Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2018 మార్చి 4వ తేదీన కర్నాటక లోని తుమకూరులో జరిగిన యువజన సమ్మేళనాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగం


అత్యంత గౌరవనీయులు స్వామి గౌతమానంద్ జీ మహారాజ్, స్వామి జిత కామానంద్ జీ మహారాజ్, స్వామి నిర్భయానంద్ సరస్వతి జీ, స్వామి వీరేశానంద్ జీ సరస్వతి మహారాజ్, స్వామి పరమానంద్ జీ మహారాజ్, ఇక్కడ సమావేశమైన యోగులు, పండితులు, భారీ సంఖ్యలో సమావేశమైన యువజనులారా,

కన్నడ భాషలో అభినందనలు.

ఈ తుమకూరు స్టేడియమ్ వేలాది స్వామి వివేకానందులు, సిస్టర్ నివేదిత ల యొక్క శక్తితో ప్రకాశిస్తోంది. ఇక్కడ పరచుకొన్న ఈ కాషాయ వన్నె మనందరిలో ఆసక్తి ని ఎంతో పెంచింది. ఈ శక్తి అంతటి నుండి నేను ఆశీస్సులను కోరుకొంటున్నాను. మూడు రోజుల కిందట స్వామి వీరేశానందజీ నుండి లేఖను అందుకొన్నందుకు నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. కానీ సమయాభావం కొన్ని సందర్భాలలో ప్రతిబంధకంగా ఉంటుంది.. పార్లమెంట్ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం అవుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. మీ అందరి మధ్యకు స్వయంగా రావడం నాకు కొంచెం కష్టమే అయినప్పటికీ, మీ అందరితో అనుసంధానం అయ్యేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవకాశం కల్పించింది. అందుకు ధన్యవాదాలు.

యువతరంతో సంభాషించడం ద్వారా నేర్చుకొనేందుకు ఎల్లప్పటికీ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అందుకే నేను ఎప్పుడూ యువతరంతో తరచు సంప్రదించేందుకు, వారి అనుభవాలు వినేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను. వారి ఆశలకు, కలలకు, ఆశయాలకు అనుగుణంగా వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకొనేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాను.

యువశక్తి పొంగిపొర్లుతున్న, ఎందరో సాధు సంతులు పాల్గొన్నఈ సమావేశాన్ని ప్రారంభించే అవకాశం దక్కడం నా అదృష్టం. మూడు సంవత్సరాల క్రితం శివకుమార్ స్వామీజీ దీవెనలు పొందడానికి వచ్చిప్పుడు తుమకూరు కు చెందిన యువకులు చూపించిన ప్రేమాభిమానాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. బసవేశ్వరుల వారు, స్వామి వివేకానందుల వారి ఆశీస్సులతో జాతి ఉద్ధరణకు శివకుమార్ స్వామీజీ నడుం బిగించారు. దేశ సంక్షేమం కోసమే ఆయన తన జీవితంలో ప్రతి ఒక్క క్షణాన్ని త్యాగం చేశారు. ఆయన దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలని నేను ఆ పరమాత్మను సదా ప్రార్థిస్తూ ఉంటాను.

మిత్రులారా,

మూడు ముఖ్యమైన సంఘటనల సమాహారమైన ఈ కార్యక్రమాన్ని అందరూ కలసి నిర్వహించుకోవడం చాలా అరుదైన సందర్భం. తుమకూరు లో మూడు పండుగల పవిత్ర సంగమం ఇది. రామకృష్ణ మఠం 125 వ వార్షికోత్సవం, స్వామి వివేకానందుల వారి శికాగో ప్రసంగం యొక్క 125 వ వార్షికోత్సవం, సిస్టర్ నివేదిత 150 వ జయంతి సమాహారమైన ఈ కార్యక్రమానికి ఇంత భారీ సంఖ్యలో యువత తరలిరావడమే ఒక గొప్ప విజయం. స్వామీజీకి, రామకృష్ణ మిశన్ కు, వయో వృద్ధులకు, ఇక్కడ సమావేశమైన అందరికీ మరోసారి అభినందనలు తెలియచేస్తున్నాను.

