పిఎంఇండియా
ఈ బడ్జెటును సమర్పించిన ఆర్ధిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ జీ కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మా ధ్యాస పల్లెలు, పేదలు, రైతులు, మహిళలు, మరియు యువత మీదే ఉంది. వారి జీవితాలలో గుణాత్మకమైన మార్పును తీసుకు రావడానికి ఈ బడ్జెటు ఆశావహమైన ప్రణాళికలతో రూపుదిద్దుకొంది.
పేదరిక నిర్మూలనకు ఈ బడ్జెటు ఒక సమగ్రమైన, నిర్ణీత కాల పరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరిస్తోంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అనేక చర్యలను ప్రస్తావించడం జరిగింది. వీటిలో ఒకటైన ‘ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన’ కింద – ప్రతి పొలానికీ సాగు నీటిని అందించాలనే సంకల్పంతో చెప్పుకోదగిన విధంగా నిధులు కేటాయించడం జరిగింది.
విద్యుచ్ఛక్తికి, రహదారి మౌలిక సదుపాయాలకు ఉన్న ప్రాముఖ్యం మన అందరికీ తెలుసు. 2019 కల్లా ప్రతి పల్లెకూ రహదారి సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ బడ్జెటులో దిశానిర్దేశం చేయబడింది. గ్రామీణ భారతాన్ని రహదారులతో అనుసంధానం చేసేందుకు ‘ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన’కు గణనీయ మొత్తంలో నిధులు కేటాయించారు. దీనికి తోడు 2018 కల్లా ప్రతి గ్రామానికీ విద్యుత్తు సరఫరా చేసేందుకు ఒక స్పష్టమైన ప్రణాళిక కూడా ఈ బడ్జెటులో ఉంది.
ఇది గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు జోరును అందించి, సానుకూలమైన మార్పులను తీసుకు రాగలదు. మీరొక పేద వ్యక్తిని అడిగితే – అతడు తన స్వప్నాన్ని తప్పక పంచుకుంటాడు.. స్వంత ఇంటిని కలిగి ఉండటమే అతని కలల్లో కెల్లా అతి పెద్దదైన కల. మధ్య తరగతి వ్యక్తి లేదా మధ్య తరగతి స్థాయికి చేరుకున్న వ్యక్తి మొదలుకొని ప్రతి వ్యక్తికీ తనకంటూ ఒక స్వంత ఇల్లు కావాలనే కోరిక ఉంటుంది. వారికి ఉన్న ఈ కల నెరవేరడానికి మనం ఏ విధంగా సహాయ పడగలం? ప్రభుత్వ తోడ్పాటు లేనిదే ఇది సాధ్యం కాదు. అందువల్లనే సామాన్య ప్రజానీకానికి ఒక ఇల్లు సమకూరాలనీ, గృహ నిర్మాణ రంగానికి ఊతం అందించాలనే ఉద్దేశంతో ఈ సారి బడ్జెటులో ప్రతిపాదనలు చేయడం జరిగింది.
అద్దె ఇంటిలో నివసిస్తున్న ప్రజలు కూడా ఆదాయపు పన్నులో ఇంటి అద్దె సంబంధిత రాయితీలో పెంపుదలను పొందారు. రూ.5 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్న వారు ఇప్పుడు తక్కువ పన్నును చెల్లిస్తే సరిపోతుంది.
పేదలను ఆధారంగా చేసుకొని బోలెడన్ని రాజకీయాలు సాగుతూవచ్చాయి. కట్టెల పొయ్యి మీద వంట చేసే పేద మహిళ తన ఆరోగ్యాన్నే కాకుండా తన పిల్లల ఆరోగ్యాన్ని కూడా పణం పెడుతున్నదని తెలిస్తే మీరు నివ్వెరపోతారు. కట్టెల పొయ్యిలో నుంచి ఒక రోజుకు వెలువడే పొగ 400 సిగరెట్ల ధూమంతో సమానమని నిపుణులు చెబుతున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు మనం సహాయం చేయాలి. అందుకే అటువంటి వారికి గ్యాస్ కనెక్షన్ ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాము.
కట్టెల పొయ్యితో వంట చేసుకునే 5 కోట్ల కుటుంబాలకు పొగ నుంచి ఇక విముక్తి లభిస్తుంది. పేద వారు ఆరోగ్య సంబంధ ప్రయోజనాలను పొందడంతో పాటు, పర్యావరణం సైతం కాపాడబడుతుంది.
ఆరోగ్య రంగంలో కూడా మా ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అప్పుడప్పుడు, ఒక అనారోగ్యం ఒక బీద కుటుంబం జీవితాన్నే విచ్చిన్నం చేస్తుంది; మధ్య తరగతి, లేదా మధ్య తరగతి స్థాయికి చేరుకున్న కుటుంబాల విషయం లో కూడా ఇదే పరిస్థితి. ఇక, సహాయం తప్పక అందవలసిన వయోవృద్ధుల కోసం మేము పథకాలు తీసుకువచ్చాము.
