Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ ఢిల్లీలో జ‌రిగిన అంత‌ర్రాష్ట్ర మండ‌లి స‌మావేశ ప్రారంభ కార్యక్రమంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌సంగం సారాంశం

న్యూ ఢిల్లీలో జ‌రిగిన అంత‌ర్రాష్ట్ర మండ‌లి స‌మావేశ  ప్రారంభ కార్యక్రమంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌సంగం సారాంశం


రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, కేంద్ర‌ పాలిత ప్రాంతాల లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్లు, మరియు నా మంత్రివర్గ స‌హ‌చ‌రులారా,

అంత‌ర్రాష్ర్ట‌ మండ‌లి ముఖ్య స‌మావేశానికి మీ అంద‌రినీ ఆహ్వానిస్తున్నాను.

కేంద్రానికి, రాష్ట్రానికి చెందిన నాయ‌కులు ఒక చోట గుమికూడే సందర్భాలు కొన్నే ఉంటాయి. సహకారాత్మక సమాఖ్యతత్వంతో కూడిన ఈ వేదిక ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలపై చర్చోపచర్చలు జరపడానికి, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించడానికి, నిర్దిష్ట‌మైన ఉమ్మ‌డి నిర్ణ‌యాలను తీసుకోవడానికి ఉత్తమమైన వేదిక. ఇది మన రాజ్యాంగ శిల్పుల దార్శనికతను వెల్లడిస్తోంది.

పదహారు సంవ‌త్స‌రాల క్రితం ఇదే వేదిక మీద అప్పటి ప్ర‌ధాన మంత్రి అట‌ల్ బిహారీ వాజ్ పేయి గారు చేసిన వ్యాఖ్య‌లను ఒక సారి జ్ఞాపకం చేస్తూ నా ప్ర‌సంగాన్ని ప్రారంభించ‌నివ్వండి..

“పెద్దదీ, భిన్న‌త్వానికి ఆల‌వాల‌మైనదీ అయిన మన ప్ర‌జాస్వామ్యంలో క్షేత్ర వాస్తవాలకు సంబంధించిన విధానాన్ని రూపొందించేందుకు వాదన, చ‌ర్చ‌లు, చర్చోపచర్చలు తోడ్పడుతాయి. మరీ ముఖ్యంగా అవి ఇటువంటి విధానాలను స‌మ‌ర్థ‌ంగా అమ‌లు చేయ‌డానికి వీలు కల్పిస్తాయి కూడా.

అంతర్రాష్ట్ర మండలి ప్రభుత్వాల మధ్య పనిచేసే వేదిక. దీనిని విధానాలను రూపొందించడానికి, ఆ విధానాలను అమలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ వేదికను మన ప్రజాస్వామ్యాన్ని, స‌మాజాన్ని, మన ప్రభుత్వ విధానాన్ని బ‌లోపేతం చేయ‌డానికి తరచుగా ఉప‌యోగించుకోవలసిందిగా రాష్ట్రాలను నేను కోరుతున్నాను” అని వాజ్ పేయి గారు సూచించారు.

కేంద్రానికి- రాష్ట్రాలకు మధ్య, రాష్ట్రాలకు- రాష్ట్రాలకు మధ్య సంబంధాల‌ను ప‌టిష్ఠం చేసుకోవడానికి అంత‌ర్రాష్ట్ర మండ‌లి ఎంతో ముఖ్యమైన వేదిక. 2006లో ఆఖరు సారిగా ఇది సమావేశమైంది. ఆ త‌రువాత నుండీ సుదీర్ఘమైన విరామం ఏర్ప‌డింది. అయితే, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు పూనుకొని చేసిన ప్రయత్నాలతో మ‌ళ్ళీ ఈ ప్రక్రియను పున: ప్రారంభించడం జరిగింది. ఇది నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆయన గ‌త ఏడాది కాలంగా ఐదు జోన‌ల్ కౌన్సిల్ ల స‌మావేశాలను నిర్వ‌హించారు. పలు మార్లు జరిపిన సంప్రదింపులు, అనుసంధానం ఇవాళ ఇలా భేటీ గా పరిణమించింది.