ఈ రోజు ప్రధాన కార్యక్రమం స్వామి వివేకానందుల వారికి సంబంధించింది. స్వామీజీకి కర్నాటక అంటే ఎంత ప్రేమో మనందరికీ తెలుసు. అమెరికా కు, కన్యాకుమారి కి వెళ్లడాని కన్నా ముందు ఆయన కొన్ని రోజుల పాటు కర్నాటక లో గడిపారు. మన ఆధ్యాత్మిక ఆలోచనలను స్వామి కాలానికి అనుగుణంగా అనుసంధానించారు. ఎంతో ఉజ్జ్వలమైన గతాన్ని వర్తమానంతో అనుసంధానించారు. సాధు- భక్తుల కార్యక్రమం, యువజన సమ్మేళనం ద్వారా ప్రస్తుత తరాన్ని గత కాలపు ఆధ్యాత్మికతతో కలిపి దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయడం నా అదృష్టం.

ఆ ఇద్దరు రుషిపుంగవులు యువకులుగా ఉండగానే ఇక్కడే సమావేశమై దేశం యావత్తును సంబోధించారు. వారి యాత్రా విశేషాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానం గురించి కూడా మనం ఒకే వేదిక మీది నుండి మాట్లాడుకుంటున్నాం. ఒకవైపు దైవం గురించి మాట్లాడుకొంటూనే మరొక వైపు నూతన ఆవిష్కరణలను గురించి కూడా మనం మాట్లాడుకొనే అవకాశం లభించింది. ఆధ్యాత్మిక ఉత్సవానికి, యువజనోత్సవానికి ఒక నమూనా కర్నాటక లోనే అభివృద్ధి చెందింది. ఈ కార్యక్రమం యావత్ దేశాన్ని ఉత్తేజితం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. పాత కాలపు సంప్రదాయాలు కొత్త తరంతో సంగమం చెందడం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది.

19, 20 శ‌తాబ్దులలో జ‌రిగిన భారత స్వాతంత్ర్య ఉద్య‌మం వంక ఒక‌సారి దృష్టి సారిస్తే, భిన్న స్థాయిలలో ఒకే ర‌క‌మైన ప్ర‌తిజ్ఞ మ‌న‌కు వినిపించింది. దేశాన్ని బానిస‌త్వ శృంఖ‌లాల నుండి త‌ప్పించ‌డం అనే ఒక ఉమ్మ‌డి సంక‌ల్పం అది. ఒక స‌న్యాసి కావ‌చ్చు, ఒక భ‌క్తుడు కావ‌చ్చు; ఒక ఆస్తిక వాది కావ‌చ్చు, ఒక నాస్తికుడు కావ‌చ్చు; ఒక విద్యార్థి కావ‌చ్చు, ఒక ఉపాధ్యాయుడు కావ‌చ్చు; ఒక కార్మికుడు కావ‌చ్చు, ఒక వృత్తి నిపుణుడు కావ‌చ్చు.. అంద‌రూ ఈ సంక‌ల్పాన్ని త‌మ‌కు అన్వ‌యించుకొన్నారు.

భిన్న కులాల పేరు మీద చీలిపోయిన స‌మాజం బ్రిటిష్ పాల‌కుల‌కు వ్య‌తిరేకంగా పోరాడ‌జాలద‌ని ఆ రోజు మన యోగి పుంగ‌వులు గుర్తించారు. ఈ బ‌ల‌హీనత నుండి బ‌య‌ట‌ప‌డేందుకు వారు దేశంలోని భిన్న ప్రాంతాలలో సామాజిక సంస్కరణలను, మత సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టారు. ఈ ఉద్య‌మాల కార‌ణంగా దేశం మొత్తం ఒకటైంది. దేశం లోని అంత‌ర్గత బ‌ల‌హీన‌త‌ల‌ను తొలగించ‌డ‌మే ఈ ఉద్య‌మాల ల‌క్ష్యం. ఈ ఉద్య‌మాల‌కు నాయ‌క‌త్వం వ‌హించిన వారు ప్ర‌జ‌లంద‌రినీ ఒకే వేదిక మీద‌కు తీసుకువ‌చ్చి అంద‌రికీ ఒకే ర‌క‌మైన గౌర‌వాన్ని క‌ల్పించారు. దేశ అవ‌స‌రాన్ని గుర్తించి వారు వారి ఆధ్యాత్మిక ప్ర‌యాణాన్ని జాతి నిర్మాణ కృషితో విలీనం చేశారు. ప్రజలకు సేవ చేయడం దైవానికి సేవ చేయడంతో సమానంగా మారిపోయింది.

