Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ‌న‌గ‌ర్‌లో కిశన్ గంగ జ‌ల‌ విద్యుత్తు ప్రాజెక్టు ను దేశ ప్రజలకు అంకితం చేసేందుకు ఏర్పాటైన ఒక కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన‌ మంత్రి ఉపన్యాసం

శ్రీ‌న‌గ‌ర్‌లో కిశన్ గంగ జ‌ల‌ విద్యుత్తు ప్రాజెక్టు ను దేశ ప్రజలకు అంకితం చేసేందుకు ఏర్పాటైన ఒక కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన‌ మంత్రి ఉపన్యాసం


జమ్ము & కశ్మీర్ గవర్నర్ శ్రీమాన్ ఎన్.ఎన్. వోహ్ రా గారు, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి గారు, నా మంత్రివర్గ సహచరులు శ్రీయుతులు నితిన్ గడ్కరీ గారు, డాక్టర్ జితేంద్ర సింహ్ గారు, శ్రీ ఆర్.కె. సింహ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీమాన్ కవీంద్ర గుప్తా గారు, విద్యుత్తు శాఖ మంత్రి శ్రీ సునీల్ కుమార్ శర్మ గారు, ఉప శాసనసభాపతి శ్రీ నజీర్ అహ్మద్ ఖాన్ గారు, పార్లమెంటు సభ్యులు మరియు సీనియర్ నాయకుడు గౌరవనీయులు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా గారు, పార్లమెంటు సభ్యులు శ్రీ ముజఫర్ హుసేస్ బేగ్ గారులతో పాటు ఇక్కడ హాజరైన ప్రముఖులు, అధికారులు, ఇంకా జమ్ము & కశ్మీర్ లోని ప్రియమైన నా సోదరులు మరియు సోదరీమణులారా,

జమ్ము & కశ్మీర్ లో మరోసారి మీలో ఒకడుగా మిమ్మల్ని కలుసుకొనే అవకాశం నాకు లభించింది. నన్ను మళ్లీమళ్లీ ఇక్కడకు రప్పిస్తున్నది మీ ప్రేమాభిమానాలే. గడచిన నాలుగు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం లోనూ నేన ఇక్కడకు వస్తూనే ఉన్నాను. నేను రాని సందర్భం అంటూ ఏ సంవత్సరం లోనూ నమోదు కాలేదు. శ్రీనగర్‌ లో వరదల తరువాత దీపావళి వేడుకలు నిర్వహించిన సమయంలో నేన ఇక్కడకు వచ్చిన వరద బాధితులతో కలసి ఆ సంబరాల్లో పాల్గొన్నాను. దాంతో పాటు సరిహద్దుల్లో అహర్నిశలూ దేశాన్ని కాపాడుతున్న సైనికుల తోనూ దీపావళి ఉత్సవాలలో పాలుపంచుకొనే అవకాశం నాకు దక్కింది. ఇక ఇవాళ పవిత్ర రంజాన్ మాసం లో నేను మీలో ఒకడు గా మీ మధ్య ఉన్నాను. ప్రవక్త మొహమ్మద్ సాహెబ్ సహా ఆయన ప్రబోధాలను స్మరించుకొనే అవకాశం ఈ మాసంలో లభిస్తుంది. ఆయన జీవితం నుండి సమానత్వాన్ని, సౌభ్రాత్రాన్ని స్వీకరిస్తే చాలు. ఆ మహనీయుడి ప్రబోధాల లోని ప్రతి అక్షరం మన దేశాన్నేగాక మొత్తం ప్రపంచాన్నే ముందుకు నడుపుతుంది. ఈ పవిత్ర రంజాన్ మాసం లో అతిపెద్ద స్వప్నం సాకారం కావడం ఒక యాదృచ్ఛిక సంతోషభరిత అంశం. నేడు ఇక్కడ కిశన్ గంగ జల విద్యుత్తు ప్రాజెక్టు ను దేశ ప్రజలకు అంకితం చేసే సదవకాశం నాకు లభించడం ఇందులో భాగమే. అనేక అడ్డంకులను అధిగమించి ఆవిష్కృతమైన ఈ ప్రాజెక్టు జమ్ము & కశ్మీర్ ప్రగతి పయనానికి కొత్త కోణాన్ని జోడించడానికి సిద్ధమైంది. అందుకే ఈ సందర్భంగా మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఉచిత విద్యుత్తు సరఫరాను మాత్రమే గాక ఖర్చు లేని విద్యుత్తును కూడా అందిస్తుంది. ప్రస్తుతం జమ్ము & కశ్మీర్ విద్యుత్తు అవసరాలలో అధిక శాతం తీరాలంటే దేశం లోని ఇతర ప్రాంతాలపైన ఆధారపడవలసి వస్తోంది. ఇప్పుడిక ఈ 330 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో విద్యుత్తు కొరత సమస్య చాలా వరకు తీరిపోతుంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

