పిఎంఇండియా
పెట్టుబడి, మౌలిక సదుపాయాల జాతీయ నిధి (ఎన్ ఐ ఐ ఎఫ్) కోసం దీర్ఘకాలిక పెట్టుబడులను సమీకరించేందుకు భారతదేశం- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు ఎ ఇ) ల మధ్య 2016 ఫిబ్రవరి 11న సంతకాలు జరిగిన అవగాహనపూర్వక ఒప్పంద పత్రానికి (ఎమ్ ఒ యు) కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
వాణిజ్య పరంగా లాభదాయకమైన కొత్త ప్రాజెక్టులలోను, పాత ప్రాజెక్టులలోను, పనులు నిలచిపోయిన ప్రాజెక్టులలోను.. ప్రధానంగా మౌలిక సదుపాయలను అభివృద్ధి చేయడం ద్వారా ఆయా ప్రాజెక్టుల ఆర్థిక ప్రభావాన్ని గరిష్ఠ స్థాయికి చేర్చడం ఎన్ ఐ ఐ ఎఫ్ లక్ష్యం. స్ట్రాటజిక్ యాంకర్ పార్ట్ నర్స్ ను ఈక్విటీని పంచుకోవలసిందిగా ఎన్ ఐ ఐ ఎఫ్ కోరుతుంది.
ఈ ఎమ్ ఒ యు ఒక పారదర్శకమైన, ఉన్నత స్థాయి సమన్వయ వేదికను ఏర్పాటు చేయడానికి తోడ్పడుతుంది. ఈ వేదిక ద్వారా భారతదేశంలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సంస్థలలో యు ఎ ఇ పెట్టుబడి సంస్థలు వాటి ప్రాతినిధ్యాన్ని విస్తరించుకొనేందుకు తగిన మార్గాలను ఇరు దేశాలు అన్వేషిస్తాయి.
ఉభయ దేశాలకు సంబంధించిన ప్రతినిధులతో కూడిన ఒక సంయుక్త కార్యాచరణ బృందం ఈ ఎమ్ ఒ యు పరిధిలో ఆశిస్తున్న సహకారాన్ని ముందుకు తీసుకుపోవడానికి పనిచేస్తుంది.
పూర్వ రంగం :
ఎన్ఐఐఎఫ్ ఏర్పాటు ప్రతిపాదనకు 2015 జులై లో కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ ఇ బి ఐ) నియమావళి ప్రకారం కేటగిరి II ఆల్టర్నేట్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్స్ (ఎ ఐ ఎఫ్) హోదాతో ఎన్ ఐ ఐ ఎఫ్ ను ఇప్పటికే నెలకొల్పారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ 2015 ఆగస్టు 16- 17 తేదీలలో యు ఎ ఇ లో పర్యటించిన సందర్భంగా యు ఎ ఇ తో కలసి చేసిన సంయుక్త ప్రకటనలో.. ‘యు ఎ ఇ- ఇండియా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్’ స్థాపనను గురించిన ప్రస్తావన ఉంది. భారతదేశంలో తదుపరి తరం మౌలిక సదుపాయాలను, ప్రత్యేకించి రైల్వేలు, నౌకాశ్రయాలు, రహదారి మార్గాలు, విమానాశ్రయాలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇండస్ట్రియల్ పార్కుల రంగాలలో తదుపరి తరం మౌలిక సదుపాయాలను శీఘ్ర గతిన విస్తరించాలన్న భారతదేశ ప్రణాళికలకు- అందుకు అవసరమయ్యే పెట్టుబడులను 75 బిలియన్ యూఎస్ డాలర్ల మేరకు సమీకరించుకోవాలనేది యు ఎ ఇ- ఇండియా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్ స్థాపన వెనుక ఉన్న లక్ష్యం.