పిఎంఇండియా
గౌరవనీయులైన జాతీయ అసెంబ్లీ స్పీకర్ శ్రీమతి అజారెల్ అర్నెస్టా గారికి,
గౌరవనీయులైన సభా వ్యవహారాల నాయకురాలు శ్రీమతి సిల్వాన్ లెమియెల్ గారికి,
గౌరవనీయులైన ప్రతిపక్ష నేత శ్రీ బైనో జార్జ్ గారికి,
సీషెల్స్ జాతీయ అసెంబ్లీ గౌరవ సభ్యులకు,
నా ప్రియమైన సోదర సోదరీమణులారా,
నమస్కారం!
బోన్ అప్రెమిడి!
ఈ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తున్న మొట్టమొదటి భారత ప్రధానిగా మీ ముందు నిలబడటం నాకు దక్కిన ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. స్పీకర్ గారు, మీ ఆత్మీయ మాటలకు నా ధన్యవాదాలు.
ఈ రోజే కొంచెం ముందు నాకు ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ పురస్కారాన్ని అందించి నన్ను గౌరవించినందుకు అధ్యక్షుడు ఎర్మినీ గారికి, సీషెల్స్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర కృషి చేస్తున్న వారందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇక్కడికి భారత్లోని 140 కోట్ల ప్రజల తరపున ఆత్మీయ శుభాకాంక్షలను, శుభాశీస్సులను తీసుకువచ్చాను.
నేను ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2015లో హిందూ మహాసముద్ర ప్రాంతంలో సందర్శించిన మొట్టమొదటి దేశం సీషెల్స్. ప్రధానిగా నా ఆఫ్రికా పర్యటనలలో కూడా ఇదే మొదటిది. హిందూ మహాసముద్రంపై భారత్కు ఉన్న దార్శనికతలో సీషెల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందనే భావనతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఒక దశాబ్దం తర్వాత ఈ రోజు నేను మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నా ఆ నమ్మకం మునుపటి కంటే మరింత బలంగా మారింది.
మీరు మీ యాభై ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను చేసుకుంటున్న ఈ తరుణంలో మీతో భాగస్వామిని కావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఈ ప్రత్యేక సందర్భంలో మీకు, సీషెల్స్ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
గౌరవ సభ్యులారా,
ఈ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడం నాకు దక్కిన ఒక అరుదైన గౌరవం. ఈ ప్రత్యేక గౌరవానికి నా ధన్యవాదాలు. ఈ ఎనిమిదో జాతీయ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన సభ్యులందరినీ అభినందించడానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. అలాగే ఈ అత్యున్నత సభకు మొట్టమొదటి మహిళా స్పీకర్గా ఎన్నికైనందుకు స్పీకర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
గౌరవ సభ్యులారా,
యాభై ఏళ్ల క్రితం మన దౌత్య సంబంధాల స్థాపనతో మాత్రమే మన స్నేహం ప్రారంభం కాలేదని ఈ రోజు మనం గుర్తుచేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇది అంతకంటే చాలా కాలం ముందే మొదలైంది. 1770 ఆగస్టులో ‘థెలిమాక్’ నౌక ద్వారా సెయింట్ ఆన్ ద్వీపానికి చేరుకున్న వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. ఆ తర్వాత వచ్చే మరెందరికో ఆ ప్రయాణం మార్గం చూపింది. కాలక్రమేణా వారి కథలు ఆధునిక సీషెల్స్ చరిత్రలో ఒక భాగమయ్యాయి.
మన మధ్య ఉన్న ఈ బంధాలను ప్రభుత్వాలు సృష్టించలేదనే విషయాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. ఇవి ప్రజలతో ఏర్పడ్డాయి.. కుటుంబాలతో పెంపొందాయి.. తరతరాలుగా కొనసాగుతూ వచ్చాయి. హిందూ మహాసముద్రం దీనిని సాధ్యం చేసింది. హిందూ మహాసముద్రం భారత్ను, సీషెల్స్ను వేరు చేయడం లేదు.. అది మనల్ని అనుసంధానిస్తోంది. అందుకే మనం ఇక్కడ అపరిచితుల్లా కలుసుకోవడం లేదు. పాత స్నేహితుల్లా కలుసుకుంటున్నాం.
గౌరవ సభ్యులారా,
సీషెల్స్ అతిపెద్ద బలం ఇక్కడి ప్రజలే. తరతరాలుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చారు. వారు తమతో పాటు విభిన్న భాషలు, ఆచారాలు, నమ్మకాలు, సంప్రదాయాలను తీసుకువచ్చారు. వీరంతా కలిసి నేడు ఎంతో గర్వించదగ్గ ‘సీషెల్లోయిస్’ ఉమ్మడి గుర్తింపును తయారుచేశారు.
