Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2017 జూలై 16 నాటి అఖిల‌ప‌క్ష స‌మావేశం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌సంగం లోని ముఖ్యాంశాలు

2017 జూలై 16 నాటి అఖిల‌ప‌క్ష స‌మావేశం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌సంగం లోని ముఖ్యాంశాలు

2017 జూలై 16 నాటి అఖిల‌ప‌క్ష స‌మావేశం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌సంగం లోని ముఖ్యాంశాలు


వ‌ర్షాకాల‌ స‌మావేశాలు: స‌మ‌య పాల‌న‌కు స్థానం; వ‌న‌రులు మరియు పార్ల‌మెంటు ప్ర‌తిష్ఠ‌ పరిరక్షణ

 

  • రేప‌టి నుండి పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఈ స‌మావేశ స‌మ‌యాన్ని మ‌నం గ‌రిష్ఠంగా సద్వినియోగం చేసుకోవ‌డమే ప్రస్తుత  త‌క్ష‌ణావ‌స‌రం.  కొన్ని అంచ‌నాలు త‌ప్ప‌డం మిన‌హా గ‌డ‌చిన మూడు సంవత్సరాలలో పార్ల‌మెంటు ఉత్పాద‌క‌త గ‌ణ‌నీయంగా మెరుగుప‌డింది.  ఇందుకుగాను అన్ని రాజ‌కీయ పార్టీల‌కూ నా ధన్యవాదాలు.

 

  • ఈ వ‌ర్షాకాల స‌మావేశాల సంద‌ర్భంగా స‌భా కార్య‌క‌లాపాల‌కు కేటాయించిన స‌మ‌యాన్నిస‌మ‌ర్థమైన రీతిలో వినియోగించుకుంటామ‌న్న న‌మ్మ‌కం నాకుంది. దానితో పాటు పార్ల‌మెంటు ఉత్పాద‌క‌త‌లో ఇదొక రికార్డు కూడా కాగ‌ల‌ద‌ని విశ్వ‌సిస్తున్నాను.  ఈ దిశ‌గా అన్ని రాజ‌కీయ పార్టీలూ స‌హ‌క‌రించ‌క త‌ప్ప‌దు.

 

  • పార్ల‌మెంటు ప్ర‌తిష్ఠ‌, మ‌న‌కున్న స‌మ‌యం, వ‌న‌రులను దృష్టిలో పెట్టుకొని, అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌ల‌ ద్వారా మ‌న బాధ్య‌త‌ల‌ను మ‌నం నిర్వ‌ర్తించ‌గ‌లం.

 

వ‌స్తువులు, సేవ‌ల ప‌న్ను (జిఎస్ టి) విష‌యంలో కృత‌జ్ఞ‌త‌లు

 

  • వ‌స్తువులు, సేవ‌ల ప‌న్ను (జిఎస్ టి)ని అమ‌లులోకి తేవ‌డంలో చేతులు క‌లిపినందుకు మీకంద‌రికీ మ‌రోసారి కృత‌జ్ఞుడిని.

 

  • ఇప్ప‌టికి 15 రోజులుగా వ‌స్తుసేవ‌ల ప‌న్ను విధానం అమ‌లుతుండ‌గా, ఇది సానుకూల ఫ‌లితాలిస్తుండ‌టం మ‌నం చూస్తున్నాం. అనేక రాష్ట్రాల స‌రిహ‌ద్దుల‌లో త‌నిఖీ కేంద్రాలు తొల‌గించ‌బ‌డ‌టంతో పాటు ట్ర‌క్కుల ప్ర‌యాణం సుల‌భ‌త‌ర‌మైంది.

 

  • జిఎస్ టి వేదిక‌లో ఇంకా న‌మోదు కాని వ్యాపారులను వీలైనంత త్వ‌ర‌గా దీని ప‌రిధిలోకి తెచ్చేందుకు కేంద్రం అన్ని రాష్ట్రాల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

 

బ‌డ్జెట్ స‌మావేశాల ఫ‌లితాలు

 

  • ఒక నెల కిందట బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రిగాయి. అన్ని రాజ‌కీయ పక్షాలూ వాటి స‌హ‌కారాన్ని అందించాయి.  ఈ స‌మావేశాల వ‌ల్ల ఒన‌గూడిన సానుకూల ఫ‌లితాల‌ను నేను మీతో పంచుకోవాల‌ని భావిస్తున్నాను.