అద్భుతమైన ఇంజినీయరింగ్ నైపుణ్యానికి ఈ ప్రాజెక్టు ఒక ఉదాహరణ. దీన్ని పూర్తి చేయడానికి అనేక మంది ఎంతో శ్రమించారు. విద్యుదుత్పాదనకు అవసరమైన ప్రవాహం కోసం బాందీపోరా జిల్లా పరిధిలోని కొండలో సొరంగం తవ్వి కిశన్ గంగ నది జలాలను బోనార్ నల్లా కు మళ్లించారు. కాబట్టి ఈ ప్రాజెక్టు పనుల్లో పాలుపంచుకున్న ప్రతి శ్రామికుడు, ప్రతి ఇంజినీయరు, ప్రతి ఉద్యోగి ప్రత్యేకించి ప్రశంసపాత్రులు. ఇది మీ ధైర్యం ఫలితం. ఈ కారణంగా మనం ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగాము.

ఈ వేదిక నుంచే శ్రీనగర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పునాదిరాయి ని వేసే అవకాశం కూడా ఇవాళ నాకు లభించింది. ఈ 42 కిలోమీటర్ల పొడవైన రహదారి కోసం 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నారు. శ్రీనగర్ పరిధి లోని అంతర్గత మార్గాలలో వాహన రాకపోకల చిక్కు సమస్యను ఈ రహదారి చాలావరకు పరిష్కరించి, ఈ ప్రాంత ప్రజల జీవనాన్ని మరింత సౌకర్యవంతం చేస్తుంది.

జమ్ము & కశ్మీర్ ప్రజల జీవితాల్లో మార్పు తేవాలంటే రాష్ట్రంలో కీలకమైన కశ్మీర్, జమ్ము, లద్దాఖ్ ప్రాంతాలను అభివృద్ధి చేయడం అవశ్యం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే 80వేల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీకి ఆమోదం తెలిపాము. ఈ మేరకు స్వల్ప కాలంలోనే 63వేల కోట్ల రూపాయల విలువైన పథకాలు మంజూరు కాగా, వీటిలో ఇప్పటికే 20వేల కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేయడం నాకెంతో ఆనందం కలిగిస్తోంది. రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఎం ల నిర్మాణం తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా ఆసుపత్రుల స్థాయి కి ఆధునికీకరించే పనులు కూడా ఈ నిధుల సాయంతో సాగుతున్నాయి. కొత్త జాతీయ రహదారులు, అన్ని రుతువులలో ఉపయోగపడే రహదారులు, కొత్త సొరంగాలు, విద్యుత్తు ప్రసార, పంపిణీ లైన్ లు, నదులు- సరస్సుల పరిరక్షణ, రైతు సంక్షేమ పథకాలు, శీతల గిడ్డంగులు, గోదాములు సహా యువతకు ఉపాధి కల్పన దిశగా సరికొత్త చర్యలు శ్రీకారం చుట్టుకున్నాయి. ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు జమ్ము & కశ్మీర్‌ను 21వ శతాబ్ది రాష్ట్రంగా మలచేందుకు ప్రాధాన్యం ప్రాతిపదికగా పనులు చేపడుతున్నారు.

