Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎకనమిక్ టైమ్స్ ప్రప౦చ వాణిజ్య శిఖరాగ్ర సదస్సులో ప్రధాని ప్రసంగం పూర్తి పాఠం

ఎకనమిక్ టైమ్స్ ప్రప౦చ వాణిజ్య  శిఖరాగ్ర సదస్సులో ప్రధాని ప్రసంగం పూర్తి పాఠం


శ్రీ వినీత్ జైన్, గౌరవనీయ అతిథులు సోదర సోదరీమణులారా

ఈ రోజు మీ అందరి మధ్య ఉన్నందుకు ఆనందంగా ఉంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర అనిశ్చితి ఎదుర్కొంటోంది. ఇంత కీలకమైన సమయంలో భారతదేశానికి చెందిన వారే కాకుండా విదేశీ అతిథులు కూడా ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇంత దూరం రావడం నాకు సంతోషదాయకం. వివిధ దేశాల అనుభవాల నుంచి మేం ప్రయోజనం పొందగలమని నేను విశ్వసనీయంగా చెప్పగలను. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన పురోగతి, దేశంలోని వ్యాపార వాతావరణంపై నా ఆలోచనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

పౌరుల జీవితాల్లో అసలైన పరివర్తన తీసుకురాగలిగినవే నిజమైన సంస్కరణలని నేను గతంలో చెప్పిన మాటలు మీలో కొందరికైనా గుర్తుండే ఉంటాయి. గతంలో ప్రకటించినట్టుగానే “పరివర్తన కోసమే సంస్కరణ” అన్నది నా లక్ష్యం.

మౌలికాంశాల నుంచి నా ప్రసంగం ప్రారంభించాలనుకుంటున్నాను. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ప్రత్యేకించి వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలకు మౌలిక మార్గదర్శక సూత్రం ఏమిటి?

విలువ జోడించడం ద్వారా మరింత మెరుగైన ఫలితం సాధించగల రీతిలో ప్రకృతి వనరులు, మానవ వనరుల వినియోగాన్ని పెంచడం తొలి అంశం. అంటే వనరుల కేటాయింపు ద్వారా సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. నిర్వహణాపరమైన సామర్థ్యం కూడా పెరగాలి. అనవసరమైన అదుపు, వ్యత్యాసాలు తొలగించడం ఈ కృషిలో ప్రధాన భాగం.

పౌరుల పురోగతికి కొత్త అవకాశాలు కల్పించడం, మరిన్ని మెరుగైన అవకాశాలు వారి ముందు ఆవిష్కరించడం రెండో అంశం. ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న పౌరులకు కొత్త అవకాశాలు ఆమ్లజని వలె ఉపయోగపడతాయి. ఆ అవకాశాలకు కొదవ లేదన్న భరోసా కల్పించడం మా ధ్యేయం. తేలిక మాటల్లో చెప్పాలంటే అదే సబ్కా సాథ్, సబ్కా వికాస్.

సగటు పౌరులు ప్రత్యేకించి పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం మూడో అంశం. జీవితంలో నాణ్యతకు ఆర్థిక శాస్త్ర కోణమే కాదు…ఆర్థిక అ౦శ౦ అనే కోణం కూడా ఉంది. ప్రభుత్వం ప్రగతిశీలకమై ఉండి గౌరవనీయమైన, సమర్థవంతమైన పాలన అందిస్తున్నట్టయితే దాని వల్ల అత్యధికంగా లాభపడేది పేదలే. అసమర్థ పాలన వల్ల ఇతరుల కన్నా పేదలే అధికంగా దెబ్బ తింటారు. అందుకే ఆర్థిక సంస్కరణల్లో మెరుగైన పాలన అందించడం ప్రధానమైనది.

మనం అంతర్జాతీయంగా అనుసంధానమైన ప్రపంచంలో నివసిస్తున్నాం. ఒక దేశం చర్యలు మరో దేశాన్ని దెబ్బ తీస్తాయి. వాణిజ్యం, పెట్టుబడులే కాదు…కాలుష్యం, పర్యావరణపరమైన చర్యలు కూడా ఇందులో భాగం. ఏ ఒక్క మనిషి ద్వీపకల్పం కానేకాదని ఒక కవి చెప్పారు. ఈ రోజుల్లో ఏ ఒక్క దేశం ఏకాకిగా మనుగడ సాగించలేదు. రాజకీయాలేవైనా స్థానికమేననేది తరచు వినిపించే మాట. నా దృష్టిలో ఆర్థికాంశాలన్నీ అంతర్జాతీయమైనవి. దేశీయ వ్యవహారాలు, అంతర్జాతీయ వ్యవహారాల మధ్య తారతమ్యం మరింత త్వరితంగా తొలగిపోతోంది. ఆధునిక యుగంలోని ఏ దేశం ఆర్థిక విధానాలైనా దేశీయ ప్రాధాన్యతలని దృష్టిలో ఉంచుకుంటే చాలదు. భారత విధానాలేవైనా ఇతర ప్రపంచానికి కూడా సానుకూలమైన ఫలితాలు అందించేవిగానే ఉండాలన్నది నా లక్ష్యం.

ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆర్థిక ప్రతిష్ఠంభన ఏర్పడిన ప్రస్తుత వాతావరణంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ పోషించాల్సిన పాత్ర ఏమిటో మీలో చాలా మందికి తెలుసు. గత నాలుగు త్రైమాసికాలుగా ప్రపంచంలో త్వరిత గతిన విస్తరిస్తున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కొనుగోలు శక్తి రీత్యా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు భారత్ 7.4 శాతం వాటా అందించింది. కాని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి 12.5 శాతం వాటా అందించింది. అంటే ఇతర దేశాలతో పోల్చితే 68 శాతం అధిక వృద్ధిని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు భారత్ అందించింది. అంతర్జాతీయంగా ఎఫ్డిఐల్లో క్షీణత ఏర్పడిన వాతావరణంలో కూడా గత 18 నెలల కాలంలో భారత్కు ఎఫ్డిఐల రాక 39 శాతం పెరిగింది.

ఏ దేశం వాటా అయినా ఆర్థిక సిద్ధాంతాలకు అతీతంగానే జరుగుతుంది. వాతావరణ మార్పుల నుంచి మన భూగోళాన్ని పరిరక్షించడం ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు. వాతావరణ వినాశానికి కారణమయ్యే వ్యర్థ పదార్థాలను ఒక దేశం తగ్గించినట్టయితే ఇతరులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ కారణంగానే ఇటీవల జరిగిన సిఓపి 21 శిఖరాగ్రంలో భూగోళం విస్తృత సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ ఎన్నో విప్లవాత్మక కట్టుబాట్లను ప్రకటించింది. చరిత్రలో అభివృద్ధిపథంలో పయనిస్తున్న ఏ దేశాన్ని చూసినా ఆ క్రమంలో తలసరి వ్యర్థాలను పెంచుకుంటూనే పోయింది. మేం చరిత్రను తిరగరాయాలనుకుంటున్నాం. త్వరితగతిన అభివృద్ధి సాధిస్తూనే 2030 నాటికి ఉద్గారాలను 33 శాతం మేరకు తగ్గించాలని మేం నిర్ణయించాం. ఇప్పటికే అతి తక్కువ ఉద్గారాలను విసర్జిస్తున్న ఒక దేశానికి వాటిని ఇంత భారీగా తగ్గించడం అనేది అతి సాహసోపేతమైన లక్ష్యమే. 2030 నాటికి మా విద్యుత్ ఉత్పత్తిలో 40 శాతం శిలాజేతర ఇంధనాల నుంచే జరుగుతుంది. అలాగే 2.5 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్తో సమానమైన అదనపు కార్బన్ సింక్ను(కార్బన్నిక్షేపాలు) నిర్మించాలనుకుంటున్నాం. 2030 నాటికి అదనపు అడవుల పెంపకం ద్వారా ఇది సాధించాలన్నది మా లక్ష్యం. తలసరి భూలభ్యత అతి తక్కువగా ఉన్న దేశం నుంచి ఇంత సాహసోపేతమైన కట్టుబాట్లు వచ్చాయి. కర్కాటక, మకర రేఖల మధ్య ఉన్న121 దేశాలు భాగస్వాములుగా అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటులో భారత్ ప్రధాన చోదకశక్తిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల విభాగంలో జరుగుతున్న పరిణామాల వల్ల ఆఫ్రికా, దక్షిణ అమెరికా ప్రాంత దేశాలు లబ్ధి పొందేందుకు ఇది సహాయకారిగా ఉంటుంది.

ఇంతకు ముందు నేను ప్రకటించిన మూడు విధానపరమైన లక్ష్యాల గురించి మరోసారి ప్రస్తావిస్తున్నాను. భారత ఆర్థిక వ్యవస్థ పనితీరుతో ప్రారంభిస్తాను. ఆర్థికవేత్తలు జిడిపి వృద్ధిరేటు, ద్రవ్యోల్బణం, పెట్టుబడులు, విత్తలోటు వంటి ఆర్థిక సూచిలపై అధికంగా మాట్లాడతారు. మా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వృద్ధిరేటు పుంజుకుంది. ద్రవ్యోల్బణం తగ్గింది. విత్తలోటు కూడా అదుపులోకి వచ్చింది. ప్రపంచ వాణిజ్యంలో మందగమనం ఏర్పడినా విదేశీ చెల్లింపుల లోటు కూడా తగ్గుదలలోనే ఉంది.

కాని ఈ స్థూల ఆర్థిక సూచిలన్నీ మేం చేస్తున్న కృషికి, మే సాధించిన విజయాలకు సంబంధించి పాక్షిక చిత్రాన్ని మాత్రమే ఆవిష్కరిస్తాయి. స్థూల అంశాల్లో ఇంకా గందరగోళమే ఉన్నదని కొందరంటూ ఉంటారు. కాని వాటిలో అధిక అంశాలను భగవంతుడే నిర్దేశిస్తున్నాడని నేను భావిస్తాను. కాని వాటిలో ఎక్కువ సానుకూలంగా ఉన్నప్పుడు అవి విజయాల్లో భాగస్వాములవుతాయి.