కేంద్ర‌ం, రాష్ర్ట‌ ప్ర‌భుత్వాలు భుజం భుజం క‌లిపి నడచిన‌ప్పుడే దేశం పురోగ‌మించగలదు. ఏ ప‌థ‌కాన్ని అయినా త‌నంత తానుగా విజ‌య‌వంతంగా అమ‌లుప‌ర‌చ‌డం ఏ ప్ర‌భుత్వానికయినా కష్టమైన పనే. అందుకని, ప‌థ‌కాలకు సరిపడే ఆర్థిక వనరులను సమకూర్చడమనేది ఆ పథకాన్ని అమ‌లు చేసే బాధ్య‌తను తీసుకోవడమంతటి ముఖ్యమైన బాధ్యతే.

14వ ఆర్థిక సంఘం సిఫార‌సులను ఆమోదించ‌డంతో కేంద్ర ప‌న్నులలో రాష్ట్రాల వాటా 32 శాతం నుండి 42 శాతానికి పెరిగింది. అంటే, రాష్ట్రాలు వాటి అవ‌స‌రాలకు అనుగుణంగా వినియోగించుకోవడానికి మ‌రిన్ని ఆర్థిక వ‌న‌రులు అందుబాటులోకి వ‌చ్చాయ‌న్న మాట‌. 2015-16 సంవత్స‌రంలో రాష్ట్రాలు 2014-15తో పోలిస్తే 21 శాతం అధిక సొమ్మును కేంద్రం నుండి అందుకున్నాయని వెల్లడించేందుకు నేను సంతోషిస్తున్నాను. అలాగే, పంచాయతీలు, ప‌ట్ట‌ణ స్థానిక స్వపరిపాలన సంస్థ‌లు 14వ ఆర్థిక సంఘం కాలంలో రూ.2.87 ల‌క్ష‌ల కోట్లను అందుకొంటాయి. ఇది క్రితం సారి క‌న్నా ఎంతో ఎక్కువ.

సహజ వ‌న‌రుల వేలాయింపు నుండి అందిన ఆదాయంలో రాష్ట్రాల హ‌క్కులను దృష్టిలో ఉంచుకున్నాం. రానున్న సంవత్స‌రాలలో బొగ్గు బ్లాక్ ల వేలం ద్వారా రూ.3.35 ల‌క్ష‌ల కోట్లు అందుతాయ‌ని అంచ‌నా. ఇతర గ‌నుల వేలం ద్వారా మరొక రూ.18,000 కోట్లు రాష్ట్రాలకు అందే అవకాశం ఉంది. అలాగే, సి ఎ ఎమ్ పి ఎ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేయడం ద్వారా బ్యాంకులలో నిరుపయోగంగా పడి ఉన్న దాదాపు రూ.40,000 కోట్లు రాష్ట్రాలకు అందేటట్లు మేం కసరత్తు చేస్తున్నాం.

వ్య‌వ‌స్థ‌లో పార‌ద‌ర్శ‌క‌త్వాన్ని తీసుకువచ్చి, తత్ఫలితంగా మిగిలే సొమ్మును కూడా రాష్ట్రాల‌తో పంచుకోవాల‌ని కేంద్రం భావిస్తోంది. ఈ విషయంలో కిరోసిన్ ఒక ఉదాహ‌ర‌ణ‌. గ్రామాల‌లో విద్యుత్ క‌నెక్ష‌న్ లు పెరుగుతున్నాయి. వ‌చ్చే మూడు సంవ‌త్స‌రాలలో 5 కోట్ల కొత్త గ్యాస్ క‌నెక్ష‌న్ లను కేంద్ర ప్రభుత్వం సమకూర్చబోతున్నది. ఎల్ పి జి స‌ర‌ఫ‌రా మరింత పెరగనుంది. ఈ ప్రయత్నాలన్నీ కిరోసిన్ వినియోగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఇటీవ‌లే చండీగ‌ఢ్ పాల‌క‌యంత్రాంగం చండీగఢ్ ను కిరోసిన్ ర‌హిత మండ‌లంగా ప్ర‌క‌టించింది. ఇక, కేంద్ర‌ ప్ర‌భుత్వం తాజాగా ఓ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఇందులో భాగంగా ఏదైనా రాష్ట్రంలో కిరోసిన్ వినియోగం తగ్గిందంటే గనక, సబ్సిడీలో ఆదా అయ్యే సొమ్ములో 75 శాతాన్ని కేంద్రం ఆ రాష్ట్రానికే గ్రాంటుగా అందించ‌గలదు. ఈ కార్యక్రమంలో వేగంగా అడుగులు వేసిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం తన ప్రతిపాదనను పెట్రోలియం మంత్రిత్వ శాఖ‌కు పంపించింది. దీనిని ఆమోదించి, రాష్ర్ట ప్ర‌భుత్వానికి గ్రాంటును ఇవ్వడమైంది. అన్ని రాష్ట్రాలు కిరోసిన్ వినియోగాన్ని 25 శాతం మేరకు తగ్గించుకోవాలని నిర్ణయించుకొంటే, అవి ఈ ఏడాది రమారమి రూ.1,600 కోట్లను గ్రాంటు రూపంలో పొందగలుగుతాయి.