మిత్రులారా,

నేను ఎప్పుడు పర్వతాలను సందర్శించినా నాకు ఒక నానుడి గుర్తుకువస్తుంది. కొండ ప్రాంతాల నీరు, యువతరం ఆ ప్రదేశానికి ఉపయోగపడేవి కావని ఇంతకుముందు చెప్పే వారు. ఆధునిక పరిజ్ఞానం విస్తరించక ముందు, ప్రకృతి ఎదుట మానవుడు శక్తిహీనుడుగా ఉన్నప్పటి నానుడి ఇది. నేడు కాలం పూర్తిగా మారింది. మీ అందరి తోడ్పాటు తో ఈ నానుడిని మార్చేయాలని మేం సంకల్పించాము. ఆ మేరకు ఇకపై జమ్ము & కశ్మీర్ యువత, ఈ నేలపై ప్రవహించే నీరు.. రెండూ ఈ భూమికే ప్రయోజనకరం కాగలవు. రాష్ట్రంలో జలవిద్యుదుత్పాదన సామర్థ్యం గల నదులు అనేకం ఉన్నాయి. తనకోసం తగినంత విద్యుత్తు ను ఉత్పత్తి చేసుకోవడమే గాక దేశానికి అంతటికీ అందించగల సామర్థ్యం ఈ ప్రాంతానికి ఉంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని నాలుగేళ్లుగా మేము అనేక ప్రాజెక్టుల సాకారానికి కృషి చేస్తున్నాము. ఆ క్రమంలో త్వరలోనే 8వేల కోట్ల రూపాయల వ్యయంతో కిష్ట్ వడ్ జల విద్యుదుత్పాదన కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నాము. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నిరవధిక విద్యుత్తు సరఫరా దిశగా నిరంతరం శ్రమిస్తున్నాము. ఇందులో భాగంగా స్మార్ట్ గ్రిడ్, స్మార్ట్ మీటర్లు వంటి వాటిని ప్రవేశపెడుతున్నాము. వీధి దీపాలను ఆధునికీకరిస్తున్నాము. జమ్ము & కశ్మీర్‌లో పల్లెల నుండి పట్టణాల దాకా విద్యుత్తు సరఫరాతో పాటు రాష్ట్ర పంపిణీ వ్యవస్థ మెరుగుదల కోసం 4 వేల కోట్ల రూపాయలకు పైగా ఇప్పటికే ఖర్చు చేశారు.

మిత్రులారా,

గ్రామాలకు, ఇళ్లకు విద్యుత్తును సరఫరా చేయాలన్న లక్ష్యం ఒక్కటే కాకుండా ఇప్పటికే విద్యుత్తు సరఫరా గల ఇళ్లకు బిల్లు భారాన్ని తగ్గించాలని కూడా మేము సంకల్పించాము. ఇందుకు తగినట్లుగా ‘ఉజాలా’ పథకం లో భాగంగా రాష్ట్రం లో 78 లక్షలకు పైగా ఎల్ఇడి బల్బులను పంపిణీ చేశాము. దీంతో రాష్ట్ర ప్రజలకు ఏటా 400 కోట్ల రూపాయలకు పైగా ఆదా అవుతోంది. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ విద్యుత్తు సరఫరా చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలై ఉంది. ఆ మేరకు ఇప్పటి దాకా విద్యుత్తు కనెక్షన్ లేని కుటుంబాలకు ‘సౌభాగ్య’ పథకం కింద విద్యుత్తు సరఫరా దిశగా పనులు జరుగుతున్నాయి.

మిత్రులారా,

జమ్ము & కశ్మీర్ ప్రగతికి అతిపెద్ద వనరు కాగల రంగమేదైనా ఉందంటే అది పర్యటక రంగమే. అతి స్వల్ప పెట్టుబడితో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే రంగం ఇదేనన్నది దశాబ్దాలుగా మనందరికీ తెలిసిన వాస్తవం. ఆ విధంగా పర్యాటక రంగమే ఈ రాష్ట్రానికి భాగ్య ప్రదాత. కానీ, దీన్ని పాత పద్ధతులలోనే నడపడం ఇక ఎంత మాత్రం కుదరదు. ఆధునిక పర్యటకులు మరిన్ని సౌకర్యాలను కోరుకుంటున్నారు. ఒకచోటు నుండి మరో చోటు కు వెళ్లాలంటే గంటల తరబడి వేచి ఉండడం, ఇరుకు మార్గాలలో చిక్కుకుపోవడం వారికి ఇష్టం ఉండదు. వారికి నిరంతర విద్యుత్తు సరఫరా, పరిశుభ్రత తో పాటు చక్కని విమానయాన సేవలు కావాలి. అందుకే పర్యటక రంగానికి అవసరమైన ఆధునిక పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం అనేక పథకాలతో ముందుకుపోతోంది. ఈ వ్యవస్థ ఎంత శక్తిమంతంగా రూపొందితే అంత ఎక్కువగా పర్యటకులు జమ్ము & కశ్మీర్ కు వస్తారు. ఇంతేకాకుండా ఈ రాష్ట్ర యువతరానికి కొత్త ఉపాధి అవకాశాలు అందిరావడంతో పాటు అదే నిష్పత్తిలో మీ ఆదాయం కూడా పెరుగుతుంది.

