పిఎంఇండియా
సీజేఐ శ్రీ బీఆర్ గవాయ్ గారు, జస్టిస్ సూర్య కాంత్ గారు, జస్టిస్ విక్రమ్ నాథ్ గారు, కేంద్రం ప్రభుత్వంలో నా సహచరులు అర్జున్ రామ్ మేఘవాల్ గారు, సుప్రీంకోర్టులోని ఇతర గౌరవ న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, మహిళలు, పెద్దలారా..
ముఖ్యమైన ఈ సందర్భంలో మీ అందరి మధ్య ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. న్యాయ సేవలను అందించే యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, న్యాయ సేవల దినోత్సవానికి సంబంధించిన ఈ కార్యక్రమం.. న్యాయ వ్యవస్థకు కొత్త బలాన్ని ఇస్తుంది. 20వ జాతీయ సదస్సు సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఈ ఉదయం నుంచే ఈ పనిలో నిమగ్నమై ఉన్నారని నాకు తెలిసింది. అందుకే నేను మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోను. ఇక్కడ హాజరైన ప్రముఖులకు, న్యాయవ్యవస్థలోని వ్యక్తులకు, న్యాయ సేవల సంస్థలకు నేను అభివాదం చేస్తున్నాను.
మిత్రులారా,
న్యాయం అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు, అది సమయానికి లభించినప్పుడు, సామాజిక – ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా న్యాయం ప్రతి వ్యక్తికి అందినప్పుడు మాత్రమే అది సామాజిక న్యాయానికి పునాది అవుతుంది. న్యాయ సేవ అనేది న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా చూడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జాతీయ స్థాయి నుంచి తాలూకా స్థాయి వరకు న్యాయ సేవల సంస్థలు న్యాయ వ్యవస్థకు, సాధారణ పౌరుడికి మధ్య ఒక వంతెనగా పనిచేస్తాయి. నేడు లోక్ అదాలత్లు, వివాదం ముందే సమస్యను పరిష్కరించటం ద్వారా.. లక్షలాది వివాదాలు త్వరగా, స్నేహపూర్వకంగా, తక్కువ ఖర్చుతో పరిష్కారం అవుతున్నందుకు నేను సంతృప్తిగా ఉన్నాను. ప్రతివాదులను అందించడం ద్వారా కేవలం మూడేళ్లలోనే దాదాపు 8 లక్షల క్రిమినల్ కేసులు పరిష్కారమయ్యాయి. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు దేశంలోని పేద, దళిత, అణగారిన, దోపిడీ– వంచనకు గురైన ప్రజలకు సులభతర న్యాయాన్ని అందించాయి.
మిత్రులారా,
గత 11 సంవత్సరాలుగా మేం నిరంతరం సులభతర వ్యాపారం, సులభతర జీవనం పైన దృష్టి సారించాం. దీని కోసం మేం అనేక చర్యలు తీసుకున్నాం. వ్యాపారాల కోసం 40 వేలకు పైగా అనవసరమైన నిబంధనలను తొలగించాం. జన్ విశ్వాస్ చట్టం ద్వారా 3,400 కంటే ఎక్కువ చట్టపరమైన సెక్షన్లను నేర పరిధి నుంచి తొలగించాం. 1500 కంటే ఎక్కువ అసంబద్ధమైన, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశాం. దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత చట్టాల స్థానంలో ఇప్పుడు భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చాం.
మిత్రులారా,
నేను ముందే చెప్పినట్లుగా సులభతర న్యాయం సరిగ్గా లభించినప్పుడు మాత్రమే సులభతర వ్యాపారం, సులభతర జీవనం సాధ్యమౌతాయి. గత కొన్నేళ్లుగా సులభతర న్యాయాన్ని మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులో మనం ఈ దిశగా మరింత వేగంగా ముందుకెళ్తాం.
