Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మన్ కీ బాత్ – మనసులో మాటప్రసారణ తేదీ : 25-3-2018 ప్రసారణ తేదీ : 25-3-2018ప్రసారణ తేదీ : 25-3-2018


నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం!

ఇవాళ శ్రీరామనవమి పండుగ. ఈ శ్రీరామనవమి పండుగ రోజున దేశప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. రామనామానికి ఎంత శక్తి ఉందో పూజ్యులైన బాపూ జీవితంలో ప్రతి క్షణంలోనూ మనం చూశాము. కొద్ది రోజుల క్రితం జనవరి 26వ తేదీన ఆసియాలోని(ASEAN) పలుదేశాల నేతలందరూ ఇక్కడికి వచ్చినప్పుడు వారందరూ వారితో తమ సాంస్కృతిక బృందాలను తమ వెంట తీసుకువచ్చారు. వారిలో ఎక్కువ శాతం దేశాల వారు ఇక్కడ రామాయణాన్ని ప్రదర్శించడం మనమెంతో గర్వించదగ్గ విషయం. అంటే రాముడు, రామాయణం కేవలం మన భారతదేశానికే కాక ప్రపంచ భూభాగంలో ఒకటైన ఈ ఆసియా దేశాలన్నింటికీ కూడా ప్రేరణను అందించి, ప్రభావితం చేసాయన్నమాట. నేను మరోసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.

 

నా ప్రియమైన దేశప్రజలారా, ప్రతిసారిలాగానే ఈసారి కూడా చాలా పెద్ద సంఖ్యలో మీ అందరి ఉత్తరాలు, ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్, కామెంట్లు నాకు అందాయి. కోమల్ ఠక్కర్ గారూ, మై గౌ యాప్ లో మీరు ఆన్ లైన్ ద్వారా సంస్కృత భాషా కోర్సులను నేర్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు రాసినది చదివాను. వృత్తిరీత్యా ఐ.టి రంగంలో ఉన్నప్పటికీ కూడా, సంస్కృత భాష పట్ల మీకు ఉన్న ప్రేమను చూస్తే చాలా సంతోషం కలిగింది. దీనికి సంబంధించిన విభాగంతో సంస్కృత భాష ప్రచారంలో జరుగుతున్న ప్రయత్నాల తాలూకూ సమాచారాన్ని మీకు అందించవలసిందిగా కోరాను.

 

’ మనసులో మాట’ శ్రోతలలో కూడా సంస్కృత భాషా ప్రచారం తాలూకూ పనులు చేసేవారు ఉంటే, కోమల్ గారి సూచనను ఎలా ముందుకు నడిపించాలో అలోచించవలసిందిగా కోరుతున్నాను.

 

బీహార్ లోని నలందా జిల్లా తాలూకూ బరాకర్ గ్రామం నుండి ఘనశ్యామ్ కుమార్ గారు నరేంద్రమోదీ యాప్ లో రాసిన కామెంట్లు చదివాను. భూమిపై నానాటికీ తగ్గిపోతున్న జలరాశి గురించి ఆయన ఆందోళనను వ్యక్తం చేసారు. ఈ విషయం నిజంగా ఎంతో ముఖ్యమైనది.

 

కర్ణాటక నుండి శకల్ శాస్త్రి గారు పదాలను ఎంతో అందంగా జతచేస్తూ ఏం రాసారంటే, “మన దేశం ఆయుష్మంతురాలు ఎప్పుడవుతుందంటే మన ’భూమి ఆయుష్మంతురాలు’ అయినప్పుడు. మన ’భూమి ఆయుష్మంతురాలు’ ఎప్పుడవుతుందంటే, మనం ఈ భూమిపై నివసించే ప్రతి ఒక్క ప్రాణి గురించి ఆదుర్దా పడినప్పుడు. వేసవికాలంలో మనందరినీ పశుపక్ష్యాదుల కోసం మంచినీటిని ఏర్పాటు చెయ్యవలసిందని కోరారు. శకల్ గారూ, మీ ఆలోచనలను నేను శ్రోతలందరికీ చేరవేసాను.