ఈ జాతీయ అసెంబ్లీ నినాదమైన ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ క్రియోల్ సంగీత మాధుర్యంలో వినొచ్చు.. ‘మౌత్యా’ నృత్య రీతుల్లో చూడొచ్చు.. ‘ఫెస్టివల్ క్రియోల్’లో అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు.
ఈ దేశం తన సాంస్కృతిక వైవిధ్యాన్ని వేడుకగా చేసుకుంటున్నప్పుడు మన సంస్కృతుల మధ్య ఉన్న బంధాలు నిత్య జీవితంలో కూడా స్పష్టంగా కనిపిస్తాయి. అవి కరి కోకో, సమోసా, చట్నీల రుచులలో తెలుస్తాయి. దీపావళి, తై పొంగల్ వేడుకల్లో.. నవరాత్రి ఉత్సవాల్లో చేసే గర్బా నృత్యాల్లో కనిపిస్తాయి. మన స్నేహం భవిష్యత్తుపై మనకు ఎనలేని నమ్మకాన్ని ఇచ్చేది ఈ ‘క్రియోల్ స్ఫూర్తే’.
గౌరవ సభ్యులారా,
సముద్ర తీర పొరుగు దేశాలుగా ఒకరి భద్రత మరొకరి భద్రతను పెంపొందిస్తుందని మనం గుర్తిస్తున్నాం. ఒకరి శ్రేయస్సు మరొకరి శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. ఈ ప్రాంతంలో ఉండే స్థిరత్వం మనందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. మన భాగస్వామ్యానికి ఉన్న లోతును గుర్తుచేసుకోవడానికి ఈ సంవత్సరం ఒక శక్తిమంతమైన అవకాశాన్ని ఇస్తోంది.
యాభై ఏళ్ల క్రితం మీ స్వాతంత్య్ర ఆవిర్భావ సమయంలో స్నేహానికి, సంఘీభావానికి చిహ్నంగా ‘ఐఎన్ఎస్ నీలగిరి’ అనే భారతీయ నౌక పోర్ట్ విక్టోరియాలో నిలిచింది. ఈ రోజు మీతో కలిసి ఈ స్వర్ణోత్సవ వేడుకలను చేసుకోవటానికి ‘ఐఎన్ఎస్ తర్కాష్’, ‘ఐఎన్ఎస్ ఇక్షక్’ నౌకలు పోర్ట్ విక్టోరియా తీరంలో ఉన్నాయి.
గడిచిన యాభై ఏళ్ల కాలం ఎన్నో మార్పులను తీసుకువచ్చింది. కానీ ఒకరి పట్ల ఒకరికి ఉన్న మన నిబద్ధతను మాత్రం అది మార్చలేదు. దశాబ్దాలుగా మన రక్షణ దళాలు, తీర రక్షక దళాలు, సముద్ర తీర సంస్థలు ఎంతో సమన్వయంతో కలిసి శిక్షణ పొందుతూ పనిచేస్తూ వస్తున్నాయి. సీషెల్స్ రక్షణ దళాలు, సీషెల్స్ కోస్ట్ గార్డ్ వృత్తిపరమైన నైపుణ్యాన్ని, వారి అంకితభావాన్ని భారత్ ఎంతో గౌరవిస్తుంది. మీ విస్తారమైన సముద్ర తీర ప్రాంతాన్ని, విశాలమైన హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని సంరక్షించడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. సముద్ర భద్రత, సామర్థ్య పెంపుదల, హైడ్రోగ్రఫీ, సముద్రయాన అవగాహన రంగాల్లో మన పరస్పర సహకారం.. మరింత సురక్షితమైన ప్రాంతాన్ని తయారుచేయాలనే మన ఉమ్మడి నిబద్ధతకు అద్దం పడుతోంది.
నేను ఈ ఉదయం అధ్యక్షుడు ఎర్మినీ టాన్ ప్యాట్ గారిని కలుసుకొని మన భాగస్వామ్యంలో సాధించిన అద్భుతమైన ప్రగతిని సమీక్షించాను. భవిష్యత్తు కోసం మన ఉమ్మడి దార్శనికతను గురించి కూడా మేం చర్చించాం. మన ఈ దార్శనికత ‘మహాసాగర్- మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్’ అనే ఆలోచనలో కనిపిస్తోంది.