కొన్ని అంశాలు మీకు ఆసక్తికరంగా ఉండవచ్చు. అవి ఒక సారి చూద్దాం…

– 2015 సంవత్సరం భారత్ చరిత్రలో అత్యధికం యూరియా ఉత్పత్తిని సాదించింది.

– 2015 సంవత్సరంలో ఇథనాల్ కలిపిన ఇంధనాలను అత్యధిక స్థాయిలో ఉత్పత్తి చేయడం ద్వారా చెరకు రైతులకు లబ్ధి చేకూరింది.

– 2015 సంవత్సరంలో గ్రామీణ పేదలకు అధిక సంఖ్యలో వంటగ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి.

– 2015 సంవత్సరంలో చరిత్రలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి నమోదయింది.

– 2015 సంవత్సరంలో చరిత్రలో గరిష్ఠ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అయింది.

– 2015 సంవత్సరంలో భారత్లోని ప్రధాన పోర్టులన్నీ అత్యధికంగా వస్తు రవాణా నమోదు చేశాయి.

– 2015 సంవత్సరంలో భారత్లోని పోర్టులు చరిత్రలోనే త్వరితగతిన టర్న్ అరౌండ్ సాధించాయి.

– 2015 సంవత్సరంలో భారతీయ రైల్వే పెట్టుబడి వ్యయాలు చరిత్రలోనే గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి.

– 2015 సంవత్సరంలో భారత హైవేలు అత్యధిక కిలోమీటర్ల సామర్థ్యాన్ని సాధించాయి.

– 2015 సంవత్సరంలో భారత్ చరిత్రలో గరిష్ఠ స్థాయిలో మోటారు వాహనాలను ఉత్పత్తి చేసింది.

– 2015 సంవత్సరంలో భారత్ చరిత్రలో గరిష్ఠంగా సాఫ్ట్వేర్ ఎగుమతులు సాధించింది.

– 2015 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు వ్యాపార నిర్వహణ సూచిల్లో భారత్ చరిత్రలో అత్యధిక ర్యాంకింగ్ సాధించింది.

– 2015 సంవత్సరంలో భారత విదేశీ మారకం నిల్వలు చారిత్రక గరిష్ఠ స్థాయిలకు చేరాయి.

ఇంతకు ముందు సంవత్సరాల్లో వీటిలో అధిక సూచిలు ప్రతికూల దిశలో పయనించాయని గుర్తుంచుకోవాలి. కాని ఇప్పుడు ఈ సూచిలన్నీ భారీ మార్జిన్లతో మెరుగుపడడం విశేషం. ఉదాహరణకి 2013-14లో 3500 కిలోమీటర్ల నిడివి గల జాతీయ రహదారుల కాంట్రాక్టులు మంజూరు చేయగా ఎన్డీయే ప్రభుత్వం తొలి ఏడాది కాలంలో అంతకన్నా రెట్టింపు స్థాయిలో 8000 కిలోమీటర్ల రహదారి కాంట్రాక్టులు మంజూరు చేసింది. ఇంత భారీగా కాంట్రాక్టులు మంజూరు చేయడం చరిత్రలోనే ఇది తొలిసారి. ఈ ఏడాది పదివేల కిలోమీటర్ల రహదారి కాంట్రాక్టులు మంజూరు చేయాలని భావిస్తున్నాం.

మేం సాధించిన ఇతర విజయాలు కూడా ప్రస్తావిస్తాను…

భారత షిప్పింగ్ కార్పొరేషన్ 2013-14 సంవత్సరంలో 275 కోట్ల రూపాయల నష్టం నమోదు చేయగా 2014-15 సంవత్సరంలో ఒక్కసారిగా 575 కోట్ల రూపాయల టర్న్ అరౌండ్తో 201 కోట్ల రూపాయల నికరలాభం ఆర్జించింది.

2013-14 సంవత్సరంలో భారత్ అంతర్జాతీయ ఇంధన సామర్థ్య ఎల్ఇడి లైట్లలో కేవలం 0.1 శాతం వాటా కలిగి ఉండగా 2015-16లో 12 శాతం వాటా సాధించింది. భారత ఎల్ఇడి బల్బులు ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఎల్ఇడి బల్బుల అంతర్జాతీయ సగటు ధర మూడు డాలర్లుండగా భారత్లో డాలర్ కన్నా తక్కువ ధరకే లభిస్తున్నాయి. 2013-14లో భారత్ 947 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభించగా 2015-16లో ఇది 2500 మెగావాట్లకు పెరిగింది. 2016-17లో 12 వేల మెగావాట్లకు చేరగలమని భావిస్తున్నాం.