 

యోగేష్ భద్రేష్ గారు ఈసారి నేను యువత తో వారి ఆరోగ్యాలను గురించి మాట్లాడాలని కోరారు. మిగతా ఆసియా దేశాల యువతతో పోలిస్తే ,మన భారతదేశంలో యువత బలహీనంగా ఉన్నారని ఆయన భావన. యోగేష్ గారూ, ఈసారి నేను కూడా అందరితోనూ ఆరోగ్యం గురించి, ముఖ్యంగా Fit India గురించి వివరంగా మాట్లాడాలని అనుకుంటున్నాను. అప్పుడు మీ యువత అంతా ఏకమై Fit India ఉద్యమాన్ని నడిపించ వచ్చు.

 

కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్ రాష్ట్రపతి కాశీయాత్రకు వచ్చారు. ఆ యాత్రకు సంబంధించిన వారణాసి చిత్రాలన్నీ మనసుకు హత్తుకునేలా ఉన్నాయని, ప్రభావితం చేసేలా ఉన్నాయని  ప్రశాంత్ కుమార్ గారు తన ఉత్తరంలో రాసారు. ఆ యాత్ర తాలూకూ చిత్రాలన్నింటినీ, వీడియోలన్నింటినీ, సామాజిక మాధ్యమం ద్వారా ప్రచారం చెయ్యాలని ఆయన కోరారు. ప్రశాంత్ గారూ, భారత ప్రభుత్వం వారు ఆ చిత్రాలను అదే రోజున సామాజిక మాధ్యమం లోనూ, నరేంద్ర మోదీ యాప్ లోనూ షేర్ చేసారు. మీరు కూడా వాటిని like చేసి, రీట్వీట్ చేసి, మీ స్నేహితులందరికీ అందించండి.

 

చెన్నై నుండి అనఘ, జయేష్, ఇంకా ఎంతోమంది పిల్లలు  Exam Warrior పుస్తకం వెనకాల ఇవ్వబడిన gratitude cards మీద తమ మనసులో వచ్చిన ఆలోచనలన్నింటినీ రాసి, తిరిగి నాకు పంపించారు. అనఘకీ, జయేష్ కీ, ఇంకా మిగతా పిల్లలందరికీ నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, మీ అందరి ఉత్తరాల వల్లా నా రోజువారీ శ్రమ అంతా మటుమాయమైపోతుంది. ఎన్నో ఉత్తరాలు, ఎన్నో ఫోన్ కాల్స్, ఎన్నో కామెంట్లు..! వీటన్నింటిలోనూ నేను చదవగలిగినన్ని ఉత్తరాలు చదివాను. వినగలిగినన్ని ఫోన్ కాల్స్ విన్నాను. వీటన్నింటిలోనూ ఎన్నో విషయాలు మనసుని తాకాయి. కానీ కేవలం వాటన్నింటి గురించే

చెప్తూ ఉంటే, బహుశా కొన్ని నెలల పాటు నేను మాట్లాడుతూ ఉన్నా కూడా ఆ కబుర్లు తరగవు. ఇంకా చెప్తూనే ఉండాలేమో.

 

