేస్తే తప్ప, మరో ఐదు సంవత్సరాల కాలానికి వర్తించేటటువంటి అవకాశం ఈ ఎమ్ఒయు లో అంతర్నిహితంగా ఉంటుంది.
***