మిత్రులారా,

పర్యటక రంగంపైన మాత్రమే మొత్తం ఆర్థిక వ్యవస్థ ఆధారపడ్డ దేశాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. అలాంటి సామర్థ్యం ఒక్క జమ్ము & కశ్మీర్‌కు మాత్ర‌మే ఉంది.. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును మరింతగా పెంచగలదు. రాష్ట్రంలో కేవలం పర్యటక రంగం గురించే నేను ప్రస్తావిస్తున్న ఈ తరుణంలో 2 వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రస్తుతం 12 అభివృద్ధి ప్రాధికార సంస్థలు, మూడు పర్యాటక వలయాలు, 50 పర్యాటక గ్రామాల అభివృద్ధి పనులు సాగుతున్నాయి. అయితే, నేను ఇంతకు ముందే చెప్పినట్లు పర్యటక రంగాన్ని మాత్రమే కాకుండా పర్యటక రంగ పర్యావరణ వ్యవస్థ మొత్తాన్ని బలోపేతం చేసుకోవడం అత్యంత అవశ్యం. ఈ పర్యావరణ వ్యవస్థ కు అతి ప్రధానమైన పునాది అనుసంధానం. జమ్ము & కశ్మీర్‌ లో అనుసంధానాన్ని మెరుగుపరచడానికి పెద్దఎత్తున కృషి సాగుతుండడానికి కారణం ఇదే. కాబట్టే రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజీ లో దాదాపు సగం నిధులను రహదారుల రంగంపై ఖర్చు చేస్తున్నాము. తదనుగుణంగా జమ్ము & కశ్మీర్‌ లో జాతీయ రహదారుల సముదాయాన్ని ఏర్పరుస్తున్నాము.

దేశంలోనే అత్యంత పొడవైన జోజిలా సొరంగ మార్గం నిర్మాణ పనులకు ఇక్కడకు వచ్చే ముందు నేను శంకుస్థాపన చేశాను. జమ్ము & కశ్మీర్ అభివృద్ధి లో ఇది కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. అనుసంధానం మెరుగుపడితే ఎన్ని ఇబ్బందులు తీరిపోతాయో ఒక్కసారి ఊహించుకోండి. మీరు చదువుల కోసం వెళ్లాలన్నా, బంధువుల ఇళ్లకు పోవాలన్నా, చికిత్స కోసమో లేదా వ్యాపారం కోసమో లేదా వస్తువుల క్రయ విక్రయాల కోసమో ప్రయాణమైనప్పుడు ఎదురయ్యే సమస్యలన్నీ ఇట్టే పరిష్కారమైపోతాయి. అంతేకాదు.. రాష్ట్రం లోని రైతులు రవాణా జాప్యం వల్ల వారికి వాటిల్లుతున్న నష్టాలను కూడా తగ్గించుకోగలుగుతారు. రవాణా లో ఆలస్యం వల్ల మీ యాపిల్స్, కాయగూరలకు సరైన ధర రాకపోవడమో లేదా అవి పాడైపోవడమో మీకు తెలిసిన సంగతే. శ్రీనగర్‌లో నిర్మించబోయే రింగ్ రోడ్డు లేదా శ్రీనగర్-షోపియాఁ- కాజీగుండ్ జాతీయ రహదారి లేదా చెంగాని-శుధ్ మహదేవ్-గుహ రోడ్డు ల వంటి రహదారి పథకాల పనులు పూర్తి అయ్యాయంటే మీకు సమయం కలసిరావడంతో పాటు మీ వనరులకు వాటిల్లే నష్టాలు కూడా తగ్గిపోతాయి. మంచు కురిసే కాలంలో దట్టంగా పేరుకున్న మంచు వల్ల రోడ్డు మార్గాన చేరుకోలేని ప్రాంతాలను కూడా హెలికాప్టర్ సేవలతో అనుసంధానం చేయబోతున్నాము. ఇక జమ్ము ను, శ్రీనగర్‌ ను ప్రభుత్వం స్మార్ట్ సిటీలు గా మార్చబోతున్న సంగతి మీకు తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రెండు నగరాల్లో నీటి సరఫరా-మురుగు పారుదల వ్యవస్థల మెరుగుకు రూ.550 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆధునిక సదుపాయాలు, అత్యాధునిక రహదారులు అందుబాటు లోకి వస్తే మీ జీవితాలు మెరుగుపడడమే గాక జమ్ము & కశ్మీర్ సౌందర్యానికి కొత్త సొబగులు, విలువ సమకూరుతాయి.