ఈసారి ఎక్కువ శాతం పిల్లల నుండే ఉత్తరాలు వచ్చాయి. పరీక్షలను గురించి రాసిన ఉత్తరాలు. శెలవులలో ఏమేమి చెయ్యాలనుకుంటున్నారో కూడా రాసారు పిల్లలు. వేసవికాలంలో పశుపక్ష్యాదులకు నీటిని అందించే విషయం గురించి రాశారు. రైతుల వేడుకల గురించీ, ఇంకా దేశవ్యాప్తంగా పొలాల్లో జరిగే కార్యక్రమాలను గురించి కొందరు రైతు సోదరుల నుండి, సోదరీమణుల నుండీ ఉత్తరాలు వచ్చాయి. నీటి సంరక్షణ గురించి కొందరు చైతన్యవంతులైన పౌరులు సూచనలు పంపారు. రేడియో మాధ్యమం ద్వారా మనం ’మనసులో మాటలు ’ చెప్పుకోవడం మొదలుపెట్టినప్పటి నుండీ నేనొక విషయాన్ని గమనించాను. వేసవికాలంలో ఎక్కువగా వేసవికాలం గురించిన విషయాలపైనే ఉత్తరాలు వస్తున్నాయి. పరీక్షల ముందర విద్యార్థిమిత్రుల ఆందోళన గురించిన ఉత్తరాలు వస్తాయి. పండుగ సమయాలలో మన పండుగలు, మన సంస్కృతి, మన సంప్రదాయాల గురించిన కబుర్లతో ఉత్తరాలు వస్తాయి. అంటే, మనసులో మాటలు వాతావరణంతో పాటూ మారతాయి. అంతే కాకుండా మన మనసులో మాటలు ఎక్కడో కొందరి జీవితాల వాతావరణాన్ని కూడా మార్చేస్తాయన్నది కూడా నిజం. ఎందుకు మార్చకూడదు? మీ ఈ మాటల్లో, మీ అనుభవాలలో, మీ ఉదాహరణలలో ఎంతో ప్రేరణ, ఎంతో శక్తి, ఎంతో ఆత్మీయత, దేశానికి ఎదో ఒకటి చెయ్యాలన్న తపన ఉంటాయి. వీటన్నింటికీ మొత్తం దేశ వాతావరణాన్నే మార్చేయగల శక్తి ఉంది.

 

అస్సాం లోని కరీమ్ గంజ్ లో ఉండే అహ్మద్ అలీ అనే ఒక ఆటోరిక్షా నడిపుకునే వ్యక్తి, తన పట్టుదలతో తొమ్మిది స్కూళ్ళు కట్టించాడు అనే విషయం నాకు మీ అందరి ఉత్తరాల ద్వారానే తెలిసింది. ఇలాంటి ఉత్తరాల వల్లనే మన దేశం యొక్క మొక్కవోనిన పట్టుదల నాకు కనబడుతుంది. కాన్పూర్ లోని డాక్టర్ అజీత్ మోహన్ చౌధరీ గారి కథ విన్నప్పుడు, ఆయన ఫుట్పాత్ పై నివసించే పేదవారి వద్దకు వెళ్ళి, వారికి వైద్యసేవలను అందించడమే కాక వారికి ఉచితంగా మందులు కూడా అందిస్తారని తెలిసినప్పుడు, ఈ దేశపు సౌభాతృత్వాన్ని తెలుసుకునే అవకాశం నాకు లభించింది. 13ఏళ్ల క్రితం సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల, కలకత్తా లోని కేబ్ డ్రైవర్ సైదుల్ లస్కర్ సోదరి మరణించింది. అందుకని సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల మరే ఇతర పేదవ్యక్తీ చనిపోకూడదన్న సదుద్దేశంతో, ఒక ఆసుపత్రిని నిర్మించాలని ఆయన సంకల్పించాడు. తన ఈ లక్ష్యం కోసం సైదుల్ ఇంట్లోని నగలన్నింటినీ అమ్మాడు, దానాలను స్వీకరించాడు. అతడి కేబ్ లో ప్రయాణించిన ఎందరో ప్రయాణికులు మనస్ఫూర్తిగా దానాలని ఇచ్చారు. ఒక మహిళా ఇంజినీరు తన మొదటి జీతాన్ని సైతం అతడికి ఇచ్చేసింది. ఇలా సమకూర్చుకున్న సొమ్ముతో చివరికి పన్నెండేళ్ల తరువాత,  సైదుల్ లస్కర్ తన బగీరథ ప్రయత్నంలో సఫలం సాధించి, తన శ్రమ ఫలితంగా, తన సంకల్పం కారణంగా, కలకత్తా దగ్గరలో పునరీ గ్రామంలో దాదాపు ముఫ్ఫై పడకలు ఉన్న ఆసుపత్రిని తయారుచేసాడు. ఇది న్యూ ఇండియా బలం.