మన భవిష్యత్తులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, పరస్పరం ఆధారపడి ఉన్నాయని ఈ దార్శనికత గుర్తిస్తోంది. మరింత సురక్షితమైన, రక్షణతో కూడిన హిందూ మహాసముద్ర ప్రాంతం కోసం మనం కలిసికట్టుగా కృషి చేయడాన్ని కొనసాగిస్తాం.
గౌరవ సభ్యులారా,
ప్రజలు భూపటాన్ని చూసినప్పుడు వారికి సీషెల్స్ హిందూ మహా సముద్రంలోని కేవలం కొన్ని దీవుల సమూహంగా కనిపించొచ్చు. కానీ మనం అంతకంటే గొప్పదైన ఒకదానిని చూస్తున్నాం. తన ప్రభావం కేవలం తన తీరాలకే పరిమితం కాకుండా వాటికి ఎంతో దూరం వరకు విస్తరించిన ఒక శక్తిమంతమైన దేశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మీ సముద్ర పరిధి దాదాపు 14 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
ఇదే సీషెల్స్ను ఒక చిన్న ద్వీప దేశంగా కాకుండా ఒక ‘విశాల మహాసముద్ర దేశం’గా నిలబెడుతోంది. ‘నీలి ఆర్థిక వ్యవస్థ’ అనేది ప్రపంచవ్యాప్త చర్చల్లో ఒక భాగం కావడానికి చాలా కాలం ముందే సీషెల్స్ ఆ మార్గంలో ముందంజలో ఉంది. సముద్ర వ్యవస్థలను రక్షించడంలోనైనా లేదా ‘బ్లూ బాండ్స్’ వంటి వినూత్న విధానాలను ముందుకు తీసుకెళ్లడంలోనైనా మీ దేశం ప్రపంచవ్యాప్త కీలక చర్చలకు ఒక దిశానిర్దేశం చేయడంలో సహాయపడింది. మనం కలిసి మత్స్య పరిశ్రమ, సముద్ర విజ్ఞానశాస్త్రం, తీరప్రాంత నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, సుస్థిర పర్యాటక రంగాల్లో బలమైన భాగస్వామ్యాలను తయారుచేసుకోవచ్చు.
నిన్న సీషెల్స్ అస్తిత్వానికి ప్రతీక అయిన ‘కోకో డి మెర్’ మొక్కను నాటే అరుదైన గౌరవం నాకు దక్కింది. ఇది సరిగ్గా సీషెల్స్ దేశం లాగే ఎంతో విశిష్టమైనది.. అమూల్యమైనది. ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నది. ఈ ప్రాకృతిక అద్భుతాన్ని రక్షించడానికి, సంరక్షించడానికి మీరు చేస్తున్న కృషి ఒక గొప్ప జీవనతత్వాన్ని ప్రతిబింబిస్తోంది. అదే మానవాళి ప్రకృతితో మమేకమై సామరస్యంతో జీవించాలనే భావన.
ఈ భావన భారత్లో కూడా ఎంతో బలంగా ప్రతిధ్వనిస్తోంది. ఈ రోజు మనం చూస్తోన్న సముద్రాల కంటే రాబోయే తరాలకు మరింత ఆరోగ్యకరమైన, సురక్షితమైన, వనరులతో సమృద్ధిగా ఉండే మహాసముద్రాలను అందించడానికి మనం కలిసికట్టుగా కృషి చేద్దాం.
గౌరవ సభ్యులారా,
గ్లోబల్ సౌత్.. ముఖ్యంగా ద్వీప దేశాలు వాతావరణ మార్పుల వల్ల అత్యధికంగా ప్రభావితమవుతున్నాయి. దీని ప్రభావాలు ఇప్పటికే మన తీరప్రాంతాల్లో, సముద్ర పర్యావరణ వ్యవస్థలో, వాతావరణ మార్పుల్లో, మన సమాజాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పులకు అత్యంత తక్కువ కారణమైన వారు దాని పరిణామాల తీవ్రమైన భారాన్ని మోయకూడదని మన రెండు దేశాలు గట్టిగా నమ్ముతున్నాయి.
పర్యావరణ పరిరక్షణ చర్యలు ఎల్లప్పుడూ న్యాయం, బాధ్యత, సమానత్వాల ఆధారంగా సాగాలి. ఇదే ‘పర్యావరణ న్యాయం’ అసలైన అంతరార్థం.