అంతర్జాతీయ సోలార్ ఎనర్జీ మార్కెట్లో భారత్ వాటా 2014లో 2.5 శాతం ఉండగా 2016 నాటికి 15 శాతానికి చేరనుంది. స్వచ్ఛ ఇంధనాల్లో భారత్ వాటా పెరగడమే కాదు…భారీ ఉత్పత్తి వల్ల ఉత్పత్తిదారులు ధరలు తగ్గించడంతో ప్రపంచదేశాలన్నీ లాభపడ్డాయి. 2013-14లో భారత్ 16,800 కిలోమీటర్ల నిడివి గల ట్రాన్స్మిషన్ లైన్లను జత చేయగా 2014-15 నాటికి 22 వేల కిలోమీటర్ల నిడివి గల లైన్లు జత అయ్యాయి. టాన్స్మిషన్ లైన్లలో 32 శాతం వృద్ధి చోటు చేసుకుంది. విద్యుత్ వ్యయాలు 30 శాతం తగ్గాయి.

ఇంక రెండో అంశం అవకాశాల కల్పన విషయానికి వద్దాం. సాధికారత కల్పించే రాజకీయాలను నేను విశ్వసిస్తాను. సాధికారత ద్వారా మాత్రమే ప్రజల జీవితాలు మెరుగుపడతాయన్నది నా ప్రగాఢ విశ్వాసం. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమం మేం ప్రారంభించాం. దీని వల్ల బ్యాంకింగ్ సదుపాయాలు ఏ మాత్రం లేని రెండు వందల మిలియన్ ప్రజలు బ్యాంకింగ్తో అనుసంధానం అయ్యారు. కొంత మంది నిరాశావాదులు ఈ ఖాతాల్లో ఒక్క పైసా కూడా నిల్వ ఉండదని ప్రారంభంలో భావించారు. ఇప్పుడు ఈ ఖాతాల్లో నగదు నిల్వ 30 వేల కోట్ల రూపాయలు లేదా నాలుగు బిలియన్ డాలర్లు దాటిపోయింది. ఆ ఖాతాదారులకు మేం అదిక సంఖ్యలో డెబిట్ కార్డులు కూడా జారీ చేశాం. దేశీయ బ్రాండ్ క్రెడిట్ కార్డు వాటా 33 శాతం పైబడి ఉన్న అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటిగా మారింది.

సరికొత్త, సమగ్ర పంటల బీమా కార్యక్రమాన్ని మేం ఆవిష్కరించాం. రైతుల అదుపులో లేని నష్టాలకు ప్రభుత్వం రక్షణ కల్పించడంతో రైతాంగం తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాగల సాధికారత లభిస్తుంది.

రైతులకు సాధికారత కల్పించడంలో భాగంగా మేం సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేశాం. ఏ భూమి స్వభావం ఏమిటన్న విషయంలో ఈ కార్డు రైతుకి సరైన సమాచారం అందించగలుగుతుంది. భూముల్లో రసాయనాలు, ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్నిం పెంచుకోవడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు ఈ కార్డులు సహాయకారిగా ఉంటాయి.

ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు సాంప్రదాయికంగా భారతదేశం బలాల్లో ఒకటి. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు దీన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. “బిజినెస్”, “ప్రాఫిట్స్” చెడు మాటలుగా మారిపోయాయి. మేం దాన్ని మార్చేశాం. పరిశ్రమలకు, శ్రమశక్తికి మనం విలువ ఇవ్వడం తప్పనిసరి. మేం చేపట్టిన ముద్ర నుంచి స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా వరకు వివిధ కార్యక్రమాలు కష్టపడి శ్రమించే వారికి, ఔత్సాహికులకు ప్రోత్సాహం ఇచ్చేవే. ఈ కృషిలో భాగంగా మేం షెడ్యూల్డు కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం. తమ అదృష్టాన్ని తామే రచించుకోగల సాధికారత వారికి కల్పించాం.

నగరాలు, పట్టణాల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పించడం అత్యంత కీలకం. పట్టణ ప్రాంతాలే అభివృద్ధికి చోదక శక్తులు. స్మార్ట్ సిటీ పథకం ద్వారా పట్టణాలు, నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రయత్నం ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో ఎన్నో అంశాలు తొలిసారిగా చోటు చేసుకుంటున్నాయి. మొట్టమొదటిసారిగా నగరాల్లోని కొన్ని ప్రాంతాలను ఒక క్రమబద్ధమైన రీతిలో సమగ్రంగా అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాంతాలు నగరంలోని ఇతర ప్రాంతాలకు మార్గదర్శకం చూపే లైట్హౌస్లుగా వ్యవహరిస్తాయి. పౌరులతో సంప్రదింపులు నిర్వహించడం ద్వారా ఇలాంటి చొరవ చేపట్టడం కూడ చరిత్రలో ఇదే ప్రథమం. మై గవర్నమెంట్ వేదికగా జరిగిన చర్చలు, పోటీలు, పోల్స్, బ్లాగ్లు, ప్రసంగాల ద్వారా 2.5 మిలియన్ ప్రజలు భాగస్వాములయ్యారు. పట్టణ ప్రణాళికలో అత్యున్నత స్థాయి నుంచి అట్టడుగు స్థాయి వరకు అందరినీ భాగస్వాములను చేయడంలో సాంప్రదాయానికి భిన్నంగా జరిగిన అతి పెద్ద చొరవ ఇది. మంత్రుల స్థాయిలో చర్చల ద్వారా కాకుండా ఒక పోటీ నిర్వహించడం ద్వారా నిధులు కేటాయించడం కూడా ఇదే ప్రథమం. పోటీతో కూడిన సహకార ఫెడరలిజంకు ఇది చక్కని ఉదాహరణ.