సోదరులు మరియు సోదరీమణులారా,

గ్రామాలను, నగరాలను “స్మార్ట్” గా తీర్చిదిద్దాలని మనం మాట్లాడుకున్నప్పడల్లా స్వచ్ఛత ప్రాధాన్యం మన ఆలోచన లోకి వస్తుంది. ఈ ప్రయత్నంలో తమ శక్తులన్నీ ఉపయోగిస్తూ జమ్ము & కశ్మీర్ ప్రజలే ముందు వరుసలో ఉన్నారనేందుకు నేను ఆనందిస్తున్నాను.

నేను ఇటీవల ఒక కశ్మీరీ బాలిక వీడియో ను సామాజిక మాధ్యమం లో చూశాను. జన్నత్ అనే ఆ ఐదేళ్ల బాలిక దాల్ సరస్సు ను స్వచ్ఛంగా చేయడంలో నిరంతరం తలమునకలై ఉన్నట్టు కనిపించింది. ఈ ఉద్యమ భాగస్వామినైన నాకు స్వచ్ఛత ను భావి భారత పౌరులందరూ ఎంతో పవిత్రంగా, నిజయతీగా స్వీకరించడం ఎంతో గర్వ కారణంగా ఉంది. మిత్రులారా, ఇదే రీతిలో పలువురు సగటు ప్రజలు కూడా ఇలాంటి ప్రయత్నాలు తమ స్థాయిలో ఎన్నో చేస్తున్నారు.

సోదరులు మరియు సోదరీమణులారా,

రాష్ట్రంలో ఆకస్మికంగా వచ్చిన భారీ వరదలు సృష్టించిన విలయం మీ జీవితాలను ఎంతగా మార్చివేసింది నాకు తెలుసు. రాష్ట్రం లోని భిన్న ప్రాంతాల్లో వరదల కారణంగా ఏర్పడిన నష్టానికి తగు పరిహారం అందించేందుకు మే గట్టిగా కృషి చేశాము. సహాయక చర్యల కోసం రాష్ట్రప్రభుత్వానికి క్రమం తప్పకుండా సహాయం చేస్తూనే ఉన్నాము.

మిత్రులారా,

రాష్ట్రంలో అధికారంలో ఉన్న పిడిపి- బిజెపి సంకీర్ణ ప్రభుత్వం పని చేస్తున్న మరో అత్యంత ప్రధానమైన సమస్య మరొకటి ఉంది. అది.. నిరాశ్రయులైన వారికి సహాయం అందించడం. సరిహద్దు ఆవల కల్లోలం కారణంగా ఇక్కడకు వచ్చిన వారు, స్థానిక సమస్యల కారణంగా ఇళ్లు వదిలిపెట్టాల్సి వచ్చిన వారి పునరావాసం కోసం రాష్ట్రం లోని భిన్న ప్రాంతాల్లో ప్రభుత్వం 3500 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తోంది.

మిత్రులారా,

ఈ రోజు జమ్ము & కశ్మీర్ కు చెందిన యువత ఇతర రాష్ట్రాలకు చెందిన యువతకు ఒక ఆదర్శవంతమైన నమూనాగా నిలుస్తున్నారు. ఈ రాష్ట్రానికి చెందిన యువతీయువకుల పేర్లు సివిల్ సర్వీసుల జాబితా లో చూసి వారిని కలిసినప్పుడు నాకు ఎంతో ఆనందం కలగింది. బాందీపోరా కు చెందిన ఒక బాలిక కిక్ బాక్సింగ్ లో విజయాన్ని సాధించి దేశానికి పేరు తీసుకువచ్చినందుకు నేను ఎంతో గర్వపడ్డాను. తజముల్ వంటి వారి ప్రతిభ వృథా కావడాన్ని దేశం సహించదు. ఆ కారణంగానే రాష్ట్రం లోని క్రీడా ప్రతిభకు ఒక రూపం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం కలిసి పని చేస్తోంది. రాష్ట్రంలో క్రీడారంగానికి ఉపయోగపడే మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు అన్నిరకాలుగాను ప్రయత్నం జరుగుతోంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