ఉత్తర్ ప్రదేశ్ లోని ఒక మహిళ అనేక సంఘర్షణల తరువాత 125మరుగుదోడ్ల నిర్మాణం జరిపి, మహిళలందరినీ వారి హక్కుల కోసం పోరాడడానికి ప్రేరణను అందించినప్పుడు, మాతృశక్తి దర్శనం అయ్యింది. ఇలాంటి ఎన్నో ప్రేరణాత్మక సంఘటనలు నాకు నా దేశాన్ని పరిచయం చేస్తాయి. యావత్ ప్రపంచం ఇవాళ భారతదేశం వైపు చూసే దృష్టికోణం మారింది. ఇవాళ భారతదేశం పేరుని ఎంతో గౌరవంగా పలుకుతున్నారంటే, దాని వెనుక ఇలాంటి భరతమాత బిడ్డల ప్రయత్నాలెన్నో దాగి ఉన్నాయి. నేటి రోజున దేశవ్యాప్తంగా యువతలో, మహిళలలో, వెనుకబడిన వర్గాలలో, పేదవారిలో, మధ్యతరగతి వారిలో, అన్ని వర్గాలలోనూ మనం ముందుకు నడవగలము, మన దేశం ముందుకు నడవగలదు అన్న నమ్మకం ఏర్పడింది. ఆశలు, ఆశయాలతో నిండిన ఒక ఆత్మవిశ్వాసంతో కూడిన సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే సానుకూలత మన న్యూ ఇండియా తాలూకూ సంకల్పాన్ని సాకారం చెయ్యగలదు. కలను నిజం చెయ్యగలదు.

 

నా ప్రియమైన దేశప్రజలారా, రాబోయే నెలలు మన రైతు సోదర ,సోదరీమణులందరికీ ఎంతో ముఖ్యమైనవి. ఈ కారణంగా వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో ఉత్తరాలు వచ్చాయి. ఈసారి నేను దూరదర్శన్ ప్రసారం చేసే డిడి కిసాన్ ఛానల్ లో రైతులతో జరిపే చర్చల వీడియోలను కూడా నేను తెప్పించుకుని చూశాను. దూరదర్శన్ ద్వారా ప్రసారమయ్యే ఈ డిడి కిసాన్ ఛానల్ తో ప్రతి రైతూ జతపడాలి, ఆ కార్యక్రమాలను చూడాలి. ప్రతి రైతూ ఆ ప్రయత్నాలని తమ తమ పొలాల్లో కూడా ప్రవేశపెట్టాలని నేను కోరుకుంటున్నాను. మహాత్మా గాంధీ నుండీ శాస్త్రిగారి వరకూ, లోహియా గారూ, చౌధరీ చరణ్ సింహ్ గారూ, చౌధరీ దేవీలాల్ గారూ, అందరూ కూడా వ్యవసాయాన్నీ, వ్యవసాయదారుడినీ, మన దేశ ఆర్థిక వ్యవస్థనూ,  సామాన్య జనజీవనంలో ఒక ముఖ్యమైన భాగంగా భావించారు.

 

మట్టి తోనూ, ధాన్యపు రాసులతోనూ, రైతులతోనూ మహాత్మా గాంధీ గారికి ఎంతో అనుబంధం ఉంది. ఇదే భావం ఆయన మాటల్లోనే ‘To forget how to dig the earth and to tend the soil, is to forget ourselves.’

అంటే, “భూమిని దున్నటం, మట్టిని సంరంక్షించుకోవడం మనం మర్చిపోతే మనల్ని మనమే మర్చిపోయినట్లు” అని అర్థం.

ఇలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా చెట్లు, మొక్కలు, వృక్షాల సంరక్షణ చెయ్యలనీ; మరింత మెరుగైన విధంగా వ్యవసాయ వ్యవస్థను అభివృధ్ధి పరచాల్సిన అవసరం ఉందని ఎన్నోసార్లు నిశ్చయంగా చెప్పేవారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారైతే మన రైతు సోదరుల కోసం మెరుగైన ఆదాయం, మెరుగైన నీటిపారుదల సౌకర్యాలను సునిశ్చితం చెయ్యడానికీ;  ధాన్యం, ఇంకా పాల ఉత్పత్తిని పెంచడానికి పెద్ద ఎత్తున జనాలను జాగృతం చెయ్యాలని చెప్పారు. 1979లో చౌధరీ చరణ సింహ్ గారు తన ఉపన్యాసంలో రైతులతో నూతన సాంకేతిక సదుపాయాలను ఉపయోగించుకునేలా చెయ్యాలనీ, కొత్త ఆవిష్కరణలు చెయ్యాలనీ కోరారు. వాటి అవసరం ఎంతో ఉందని గట్టిగా చెప్పారు. కొద్ది రోజుల క్రితం నేను ఢిల్లీ లో ఏర్పాటైన “వ్యవసాయ అభివృధ్ధి మేళా”కి వెళ్ళాను. అక్కడ రైతు సోదరులు, సోదరీమణులతోనూ, శాస్త్రజ్ఞులతోనూ నేను సంభాషించడం జరిగింది.

వ్యవసాయంతో ముడిపడిన వారి అనుభవాలను తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, వ్యవసాయంతో ముడిపడిన ఆవిష్కరణల గురించి తెలుసుకోవడం నాకొక ఆనందకరమైన విషయం.  మేఘాలయ లోని రైతుల శ్రమను గురించి తెలుసుకోవడం నన్ను అన్నింటికన్నా ఎక్కువగా ప్రభావితం చేసింది. తక్కువ దిగుబడి వచ్చే ఈ ప్రాంతంవారు గొప్ప పని చేసి చూపించారు. మేఘాలయ లోని మన రైతుసొదరులు 2015-16సంవత్సరంలో గత ఐదేళ్ల రికార్డునీ అధుగమించి, రికార్డ్ ఉత్పత్తిని చేసి చూపించారు. లక్ష్యం నిర్ధారితమై ఉన్నప్పుడు, చెక్కుచెదరని ధైర్యం ఉన్నప్పుడు, మనసులో సంకల్పం ఉన్నప్పుడు, లక్ష్యాన్ని తప్పక సిధ్ధించుకోగలము అని వాళ్లు చూపెట్టారు. ఇవాళ రైతుల శ్రమకు, సాంకేతిక సహాయం కూడా తోడౌతోంది. దానివల్ల వ్యవసాయదారులకు ఎంతో బలం చేకూరింది. నా వద్దకు వచ్చిన ఉత్తరాలలో చాలా మంది రైతులు MSP(MSP అంటే, కనీస మద్దతు ధర) గురించి రాశారు. ఈ విషయంపై నేను వారితో చర్చించాలని కూడా వారు కోరారు . సోదరసోదరీమణులారా, ఈసారి బడ్జట్ లో రైతుల పంటలకు సరైన ధర అందించాలనే ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 