నేను గతంలోనే చెప్పినట్టుగా ప్రభుత్వం పాత్ర ఆర్థికాంశాలకే పరిమితం కాదు. ప్రజాసంక్షేమానికి భరోసా ఇచ్చే ఎన్నో ఆర్థికేతర అంశాలున్నాయి. సత్పరిపాలన అత్యంత కీలకం. పరివర్తిత సామర్థ్యం గల ఎన్నో చర్యలు మేం చేపట్టాం. మితిమీరిన అవినీతితో కూడిన శకానికి తెర దించాం. భారతీయులు, విదేశీయులు, ప్రభుత్వ విమర్శకులు, మద్దతుదారులు అందరూ అంగీకరిస్తున్న అంశం ఇది. ఇది తేలికైన విజయం కాదు. జాతీయ బ్యాంకుల్లో ప్రభుత్వ జోక్యాన్ని, క్రోనీ కాపిటజలిజంకు అంతం పలికాం. తొలిసారిగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సారథులుగా ప్రైవేటు రంగం వ్యక్తులను ఎంపిక చేశాం. వివిధ కుంభకోణాలకు ఆలవాలం అయిన సహజ వనరుల కేటాయింపు విధానాన్ని మార్చి వేలం విధానం ప్రవేశపెట్టాం.

సబ్సిడీల తగ్గింపుపై పలువురు నిపుణులు పలు అభిప్రాయాలు ప్రకటిస్తున్నారు. జనధన్ యోజన ద్వారా బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి తేవడంతో సబ్సిడీల లీకేజికి తెర పడింది. ఇంధన సబ్సిడీల నిర్వహణ ప్రతీ ఒక్క వర్థమాన దేశానికి పెద్ద సవాలు. వంట గ్యాస్ ధరలను మేం విజయవంతంగా అదుపులోకి తీసుకురాగలిగాం. ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రత్యక్ష నగదు బదిలీ పథకం మేం అమలుపరుస్తున్నాం. ఈ పథకం ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే సబ్సిడీలు బదిలీ చేస్తున్నాం. ఎలక్ర్టానిక్ వెరిఫికేషన్ ద్వారా బహుళ, బోగస్ కనెక్షన్లను తొలగించాం. అనర్హులైన లబ్ధిదారులను తొలగించి అసలు, సిసలు లబ్ధిదారులకు సబ్సిడీ ప్రయోజనాలు అందించేందుకు, సబ్సిడీ భారాన్ని గణనీయంగా తొలగించేందుకు ఇది సహాయపడింది.

సబ్సిడీ భారం అధికంగా ఉన్న మరో ఇంధనం కిరోసిన్. వంటచేసుకునేందుకు, దీపాలు వెలిగించుకునేందుకు పేదలు విరివిగా ఉపయోగించే ఈ ఇంధనాన్ని రాష్ర్టప్రభుత్వాలు సరఫరా చే్స్తాయి. కాని భారీ పరిమాణంలో సబ్సిడీ కిరోసిన్ దారి మళ్ళుతున్నదనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయి. దేశంలోని మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కిరోసిన్ను మార్కెట్ ధరలకే విక్రయిస్తున్నాం. మార్కెట్ ధరకు, సబ్సిడీ ధరకు మధ్య గల వ్యత్యాసాన్ని లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నాం. ఆధార్ సహాయంతో బయోమెట్రిక్ విధానంలో బ్యాంకు ఖాతాల ద్వారా పేదలను తేలిగ్గా గుర్తించగలుగుతున్నాం. దీని వల్ల అనర్హులైన, డూప్లికేట్, బోగస్ వినియోగదారులను తేలిగ్గా గుర్తించడం సాధ్యం అవుతోంది. ఈ విధానంలో కూడా అనవసర సబ్సిడీల నిర్మూలన సాధ్యమవుతోంది. ఈ విధంగా ఆదా అవుతున్న సొమ్ములో 75 శాతం రాష్ర్టాలకే బదిలీ చేస్తున్నాం. ఈ విధానాన్ని అన్ని జిల్లాలకు వర్తింపచేసేందుకు రాష్ర్టప్రభుత్వాలను ప్రోత్సహిస్తున్నాం.