మిత్రులారా,

విద్యార్థులు, వృత్తి నిపుణులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజినీయర్లు ప్రాంతీయ విభేదాలను పక్కన పెట్టి స్వాతంత్ర్య ఉద్యమంలో చేతులు కలిపిన మహోజ్జ్వల ఘట్టం అది. వీరు స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త దిశను కల్పించడమే కాకుండా జాతి నిర్మాణ పునాదిని పటిష్ఠం చేశారు. ప్రయత్నాలన్నీ ఏకమైయినప్పుడు మేథోపరంగా, సామాజికంగా దేశ నిర్మాణం జరుగుతుంది. ప్రజల ఐక్య శక్తి బ్రిటిషర్లను దేశం నుండి తరిమి కొట్టాలన్న సంకల్పానికి బాట పరచింది. స్వాతంత్ర్య పోరాటం సాగినన్ని దశాబ్దాలు ఇదే తీర్మానం, ఇదే సంకల్పాలు కొనసాగాయి. కొన్ని సందర్భాలలో మనం ఈ రోజు కూడా ఆ సంకల్పం శక్తి ఎంతటిదో కళ్లారా చూశాం. మొన్నటికి మొన్న హోలీ రంగులు దేశం అంతటా కనిపించాయి. నిన్న ఈశాన్య భారతంలో ఎన్నికల ఫలితాల పండుగ వాతావరణం కనిపించింది.

ఈ కార్యక్రమంలో దానిని గురించి ఎందుకు మాట్లాడుతున్నానా అని మీ అందరికీ ఆశ్చర్యం కలగవచ్చు. నా లోపలి భావాలను మీతో పంచుకోవాలని నేను నమ్ముతాను. నేను దానిని ఈశాన్య భారత రాజకీయాల కోణం నుండి చూడడం లేదు. ఈశాన్య ప్రజల ఆనందంలో జాతి యావత్తు భాగం పంచుకొందనే నేను చెప్పేది. ప్రతి ఒక్క భారతీయుడిలో అదే భావం కనిపించింది. ఈశాన్య భారత సోదరులు మరియు సోదరీమణులంతా ఒక పెద్ద మార్పుకు అనుకూలంగా వారి వోట్లను వేశారని నేను భావిస్తున్నాను. రామకృష్ణ మిశన్, వివేకానంద కేంద్రం, ఇంకా ఎందరో యువకులు, యోగులు ఈశాన్య ప్రాంత సంక్షేమానికి వారి జీవితాలను అర్పణం చేశారు. అందుకే ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల అనంతరం జాతి ప్రజల భావాలన్నీ దానితో మమేకం అయ్యాయి. ఈ బలమే దేశ ఐక్యతకు అపారమైన శక్తిని అందిస్తుంది. “ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్” ను ముందుకు నడిపిస్తుంది.