కేంద్రం- రాష్ర్ట సంబంధాలే కాకుండా, జ‌నాభాలో అధిక శాతం మందికి సంబంధించిన అంశాల‌ను గురించి చ‌ర్చించేందుకు కూడా అంతర్రాష్ట్ర మండలి ఒక సరైన వేదికే. విధానాల రూపకల్పన ద‌శ‌లోనే మ‌నం ఏకాభిప్రాయాన్ని ఏ విధంగా సాధించ‌గ‌లం ? ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాల‌లో ముడిపడిన అంశాల‌ను మనం ఏ విధంగా ప‌రిష్క‌రించ‌గ‌లం ?

అందుకే, ఈ అంత‌ర్రాష్ర్ట మండ‌లి స‌మావేశంలో పుంఛీ సంఘం నివేదిక‌తో పాటు మూడు ముఖ్య అంశాల‌ను అజెండాలో చేర్చడమైంది.

వాటిలో ‘ఆధార్’ ఒక‌టి. ‘ఆధార్ చ‌ట్టం-2016’ను పార్ల‌మెంటు ఆమోదించింది. ఈ చట్టాన్ని ఆమోదించడంతో స‌బ్సిడీ, ఇత‌ర సేవ‌ల కోసం ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ కోసం ‘ఆధార్’ను వినియోగించే వీలు మనకు చిక్కుతోంది.

ఇప్పటి వరకు 128 మంది కోట్ల మంది ప్రజలు ఉన్న మన దేశంలో 102 కోట్ల ‘ఆధార్ కార్డు’లను పంపిణీ చేయడమైంది. మన ప్రజలలో 79 శాతం మంది ప్రస్తుతం ‘ఆధార్ కార్డు’లు కలిగివున్నారు. వ‌యోజ‌నులలో 96 శాతం మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. మీ స‌హ‌కారంతో దేశంలోని ప్రతి ఒక్క పౌరుడిని ఈ ఏడాది చివ‌రిక‌ల్లా మనం ‘ఆధార్’ తో అనుసంధానం చేయాలి.

సాదా ‘ఆధార్ కార్డు’ ఇవాళ సాధికారిత‌కు ఓ గుర్తుగా మారింది. ఇప్పుడు న్యాయ‌బ‌ద్ధంగా అర్హ‌త కలిగిన లబ్ధిదారులకు మాత్రమే నగదు వారి బ్యాంకు ఖాతాలలో నేరుగా జ‌మ అవుతోంది. ఇది పార‌ద‌ర్శ‌క‌త్వాన్ని తీసుకురావడమే కాకుండా, వేలాది కోట్ల రూపాయ‌లను ఆదా చేయడానికి తోడ్పడింది. ఇలా ఆదా అయిన సొమ్మును అభివృద్ధి పనులకు ఉప‌యోగించడం జరుగుతోంది.

