పిఎంఇండియా
శ్రేష్ఠుడైన ప్రధాన మంత్రి శ్రీ థోంగ్ లోవున్ సిసోవులిథ్,
ఇతర శ్రేష్టులారా,
ఇది నేను పాల్గొంటున్న మూడవ భారతదేశం-ఏషియాన్ శిఖరాగ్ర సమావేశం. అనేక సంవత్సరాలుగా ఏషియాన్తో మనం పెంపొందించుకొన్న సన్నిహిత స్నేహ బంధాలను పునరుద్ధరించుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. మీరు చేసిన అద్భుతమైన ఏర్పాట్లకూ, మీరు పలికిన ఆత్మీయ సాదర స్వాగతానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను.
సుందరమైన చారిత్రక నగరం వియెన్ తియేన్ను నేను సందర్శించినపుడు, భారతదేశంతో ఈ నగరానికి వున్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు నాకు గుర్తుకొచ్చాయి. ఏషియాన్-భారతదేశం సంబంధాలకు సమన్వయ కర్త దేశంగా సమర్థవంతమైన నాయకత్వం అందిస్తున్నందుకు కూడా వియెన్ తియేన్ను నేను అభినందిస్తున్నాను.
శ్రేష్టులారా,
ఏషియాన్తో మన ఒడంబడిక కేవలం మన ఉమ్మడి నాగరికతా వారసత్వపు ధృఢమైన పునాదికి సంబంధించినది మాత్రమే కాదు. మన సమాజాలకు భద్రతను కల్పించడానికీ, ఈ ప్రాంతానికి శాంతిని, సుస్థిరత్వాన్ని మరియు సమృద్ధిని అందించడానికీ మనం ఇస్తున్న ఉమ్మడి వ్యూహాత్మక ప్రాధాన్యాలకు కూడా ఈ ఒడంబడిక అవసరం. భారతదేశపు ‘Act East’ పాలసీ (తూర్పు ఆసియా దేశాలతో మెరుగైన సంబంధాల విధానం) కి ఏషియాన్ కేంద్ర బిందువు. అంతే కాకుండా, ఈ ప్రాంతంలో సమతుల్యత, సామరస్యం నెలకొనడానికి మన పొత్తులు ఆధారంగా నిలుస్తాయి.
శ్రేష్టులారా,
ఏషియాన్ కార్యకలాపాల్లో మూడు ముఖ్యమైన విభాగాలైన భద్రత, ఆర్థిక మరియు సామాజిక- సాంస్కృతిక అంశాలన్నిటినీ మన వ్యూహాత్మక భాగస్వామ్య సారాంశం పరిగణనలోకి తీసుకొంటుంది. ఏషియాన్-భారత కార్యాచరణ ప్రణా ళిక 2016-2020 మన లక్ష్యాలను నెరవేర్చడంలో చాలా బాగా సేవ చేసింది. కార్యాచరణ ప్రణాళికలో గుర్తించిన 130 కార్యకలాపాలలో 54 అంశాలను మనం ఇప్పటికే అమలు చేసి ఉన్నాము.
శ్రేష్టులారా,
భౌతిక, డిజిటల్, ఆర్థిక, వ్యవస్థాగత, సాంస్కృతిక అంశాల వంటి అనుసంధానాలను అన్ని వైపులా విస్తరించి బలోపేతం చెయ్యడం ఏషియాన్తో భారతదేశం యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యపు గుండెకాయగా చెప్పవచ్చు. ఏషియాన్ దేశాలతో , ముఖ్యంగా సిఎల్ ఎమ్ వి ( కంబోడియా, లావోస్, మయన్మార్, వియత్నాం) దేశాలతో మన ఆర్థిక విజయాన్ని అనుసంధానించడానికీ, మన అభివృద్ధి అనుభవాలను పంచుకోవడానికీ వున్న మన సంసిద్ధతే మన ఒడంబడికను ముందుకు తీసుకువెళ్తుంది.
శ్రేష్టులారా,
సాంప్రదాయక సవాళ్లు, సాంప్రదాయేతర సవాళ్లు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో దేశాల మధ్య రాజకీయపరమైన, భద్రత పరమైన సహకారాలు మన సంబంధాన్ని సుదృఢం చేయడంలో కీలకమైన పాత్ర వహిస్తుంది. ఉగ్రవాద ఎగుమతి పెరుగుతున్నది. ద్వేష భావజాలం ద్వారా తీవ్రవాదం పరివ్యాప్తి చెందుతున్నది. అవధులు లేని హింస విస్తరిస్తున్నది. ఇవన్నీ మన సమాజాల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. ఈ ముప్పు ఏక కాలంలో స్థానికమైనది, ప్రాంతీయమైనది మరియు ప్రపంచవ్యాప్తమైనది కూడా. సమన్వయం, సహకారం మరియు బహుళ స్థాయిలలో పరస్పరం సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం- వీటి మీద ఆధార పడి మన స్పందన రూపొందాలని ఏషియాన్తో మన భాగస్వామ్యం కోరుకుంటోంది.
శ్రేష్టులారా,
రాబోయే సంవత్సరం మన పొత్తులలో ఒక మైలురాయి. 25 సంవత్సరాల మన చర్చల భాగస్వామ్యాన్నీ, 15 సంవత్సరాల మన శిఖరాగ్ర సమావేశ స్థాయి పరస్పర కలయికనీ, 5 సంవత్సరాల మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్నీ పురస్కరించుకొని మనం సంబరాలు జరుపుకొంటాం.
2017లో జరగబోయే ఏషియాన్-భారతదేశ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ సంబరాలు ప్రారంభమవుతాయి. “సమష్టి విలువలు- ఉమ్మడి భవితవ్యం” అనే ఇతివృత్తం మీద స్మారక శిఖరాగ్ర సమావేశానికి కూడా మనం ఆతిధ్యం ఇవ్వబోతున్నాము. ఒక వ్యాపార శిఖరాగ్ర సమావేశం, సి ఇ ఒ ల ఫోరమ్, కారు ర్యాలీ, నౌకాయానం మరియు సాంస్కృతిక సంబరాలు వంటి అనేక కార్యక్రమాలను కూడా నిర్వహించాలని సంకల్పించుకొన్నాము. ఈ స్మారక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం కోసం మీ అందరితో కలసి పని చేసేందుకు నేను ఎదురు చూస్తున్నాను.
మీకు ఇవే నా ధన్యవాదాలు.
మీకు అనేకానేక ధన్యవాదాలు.