సూచించిన పంటలకు MSPని, వారి పెట్టుబడిలో కనీసం ఒకటిన్నర రెట్లు ఉండేలాగ నిర్ణయించడం జరిగింది. వివరంగా చెప్పాలంటే, MSP ని లెఖ్ఖించడం కోసం ఏ పెట్టుబడి అయితే పెడతారో అందులో ఏవేమి కలుస్తాయంటే – పొలంలో పనిచేసేవారి కూలీ, పశువుల ఖర్చు, వాటి గ్రాసం, మషీన్ అద్దెకు తెచ్చిన వాటి ఖర్చు, ఉపయోగించిన అన్నిరకాల ఎరువుల ఖరీదు, నీటి పారుదల ఖర్చు, ప్రభుత్వానికి కట్టే భూమి శిస్తు, వర్కింగ్ క్యాపిటల్ పై కట్టవలసిన వడ్డీ, కౌలుకు తోసుకున్న భూమి తాలూకూ అద్దె, మొదలైనవన్నీ కలుస్తాయి. ఇంతేకాక, శ్రమించే రైతుతో పాటూ అతడి కుటుంబ సభ్యులెవరైనా కూడా అతడికి సహాయపడితే వారి శ్రమ విలువను కూడా ఈ ఖర్చులో కలుపుతారు. ఇంతేకాకుండా రైతుకు తన దిగుబడికి సరైన ధర లభించడం కోసం దేశంలో agriculture marketing reform పై కూడా పెద్ద ఎత్తున పని జరిగుతోంది. గ్రామాలలోని స్థానిక సంతలు, హోల్సేల్ మార్కెట్ల తోటీ, ఇంకా గ్లోబల్ మార్కెట్ల తోటీ కలిసేలాగ ప్రయత్నం జరుగుతోంది. రైతులకు తమ ఉత్పత్తులను అమ్మడానికి ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా దేశంలోని ఇరవై రెండువేల గ్రామీణ మండీలను అవసరమైన ప్రాధమిక సదుపాయాలతో అభివృధ్ధి పరుస్తూ, APMC , ఇంకా e-NAM platform తోటి వాటిని అనుసంధానించబడుతున్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే, వ్యవసాయం తో దేశంలోని ఏ మార్కెట్ తో అయినా ముడిపడేలాంటి ఏర్పాటు జరుగుతోంది.

 

నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సంవత్సరం మహాత్మా గాంధీ గారి 150వ జయంతి ఉత్సవాలు మొదలౌతాయి. ఇది ఒక చారిత్రాత్మిక సందర్భం. దేశం ఏ విధంగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలి? పరిశుభ్ర భారతదేశాన్ని తయారుచెయ్యడం అనేది ఎలానూ మన సంకల్పమే. ఇది కాకుండా 125కోట్ల దేశవాసులందరూ కలిసి గాంధీ గారికి ఎటువంటి ఉత్తమమైన శ్రధ్ధాంజలి ఇవ్వగలం? మీరందరూ మై గౌ యాప్ ద్వారా ఈ విషయంపై మీ అభిప్రాయాలను అందరితో పంచుకోవాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతున్నాను.

’ గాంధీ 150 ’ లొగో ఎలా ఉండాలి? నినాదం లేదా మంత్రం లేదా ప్రకటనా వాక్యం ఏదైతే బావుంటుంది? వీటన్నింటి గురించీ మీరంతా మీ మీ సూచనలను అందించండి. మనందరమూ కలిసి బాపూ కి ఒక అపురూపమైన శ్రధ్ధాంజలిని సమర్పిద్దాం. బాపూని స్మరించుకుంటూ, వారి నుండి ప్రేరణను పొందుతూ, మన దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలి.

 

( మహిళా ఫోన్ కాల్)

“ఆదరణీయ ప్రధానమంత్రి గారూ ,నమస్కారం. నేను గుర్గావ్ నుండి ప్రీతీ చతుర్వేదీ ని మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి గారూ, స్వఛ్ఛభారత ప్రచారాన్ని మీరు ఎలాగైతే ఒక విజయవంతమైన ప్రచారంగా మలిచారో, అదే విధంగా ’ఆరోగ్యకరమైన భారతదేశ ప్రచారాన్ని ’ కూడా విజయవంతం చెయ్యవలసిన సమయం వచ్చింది. ఈ ప్రచారం కోసం మీరు ప్రజలను, ప్రభుత్వాన్నీ, సంస్థలను ఏ విధంగా సంఘటితపరుస్తున్నారో మాకు తెలపండి..ధన్యవాదాలు “

 

