Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముద్ర యోజ‌న ల‌బ్దిదారుల‌తో ముఖాముఖి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం


సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణులారా,

నా మనస్సు కు ఎంతో ఇష్టమైన‌టువంటి ప‌థ‌కంతో క్రియాశీల ప్ర‌మేయాన్ని క‌లిగివున్న వ్య‌క్తుల‌తో, క‌ష్టించి ప‌నిచేసే యువ‌త‌తో, సంప్ర‌దాయాన్ని వ‌దలిపెట్టి బయటకు వ‌చ్చిన సోద‌రీమ‌ణుల‌తో సంభాషించే అవ‌కాశం ఈ రోజున నాకు ద‌క్క‌డం నా అదృష్టం. సాంప్రదాయక మార్గాన్ని అనుస‌రించ‌డానికి బ‌దులుగా మీదైన దారి ని నిర్మించుకొన్నటువంటి వ్య‌క్తులు మీరు. మ‌రి మీరు నిర్మించిన బాట ధైర్యం తోను, మ‌న‌శ్శ‌క్తి తోను కూడుకొన్న‌ బాట. దేశం యొక్క స‌మృద్ధికి మరియు సంతోషానికి మీరు ఎంతో పెద్ద ఎత్తున తోడ్పాటు ను అందించారు.

ఈ రోజున యావ‌త్ దేశం మీ యొక్క సాహ‌స గాథను, మీరు తీసుకొన్న నిర్ణ‌యాలను, ఈ ప్ర‌యాణంలో మీరు క‌న‌బ‌రుస్తున్నటువంటి చొర‌వ‌ ను యావత్తు దేశం నాతో కలసి ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఆల‌కిస్తోంది. కింద‌టి నెలే ‘ముద్ర ప‌థ‌కం’ ల‌బ్దిదారుల‌తో ప్ర‌ధాన మంత్రి నివాసం లో కొద్ది సేపు గ‌డిపే అవ‌కాశాన్ని నేను ద‌క్కించుకొన్నాను. వారి అనుభ‌వాలు, వారి సంఘ‌ర్ష‌ణ‌, వారి పురోగతి యొక్క కథ‌లు నాకు సంతృప్తిని కలిగించాయి; అవి నా హృద‌యాన్ని అతిశ‌యంతో నింపి వేశాయి. ఆ రోజే- నేను నిర్ణయించుకొన్నాను- నాకు గ‌నుక ఒక అవ‌కాశం వ‌స్తే ‘ముద్ర’ ల‌బ్దిదారుల‌తో మాట్లాడాల‌నీ, వారితో ఇష్టాగోష్ఠి జ‌ర‌పాల‌నీనూ. మ‌రి, ఈ రోజున సాంకేతిక విజ్ఞానం అండ‌దండ‌ల‌తో నా యొక్క మ‌రియు మీ యొక్క స‌మ‌యం ఆదా అవుతోంది. మీ అనుభ‌వాల‌ను నేను వినగలుగుతున్నాను, మీ అనుభూతుల‌ను నేరుగా ఆల‌కించ‌ గ‌లుగుతున్నాను. మరి మ‌న మ‌ధ్యన ఎటువంటి మ‌ధ్య‌వ‌ర్తి తో పని లేదు.