మిత్రులారా,
ఈ సంవత్సరం జాతీయ న్యాయ సేవల సంస్థ (ఎన్ఏఎల్ఎస్ఏ– నాల్సా) 30వ వార్షికోత్సవం చేసుకుంటుంది. ఈ మూడు దశాబ్దాలలో నాల్సా దేశంలోని పేద ప్రజలను న్యాయవ్యవస్థకు అనుసంధానించడంలో చాలా కీలకమైన పనులు చేసింది. న్యాయ సేవల సంస్థలను ఆశ్రయించే ప్రజలకు సాధారణంగా వనరులు ఉండవు.. ప్రాతినిధ్యం ఉండదు.. కొన్నిసార్లు ఆశ కూడా ఉండదు. వారికి ఆశ, మద్దతునివ్వడమే సేవ అనే పదానికి నిజమైన అర్థం. ఇది ‘నాల్సా‘ అనే పేరులో కూడా ఉంది. అందుకే ఇందులోని ప్రతి సభ్యుడు ఓర్పు, వృత్తి నైపుణ్యంతో పనిని కొనసాగిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది.
మిత్రులారా,
ఈ రోజు మనం నాల్సా సామాజిక మధ్యవర్తిత్వ శిక్షణ మాడ్యూల్ను ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా చర్చలు, ఏకాభిప్రాయం ద్వారా వివాదాలను పరిష్కరించే భారతీయ సంప్రదాయంలోని ప్రాచీన జ్ఞానాన్ని మనం పునరుద్ధరిస్తున్నాం.
మిత్రులారా,
సాంకేతికత ఖచ్చితంగా ఒక పెను మార్పు తీసుకువచ్చే శక్తి. అయితే దానికి ప్రజానుకూల దృష్టి ఉంటే అది ప్రజాస్వామ్యీకరణ శక్తిగా మారుతుంది. యూపీఐ డిజిటల్ చెల్లింపులలో ఏ విధంగా విప్లవం తెచ్చిందో మనం చూశాం. ఈ రోజు చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యారు. గ్రామాలకు లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్తో అనుసంధానం లభించింది. కొద్ది వారాల క్రితం గ్రామీణ ప్రాంతాల్లో సుమారు లక్ష మొబైల్ టవర్లను ఏకకాలంలో ప్రారంభించాం. అంటే సాంకేతికత నేడు సమ్మిళితత్వానికి, సాధికారత కల్పించడానికి ఒక మాధ్యమంగా మారుతోంది. న్యాయ పంపిణీలో ఈ–కోర్ట్స్ ప్రాజెక్ట్ కూడా దీనికి ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. న్యాయ ప్రక్రియలను సాంకేతికత ఎలా ఆధునికంగా, మానవీయంగా మార్చగలదో ఇది తెలియజేస్తోంది. ఈ–ఫైలింగ్ నుంచి ఎలక్ట్రానిక్ సమ్మన్స్ వరకు, వర్చువల్ విచారణల నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ వరకు సాంకేతికత ప్రతి దానిని సులభతరం చేసింది. ఇది న్యాయం కోసం పోరాడే మార్గాన్ని సులభతరం చేసింది. మీ అందరికీ తెలిసినట్లుగా ఈ ప్రాజెక్ట్ మూడో దశకు బడ్జెట్ను 7 వేల కోట్ల పైకి పెంచాం. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తుంది.
మిత్రులారా,
మనందరికీ న్యాయ అవగాహన ప్రాముఖ్యత తెలుసు. ఒక పేద వ్యక్తి హక్కులను తెలుసుకున్నప్పుడు, చట్టాన్ని అర్థం చేసుకున్నప్పుడు.. వ్యవస్థలోని సంక్లిష్టత చూసి భయపడనప్పుడు మాత్రమే న్యాయం పొందగలడు. అందుకే బలహీన వర్గాలు, మహిళలు, వృద్ధులలో న్యాయ అవగాహనను పెంచడం అనేది మన ప్రాధాన్యత. మీరందరూ, మన కోర్టులు ఈ దిశగా నిరంతరం కృషి చేస్తున్నాయి. ఈ విషయంలో మన యువత ముఖ్యంగా న్యాయ విద్యార్థులు పరివర్తనాత్మక పాత్ర పోషించగలరని నేను నమ్ముతున్నాను. పేదలు, గ్రామాల్లో నివసించే ప్రజలతో అనుసంధానమయేందుకు, వాళ్లకు చట్టపరమైన హక్కులు– న్యాయ ప్రక్రియలను వివరించడానికి యువ న్యాయ విద్యార్థులను ప్రోత్సహించినట్లయితే.. ఆయా విద్యార్థులకు సమాజపు నాడిని నేరుగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. స్వయం సహాయక బృందాలు, సహకార సంఘాలు, పంచాయతీ రాజ్ సంస్థలు, ఇతర బలమైన క్షేత్ర స్థాయి సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా మనం న్యాయ పరిజ్ఞానాన్ని ప్రతి ఇంటికి చేర్చగలం.