భారత్ ఎప్పుడూ ఆచరించి చూపి మార్గదర్శకంగా నిలబడటానికి ప్రయత్నించింది. గత దశాబ్ద కాలంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రపంచంలోనే అత్యంత భారీగా విస్తరించిన దేశాల్లో ఒకటిగా నిలిచాం. ‘మిషన్ లైఫ్- పర్యావరణ అనుకూల జీవనశైలి’ ద్వారా సుస్థిర జీవన విధానాలకు మేం పెద్దపీట వేశాం. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమి, ప్రపంచ జీవ ఇంధనాల కూటమి, ‘ఏక్ పేడ్ మా కే నామ్’ వంటి మా కార్యక్రమాల ద్వారా హరిత పరివర్తనను వేగవంతం చేయడానికి మేం భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేశాం.
‘అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాల’ సమస్యలకు దక్కాల్సిన గుర్తింపు, ప్రాధాన్యత లభించేలా చూడటంలో సీషెల్స్తో కలిసి పనిచేయడానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.
గౌరవ సభ్యులారా,
అభివృద్ధి అనేది అందరికీ సమానంగా అందేలా ఉండే ఒక నూతన ప్రపంచాన్ని సీషెల్స్, భారత్ రెండు దేశాలూ ఆకాంక్షిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు నేటి వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండాలని మన దేశాలు కోరుకుంటున్నాయి. మన ఉమ్మడి భవిష్యత్తు అనేది అందరి భాగస్వామ్యంతో అందరినీ కలుపుకుంటూ న్యాయబద్ధంగా నిర్మాణమవ్వాలని మనం బలంగా నమ్ముతున్నాం.
మా జీ20 అధ్యక్ష పదవీ కాలంలో భారత్ చేసిన కృషికి ఈ నమ్మకమే దిశానిర్దేశం చేసింది. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలను అంతర్జాతీయ చర్చల కేంద్ర బిందువుగా మార్చడానికి మేం ఇదే స్ఫూర్తితో పనిచేశాం. ఇదే స్ఫూర్తితో ఆఫ్రికా సమాఖ్యను జీ20లో శాశ్వత సభ్యునిగా మేం సాదరంగా ఆహ్వానించాం. ఇదే స్ఫూర్తి గ్లోబల్ సౌత్ను ఒకటిగా నిలుపుతోంది. ఇదే దూరదృష్టిని భారత్, సీషెల్స్ కలిసి ముందుకు తీసుకెళ్తూనే ఉంటాయి.
గౌరవ సభ్యులారా,
గడిచిన యాభై ఏళ్ల విజయాలను మనం జరుపుకుంటున్న ఈ తరుణంలోనే మనం భవిష్యత్తు వైపు కూడా చూడాలి. సీషెల్స్ భవిష్యత్తు ఇక్కడి యువత చేతుల్లోనే రూపుదిద్దుకుంటుంది. దశాబ్దాలుగా సీషెల్స్కు చెందిన విద్యార్థులు, వృత్తి నిపుణులు, అధికారులు, రక్షణ దళాలు భారత్లో శిక్షణ పొందడం, ఉన్నత చదువులు చదవడం మాకెంతో గర్వకారణం.
వాస్తవానికి సీషెల్స్లో ప్రతి యాభై మందిలో ఒకరు భారత్లో ఏదో ఒక రంగంలో శిక్షణ పొందినట్లు చెబుతారు. వారు నైపుణ్యాలు, బలమైన స్నేహాలు, మధురమైన అనుభవాలతో తిరిగి తమ మాతృభూమికి చేరుకున్నారు. ఇవి నేటికీ మన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూనే ఉన్నాయి.
యువతకు ఇంటర్న్షిప్లు అందించడం కోసం మీరు చేపట్టిన ‘ఇగ్నైట్’ కార్యక్రమం గురించి తెలుసుకుని నేను ఎంతగానో సంతోషించాను. ఇది ఒక అద్భుతమైన ప్రణాళిక. ఈ రంగంలో పరస్పర సహకారం కోసం మనం మరిన్ని కొత్త మార్గాలను అన్వేషించొచ్చు.
అలాంటి సహకారానికి ‘డిజిటల్ ఆవిష్కరణలు’ ఒక కీలకమైన రంగం కాగలదు. సాంకేతికత ద్వారా అవకాశాలను ఎలా విస్తరించొచ్చో.. పరిపాలనను ఏ విధంగా మెరుగుపరచొచ్చో.. ఆర్థిక సమగ్రతను ఎలా పెంపొందించొచ్చో.. కోట్లాది ప్రజలకు సేవలను ఎలా చేరవేయవచ్చో భారతదేశపు ‘డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ (డీపీఐ) ప్రపంచానికి నిరూపించి చూపించింది.