చండీగఢ్ అనుభవం ఇది సాధ్యమేనని నిరూపించింది. 2014 ఏప్రిల్లో చండీగఢ్లో 68 వేల మంది సబ్సిడీ కిరోసిన్ వినియోదారులున్నారు. 10,500 కొత్త గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశాం. గ్యాస్ కనెక్షన్లున్న 42 వేల కుటుంబాలకు కిరోసిన్ కోటాలు నిలిపివేశాం. 2016 మార్చి 31 నాటికి చండీగఢ్ను కిరోసిన్ వినియోగం లేని నగరంగా ప్రకటించనున్నాం. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇప్పటివరకు కిరోసిన్ వినియోగాన్ని తొలగించడం ద్వారా 73 శాతం పొదుపు సాధించాం.

రెండు రోజుల క్రితం వివిధ పింఛను పథకాల అమలు తీరుపై రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులతో చర్చించాను. రెండేసి పింఛన్లు పొందుతున్నవారిని, అనర్హులను తొలగించడం ద్వారా పింఛనుల బట్వాడాలో లీకేజిలు గణనీయంగా తగ్గించినట్టు గుర్తించి నేను చాలా ఆశ్చర్యపోయాను. కొన్ని రాష్ర్టాల్లో పేదలకు ఎలాంటి హాని కలగకుండానే సబ్సిడీలను 12 శాతం తగ్గించగలిగారు.

ఎరువుల సబ్సిడీ మరొకటి. భారీ పరిమాణంలో సబ్సిడీ యూరియా రసాయనాల తయారీకి అక్రమంగా తరలిస్తున్నారు. ఈ దుర్వినియోగాన్ని నిలువరించేందుకు అత్యంత తేలికపాటి పరిష్కారంగా వేపపూత పూసిన యూరియా సరఫరా చే్సే విధానం ప్రవేశపెట్టాం. ఆర్గానిక్ విధానంలో యూరియాకు వేపపూత పూయడం వల్ల యూరియా ఇతర అవసరాలకు ఉపయోగపడదు. దేశీయంగా ఉత్పత్తి అయిన, దిగుమతి చేసుకుంటున్న యూరియాను నూరు శాతం వేప పూతతోనే పంపిణీ చేస్తున్నాం. ఇందుకోసం వేప ఆకుల సేకరణ గ్రామీణ మహిళలకు ఒక ఆదాయ వనరుగా మారింది.

మీలో చాలా మంది ఆర్థికవేత్తలున్నారని నాకు తెలుసు. ప్రజలు మొండిగా వ్యవహరిస్తారని, తాము అర్హులు కాని ప్రయోజనాలు వదులుకునేందుకు సిద్ధం కారని ఆర్థికవేత్తల విశ్వాసం. మీరు సబ్సిడీ పొందే అర్హత గల పేదలు కాకపోతే వంటగ్యాస్ సబ్సిడీ వదులుకోవాలని నేను ప్రజలకు పిలుపు ఇచ్చాను. ఇలా వదులుకున్న ప్రతి ఒక్క గ్యాస్ కనెక్షన్ స్థానంలో ఒక పేద కుటుంబానికి కొత్త గ్యాస్ కనెక్షన్ మంజూరు చేస్తామని కూడా మేం హామీ ఇచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు వంట కోసం కట్టెలు లేదా బయోమాస్ ఉపయోగించడం వల్ల వచ్చే పొగతో చాలా బాధ పడుతున్నారు. దీన్ని నివారించడానికి ఇచ్చిన పిలుపు నిర్బంధం ఏమీ కాదు. ఎవరైనా స్వచ్ఛందంగానే ఇందులో భాగస్వాములు కావచ్చు. ఈ పిలుపునకు స్పందించి 6.5 మిలియన్ ప్రజలు సబ్సిడీ వదులుకున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎలాంటి నిర్బంధం లేకపోయినా ఇంత మంది ముందుకు రావడం నా హృదయాన్ని కదిలించింది. వారి సహృదయానికి స్పందనగా మేం ఇప్పటికే పేదలకు 5 మిలియన్ కొత్త గ్యాస్ కనెక్షన్లు మంజూరుచేశాం. ప్రజాస్ఫూర్తికి, పౌరుల కార్యాచరణలోని శక్తికి, భారతీయుల ఆత్మవిశ్వాసానికి ఇది నిదర్శనం. ఖాదీ విషయంలో కూడా పౌరుల స్పందన ఇలాగే ఉంది.ప్రతీ ఒక్కరూ ఒక్క ఖాదీ వస్ర్తం అయినా కొనుగోలు చేయాలని 2014 అక్టోబర్ లో నేను పిలుపు ఇచ్చాను. అప్పటి నుంచి ఖాదీ అమ్మకాలు విశేషంగా పెరిగాయి.