మిత్రులారా,

గతంలోని విధానాలు, పథకాలు ఈశాన్య ప్రజలను జాతి జీవన స్రవంతి నుండి వేరు చేశాయి. అభివృద్ధి నుండి తాము దూరంగా ఉన్నామనే భావాన్ని వారిలో కలిగించాయి. అక్కడ అనేక సమస్యలకు మూలం ఇదే. గత నాలుగు సంవత్సరాలుగా ఈ లోపాలన్నింటినీ సరిదిద్ది వారిలో తాము వేరు అనే భావం తొలగించే ప్రయత్నం జరిగింది. ఈశాన్యాన్ని భావోద్వేగపూరితంగా సంఘటితం చేస్తామని మేం ప్రతిజ్ఞ చేసి దానిని సాధించాం. త్రిపుర లోని ఈ ఆదివాసి ప్రాంతాల ఎన్నికల ఫలితాలు నాకెంతో సంతృప్తిని ఇచ్చాయి. చిన్న రాష్ట్రం అయిన త్రిపుర లో 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆదివాసీలు నివసించే ప్రాంతాలన్నీ నక్సలైట్లు, మావోయిస్టుల ప్రాబల్యం గల ప్రాంతాలనే ఒక అపోహ మనలో ఉంది. ఈశాన్య ప్రాంతాలు వేర్పాటువాదశక్తులను పెంచే ప్రదేశాలన్న ఆలోచనలను రూపుమాపే ప్రయత్నం మేం చేశాం. భారతీయ జనతా పార్టీకి వోటు వేయడం ద్వారా ఈశాన్య ప్రాంతాల ప్రజలు అసహన రాజకీయాలను ఓడించారు.

మిత్రులారా,

అందరినీ సంఘటితం చేయడం ద్వారా మాత్రమే తీవ్రవాదాన్ని రూపు మాపగలం. సమాజం లోని ఏ ఒక్క వర్గం, ఏ ఒక్క విభాగం తాము ప్రధాన స్రవంతి కన్నా వేరు అనే ఆలోచన లేకుండా చేసేందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకొంది. అలాంటి సంకల్పం శక్తి ఎంతటిదో కర్నాటక స్టేడియమ్ లో ప్రతిబింబించింది. ప్రధానంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలంతా మరింతగా ఆ భావనను పొంది ఉంటారు.

మిత్రులారా,

స్వామి వివేకానందుల వారి మాటల ద్వారా ఈ జాతి నిర్మాణ సంకల్పాన్ని మరింత బాగా అర్ధం చేసుకోవచ్చు. స్వామీజీ ఇలా అన్నారు..

“జీవితం చిన్నది, కాని ఆత్మ నాశనం లేనిది; శాశ్వతమైనది, కానీ మరణం మాత్రం తథ్యం. ఒక మంచి ఆలోచనను తెచ్చుకొని దానికి యావత్తు జీవితాన్ని అంకితం చేసేందుకు ప్రయత్నిద్దాం”.

అందుకే మనం ఒక సంకల్పం తీసుకొని దానికి జీవితాన్ని అంకితం చేయాలి.
ఈ రోజు వేలాది యువకుల సమక్షంలో ఒక ప్రశ్నను అడుగుతున్నాను. అది.. “మీ సంకల్పం ఏమిటి ?”.

ఏ యువకుడినైనా ఈ ప్రశ్నను అడిగితే, ఏ ఒక్కరూ నేరుగా సమాధానం చెప్పలేకపోతారు. తరచుగా జీవిత లక్ష్యం విషయంలో వారు గందరగోళానికి లోనవుతూ ఉంటారు. మనకు జీవిత లక్ష్యంపైన స్పష్టత ఉన్నప్పుడే ఏదైనా సాధించే ప్రయత్నం చేయగలుగుతాం, సమాజానికి కూడా మన వంతుగా ఏదైనా చేయగలుగుతాం. లక్ష్యం లేని వారు ఏదీ సాధించలేరు.

స్వామి వివేకానందుల వారు ప్రముఖమైన మరో విషయాన్ని కూడా చెప్పారు.

“ఒక ఆలోచన మనసులోకి తెచ్చుకోండి, దాన్నే మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి. దాని గురించి ఆలోచించండి, కల గనండి. మీ మెదడు, కండరాలు, నరాలు.. శరీరం లోని ప్రతి అణువును ఆ ఆలోచతోనే నింపండి, మిగిలిన ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. విజయం సాధించే మార్గం అదే.”

ఈ యువజనోత్సవానికి హాజరైన యువకులందరికీ సంకల్పం, భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్నారనే అంశంపై స్పష్టత ఉండాలని నేను కోరుతున్నాను.