 

  • బ‌డ్జెట్ స‌మ‌ర్ప‌ణ ప్ర‌క్రియ‌ను ఒక నెల ముందుకు జ‌ర‌ప‌డం వ‌ల్ల ప్ర‌ధానంగా క‌నిపించిన ప్ర‌భావం ఏమిటంటే, వివిధ ప‌థ‌కాల కోసం కేటాయించిన నిధులు వ‌ర్షాకాలం మొద‌లు కావ‌డానికి ముందే అనేక‌ శాఖ‌ల‌కు చేరాయి. ఇంత‌కుముందు ఈ నిధులు ఆయా శాఖ‌ల‌కు చేరాలంటే క‌నీసం రెండు మూడు నెల‌ల స‌మ‌యం ప‌ట్టేది. అప్ప‌టికల్లా వ‌ర్షాకాలం ప్ర‌వేశించ‌డంతో ప‌థ‌కాల అమ‌లు నిలిచిపోయేది.  ఈసారి ఇలా జ‌ర‌గ‌లేదు.. అంతేకాకుండా మార్చి నెల త‌రువాత వెనుక‌బాటు వ్య‌వ‌ధి అనేది మాయ‌మైంది.  మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ప్రాజెక్టుల ప‌నుల కోసం మూడు నెల‌ల అద‌న‌పు స‌మ‌యం క‌లిసివ‌చ్చింది.

 

  • కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ అకౌంట్స్ అంచ‌నాల ప్ర‌కారం.. ఈ ఏడాది ఏప్రిల్‌, జూన్ ల మ‌ధ్య వ్య‌యం గ‌డ‌చిన సంవ‌త్స‌రం ఇదే కాలపు వ్యయంతో పోలిస్తే 30 శాతం పెరిగింది.

 

  • మౌలిక స‌దుపాయాల సంబంధిత‌ పథ‌కాల్లో మూల‌ధ‌న వ్య‌యం గ‌డ‌చిన సంవ‌త్స‌రంతో పోలిస్తే ఈసారి 48 శాతం పెరిగింది.

 

  • వివిధ ప‌థ‌కాల‌లో నిధుల వ్య‌యం తీరును ప‌రిశీలిస్తే.. కేటాయించిన నిధులు ఏడాది పొడ‌వునా స‌మ‌తూకంతో ఖ‌ర్చ‌వ‌డాన్ని ప్ర‌తిబింబిస్తోంది. ఇంత‌కుముందు వ‌ర్షాకాలం అనంతరం నిధుల వ్య‌యం మొద‌ల‌య్యేది.  దీని వ‌ల్ల మార్చిలోగా నిధులు ఖ‌ర్చు చేయాల‌న్న అన‌వ‌స‌ర‌పు ఒత్తిడి ఉండేది.  వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌కు ఇదీ ఒక‌ కార‌ణం.

 

ఈశాన్య రాష్ట్రాల‌లో వ‌రద‌లు

 

  • దేశంలో అనేక చోట్ల ఎడ‌తెగ‌ని వ‌ర్షాలు, ఈశాన్య రాష్ట్రాల‌ను ముంచెత్తుతున్న వ‌ర‌ద‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాల‌తో నిత్య సంబంధాలు నెర‌పుతూ ప‌రిస్థితుల‌ను శ్ర‌ద్ధ‌గా ప‌ర్య‌వేక్షిస్తోంది.  వ‌ర‌ద‌ బాధిత ప్రాంతాల‌లో సాగుతున్న ర‌క్ష‌ణ‌-స‌హాయ కార్య‌క్ర‌మాల‌లో కేంద్ర సంస్థ‌లు అనేకం నిమ‌గ్న‌మై ఉన్నాయి.  ఏ స‌హాయం కావాల్సి వ‌చ్చినా త‌క్ష‌ణం తెలియ‌జేయాల్సిందిగా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్రం సూచించింది.

 

  • అమ‌ర్ నాథ్ యాత్రికుల‌పై ఉగ్ర‌వాదుల దాడిమీద జాతి మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఈ దాడిలో మ‌ర‌ణించిన యాత్రికులకు సంతాపంతో పాటు ఈ విషాద స‌మ‌యంలో వారి  కుటుంబాల‌కు నా హృద‌య‌పూర్వ‌క సానుభూతి తెలియ‌జేస్తున్నాను.  యాత్రికుల‌పై దాడికి బాధ్యుల‌ను ప్ర‌భుత్వం చ‌ట్ట ప్ర‌కారం క‌ఠినంగా శిక్షిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా హామీ ఇస్తున్నాను.
  • జ‌మ్ము & క‌శ్మీర్‌ లో శాంతి భ‌ద్ర‌త‌ల నిర్వ‌హ‌ణ‌కు, జాతి వ్య‌తిరేక శ‌క్తుల‌ను ఏరివేసేందుకు మేం పూర్తిగా క‌ట్టుబ‌డి ఉన్నాం. ఈ దిశ‌గా అట‌ల్‌ గారు వేసిన బాట‌లో ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది.

 

గోర‌క్ష‌ణ పేరిట హింస‌ను ప్రేరేపిస్తున్న అసాంఘిక శ‌క్తుల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి.