జమ్ము & కశ్మీర్ యువతకు విద్యా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తేవడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్రప్రభుత్వ సమన్వయంతో పలు పథకాలు అమలుపరిచాం. హిమాయత్ పథకం లో భాగంగా లక్ష మంది పైగా యువతకు శిక్షణ ఇచ్చే పనులు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి ప్రత్యేక ఉపకార వేతనం పథకం లో భాగంగా 16 వేల మందికి పైగా విద్యార్థులు లబ్ధిని పొందుతున్నారు. వారు దేశం లోని అత్యున్నత కళాశాలలలో, విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను పూర్తి చేసుకొనే అవకాశాన్ని అందుబాటు లోకి తెచ్చాము. విభిన్న కారణాల వల్ల మధ్యలోనే చదువు మానేసిన 60 వేల మందికి పైగా విద్యార్థులకు సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ముందుకువచ్చింది. రాష్ట్రంలోనే కాకుండా దేశ పౌరులందరికీ రక్షణ, భద్రత బాధ్యతలు నిర్వహించగల రీతిలో కశ్మీర్ యువకులను తీర్చి దిద్దడానికి కొత్త అవకాశాలు ప్రభుత్వం కల్పించింది. జమ్ము & కశ్మీర్ లో పోలీసు శాఖ ను పటిష్ఠం చేసే దిశగా ఐదు భారతీయ రిజర్వ్ ఫోర్స్ బెటాలియన్ లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీని భర్తీలు చివరి దశ కు వచ్చాయని, భద్రతా విభాగంలో ఐదు వేల మందికి పైగా యువతకు అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని నాకు చెప్పారు.

సోదరులు మరియు సోదరీమణులారా,

దేశ పౌరుల భద్రత, రక్షణ ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యతాంశం. ఈ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చేందుకు మన భద్రత దళాలు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాయి. జమ్ము & కశ్మీర్ పోలీసులు, పారామిలిటరీ దళాలు, ఇక్కడ పని చేస్తున్న జవానులు అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా అద్భుతంగా పని చేస్తున్నారు. అలాంటి సమన్వయాన్ని, సహకారాన్ని అందిస్తున్నందుకు మీరు కూడా అభినందనీయులు. జమ్ము & కశ్మీర్ ప్రజలు వరదలు, తుపానులు, అగ్ని ప్రమాదాలు వంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో భద్రతదళాలు అందించే సేవ నోటి మాటతో కొనియాడలేనిది. జమ్ము & కశ్మీర్ ప్రజలకు అలాంటి క్లిష్ట సమయంలో సహాయం అందించేందుకు వారు పడిన శ్రమకు సంబంధించిన రేఖాచిత్రాలు దేశ ప్రజల మనస్సులలో ముద్ర పడిపోయాయి.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఈ రోజు 1.25 బిలియన్ భారతీయులు న్యూ ఇండియా ను ఆవిష్కరించాలన్న ప్రతిజ్ఞ సాకారం చేసేందుకు శ్రమిస్తున్నారు. న్యూ ఇండియా లో ఉజ్జ్వలంగా వెలిగే తారగా జమ్ము & కశ్మీర్ కాబోతోంది. దేశం లోని అత్యుత్తమ విద్యాసంస్థలు, అత్యుత్తమ ఆస్పత్రులు, అత్యుత్తమ రహదారులు, అత్యాధునిక విమానాశ్రయాలు జమ్ము & కశ్మీర్ లో అందుబాటు లోకి రాకపోవడానికి కారణం లేనేలేదు. రాష్ట్రానికి చెందిన బాల బాలికలు మంచి వైద్యులు, మంచి ఇంజినీయర్లు, మంచి ఆచార్యులు, మంచి అధికారులు కాకపోయేందుకు అవరోధం ఏమీ లేదు.