సోదరులు మరియు సోదరీమణులారా,

ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో యువ రక్తం పొంగుతున్న దేశం. జనాభా లో 65 శాతం మంది 35 సంవత్సరాల లోపు వయస్సు వారే. ఈ యువశక్తే భారతదేశం దిశను మార్చగలదు. దేశానికి ఇంధనం అదే. 2014 సంవత్సరంలో మేం ఎన్నికైన తర్వాత ఈ యువకులను, వారిలోని శక్తిని జాతి నిర్మాణానికి ఉపయోగించుకోవడం లక్ష్యంగా పలు పథకాలను ప్రారంభించాం.

యువజనుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. గతంలో కూడా నైపుణ్యాల అభివృద్ధి ఉన్నప్పటికీ 40- 50 మంత్రిత్వ శాఖలకు విస్తరించి ఉంది. వారి లక్ష్యాలు కూడా వేరు వేరే. కొన్ని సందర్భాలలో వాటి మధ్య ప్రయోజనాల వైరుధ్యం కూడా ఏర్పడేది. కానీ ఈ రోజు ఒకే ఒక మంత్రిత్వ శాఖ నైపుణ్యాల అభివృద్ధి వ్యవహారం అంతా చూస్తోంది. ఆ మంత్రిత్వ శాఖ నిర్వహణలో ప్రతి ఒక్క జిల్లాలోను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. యువతరం, పరిశ్రమ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని యువతకు స్వల్పకాలిక శిక్షణను, దీర్ఘకాలిక శిక్షణను ఇస్తున్నాయి. ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్ర యోజన పేరిట ఎలాంటి పూచీకత్తులు లేకుండానే యువతకు వ్యాపారాల కోసం రుణాలను అందించేందుకు ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకాన్ని ప్రవేశపెట్టాం. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 11 కోట్ల రుణాలను మంజూరు చేయడమైంది. కర్నాటక లోని యువకులకు 1.14 లక్షల కోట్లకు పైగా రుణాలకు ఆమోదం తెలపడమైంది. ఆ పథకం పుణ్యమా అని ఈ రోజు 3 కోట్ల మంది యువ పారిశ్రామికవేత్తలు సిద్ధం అయ్యారు. నా యువ మిత్రులారా, ఇది ఎంతో ప్రాధాన్యం ఉన్నది కాదా ? అంత స్వల్ప సమయంలో 3 కోట్ల మంది దేశ ఆర్థిక వ్యవస్థకు తమ వంతు వాటాను అందిస్తున్నారు.

నైపుణ్యాల అభివృద్ధి, స్వతంత్రోపాధిని మాత్రమే కాదు, యువ పారిశ్రామికవేత్తల ఉత్పత్తుల కోసం కొత్త విపణులను కూడా సృష్టిస్తున్నాం.
ప్రభుత్వ సేకరించే వస్తువులన్నింటిలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా విధానంలో కూడా మార్పులు చేశాం. అలాగే గవర్నమెంట్ ఇ-మార్కెట్ (GeM) పేరిట గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతీయువకులు వారి ఉత్పత్తులను ఆన్ లైన్ లోనే విక్రయించుకొనే అవకాశం కల్పించేందుకు ఒక ఆన్ లైన్ వ్యవస్థ ను ఏర్పాటు చేశాం. దీనివల్ల వస్తువుల విక్రయం కోసం మధ్యవర్తులను లేదా పెద్ద కంపెనీలను ఆశ్రయించవలసిన అవసరం ఉండదు. ప్రభుత్వం సామాన్యుడి వద్ద నుండి నేరుగా కొనుగోలు చేస్తుంది. యువ పారిశ్రామికవేత్తల ప్రయోజనం కోసం ఈ పోర్టల్ తో అనుసంధానం కావాలని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేం ప్రోత్సహిస్తున్నాం. 20 రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే దీని విషయంలో కేంద్రంతో చేతులు కలిపాయి.