 

  • గో ర‌క్ష‌ణ పేరిట కొన్ని అసాంఘిక శక్తులు హింస‌ను ప్రేరేపిస్తున్నాయి. దేశంలో సామ‌ర‌స్య‌పూర్వ‌క వాతావ‌ర‌ణాన్ని చెద‌ర‌గొట్ట‌డంలో నిమ‌గ్న‌మైన వారు ఈ ప‌రిస్థితుల‌ను అవ‌కాశంగా తీసుకునేందుకు య‌త్నిస్తున్నారు.

 

  • ఇది దేశ ప్ర‌తిష్ఠ‌పై ప్ర‌భావం చూపుతుంది. అందువ‌ల్ల అటువంటి శ‌క్తుల‌పై రాష్ట్రాలు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి.

 

  • దేశంలో గోవును త‌ల్లిలా భావిస్తారు. గోవుకు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో అనుబంధం ఉంది. అయితే, గో సంర‌క్ష‌ణ‌కు ఒక చ‌ట్టం ఉంద‌న్న వాస్త‌వాన్ని అంద‌రూ గుర్తించాలి.  చ‌ట్టాన్ని అతిక్ర‌మించ‌డం దానికి ఎన్న‌డూ ప్ర‌త్యామ్నాయం కాబోదు.

 

  • శాంతి భ‌ద్ర‌త‌ల నిర్వ‌హ‌ణ రాష్ట్రాల బాధ్య‌త. ఇటువంటి సంఘ‌ట‌న‌లు ఎక్క‌డ జ‌రిగినా, వాటిపై రాష్ట్ర ప్ర‌భుత్వాలే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి.  గోర‌క్ష‌ణ సాకుతో కొంద‌రు వ్య‌క్తిగ‌త క‌క్ష తీర్చుకొనేందుకు పాల్ప‌డుతున్న‌ విష‌యాన్ని కూడా రాష్ట్ర ప్ర‌భుత్వాలు గుర్తించాలి.

 

  • గోర‌క్ష‌ణ పేరిట సాగుతున్న గూండాయిజాన్ని అన్ని రాజ‌కీయ పార్టీలు గ‌ట్టిగా ఖండించాలి.

 

అవినీతి వ్య‌తిరేక చ‌ర్య‌లు

 

  • మ‌న నేత‌ల‌లో కొందరి చ‌ర్య‌ల వ‌ల్ల‌ కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయ నాయ‌కుల ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బారింది. నాయ‌కులు ప్ర‌తి ఒక్క‌రూ మ‌చ్చ‌ప‌డిన వారు కాద‌ని, నాయ‌కులంతా ధ‌నార్జ‌న కోసం ప‌రుగులు తీయ‌డంలేద‌ని ప్ర‌జ‌ల‌లో మ‌నం విశ్వాసం క‌లిగించాల్సిన అవ‌స‌రం ఎంత‌యినా ఉంది.

 

  • మ‌నం చేయాల్సింద‌ల్లా ప్ర‌జా జీవ‌నంలో పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం, అలాగే అవినీతిప‌రులైన నాయ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం.

 

  • అటువంటి నాయ‌కుల‌ను గుర్తించి త‌మ రాజ‌కీయ ప్ర‌యాణ మార్గం నుంచి వారిని వేరు చేసే బాధ్య‌త రాజ‌కీయ పార్టీల‌ పైన ఉంది.

 

  • దేశంలో అమ‌ల‌య్యే చ‌ట్టాల త‌మ ప‌ని తాము చేస్తున్న‌ప్పుడు రాజ‌కీయ కుట్ర సాకుతో దాన్నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించే వారిని నిరోధించ‌డంలో మ‌న‌మంతా ఏకం కావాలి.

 

  • జాతిని దోచుకున్న వారితో చేయి క‌లిపితే జాతికి ఒరిగేదేమీ ఉండ‌దు.

 

  • ఈ సంవత్సరం ఆగ‌స్టు 9న ‘క్విట్ ఇండియా’ ఉద్య‌మ 75వ వార్షికోత్స‌వం వ‌స్తున్నందున దీనిపై పార్ల‌మెంటు చ‌ర్చించాలి.

 

  • రాష్ట్రప‌తి ఎన్నిక ఏకాభిప్రాయంతో సాగితే ఎంతో బాగుండేది. అయితే, ఈ ఎన్నిక‌ల ప్ర‌చారం ఎంతో హుందాగా సాగుతుండ‌డం చాలా సంతృప్తిని, గ‌ర్వాన్ని క‌లిగిస్తోంది.  ఇందుకు అన్ని రాజ‌కీయ పక్షాలనూ అభినందించవలసివుంది.  పోలింగ్ సంద‌ర్భంగా ఒక్క వోటు కూడా వృథా కాకుండా శాస‌న స‌భ్యులు, పార్ల‌మెంటు స‌భ్యులంద‌రికీ ఆయా రాజకీయ పక్షాలు త‌ప్ప‌క‌ త‌గిన శిక్ష‌ణను ఇవ్వాలి.