నష్టాలతో నడుస్తున్న విద్యుత్ పంపిణీ కంపెనీల సమస్యను పరిష్కరించేందుకు మేం ఒక కొత్త పంథా అనుసరించాం. ఉదయ్ కార్యక్రమం కింద ఆయా కంపెనీల రుణభారాన్ని రాష్ర్టప్రభుత్వాలే తీసుకుని స్వల్పకాలిక రుణాలు మంజూరు చేశాయి. కట్టుదిట్టమైన షరతులతో పంపిణీ సంస్థలు, రాష్ర్టప్రభుత్వాల మధ్య దీర్ఘకాలిక బంధం ఏర్పడేందుకు ఇది దోహదపడింది. దీని వల్ల ప్రజలకు నిరంతరాయంగా (24×7) విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుంది.

అటు ప్రజలకు, ఇటు వ్యాపారాలకు అడుగడుగునా అవరోధం అవుతున్న కాలం చెల్లిపోయిన చట్టాలు మన దేశంలో లెక్కలేనన్ని ఉన్నాయి. అలాంటి వాటిని గుర్తించి నిర్మూలించే ప్రక్రియకు మేం శ్రీకారం చుట్టాం. కేంద్రస్థాయిలో అలాంటివి 1827 చట్టాలున్నట్టు మేం గుర్తించాం. వాటిలో 125 ఇప్పటికే ఉపసంహరించాం. మరో 758 చట్టాల ఉపసంహరణకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి.

సత్పరిపాలనకు మేం తీసుకున్న చర్యల్లో కొన్నింటిని మాత్రమే ఇక్కడ ఉదహరించాను. సత్పరిపాలన, అవినీతి తగ్గింపు ప్రయోజనం దీర్ఘకాలికంగా ఉంటాయి. ఈ విధానాలను సన్నిహితంగా పరిశీలించినట్టయితే వాటిలో అవి ప్రముఖమైనవే తప్పితే ఏ ఒక్కటి జనాకర్షణతో కూడినవి కావు. స్వచ్ఛమైన, హేతుబద్ధ పరిపాలన లక్ష్యంతోనే ఈ మార్పులన్నీ మేం చేపట్టాం.

వంటగ్యాస్, ఎరువులు, కిరోసిన్ సబ్సిడీల గురించి నేను ప్రస్తావించాను. వాటిపై నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఏదైనా ప్రయోజనాన్ని రైతులకు, పేదలకు అందిస్తే దాన్ని సాధారణంగా సబ్సిడీగా వ్యవహరిస్తారు. అలాంటి ప్రయోజనమే పరిశ్రమ లేదా వాణిజ్య వర్గాలకు అందిస్తే దాన్ని “ప్రోత్సాహకం” లేదా “రాయితీ”గా అభివర్ణిస్తారు.

ఈ పదప్రయోగంలో మన తేడా మన వైఖరిలో మార్పునకు సంకేతమా అని పరిశీలించుకోవాలి. సంపన్నులకు అందించే సబ్సిడీలను సరళమైన పదాలతో ఎందుకు వ్యవహరించాలన్నదే నాప్రశ్న. ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల ఖజానాకు ఏర్పడుతున్న నష్టం 62 వేల కోట్ల రూపాయలు. స్టాక్ ఎక్స్ఛేంజిల్లో ట్రేడయ్యే షేర్లపై ఇచ్చే డివిడెండ్లు, దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు పేద ప్రజలకు ఉద్దేశించినవి కాకపోయినా వాటిపై పూర్తి స్థాయి పన్ను మినహాయింపు ఇస్తున్నాం. దాన్ని ఈ 62 వేల కోట్లలో చేర్చలేదు. అలాగే కొన్ని దేశాలతో కుదుర్చుకున్న ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందాల వల్ల రెండు చోట్లా పన్నులు లేని పరిస్థితి కూడా ఉంది. ఆ ప్రయోజనాన్ని కూడా ఈ 62 వేల కోట్లలో చేర్చలేదు. సబ్సిడీలు తగ్గించాలని వాదించే వారు వీటి గురించి అరుదుగా ప్రస్తావిస్తారు. ఎందుకంటే వారు వాటిని పెట్టుబడులకు అందించే ప్రోత్సహకంగా పరిగణిస్తారు. ఎరువుల సబ్సిడీని వ్యవసాయ ఉత్పత్తి కోసం అందిస్తున్న ప్రోత్సాహకంగా పేర్కొంటే కొందరు నిపుణులు దాన్ని భిన్న కోణంలో చూడడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం.

సబ్సిడీలన్నీ మంచివేనని నేను వాదించడంలేదు. కాని ఇలాంటి అంశాల్లో సైద్ధాంతిక ధోరణులు పనికిరాదన్నదే నా అభిప్రాయం. ఇలాంటి విషయాల్లో ఆచరణీయంగా మనం వ్యవహరించాలి. సబ్పిడీ అని వ్యవహరించినా వ్యవహరించకపోయినా చెడు సబ్సిడీలను మనం తొలగించాల్సి ఉంటుంది. పేదలు, అవసరంలో ఉన్న వారి కోసం కొన్ని సబ్సిడీలు అవసరం కావచ్చు. సబ్సిడీలను పూర్తిగా తొలగించడం కన్నా వాటిని హేతుబద్ధం చేసి అవసరంలో ఉన్న వారికి మాత్రమే అందేలా చూడాలన్నదే నా ధ్యేయం.