మిత్రులారా,

ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాల ఫలితంగా ఈ రోజు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువకులు శిక్షణను పొందగలుగుతున్నారు. వారి ఉత్పత్తులను విక్రయించుకోగలుగుతున్నారు. అలాంటి వాతావరణం ప్రాధాన్యం ఏమిటో కర్నాటక కు చెందిన యువకులకు బాగా తెలుసు. మీ వంటి కోట్లాది యువకుల ఆశలకు, ఆశయాలకు రెక్కలు ఇచ్చేందుకు స్టార్ట్- అప్ ఇండియా, స్టాండ్- అప్ ఇండియా వంటి పథకాలను ప్రారంభించాం. తొలిసారిగా మా ప్రభుత్వం ఆరు పన్ను ప్రయోజనాలను ఉపాధితో అనుసంధానం చేసింది. యువతరానికి అప్రెంటిస్ అవకాశాలు కల్పించే కంపెనీలకు ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలు అందిస్తోంది. యువ ఉద్యోగుల వేతనాల నుండి వసూలు చేసే భవిష్య నిధులకు ప్రభుత్వం వాటా అందిస్తోంది. 2 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ ను కలిగి ఉండి డిజిటల్ చెల్లింపులు చేసే కంపెనీలు కూడా పన్ను ప్రయోజనాలను పొందుతున్నాయి.

మన యువతలో “లక్ష్య స్ఫూర్తి” కి కొదవ లేదు. వారు వారి లోని కొత్త ఆలోచనలను సమర్థవంతమైన విధానంలో తక్కువ ఖర్చుతో ఆచరణలోకి తీసుకురాగల పరిష్కారాలను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ లక్ష్యాలు సాకారం చేసేందుకు ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోంది.

మిత్రులారా,

ఉజ్జ్వల భవిష్యత్తుకు బాట నవ్యతే. మన విద్యావ్యవస్థకు ఈ ఆలోచనను అనుసంధానం చేసి పాఠశాల సంస్కృతిలో నవ ఆవిష్కరణలు ఒక భాగంగా చేసే ప్రయత్నం చేశాం. పిల్లల్లోని ఆలోచనలను నూతన ఆవిష్కరణలుగా మార్చడం లక్ష్యంగా అటల్ ఇనవేశన్ మిశన్ (ఎఐఎమ్) ను ప్రవేశపెట్టాం. ఇందులో భాగంగా 2400 అటల్ టింకరింగ్ ల్యాబ్ ల ఏర్పాటుకు ఆమోదం తెలిపాం.

దేశంలో 20 ప్రపంచ శ్రేణి సంస్థల ఏర్పాటు ప్రక్రియను కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమం లో భాగంగా దేశంలో ఎంపిక చేసిన పది ప్రభుత్వ రంగ సంస్థలకు నిర్దిష్ట కాలపరిమితికి 10 వేల కోట్ల రూపాయల వంతున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఈ సంస్థలన్నీ భారతదేశాన్ని ఆధునిక విద్యాశకంలోకి తిరిగి తీసుకుపోతాయి. బడ్జెటు లో మేం ‘రైజ్’ పేరిట ఒక కొత్త పథకాన్ని ప్రకటించాం. ఈ కార్యక్రమం లో భాగంగా రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో విద్యావ్యవస్థ పరివర్తనకు ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

అలాగే బడ్జెట్ లో ప్రధాన మంత్రి రిసెర్చ్ ఫెలో స్కీమ్ ఒకటి ప్రకటించాం. ఈ స్కీమ్ లో భాగంగా ప్రతిభావంతులైన 1000 మంది ఇంజినీయరింగ్ విద్యార్థులకు పిహెచ్. డి. చేయడం కోసం ఐదు సంవత్సరాల పాటు నెలకు 70,000 నుండి 80,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం.

మన మానవ వనరుల బలాన్ని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాల ప్రయోజనాలు కర్నాటక లోని యువకులకు కూడా తేలికగా అందుబాటులో ఉంటాయి. ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ ల వంటి విభాగాలలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కృషి కర్నాటక లోని యువతకు నూతన ఆవిష్కరణలను, ప్రతిభ ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు కొత్త అవకాశాలు అందుబాటులోకి తీసుకువస్తుంది.