మన దేశం సురక్షితంగా ఉండాలి; మన పౌరులు తాము సురక్షితంగా ఉన్నట్లుగా భావించాలి. ఇంకా, మన దళాలకు ఆధునిక రక్షణ పరికరాలను అందించగలగాలి. అంతే కాదు, మన సైనికులు పదవీ విరమణ అనంతరం ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ ను పొందాలి. రక్షణ ఉత్పత్తుల రంగాన్ని ప్రోత్సహించేందుకు, సాయుధ బలగాలకు ఆధునికమైన, శక్తిమంతమైన పరికరాలను సమకూర్చడానికి ఈ బడ్జెటు తగిన ప్రతిపాదనలు చేసింది.
మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.2 లక్షల కోట్లకు పైగా కేటాయించిన సంగతిని మీరు గమనించే ఉంటారు. ఇది మన దేశ సరిహద్దులను సంరక్షిస్తున్న దళాలకు లబ్ధిని చేకూర్చే ప్రతిపాదన.
మన దేశపు యువతీయువకులు ముందంజ వేస్తూ ఉన్నారు. వారికి ఉపాధిని కల్పించడం కోసం మేము ‘formalizing the informal’ అలాగే ’employing the unemployed’ అనే రెండు కొత్త కార్యక్రమాలతో ముందుకు రాబోతున్నాము.
‘స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా’ అనేది నా మంత్రం. స్టార్టప్ లకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఈ బడ్జెటులో పన్ను ప్రోత్సాహకాలను ప్రతిపాదించడం జరిగింది. మన దళిత, గిరిజన యువత ఇప్పుడు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు గా తయారవ్వాలని అనుకుంటున్నారు. వారు ఇకపై ఉద్యోగం కోరుకొనే అభ్యర్ధిగా ఉండాలని కోరుకోవడం లేదు. ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే వారు అవ్వాలనుకుంటున్నారు. వారి కలను నెరవేర్చేందుకు ఒక ఆంట్రప్రన్యూర్ షిప్ హబ్ ను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ దేశ యువత అంతర్జాతీయ సవాళ్ళను ఎదుర్కోగలగాలి; విద్యారంగం లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అయితే కొన్ని పురాతన చట్టాలు, నిబంధనల వల్ల విద్యారంగం ఎంతో నష్టపోయింది. దీనిని మెరుగు పరచడానికి 10 ప్రభుత్వ, 10 ప్రయివేటు సంస్థలను కఠిన పరీక్షల ద్వారా ఎంపిక చేసిన తరువాత వాటిని అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు పెంపొందించడం జరుగుతుంది. ఈ సంస్థలకు ఆర్ధిక సహాయం కూడా సమకూర్చడం జరుగుతుంది. విద్యారంగంలో ఇది ఒక గొప్ప ప్రోత్సాహకంగా చెప్పవచ్చు. ఒక సారి ఉన్నత విద్యా సంస్థల మధ్య స్పర్ధాత్మక వాతావరణం నెలకొన్నట్లయితే – ఆ తరువాత అది ఆవిష్కరించే ప్రభావాన్ని మీరే అంచనా వేయగలుగుతారు.
ప్రాథమిక విద్య కూడా ఇంతే ప్రాధాన్యం కలిగినటువంటిది. ప్రాథమిక విద్య విస్తరణ పైనే ప్రభుత్వాలు ఇంతవరకు వాటి దృష్టిని కేంద్రీకరిస్తూ వచ్చాయి. ఇదీ చాలా ప్రధానమైనదే అయినప్పటికీ, ఇవాళ్టి సవాళ్ళకు తగినట్లు విస్తరణతో పాటు గుణాత్మకమైన మార్పులు చేయడం కూడా అవసరం. మారుమూల గ్రామాల చిన్నారులూ విద్యావంతులవ్వాలి; వారు గుణాత్మక విద్యను అభ్యసించాలి.. దీనిపైన మేం దృష్టి పెట్టాం. ఈ విధమైన గుణాత్మక అంశాలకు ఈ బడ్జెటు ప్రాధాన్యం ఇస్తుంది.
ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం కోసమే మా ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుంది. పౌరులను ఎప్పుడూ అనుమానించకూడదు. ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రజల పట్ల గౌరవం కలిగి ఉండాలి; సామాన్య వ్యక్తిని అతడు ఎదుర్కొంటున్న క్లిష్టతరమైన విధానాల నుంచి విముక్తుడిని చేయాలి. అటువంటి సమస్యలను ఎదుర్కొంటున్న వ్యాపారస్తులు, ప్రొఫెషనల్స్ కు వాటి నుంచి స్వేచ్ఛ కల్పించాలి. జీవనోపాధిని సంపాదించుకునే సామాన్య మానవుడిని టర్నోవర్ పై ప్రిజంప్టివ్ ట్యాక్స్ చెల్లించే ప్రక్రియల బారి నుంచి విముక్తుడిని చేస్తాం.
శ్రీ అరుణ్ జైట్లీ జీ ని మరొక్క సారి అభినందిస్తున్నాను; అలాగే,
ఈ బడ్జెటు మీ కలల బడ్జెటు గా ఉంటుందని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఈ బడ్జెటు మీ కలలను పండించాలనే ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబించింది.
ధన్యవాదములు.
***