గత 19 నెలల కాలంలో చాలా సాధించాం. ఇంకా మా నుంచి ఎంతో ఆశిస్తున్నారు. ముందు ఎన్నో సవాళ్ళున్నాయి. రానున్న కాలంలో మేం విజయం సాధిస్తామని, విజయవంతంగా త్వరితంగా పురోగమిస్తామని నాకు విశ్వాసం ఉంది. సాధారణ ప్రజలకు లాభం సమకూర్చే విధంగా మేం పని చేస్తాం.

దేశ ప్రజలు సానుకూల దృక్పథంతో ఆలోచించగలిగినప్పుడు, పురోగమన పథంలో వేసే ప్రతి అడుగులోనూ మాకు అండగా నిలిచినప్పుడు ఎలాంటి కష్టమైన సవాళ్ళైనా పెద్ద అవకాశాలుగా మారిపోతాయి. నాలోని ఈ విశ్వాసం శూన్యంలో నుంచి వచ్చింది కాదు. గత 19 నెలల అనుభవ సారం ఇది.

అప్పుడే కరెన్సీ సంక్షోభం నుంచి కోలుకుంటున్న ఎదురీతలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మాకు వారసత్వంగా లభించింది. కాని రెండేళ్ళ లోగానే విదేశీ పెట్టుబడులు, వృద్ధిలో అంతర్జాతీయ దేశాల్లో అగ్రస్థాయికి భారత్ను చేర్చగలిగాం. మిత్రులారా, మనం ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది. ఆ ప్రయాణానికి చక్కని ప్రారంభం ఏర్పడింది. అన్ని సుదూర ప్రయాణాల వలెనే ఈ ప్రయాణంలో కూడా ఎన్నో అవరోధాలు ఎదురుకావచ్చు. కాని మా లక్ష్యాన్ని చేరుకుంటామన్న నమ్మకం నాకుంది. సరికొత్త భవిష్యత్తు, నవభారత ఆవిష్కారానికి అనువైన వాతావరణం మేం కల్పించాం.

– ప్రతీ ఒక్క శిశువు క్షేమంగా జన్మించగల, బాలింత, శిశు మరణాలు ప్రపంచ సగటు కన్నా తక్కువగా ఉండే భారత్

– ఏ ఒక్కరూ నిరాశ్రయులుగా ఉండని భారత్

– ప్రతి ఒక్క గ్రామం, ప్రతీ పాఠశాల, ప్రతి రైలు, ప్రతి వీధి, ప్రతి ఇల్లు పరిశుభ్రంగా, పారిశుధ్యంతో విలసిల్లే భారత్

– ప్రతి ఒక్క భారతీయ పౌరుడు చక్కని ఆరోగ్యంతో జీవించగల భారత్

– నిరంతరాయంగా (24×7) విద్యుత్ సరఫరా ఉన్న భారత్

– ప్రతీ ఒక్క నగరం చలనశీలంగా, జీవనానికి అనుకూలంగా ఉన్న భారత్

– బాలికలందరికీ చక్కని విద్యావకాశాలు, సాధికారత గల భారత్

– ప్రతి ఒక్క బాలుడు, బాలికలకు నైపుణ్యాలు అందించి ఉత్పాదకమైన ఉపాధికి సిద్ధంగా ఉండే భారత్

– చక్కని వేతనాలతో కూడిన ఉద్యోగావకాశాలు కల్పించగల వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలతో కూడిన భారత్

– ప్రతీ ఒక్క వ్యవసాయదారుడు తనకు అందుబాటులో ఉన్న భూమి స్వభావాన్ని తెలుసుకుని, చక్కని వ్యవసాయ ఉపకరణాలు అందుబాటులో ఉండి అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉత్పత్తులు అందించగల భారత్

– భారీ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికులందరికీ పెట్టుబడులు, రుణాలు అందుబాటులో ఉండే భారత్

– నవ్యతతో కూడిన సొల్యూషన్లు అందించగల స్టార్టప్లు, వ్యాపారాలకు స్థానం ఉన్న భారత్

– డిజిటల్ ఎకానమీలో అంతర్జాతీయంగా ముందువరుసలో ఉన్న భారత్

– ప్రపంచాన్ని స్వచ్ఛ ఇంధనాల దిశగా నడిపించగల భారత్

– ప్రతి పౌరునికి మౌలిక భద్రత, వృద్ధాప్య పింఛన్లు అందుబాటులో ఉన్న భారత్

– ప్రభుత్వాన్ని విశ్వసించగల, ప్రభుత్వ విశ్వాసం పొందగల పౌరులతో కూడిన భారత్

అన్నింటి కన్నా మిన్నగా పౌరులు తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగి౦చుకోగల అవకాశాలు కల్పి౦చే విధ౦గా భారత్ రూపా౦తర౦ చె౦ది౦ది.

ధన్యవాదాలు….

***