Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అజామ్‌ఘ‌డ్‌లో పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర‌మోదీ

అజామ్‌ఘ‌డ్‌లో పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర‌మోదీ


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు (జూలై 14,2018) ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అజామ్‌ఘ‌డ్‌లో పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వే కు శంకుస్థాప‌న చేశారు. 

ఈ సంద‌ర్భంగా పెద్ద‌సంఖ్య‌లో హాజ‌రైన ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఈ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం రాష్ట్ర అభివృద్ధి ప్ర‌యాణంలో కొత్త అధ్యాయానికి శ్రీ‌కారంగా అభివ‌ర్ణించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ రాష్ట్రానికి అందిస్తున్న నాయ‌కత్వాన్ని ఆయ‌న కొనియాడారు. రాష్ట్రంలో అభివృద్ధికి అనుకూల‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించేందుకు రాష్ట్ర‌ప్ర‌భుత్వం కృషిచేస్తున్న‌ద‌ని ఆయ‌న అన్నారు. స‌మాజంలోని వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల అభ్యున్న‌తికి రాష్ట్ర‌ప్ర‌భుత్వం కృషి చేస్తున్న‌ద‌ని ఆయ‌న అన్నారు. 
 340 కిలోమీట‌ర్ల పోడ‌వున నిర్మించ‌నున్న పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ వే  నిర్మిత‌మౌతున్న మార్గంలోని గ్రామాలు , ప‌ట్ట‌ణాల స్వ‌రూప‌మే మారిపోనున్న‌ద‌ని ప్ర‌ధాని అన్నారు. ఇది ఢిల్లీ – ఘాజిపూర్ మ‌ధ్య త్వ‌ర‌గా చేరుకోవ‌డానికి అనుసంధాన‌త క‌ల్పిస్తుంద‌ని అన్నారు. ఎక్స్‌ప్రెస్ వే మార్గం వెంబ‌డి కొత్త సంస్థ‌లు, కొత్త పరిశ్ర‌మ‌లు అభివృద్ధి చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు. ఈ ప్రాంతంలో చారిత్ర‌క ప్రాధాన్య‌త‌గ‌ల ప్రాంతాల‌లో ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేసుకోవడానికీ ఇది ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.
 ఇవాళ అభివృద్ధికి అనుసంధాన‌త ఎంతో అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అన్నారు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జాతీయ ర‌హ‌దారుల నెట్‌వ‌ర్క్‌ను దాదాపు రెట్టింపు చేసిన‌ట్టు ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి విమాన‌యాన అనుసంధాన‌త‌, జ‌ల‌మార్గ అనుసంధాన‌త‌ల గురించి కూడా ప్ర‌స్తావించారు. దేశ తూర్పు ప్రాంతాన్ని నూత‌న అభివృద్ధి కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌ని ప్ర‌ధాని అన్నారు.
స‌బ్ కా సాథ్‌, స‌బ్ కా వికాస్ అన్న త‌న దార్శ‌నిక‌త గురించి ప్ర‌ధాని పున‌రుద్ఘాటించారు.ఈ ప్రాంతాన్ని స‌మ‌తూకంతో అభివృద్ధి చేయ‌వ‌ల‌సిన ఆవ‌శ్య‌క‌త‌ను ప్ర‌ధాని నొక్కిచెప్పారు. డిజిట‌ల్ క‌నెక్టివిటీ గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు ల‌క్ష పంచాయితీల‌కు ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కనెక్టివిటీ క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. అలాగే మూడు ల‌క్ష‌ల కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు సామాన్యుల జీవితాల‌ను సుల‌భ‌త‌రం చేశాయ‌ని ఆయ‌న అన్నారు.
ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌, ప్ర‌ధాన‌మంత్రి గ్రామ్ స‌డ‌క్ యోజ‌న‌, వంటి కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌లు సంక్షేమ ప‌థ‌కాల గురించి కూడా ప్ర‌ధాన‌మంత్రి త‌మ ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే విధంగా ,ఖ‌రీఫ్ పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను పెంచిన విష‌యాన్ని ప్ర‌ధాని ప్ర‌స్తావించారు. 
ముస్లిం మ‌హిళ‌ల‌కు ముమ్మార్లు త‌లాక్ నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించే చ‌ట్టాన్ని అడ్డుకోవ‌డానికి కొన్ని శ‌క్తులు ప్ర‌య‌త్నించాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఈ చ‌ట్టం వాస్త‌విక రూపం దాల్చ‌డానికి త‌మ‌కు గ‌ల గట్టి సంక‌ల్పం గురించి ఆయ‌న పేర్కొన్నారు. కేంద్ర‌ప్ర‌భుత్వం, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, దేశం, దాని ప్ర‌జ‌లు అత్యంత ముఖ్య‌మ‌ని ఆయ‌న అన్నారు.

ఈ ప్రాంత నేత కార్మికుల అభివృద్ధికి ప‌లు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆధునిక యంత్రాలు, త‌క్కువ వ‌డ్డీరేటుకు రుణాల మంజూరు,వార‌ణాసిలో ట్రేడ్ ఫెసిలిటేష‌న్ సెంట‌ర్ తదిత‌ర చ‌ర్య‌ల గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వం తీసుకున్నే ప‌లు చ‌ర్య‌ల గురించి కూడా ప్ర‌ధాని ప్ర‌స్తావించారు.