మిత్రులారా, బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసినట్లు “భార‌త్ లో సాంఘిక‌ సంస్క‌ర‌ణ‌ల బాట స్వర్గానికి వెళ్లే దారి లాగానే అనేక కష్టాలతో నిండివుంది. భారతదేశంలో సంఘ సంస్క‌ర‌ణ‌కు మిత్రులు లేరు, విమర్శకులకు మాత్రం కొదవ లేదు”.

ఆయ‌న రాసిన మాట‌లు ఇప్ప‌టికీ వ‌ర్తిస్తూనే ఉన్నాయి. అందుకే విమ‌ర్శ‌ల‌ను ప‌క్క‌న పెట్టి, మ‌నం ప‌ర‌స్ప‌ర స‌హ‌కార భావంతో సంఘ సంస్కరణ పథ‌కాల‌ను ప్రోత్స‌హించడానికి నడుం కట్టాలి. ఈ పథకాలలో అనేకం నీతి ఆయోగ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ముఖ్య‌మంత్రుల ఉప సంఘాలు రూపొందించినవే.

అంత‌ర్రాష్ర్ట‌ మండ‌లిలో చ‌ర్చించాల్సిన మ‌రో ముఖ్యమైన అంశం విద్య‌. భార‌తదేశానికి ఉన్న అతి పెద్ద ఆస్తి దాని యువతీయువకులే. 30 కోట్ల మందికి పైగా బాల‌ బాలిక‌లు ఇప్పుడు పాఠ‌శాల‌కు వెళ్ళే వ‌య‌సులో ఉన్నారు. కాబట్టి, రానున్న అనేక సంవ‌త్స‌రాల పాటు ప్ర‌పంచానికి అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు గ‌ల మాన‌వ వ‌న‌రుల‌ను అందించ‌గ‌లిగే సామర్థ్యం మన దేశానికి ఉంది. కేంద్రం- రాష్ట్రాలు మన చిన్నారులకు వారు వారి నైపుణ్యాలను పెంచుకొని, ఇవాళ్టి అవ‌స‌రాలను తీర్చేందుకు తమను తాము సిద్ధం చేసుకోగలిగే వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించాలి.

పండిత్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ చెప్పినట్లు “విద్య అనేది ఒక పెట్టుబ‌డి. మొక్కలు నాటే స‌మ‌యంలో మ‌నం వాటి నుండి ఎలాంటి రుసుమునూ వ‌సూలు చేయం”. ఈ మొక్కలు మనకు భవిష్య‌త్తులో ప్రాణ వాయువును అందిస్తాయని, ప‌ర్యావ‌ర‌ణానికి మేలు చేస్తాయని మనం ఎరుగుదుము. అలాగే, విద్య కూడా స‌మాజానికి మేలు చేసే ఒక పెట్టుబ‌డే.

ఈ విషయాన్ని పండిత్ దీన్ ద‌యాళ్ 1965లో చెప్పారు. అప్ప‌టి నుండి విద్యారంగంలో మ‌నం ఎంతో దూరం పయనించాం. కానీ, విద్య ప్ర‌మాణాల విషయంలో మ‌నం చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. మ‌న విద్యా వ్య‌వ‌స్థ పిల్ల‌ల‌కు ఎంతటి స‌మ‌ర్థ‌మైన చదువును చెబుతోందన్నది మ‌నం చ‌ర్చించే తీరాలి.

విద్య ప్రమాణాలను మెరుగుపరచడానికి అత్యంత ఉత్తమమైన పద్ధతి ఏదంటే.. అది పిల్లలకు విద్య యొక్క పరమార్థాన్ని తెలియ‌చేయ‌డమే. బడికి వెళ్లనంత మాత్రాననే అది విద్య కాబోదు. విద్య పిల్ల‌లలో ఆస‌క్తిని రేకెత్తించాలి. విజ్ఞానాన్ని ఎలా సాధించాలో, దానిని ఎలా పెంచుకోవాలో అది వారికి నేర్పాలి. వారి జీవిత పర్యంతం వారు నేర్చుకుంటూనే ఉండేటట్లుగా అది వారిలో ప్రేరణను కలగజేయాలి.