మిత్రులారా,
న్యాయ సహాయానికి సంబంధించిన మరొక అంశం ఉంది. దాని గురించి నేను తరచుగా మాట్లాడుతూ ఉంటాను. న్యాయానికి సంబంధించిన భాష.. న్యాయం కోరుకునే వ్యక్తికి అర్థమయ్యే విధంగా ఉండాలి. చట్టాన్ని రూపొందించేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రజలు సొంత భాషలో చట్టాన్ని అర్థం చేసుకున్నప్పుడు.. అది ఆయా చట్టాలను మరింత మెరుగ్గా పాటించేందుకు దారితీస్తుంది. తద్వారా వ్యాజ్యాలు తగ్గుతాయి. దీనితో పాటు తీర్పులు, న్యాయపరమైన పత్రాలు కూడా స్థానిక భాషలో అందుబాటులో ఉండటం అవసరం. సుప్రీంకోర్టు 80 వేలకు పైగా తీర్పులను 18 భారతీయ భాషల్లోకి అనువదించే పని ప్రారంభించటం నిజంగా ప్రశంసనీయం. ఈ ప్రయత్నం హైకోర్టులు, జిల్లా స్థాయిలో కూడా కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను.
మిత్రులారా,
మనం అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా పయనిస్తున్న తరుణంలో న్యాయ వృత్తి, న్యాయ సేవలు, అనుబంధ వ్యక్తులందరూ.. ‘మనల్ని అభివృద్ధి చెందిన దేశం అని పిలుసున్నప్పుడు మన న్యాయ పంపిణీ వ్యవస్థ ఎలా ఉంటుందో ఊహించుకోండి? మనం ఆ దిశగా కలిసి ముందుకు సాగాలి’ అన్న విషయంపై ఆలోచించాలి. నాల్సాకు, సమస్త న్యాయ సోదర వర్గానికి, న్యాయాన్ని అందించటంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ అందరితో ఉండే అవకాశం కల్పించినందుకు కూడా మీకు చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు.
***
Addressing the National Conference on Strengthening Legal Aid Delivery Mechanisms at Supreme Court. https://t.co/aAlPK9koIK
— Narendra Modi (@narendramodi) November 8, 2025
जब न्याय सबके लिए Accessible होता है, Timely होता है, जब न्याय Social या Financial Background देखे बिना हर व्यक्ति तक पहुंचता है, तभी वो सामाजिक न्याय की नींव बनता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 8, 2025
Ease of Doing Business और Ease of Living तभी संभव हैं... जब Ease of Justice भी सुनिश्चित हो।
— PMO India (@PMOIndia) November 8, 2025
पिछले कुछ वर्षों में, Ease Of Justice को बढ़ाने के लिए भी कई कदम उठाए गए हैं।
और आगे, हम इस दिशा में और तेजी लाएंगे: PM @narendramodi
Mediation हमेशा से हमारी सभ्यता का हिस्सा रही है।
— PMO India (@PMOIndia) November 8, 2025
नया Mediation Act इसी परंपरा को आगे बढ़ा रहा है, उसे आधुनिक स्वरूप दे रहा है: PM @narendramodi
Technology आज Inclusion और Empowerment का माध्यम बन रही है।
— PMO India (@PMOIndia) November 8, 2025
Justice delivery में E-Courts project भी इसका एक शानदार उदाहरण है: PM @narendramodi
जब लोग कानून को अपनी भाषा में समझते हैं, तो इससे Better Compliance होता है और मुकदमेबाजी कम होती है।
— PMO India (@PMOIndia) November 8, 2025
इसके साथ ही ये भी आवश्यक है कि judgements और legal documents को स्थानीय भाषा में उपलब्ध कराया जाए: PM @narendramodi