మిత్రులారా,

భారతీయ విద్యార్థులు ఇతర దేశాలకు చెందిన ఆలోచనలను అనుకరించవలసిన అవసరం ఉండని వాతావరణాన్ని కల్పించాలని సిస్టర్ నివేదిత ఒకసారి వ్యాఖ్యానించారు. ఇదే అంశాన్ని మరింత వివరిస్తూ “విద్య అనేది హృదయానికి, శక్తికి సంబంధించినది కావాలి, ప్రత్యేకించి మెదడు లోని శక్తిని ఉత్తేజింపచేయాలి. మీకు, మీ గతానికి, ఆధునిక ప్రపంచానికి అనుసంధానం కావాలి” అని ఆమె పేర్కొంన్నారు.

మన గతానికి, భవిష్యత్తుకు అనుసంధానం కలిగించడమే ఇందులో ప్రధానమైన అంశం. మన సంప్రదాయాలతో ఎంత బలమైన అనుబంధం ఉంటే, దేశ యువత అంత శక్తివంతంగా ఉంటారు.

సోదరులు మరియు సోదరీమణులారా,

కేంద్రప్రభుత్వం చేపట్టిన ఖేలో ఇండియా పథకం లో మన సంప్రదాయాల పట్ల గౌరవ భావం కనిపిస్తుంది. ఆటలు ఆడిన వారంతా వికసించాలన్నది నేను చెప్తాను. అందుకు అనుగుణంగానే విధానంలో మేం పెద్ద మార్పు చేశాం. గురు శిష్య పరంపర లో భాగంగా ప్రభుత్వం ప్రస్తుత కోచ్ లను మాత్రమే కాకుండా గతంలో క్రీడాకారుని క్రీడాజీవితంలో పాత్రధారులైన గురువులందరినీ ప్రభుత్వం సత్కరిస్తుంది. అంతర్జాతీయ క్రీడలలో విజయాన్ని సాధించినట్టయితే గెలుచుకొన్న మొత్తంలో కొంత భాగం కోచ్ లందరికీ కూడా ఇస్తున్నాం. మన సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని కబడ్డీ, ఖో-ఖో వంటి క్రీడలను ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రోత్సహిస్తున్నాం. దేశం లోని అన్ని క్రీడల్లో ప్రతిభను గుర్తించిన అనంతరం ఒక ఉమ్మడి వేదిక ను కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆధునిక క్రీడా మౌలిక వసతుల సహాయంతో శిక్షణ పొందేందుకు దేశంలోని ఎంపిక చేసిన 1,000 మంది క్రీడాకారులకు ఏడాదికి 5 లక్షల రూపాయల వంతున ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

మిత్రులారా,

“విద్యార్థి దేవో భవ” ఇది మీ కోసం ఇస్తున్న నినాదం మాత్రమే కాదు, మా మంత్రం కూడా అదే. మీ అనుమతితో ఇంకో విషయం చెబుతున్నాను – అది “యువ దేవోభవ, యువశక్తి దేవో భవ”.

నాకైతే యువకులు దైవశక్తితో సమానం. యవ్వనం అనేది వయస్సుకు సంబంధించిన ఒక స్థితి మాత్రమే కాదు, మానసిక స్థితికి కూడా దర్పణం. గతించిపోయిన కాలం ఒక్కటే బాగుందని యువశక్తి ఎప్పుడూ భావించదు. గతం నుండి నేర్చుకొని వర్తమానాన్ని, భవిష్యత్తును ఉజ్జ్వలంగా ఉంచుకోవాలని యువత విశ్వసిస్తుంది. అందుకు అనుగుణంగానే వారు పని చేసి దేశం, ప్రపంచం గతిని మార్చేందుకు ప్రయత్నిస్తారు. గతం కన్నా, వర్తమానం కన్నా భవిష్యత్తు బాగుండాలని వారు కోరుకుంటారు.