విద్యకు అర్థం పుస్త‌కాలలో ఉన్నది గ్రహించడం మాత్రమే కాదు అని స్వామి వివేకానంద కూడా చెబుతుండే వారు. విద్య ధ్యేయం మంచి నడవడికను అల‌వ‌ర‌చ‌డం. మ‌న‌స్సును శ‌క్తిమంతం చేయ‌డం, తెలివిని అధికం చేయడం.. ఇవీ విద్యకు అర్థాలు. దీని వల్ల ఎవ‌రైనా స్వ‌యంస‌మృద్ధిని సాధించ‌గ‌లరు.

21వ శ‌తాబ్దికి చెందిన ఆర్థిక వ్యవస్థకు అవసరమైన సత్తాను, సామర్థ్యాన్ని పొందాలంటే, మ‌నం యువ‌త‌ను కనీసం కొన్ని నైపుణ్యాలలో అయినా దిట్ట‌లుగా తీర్చి దిద్దాలి. మనం మన యువతీయువకులను తార్కికంగాను, కొత్త‌ద‌నంతోను ఆలోచించేటట్లుగా, సృజ‌నాత్మ‌కంగా పనిచేసేటట్లుగా సిద్ధం చేయాల్సి వుంది.

ఈ రోజు అజెండాలో మ‌రో కీల‌కాంశం అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌. దేశ అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు ఎదుర‌వుతున్న స‌వాళ్ళ‌ను గురించి మ‌నం చ‌ర్చించి, వాటికి ప‌రిష్కారాలను, ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి గ‌ల అవ‌కాశాలను అన్వేషించాలి. రహస్య స‌మాచారాన్ని ఒక‌రితో మరొక‌రు పంచుకోవ‌డం, భ‌ద్ర‌త సంబంధి ఏజెన్సీల మ‌ధ్య మ‌రింత స‌మ‌న్వ‌యాన్ని సాధించడం, మన పోలీసు లకు ఆధునిక ప‌రిక‌రాలను,సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందించ‌డం.. వీటిపై మనం శ్రద్ధ తీసుకోనంతవరకు మన అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌ను మనం బలోపేతం చేయ‌లేం. సామ‌ర్థ్యాల నిర్మాణం, స‌మ‌ర్థ‌త పెంపుదల విష‌యాలలో మ‌నం ఎంతో ముందుకు ప‌య‌నించాం. అయితే, మన సామర్థ్యాలను, శక్తిని నిరంతరం పెంచుకుంటూ పోవలసిన అవసరం ఎంతయినా ఉంది. మ‌నం స‌దా అప్ర‌మ‌త్తంగాను, తాజా దృక్ప‌థంతోను మెల‌గ‌వ‌ల‌సి ఉంటుంది.

ఒకరి అభిప్రాయాలను మరొకరు అత్యంత స్వేచ్ఛాయుత వాతావరణంలో తెలియజెప్పుకొనేందుకు అంత‌ర్రాష్ర్ట మండ‌లి సమావేశం ఒక అవకాశాన్ని క‌ల్పిస్తోంది. అజెండాలో ఉన్న అన్ని అంశాల‌పైన మీ అంద‌రి అభిప్రాయాలను దాపరికం లేకుండా, నిర్మొహమాటంగా పంచుకుంటార‌న్న నమ్మకం నాకుంది. ఈ అభిప్రాయాల విలువ అపారం.

ఈ కీల‌కాంశాల‌ విషయంలో మ‌నం ఎంత‌గా ఏకాభిప్రాయాన్ని సాధించ‌గ‌లిగితే, వాటిని అంత స‌మ‌ర్థ‌ంగా ప‌రిష్క‌రించుకోగ‌లుగుతాము. ఈ క్ర‌మంలో, స‌హ‌కారాత్మక సమాఖ్యతత్వం స్ఫూర్తిని, కేంద్రం- రాష్ర్ట సంబంధాల‌ను ప‌టిష్ఠం చేయ‌డ‌మే కాదు.. మ‌న పౌరుల‌కు ఉత్తమ భ‌విష్య‌త్తును కూడా అందించ‌గ‌లుగుతాము.