మిత్రులారా,

జమ్ము & కశ్మీర్ అభివృద్ధి చెందకుండా ఉండిపోవాలని, ఇక్కడి ప్రజలు ఆనందంతో ఉండకూడదని కోరుకునే శక్తులకు అపారమైన అధికారాలు ఉన్నాయి. కానీ మిత్రులారా, అలాంటి విదేశీ శక్తులకు దీటైన జవాబును ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. విదేశీ ప్రచారానికి లొంగిపోయి, తమ పవిత్ర భూమి పైనే దాడులు చేస్తున్న దారి తప్పిన యువత ను సన్మార్గంలో పెట్టేందుకు మెహబూబా ముఫ్తి గారి నాయకత్వంలో పిడిపి-బిజెపి ప్రభుత్వం, కేంద్రం లోని ఎన్ డిఎ ప్రభుత్వం క్రమం తప్పకుండా కృషి చేస్తున్నాయి.

మిత్రులారా,

శాంతి కి, సుస్థిరతకు ప్రత్యామ్నాయం ఏదీ లేదు. దారి తప్పిన యువత మళ్లీ ప్రధాన జీవన స్రవంతి లోకి ప్రవేశించాలంటూ నేను పిలుపు ఇస్తున్నాను. ఈ ప్రధాన స్రవంతే వారి కుటుంబం, వారి తల్లితండ్రులు. జమ్ము & కశ్మీర్ అభివృద్ధి కి ఈ ప్రధాన స్రవంతి లోని వారందరూ శక్తియుక్తులన్నీ అందించి కృషి చేస్తున్నారు. జమ్ము & కశ్మీర్ ప్రతిష్ఠ ను ఇనుమడింపచేయవలసిన బాధ్యత ఈ యువతరం మీద ఉంది. ఎన్నో వనరులు, ఎన్నో మార్గాలు, ఎంతో సామర్థ్యం వారికి స్వాగతం పలుకుతున్నాయి. దేశం లోని ఇతర ప్రాంతాల కన్నా జమ్ము & కశ్మీర్ వెనుకబడి ఉండిపోవడానికి కారణం ఏదీ లేదు. దారి తప్పిన యువత వేస్తున్న ప్రతి ఒక్క రాయి, ఉపయోగిస్తున్న ప్రతి ఒక్క ఆయుధం వారి సొంతమైన జమ్ము & కశ్మీర్ నే ధ్వంసం చేస్తోంది. అస్థిర వాతావరణం నుండి రాష్ట్రం బయటపడి తీరాలి. తమ సొంత భవిష్యత్తు కోసమే కాకుండా భవిష్యత్తు తరాల సంక్షేమం కోసం కూడా వారు ప్రధాన స్రవంతిలోకి రావాలి. వేలాది సంవత్సరాలు మనం భారత మాత బిడ్డలుగా జీవించాము. అందుకోసం దశాబ్దాల తరబడి శక్తివంచన లేకుండా పని చేసిన వారే ఈ రోజున వేర్పాటు అంచున ఉన్నారు.

సోదరులు మరియు సోదరీమణులారా,

గత ఏడాది దీపావళి పండుగను గురెజ్ లో జవానులతో కలసి నేను జరుపుకొన్న విషయాన్ని మరో సారి చెబుతున్నాను. ఈ సంవత్సరం రంజాన్ రోజున మీ అందరితో ఉన్నాను. ఇదే కశ్మీర్ భావన. ఈ దేశానికి, ప్రపంచానికి కశ్మీర్ అందించే బహుమానం ఇదే. ప్రతి ఒక్కరికీ ఇక్కడ సాదర స్వాగతం లభిస్తుంది. ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుంది. ప్రపంచం లో ఎక్కడా కనిపించని రీతిలో ఈ భూమి సంప్రదాయానికి నిలయం. భిన్న జాతులు, తెగల కన్నా అది అనుసరించే సంప్రదాయం ద్వారా ఈ భూమి సుసంపన్నం అవుతోంది. ఈ కశ్మీరీ సంస్కృతినే అటల్ గారు ఆచరిస్తారు. మోదీ కూడా అంతే. ఎర్ర కోట బురుజుల మీది నుండి కూడా నేను ఈ విషయం చెప్పాను. నిందాపరమైన భాష ఉపయోగించి లేదా తుపాకిగుళ్లు ఉపయోగించి నేటి సమస్య ను పరిష్కరించలేము. కశ్మీరీలను అక్కున చేర్చుకోవడం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది.