యువశక్తికి నేను ఎప్పుడూ వందనం చేస్తాను. “ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్” గురించి మీరు వినే వుంటారు. దేశాన్ని ఐక్యంగా నిలిపేందుకు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు కష్టపడి పని చేశారు. ఐక్యభారం అత్యుత్తమంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనందరిదీ. మీలో కొందరికి ఫ్రెంచ్ భాష లేదా స్పానిష్ భాష ను నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఉండవచ్చు. ఏ భాష ను నేర్చుకోవాలన్న తపన అయినా మంచిదే. అయితే మన దేశంలోని భాషలు నేర్చుకోవాలని మనం ఎప్పుడైనా ఆలోచించామా ? 100 భాషలు, 1700 మాండలికాలు కల విస్తారమైన దేశం మనది. ఇతర భాషల నుండి కనీసం 5 లేదా 50 వాక్యాలను నేర్చుకోవచ్చు. ఇతర భాషల్లోని పాటలను నేర్చుకోవచ్చు. దేశాన్ని ఐక్యం చేయడానికి ఈ శక్తి అవసరమని నేను నమ్ముతాను. దానిని మనం సహజసిద్ధంగానే అలవరచుకోవచ్చు. నైనయితే చిన్న చిన్న ముక్కలుగా అయినా కన్నడ భాషలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను, కానీ నేను ఎప్పుడైతే కన్నడంలో మాట్లాడడం మొదలుపెట్టానో అప్పుడది మీ హృదయాలను స్పర్శిస్తుంది. నేను మాట్లాడేది సరిగా ఉందా లేదా ?, వ్యాకరణం ఎలా ఉంది ?, నేను ఉపయోగిస్తున్న పదాలు సరైనవేనా ? అని మీరు ఆలోచించరు. ఆయన మాతో అనుసంధానం కావాలని ప్రయత్నిస్తున్నారనే మీరు భావిస్తారు. అదే ఐక్యత యొక్క శక్తి.

“సంకల్ప్ సే సిద్ధి” మరియు న్యూ ఇండియా ఆవిష్కారం స్వప్నాన్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత యువత పైనే ఉంది. నేను మరోసారి దేశ యువత అందరికీ శుభాభినందనలు తెలుపుతూ స్వామి వివేకానందుల వారు, సిస్టర్ నివేదిత గారుల ఆలోచనలు అలవరచుకోవాలని సూచిస్తున్నాను.

మానవ సేవే మాధవ సేవ అనే విషయం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రతీ జీవిలోనూ మనం శివుని దర్శించవచ్చు. స్వచ్ఛ్ భారత్ అభియాన్, బేటీ బచావో బేటీ పఢావో, వయో వృద్ధుల కోసం, రైతాంగం కోసం చేపట్టే పథకాలు.. ఏ కార్యక్రమం అయినా ఈ సిద్ధాంతాన్ని వర్తింపచేయవచ్చు. ఏదో ఒక సంకల్పంతో మనం ముందుకు సాగాలి. ఈ తుమకూరు గడ్డ మీద సమావేశమైన ఎందరో మహానుభావులైన యోగులు, పండితుల నుండి స్ఫూర్తి ని అందుకొని యువశక్తి ముందుకు సాగాలి.

మీరంతా Narendra Modi app తో అనుసంధానం అయ్యారని నేను భావిస్తాను. మీ అందరితో అనుసంధానం కావాలనే నేను కోరుతున్నాను. నరేంద్రమోదీ యాప్ ద్వారా నాతో అనుసంధానమై మాట్లాడండి, మీ భావాలు పంచుకోండి. నేను మీతో కన్నడ భాషలో మాట్లాడలేకపోవచ్చు. హిందీలో మాట్లాడగలను. ఈ ప్రసంగం లోని ప్రధానాంశాలను కన్నడ భాషలోకి తర్జుమా చేసి నరేంద్రమోదీ యాప్ లో అప్ లోడ్ చేయాలని నా బృందానికి చెప్తాను. మీరు నా మాటలను మరింత మెరుగ్గా అర్ధం చేసుకొని దానిని ముందుకు తీసుకువెళ్లగలుగుతారు.

ఈ నాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నేను మరోసారి రామకృష్ణ – వివేకానంద ఆశ్రమానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ సమావేశమైన యోగులకు, శివగిరి మఠానికి, యువకులకు అందరికీ నా అభివాదాలు.

అనేకానేక ధన్యవాదాలు.

***