మీ వంటి న‌వ పారిశ్రామికులు అందించిన తోడ్పాటు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ కు ఎంతో ముఖ్య‌ం. 25-30 సంవ‌త్స‌రాల కింద‌ట రుణ మేళా ల‌ను రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోసం నిర్వ‌హించ‌డం గురించి మీకు తెలిసిన సంగతే. రాజ‌కీయ అనుబంధం క‌లిగిన‌టువంటి వ్య‌క్తులు, వారి యొక్క స‌న్నిహితులు, కాంట్రాక్ట‌ర్లు, ఇంకా వోటు బ్యాంకు రాజ‌కీయాలను న‌డిపే వారు, అటువంటి వ్య‌క్తులంతా బ్యాంకుల నుండి డ‌బ్బును పొందే వారు. ఎంత మేరకు బ్యాంకు రుణం ఇచ్చిందీ బోలెడన్ని వార్తా క‌థ‌నాలు అచ్చు అయ్యేవి. ఆ త‌రువాత ఏం జ‌రిగిందో అడిగిన పాపాన ఎవ్వరూ పోలేదు. మేము రుణ మేళా ల‌ను నిర్వ‌హించిందీ లేదు, ఏ ద‌ళారికీ వీలు కల్పించిందీ లేదు. ఈ దేశపు యువ‌తీ యువ‌కులు, మాతృమూర్తులు మరియు సోద‌రీమ‌ణులు త‌మంత‌ట తాము ఏదైనా చేయాల‌ని కోరుకొన్న వారు, బ్యాంకు అధికారుల‌తో నేరుగా మాట్లాడ‌ద‌ల‌చుకొన్న‌ వారు.. ఇదిగో వారి కోస‌ం ఒక పథకాన్ని- ‘ముద్ర యోజ‌న’ ను- మేము సిద్ధం చేశాము. ఈ పథకం దేశంలో ఏదైనా సాధించాల‌నుకొన్న వారికి ఒక పెద్ద అవ‌కాశంగా మారింది. మన చిన్న న‌వ పారిశ్రామికుల‌ను, వారి లోని వ్యాపార నైపుణ్యాల‌ను మేము విశ్వ‌సించి, వారు వారి సొంత వ్యాపారాన్ని మొద‌లుపెట్టడమే కాక ఆ వ్యాపారాన్ని విస్త‌రించేందుకు వీలుగా వారికి ముద్ర యోజ‌న లో భాగంగా రుణాలు ఇచ్చాం. ముద్ర యోజ‌న స్వతంత్రోపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డంతో పాటు ప‌లు ఉద్యోగాల‌కు ఒక వాహ‌కంగా కూడా వ్యవహరిస్తోంది.

స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుండి మ‌న దేశంలో లైసెన్స్ హ‌యాం రాజ్య‌మేలింది. ఎవ‌రి తోనైనా ప‌రిచ‌యం ఉన్న‌ వారు మాత్ర‌మే రుణాలను పొంద‌గ‌లిగారు. ఫ‌లానా వారి పేర్ల‌ను చెప్ప‌గ‌లిగిన వారికి మాత్ర‌మే ప‌ని జ‌రిగేది. ఏదో ఒక విధంగా, ఈ వ్య‌వ‌స్థ పేద ప్ర‌జ‌ల‌ను వ్య‌వ‌స్థ కు వెలుపల అట్టిపెట్టేసింది. ఎందుకంటే, వారికి ఏ పెద్ద పేరు ఎరుక ఉండడం గాని లేదా సమీపించే మార్గమేదైనా గాని లేకపోయింది. వేలాది చిన్న ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లు వారి వ్యాపారాన్ని మొద‌లుపెట్ట‌లేక పోవ‌డానికి మరియు ఆ వ్యాపారాన్ని వారి శ‌క్తియుక్తుల మేర‌కు విస్త‌రించ‌ లేక‌పోవ‌డానికి దోవ తీసిన ప్ర‌ధాన‌ కార‌ణాల్లో ఇది కూడా ఒక‌ కారణమైంది. ఆర్థిక స‌హాయం కోసం, వారు వ‌డ్డీ వ్యాపారుల గుప్పెట్లో చిక్కుకొని ఆ బంధంలో ఉండిపోయే వారు.

బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లకు రుణాల‌ను అందించడం కోసం ఆర్థిక మంత్రి తానే ఫోన్ లో మాట్లాడుతూ ఉండే కాలం అంటూ ఈ దేశంలో ఒక‌టి ఉండింది. మ‌రో పక్క, చిన్న నవ పారిశ్రామికుడు 30- 40 శాతం వ‌డ్డీ ని చెల్లిస్తూ వ‌డ్డీ వ్యాపారుల వలలో ఎలా చిక్కుకొని పోయేవాడంటే దాని లోపలి నుండి అత‌డు తన జీవిత ప‌ర్యంతం బయ‌టప‌డగలిగే వాడే కాదు. ఈ విష‌ వ‌ల‌యం ఏదో ఒక రోజున ఛేద‌న‌ కు లోన‌వ్వాల్సిన అగ‌త్యం తప్పక ఏర్ప‌డింది; దీనిని ఎవ‌రో ఒక‌రు బ‌ద్ద‌లు కొట్టాల్సివచ్చింది. ఈ దిశ‌గా మేము ప్ర‌యత్నాలు చేశాము, మ‌రి ఇందులో మేము సఫ‌లం అయ్యాము. మేము ఈ విష వలయాన్ని- న‌మ్మ‌కంతోను, విశ్వాసంతోను, పేద ప్ర‌జ‌ల ప‌ట్ల ప్ర‌భుత్వం పెట్టుకున్న నమ్మికతోను, వారి స్వ‌ప్నాల పట్ల మ‌రియు పేద ప్రజల క‌ఠోర శ్ర‌మ ప‌ట్ల న‌మ్మిక‌తో- ఛేదిస్తూ వున్నాము.

