పిఎంఇండియా
నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యాక్ట్, 1993 ను సవరించడానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (అమెండ్మెంట్) యాక్ట్, 2017 పేరిట ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సవరణ- ఎన్ సిటిఇ అనుమతి లేకుండానే ఉపాధ్యాయ విద్య కోర్సులను నడుపుతున్న కేంద్రీయ/రాష్ట్ర/విశ్వవిద్యాలయాలకు గతానికి వర్తించే విధంగా గుర్తింపును మంజూరు చేయడానికి- ఉద్దేశించింది.
ఎన్ సిటిఇ గుర్తింపును పొందకుండానే ఉపాధ్యాయ విద్య కోర్సులను నిర్వహిస్తున్న కేంద్రీయ/రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంత నిధులతో సాగుతున్న సంస్థలు/విశ్వవిద్యాలయాలకు 2017-2018 విద్యా సంవత్సరం దాకా పూర్వ వర్తి గుర్తింపును మంజూరు చేయాలన్నది ఈ సవరణ యొక్క ఉద్దేశం. ఈ సంస్థలలో చేరిన విద్యార్థుల/ఉత్తీర్ణులైన విద్యార్థుల భవిష్యత్తుకు ఆపద వాటిల్లకుండా చూడటానికి ఒకసారి చేపట్టే చర్యలో భాగంగా పూర్వ వర్తి గుర్తింపును ఇవ్వడం జరుగుతోంది.
ఈ సవరణ ఆయా సంస్థలు/విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు లేదా ఇప్పటికే ఆయా విద్యా సంస్థలలో నుండి కృతార్థులైన వారు టీచర్గా ఉపాధిని పొందేందుకు అర్హతను ప్రసాదించగలుగుతుంది. పైన పేర్కొన్న ప్రయోజనాలను సాధించే ఉద్దేశంతో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం ఈ సవరణను తీసుకు వచ్చింది.
బిఎడ్ మరియు D.El.Ed. వంటి ఉపాధ్యాయ విద్య కోర్సులను నడిపే అన్ని సంస్థలు ఎన్ సిటిఇ యాక్టు లోని 14వ సెక్షన్లో భాగంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నుంచి గుర్తింపు పొందవలసి ఉంటుంది. దీనికి తోడు, ఆ తరహా గుర్తింపు కలిగిన సంస్థలను/విశ్వవిద్యాలయాలను ఎన్ సిటిఇ యాక్టు లోని 15వ సెక్షన్ లో భాగంగా కూడా అనుమతించవలసి ఉంటుంది .
ఉపాధ్యాయ విద్య కోర్సులను ఆరంభించేందుకు ముందస్తు అనుమతిని తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుందని, చట్ట నిబంధనలు ఉన్నాయన్న సంగతిని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మరియు రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు/ District Institutes of Education and Training (DIETs) కు తెలియజేస్తూ ఎన్ సిటిఇ లేఖలు రాసింది. ఎన్ సిటిఇ అనుమతిని పొందకుండా ఈ కోర్సును నడుపుతున్న ఏదైనా సంస్థ/విశ్వవిద్యాలయం పూర్వ అంశాల ఏక- కాల పరిష్కారం గురించి ఎన్ సిటిఇ కి సమాచారాన్ని అందించాలంటూ అందుకు 31-03-2017 దాకా వాటికి వ్యవధినిచ్చింది.
పూర్వరంగం:
1995 జులై 1వ తేదీ నాటి నుండి ఎన్ సిటిఇ యాక్ట్, 1993 అమలులోకి వచ్చింది. ఈ చట్టం జమ్ము & కశ్మీర్ రాష్ట్రంలో మినహా, దేశవ్యాప్తంగా వర్తిస్తోంది. ఉపాధ్యాయ విద్య వ్యవస్థ ప్రణాళికబద్ధం గాను, సమన్వయ పూర్వకం గాను అభివృద్ధి చెందేటట్లు చూడటానికి, సదరు వ్యవస్థలో నియమాలు మరియు ప్రమాణాలు సరైన రీతిలో నిర్వహింపబడేలా గాను మరియు క్రమబద్ధీకరింపబడే విధం గాను చూడటానికి ఒక ఎన్ సిటిఇ స్థాపనకు చోటివ్వడమే ఈ చట్టం ప్రధాన ధ్యేయం. ఈ చట్టం యొక్క లక్ష్యాలను సాధించడానికని ఉపాధ్యాయ విద్య కోర్సులకు గుర్తింపును ఇవ్వడానికి మరియు గుర్తింపు పొందిన సంస్థలు/విశ్వవిద్యాలయాలు అనుసరించవలసిన మార్గదర్శక సూత్రాలను పొందుపరుస్తూను చట్టంలో ప్రత్యేక నియమాలను చేర్చడమైంది.
***