మీరు చేపడుతున్న డిజిటల్ పరివర్తనలో మా అనుభవాలను, నైపుణ్యాలను మీతో పంచుకోవడానికి మేం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. మీ స్వాతంత్ర్యపు మొదటి యాభై ఏళ్ల ప్రయాణాన్ని నడిపించిన అదే పట్టుదలతో సీషెల్స్ యువత ఈ సరికొత్త అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది.
గౌరవ సభ్యులారా,
ఈ చారిత్రాత్మక స్వర్ణోత్సవ ఏడాదిలో ఈ రోజు నేను మీ ముందు నిలబడిన ప్రస్తుత తరుణంలో మన ప్రజలు రెండున్నర శతాబ్దాల కంటే ఎక్కువ కాలం నాటి సుదీర్ఘమైన స్నేహ బంధాన్ని వేడుకగా చేసుకుంటున్నారు. ఇంతటి లోతైన పునాదులపై నిర్మాణమైన భాగస్వామ్యాలు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాయి. ఇంతటి ఆప్యాయత, నమ్మకం, సద్భావనలతో ఎదిగిన బంధాలు కూడా ఎంతో అరుదు.
మనం భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఈ బలమైన పునాదులపై మన బంధాన్ని మరింత ఉన్నతంగా నిర్మించుకుందాం. భారత్ ఎల్లప్పుడూ మీ నమ్మకమైన భాగస్వామిగా ఉంటుంది. మేం మీ విజయాలను ఘనంగా చేసుకుంటాం. మీ ఆకాంక్షలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాం. ఒక నిజమైన స్నేహితుడిగా నిరంతరం మీ పక్కనే ఉంటాం.
గడిచిన యాభై ఏళ్ల కాలం ఎంతో అద్భుతమైనది. కానీ ‘సీషెల్స్ ప్రస్థానంలో అత్యంత అద్భుతమైన అధ్యాయాలు ఇంకా రాయాల్సి ఉందని, మన స్నేహ బంధంలోని అత్యుత్తమ ఘట్టాలు భవిష్యత్తులో మరిన్ని రాబోతున్నాయని’ నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.
***
Speaking at the National Assembly of Seychelles.@SeychellesNA
— Narendra Modi (@narendramodi) June 28, 2026
https://t.co/8GcumuqG94
Addressed the National Assembly of Seychelles today.
— Narendra Modi (@narendramodi) June 28, 2026
Expressed my gratitude for the warmth and friendship extended by the people of Seychelles. Spoke about the long-lasting partnership between our two nations that is built on shared values. It was also an honour interacting with… pic.twitter.com/nyNzt3Q4ym
Mon'n adres Lasanble Nasyonal Sesel ozordi.
— Narendra Modi (@narendramodi) June 28, 2026
Mon'n eksprim mon gratitid pour lakey salere ek lanmitye ofer par pep Seselwa.
Nou'n koz lo partenarya lonterm ant nou de nasyon ki ganny batir lo bann valer partaze.
Ti osi en loner pour enterakte avek bann manm Lasanble.… pic.twitter.com/dpcHYFuzSK
I thank President Herminie and the people of Seychelles for honouring me with the "Guardian of the Blue Horizon" earlier today.
— PMO India (@PMOIndia) June 28, 2026
It will encourage all those who are making sustained efforts for environment conservation: PM @narendramodi pic.twitter.com/asg6XyT9WU
The Indian Ocean does not separate India and Seychelles.
— PMO India (@PMOIndia) June 28, 2026
It connects us: PM @narendramodi pic.twitter.com/AQOLHocbOp
When people look at a map, they may see Seychelles as a group of islands in the Indian Ocean.
— PMO India (@PMOIndia) June 28, 2026
But we see something much greater.
We see a nation whose horizons stretch far beyond its shores: PM @narendramodi pic.twitter.com/RHCsBrShWV
Climate action must be guided by fairness, responsibility and equity.
— PMO India (@PMOIndia) June 28, 2026
This is the essence of climate justice: PM @narendramodi pic.twitter.com/XfcnhJZOvk
Seychelles and India both seek a world where development is more inclusive.
— PMO India (@PMOIndia) June 28, 2026
We both seek a world where international institutions reflect contemporary realities: PM @narendramodi pic.twitter.com/CgXvFNFL0t
India's Digital Public Infrastructure has demonstrated how technology can expand opportunity, improve governance, boost financial inclusion and deliver services for hundreds of millions of people: PM @narendramodi pic.twitter.com/O62QQbgLH7
— PMO India (@PMOIndia) June 28, 2026