ద‌శాబ్దాల కింద‌ట దేశ యువ‌త ముద్ర యోజ‌న వంటి ఒక ప‌థ‌కాన్ని పొందివున్నట్లయితే న‌గ‌రాల‌కు వ‌ల‌స పోయే స‌మ‌స్య ఇంత తీవ్ర రూపాన్ని సంత‌రించుకోక‌పోయేదని అవ‌శ్యం నేను భావిస్తాను. యువ‌జ‌నులు వారికి గ‌నుక పూచీక‌త్తు లేకుండా బ్యాంకు రుణాలు ల‌భ్య‌మైన‌ప్పుడు గాని, లేదా త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కు బ్యాంకు రుణాల‌ను వారు పొందగలిగివున్న‌ప్పుడు గాని వారి న‌గ‌రాలలోనే లేదా ప‌ల్లెల‌లోనే ఉంటూ వ్యాపారం చేసుకొనే వారు. నేడు, పేద‌ల‌లో కెల్లా పేద‌లైన వారు ఎటువంటి అదనపు హామీ అక్క‌ర లేకుండానే బ్యాంకు రుణం పొందుతున్నారు. నేడు సామాన్య మాన‌వుడు సైతం ఎటువంటి ప్ర‌త్యేక వ్య‌క్తి పేరు గాని, లేదా ఫలానా వారి పేరును చెప్పనవ‌స‌రం లేకుండా నే -ముద్ర రుణం స‌హాయంతో- ఒక న‌వ పారిశ్రామిక‌వేత్త గా అవ్వొచ్చు. మరి నేడు, ప్ర‌భుత్వంలో బంధువును గాని, లేదా మిత్రుడిని గాని కలిగివుండనక్కర లేదు. నేడు, దేశంలో ప్ర‌తిభ‌కు ఎటువంటి లోటూ లేదు. ప్ర‌తి ఒక్క‌రికి ఒక రంగంలో కాకపోతే మరొక రంగంలో కొంత ప్రావీణ్యం అంటూ ఉంది; మరి ఆ ప్రావీణ్యాన్ని గుర్తించి, అత‌డిని ప్రోత్స‌హించ‌వలసిన అవసరం ఉంది. ముద్ర ప‌థ‌కం ప్ర‌జ‌ల లోని- మ‌రీ ముఖ్యంగా యువ‌కుల‌ లోని- ఈ నైపుణ్యాల‌కు బ‌లాన్ని చేకూరుస్తోంది.

ప్రావీణ్యాల‌ను ప్రోత్స‌హించిన‌ప్పుడు అవి మ‌రింతగా విక‌సిస్తాయి; జీవితంలో ఒక మార్పు చోటు చేసుకొంటోంది. ఉదాహ‌ర‌ణ‌కు, ఎవ‌రికైనా దుస్తుల పై బుటేదారు ప‌ని చేయ‌డంలో నేర్పు ఉన్న‌ట్ల‌యితే; అత‌డు లేదా ఆమె ముద్ర యోజ‌న లో భాగంగా డ‌బ్బు ను రుణంగా తీసుకొని, ఇంబ్రాయిడరి వ్యాపారాన్ని మొద‌లు పెట్ట‌వ‌చ్చు. క్ర‌మేణా అత‌డు లేదా ఆమె దుస్తుల డిజైన‌ర్ వ్యాపారాన్ని కూడా ఆరంభించవ‌చ్చును. మ‌రొకరు తన చేనేత వ్యాపారాన్ని మొదలుపెట్టుకోవడంలో స‌హాయం పొందివుండవచ్చును. ఒక ర‌కంగా చూస్తే, ముద్ర యోజ‌న సామాన్య మాన‌వుడి ప్రావీణ్యాల‌కు మెరుగులు పెట్టే ప‌నిని చేసింది. ఇది ఆయా నైపుణ్యాల‌కు గుర్తింపును తీసుకు వ‌చ్చే పనిని నెర‌వేర్చడంతో పాటు ప్ర‌జ‌ల‌కు సాధికారిత‌ ను ఇచ్చే ప‌ని ని కూడా పూర్తి చేసింది. ముద్ర యోజ‌న లో భాగంగా, 5.75 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లను 12 కోట్ల మంది ల‌బ్దిదారుల‌ కు పంచడమైంది.