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రెండూ జమ్ము & కశ్మీర్ అభివృద్ధికి దోహదపడే విధానాలకు కట్టుబడి వున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఏ నాడూ వెనుకబడిపోలేదు. వేలాది విద్యార్థులపై ఉన్న కోర్టు కేసులు ఉపసంహరించడం లేదా రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని కాల్పుల విరమణ ను అమలుపరచడం వెనుక లక్ష్యం ఇదే. కశ్మీర్ లోని ప్రతి ఒక్క యువతి ప్రతి ఒక్క యువకుడు సుస్థిరతను, అభివృద్ధిని సాధించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం.

మిత్రులారా,

ఇది కాల్పుల విరమణ ఒక్కటే కాదు. ఇస్లామ్ పేరిట బీభత్సకాండకు పాల్పడే వారి దురుద్దేశాలను బయటపెట్టే సందర్భం ఇది. తమందరినీ ఒక భావనలో జీవించేలా ఎలా చేస్తున్నారో జమ్ము & కశ్మీర్ ప్రజలు కళ్లారా చూడగలుగుతారని నేను విశ్వసిస్తున్నాను. ఈ సుస్థిరతను ముందుకు నడిపించేందుకు ఒక మధ్యవర్తిని ప్రభుత్వం నియమించింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులతో, భిన్న సంస్థల, వ్యవస్థల ప్రతినిధులతో ఆయన భేటీ అవుతున్నారు. ప్రజలందరు ఆయన వద్దకు వెళ్లి వారి భావాలను పంచుకొంటారని నేను ఆశిస్తున్నాను. ఈ శాంతి ప్రక్రియ ను బలోపేతం చేసే దిశగా ఆయన అందరితో మాట్లాడుతున్నారు.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఈ విషయంలో ఏ ప్రయత్నం వృథా పోకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రజాస్వామిక, కశ్మీరియత్ సహకారాన్ని కొనసాగించాలని జమ్ము & కశ్మీర్ పౌరులందరినీ నేను కోరుతున్నాను. రాష్ట్రంలోని తల్లితండ్రులు, మేధావులు, మత నాయకులు ఈ అంశలో అతి పెద్ద పాత్రను పోషించవలసివుంది. ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం అభివృద్ధి.

న్యూ ఇండియా, న్యూ జమ్ము & కశ్మీర్ తోనే శాంతి, సుసంపన్నత లు బలోపేతమై భారత అభివృద్ధి గాథ కు కొత్త అధ్యాయాన్ని అందించగలుగుతాయి. ఈ విశ్వాసం తోనే నేను మీ అందరితో మనసు విప్పి నా భావాలను వెల్లడిస్తున్నాను. నా హృదయాన్ని మీ ముందు పరచాను. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ఎంచుకొన్న ఏ దేశం అయినా ఈ రోజు ఆ బాటను ఎంపిక చేసుకొన్నందుకు బాధ పడుతున్నాయని ప్రపంచ ప్రజలకు నేను చెబుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రస్తుతం సన్మార్గం లోకి వస్తున్నారు. పునరుజ్జీవం కోసం మార్గాలు అన్వేషిస్తున్నారు. అందుకే భారతదేశ వైభవానికే మూలం అయిన శాంతి, సుహృద్భావ, సహోదర భావాలను ముందుకు నడిపిస్తున్నాము. ఈ విషయంలో ఎవరు ఏది కోరినా అందించడానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ దిశగా మీ అందరి మద్దతును కోరుకుంటోంది. మేము ఎంతో పవిత్రంగా చేపట్టిన ఈ ప్రయత్నం లో ఆశించిన గమ్యానికి చేరుకోగలుగుతామని, గతంలో వలెనే ప్రతి ఒక్కరినీ ప్రేమాభిమానాలతో జమ్ము & కశ్మీర్ మరో సారి అక్కున చేర్చుకొంటుందని విశ్వసిస్తున్నాను.

ఈ భావన తో Setha-Setha Shukriya, Aj Diyu Ijazat, Khudai Thai Nav Khoshat Khush-hal.

మీకు ఇవే ధన్యవాదాలు.