Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సర్దార్ సరోవర్ ఆనకట్ట ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి; నర్మద మహోత్సవ్ ముగింపు ఉత్సవానికి హాజరు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్దార్ సరోవర్ ఆనకట్ట ను దేశ ప్రజలకు ఈ రోజు అంకితం చేశారు. ఈ సందర్భంగా కేవాడియా లోని ఆనకట్ట వద్ద పూజలు, మంత్రోచ్చారణలు జరిగాయి. ఒక ఫలకాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.

ఆ తరువాత, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు అంకితమిచ్చే ఓ ప్రతీకాత్మక కట్టడమైనటువంటి ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మాణ ప్రదేశమైన సాధు బెట్ ను ప్రధాన మంత్రి సందర్శించారు. ఈ ప్రదేశం సర్దార్ సరోవర్ ఆనకట్ట కు కొద్ది దూరంలోనే ఉంది. ఈ సందర్భంగా ఆ స్థలంలో జరుగుతున్న పనుల తాలూకు పురోగతిని గురించి ప్రధాన మంత్రికి అధికారులు వివరించారు.

దభోయ్ లో జరిగిన ఒక పెద్ద బహిరంగ సభలో ప్రధాన మంత్రి పాల్గొని, జాతీయ ఆదివాసీ స్వాతంత్ర్య యోధుల సంగ్రహాలయ నిర్మాణానికి శంకుస్థాపన సూచకంగా ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు. అలాగే, నర్మద నదిని గురించిన అవగాహన కలిగించేందుకు గుజరాత్ లోని వేరు వేరు జిల్లాలలో నిర్వహించిన ‘నర్మద మహోత్సవ్’ కు ముగింపు ఉత్సవాన్ని కూడా ఇదే సందర్భంగా జరిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఇక్కడకు తరలివచ్చిన భారీ జనసందోహం నర్మద మాత పట్ల ప్రజలకు ఉన్నటువంటి గౌరవాన్ని సూచిస్తోంది అని అన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశ నిర్మాణంలో పాల్గొంటున్న వారందరికీ ఇవే నా ప్రణామాలు అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 2022 కల్లా ఒక ‘న్యూ ఇండియా’ను నిర్మించడం కోసం మనం శక్తివంచన లేకుండా పాటుపడదాం అని ప్రధాన మంత్రి ఉద్బోధించారు.

ఆనకట్ట కు సంబంధించి సర్దార్ పటేల్ కు ఉన్న విజన్ ను ప్రధాన మంత్రి గుర్తుకుతెచ్చారు. సర్దార్ పటేల్ తో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ సేద్యపు నీటి పారుదల మరియు జల మార్గాలకు ఎనలేని ప్రాధాన్యాన్ని కట్టబెట్టారని ఆయన చెప్పారు.

జల వనరుల కొరత అభివృద్ధికి ఒక పెద్ద అడ్డంకిగా నిలచిందని ప్రధాన మంత్రి చెప్పారు. గతంలో తాను సరిహద్దు ప్రాంతాలను సందర్శించినప్పుడు బిఎస్ఎఫ్ జవాన్ లకు తగినంతగా నీరు అందని ఘట్టాలను గురించి ఆయన ప్రస్తావించారు. జవాన్ ల కోసం నర్మద జలాలను సరిహద్దు ప్రాంతాలకు మేం తీసుకువచ్చాం అని ఆయన అన్నారు.

సర్దార్ సరోవర్ ఆనకట్ట రూపుదాల్చడంలో గుజరాత్ కు చెందిన సాధువులు మరియు యోగులు ఎంతో ప్రముఖమైన పాత్రను పోషించారని ప్రధాన మంత్రి వివరించారు. నర్మద నది జలాలు పౌరులకు ఎంతగానో ఉపయోగపడతాయని, వారి జీవనాలలో పరివర్తనను తీసుకువస్తాయని ఆయన చెప్పారు.

దేశ పశ్చిమ ప్రాంతాలలో నీటికి కొదువ ఉందని, దేశ తూర్పు ప్రాంతాలలో విద్యుత్తుకు, గ్యాసుకు లోటు ఉందని ప్రధాన మంత్రి తెలిపారు. ఈ లోటుపాట్లను అధిగమించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, భారతదేశం అభివృద్ధిలో నూతన శిఖరాలను అందుకోవాలనేదే ధ్యేయమని ఆయన స్పష్టంచేశారు.

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ సర్దార్ పటేల్ కు ఒక సముచితమైన నివాళి కాగలదని, నలు మూలల నుండి యాత్రికులను ఇది ఆకర్షిస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు. ఆదివాసీ సముదాయాలకు చెందిన స్వాతంత్ర్య యోధులు వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడారంటూ, వారి సేవలను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చారు.

***