ఒక్కొక్క సారి ఏమవుతుందటే ప్ర‌భుత్వం వ‌ద్ద ప‌థ‌కాల‌కు నిధులు ఉంటాయి గాని ఆ నిధులను పూర్తిగా వినియోగించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. అయితే, ముద్ర ఎటువంటి ప‌థ‌కం అంటే- అందులో రుణ మొత్తం ల‌క్ష్యాన్ని అధిగ‌మించింద‌ని తెలిస్తే- మీరు ఆశ్చ‌ర్య చ‌కితులు అవుతారు.

ఈ ప‌థ‌కంలో భాగంగా, 28 శాతం, లేదంటే సుమారు 3.25 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు మొట్ట‌మొద‌టి సారిగా వ్యాపారాన్ని మొద‌లు పెట్టిన వారికి ఇవ్వ‌డ‌మైంది. ఒక ర‌కంగా చూస్తే, వీరు ఎటువంటి వారంటే, దీర్ఘ‌కాలం పాటు నిరుద్యోగంతో స‌త‌మ‌త‌మైన అనంతరం ఉద్యోగాన్ని ద‌క్కించుకొన్నారన్న మాట.

ఈ ప‌థ‌కం లోని అత్యంత సంతృప్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే ఈ ప‌థ‌కంలో 74 శాతం మంది ల‌బ్దిదారులు మ‌హిళ‌లే. దీనికి అర్థం, 9 కోట్ల మంది ల‌బ్దిదారులు మ‌హిళ‌లుగా ఉన్నారు అని. ఒక మ‌హిళ పురోగ‌తి చెందినప్పుడు- ఆర్థిక కార్య‌క‌లాపాల‌కు ఆమె కేంద్ర బిందువు అయినప్పుడు- అటువంటప్పుడు యావ‌త్తు కుటుంబం విశ్వాసం పెంపొందుతుంది. ఆలోచ‌నా స‌ర‌ళి పూర్తిగా మారిపోతుంది; మరి స‌మాజం సాధికారిత‌ ను సంత‌రించుకొంటుంది. అదే విధంగా, ముద్ర యోజ‌న లో భాగంగా మంజూరు చేసిన మొత్తం రుణంలో 55 శాతం రుణ మొత్తాన్ని వెనుక‌బ‌డిన స‌ముదాయాల స‌భ్యుల‌కు ఇవ్వ‌డం జ‌రిగింది. అంటే, మొత్తం 12 కోట్ల మంది లబ్దిదారుల‌లో రుణ మొత్తం లోని 55 శాతం రుణం ఎస్‌సి/ఎస్‌టి, ఇంకా ఒబిసి స‌ముదాయాలకు చెందిన న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఇవ్వడమైంది. మనం ద‌శాబ్దాల త‌ర‌బ‌డి పేద‌రికం పేరిట నినాదాల‌ను వింటూ వ‌చ్చాము; పేద‌ల అభ్యున్న‌తి తాలూకు చ‌ర్చ‌ను మ‌నం విన్నాము. అయితే, ముద్ర యోజ‌న ఎటువంటి ప‌థ‌కం అంటే, ఈ పథకం వెనుక‌బ‌డిన స‌ముదాయాల‌కు ఆర్థిక శక్తిని మ‌రియు సామాజిక శ‌క్తిని ఇచ్చే ప‌నిని ఎటువంటి వివ‌క్ష‌కు తావు లేకుండా చేస్తోంది; వారికి సాధికారిత‌ ను ఇచ్చే ప‌నిని ఈ పథకం చేస్తోంది.

మధ్యకాలంలో, ఈ ఉద్యమంలో అనేక సంస్థ‌లు పాలుపంచుకొన్నాయి. ఇవాళ 110 బ్యాంకులే కాదు, 72 సూక్ష్మ ఆర్థిక సంస్థలు మ‌రియు 9 బ్యాంకింగేత‌ర ఆర్థిక కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సి లు) సైతం ముద్ర రుణాల‌ను అందిస్తున్నాయి. బ్యాంకులు ముద్ర రుణ మంజూరు ప్ర‌క్రియ‌ను స‌ర‌ళ‌త‌రం చేశాయి. అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను నింపే త‌తంగం స‌ర‌ళీకృత‌ం అయింది. అంతేకాకుండా ప‌త్రాల‌ను సేక‌రించడం ఇక ఎంతమాత్రం ఉత్కంఠ కలిగించే విషయంగా లేదు కూడాను. ఈ రోజున, స్వ‌తంత్రోపాధిని క‌లిగి వుండ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మైనటువంటి విష‌యం. మ‌రి ఈ విషయంలో స్ఫూర్తిని అందిస్తోందీ మీరే.

***