ధన్యవాదాలు, మీరు సరిగ్గా చెప్పారు. పారిశుధ్య భారత దేశం, ఆరోగ్యకరమైన భారతదేశం – రెండూ కూడా ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ఉన్నాయన్న మాట నిజం .  ఆరోగ్యరంగంలో ఇవాళ దేశం సంప్రదాయ విధానాల ద్వారా ముందుకు వెడుతోంది. దేశంలో ఆరోగ్యానికి సంబంధించిన ఏ పనికైనా ఇంతకు ముందు కేవలం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కు మాత్రమే బాధ్యత ఉండేది. కానీ ఇప్పుడు అన్ని మంత్రిత్వ శాఖలూ, పారిశుధ్య మంత్రిత్వ శాఖ , ఆయుష్ మంత్రిత్వ శాఖ , రసాయనాల మరియు సేంద్రీయ ఎరువుల మంత్రిత్వ శాఖ , వినియోగదారుల మంత్రిత్వ శాఖ  లేదా మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ , లేదా రాష్ట్ర ప్రభుత్వాలూ అన్నీ కూడా కలిసికట్టుగా ఆరోగ్యకరమైన భారతదేశం కోసం పని చేస్తున్నారు. అంతే కాకుండా వ్యాధి నిరోధక ఆరోగ్యంతో(preventive health) పాటుగా అందుబాటులో ఆరోగ్యానికి(affordable health)  కూడా అధిక ప్రాముఖ్యతని ఇస్తున్నారు. వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణ పట్ల ఎంత ఎక్కువ అప్రమత్తంగా ఉంటే అంత ఎక్కువగా వ్యక్తికీ, కుటుంబానికీ, సమాజానికీ కూడా లాభం చేకూరుతుంది. ఆరోగ్యకరమైన జీవితం  ఉండాలంటే ముందుగా కావాల్సినది -పరిశుభ్రత. గత నాలుగేళ్లలో పారిశుధ్య సంరక్షణ దాదాపు రెట్టింపు అయి దగ్గర దగ్గరగా ఎనభై శాతానికి చేరుకుంది. మనందరమూ కూడా దేశపరంగా దృష్టిని సారించాము కాబట్టి మనకీ పరిణామం లభించింది.

ఇంతే కాకుండా దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణా కేంద్రాలు(health wellness cenres) ఏర్పరచడానికి విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణ(previntive health-care)  రూపంలో యోగా కొత్తగా ప్రపంచవ్యాప్తంగా తనకు గుర్తింపుని తెచ్చుకుంది. ధృఢత్వానికీ, ఆరోగ్యానికీ, రెండిటికీ యోగా గ్యారెంటీని ఇస్తుంది. యోగా ఇవాళ ఇంటింటికీ చేరి, ఒక ప్రజా ఉద్యమం గా మారింది. ఇది మనందరి నిబధ్ధతకూ లభించిన పరిణామం. ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న అయింది. ఇంకా వంద రోజులు కూడా లేవు. గత మూడేళ్ళ లోనూ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు దేశం లోనూ, ప్రపంచంలోనూ , ప్రతి చోటా కూడా ప్రజలందరూ ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈసారి కూడా మనము ఖచ్చితంగా యోగా చేద్దామని నిశ్చయించుకుందాం. మన కుటుంబాన్నీ, స్నేహితులనూ, అందరినీ యోగా చెయ్యవలసిందిగా ప్రోత్సహించడం ఇప్పటి నుండే మొదలుపెట్టండి. ఆసక్తికరమైన కొత్త పధ్ధతుల ద్వారా  పిల్లలలో, యువతలో, వయోవృధ్ధులలో , స్త్రీలైనా, పురుషులైనా, అన్ని వయస్కుల వారిలోనూ యోగా పట్ల ఇష్టాన్ని పెంచాలి. మన దేశంలో టివీ లోనూ, ఇతర ఎలెక్ట్రానిక్ మాధ్యమాల లోనూ ఏడాది పొడువునా యోగా గురించిన రకరకాల కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పటి నుండీ యోగా దినోత్సవం వరకూ ఒక ప్రచార రూపంలో ప్రజలలో యోగా పట్ల అప్రమత్తతను మీరు పెంచగలరా ?

 

నా ప్రియమైన దేశప్రజలారా, నేను యోగా గురువుని కాదు. యోగ సాధనను మాత్రం చేస్తాను. కానీ కొందరు వ్యక్తులు తమ సృజనాత్మకతతో నన్ను ఒక యోగా గురువుని కూడా చేసేసారు. నేను యోగా చేస్తున్నట్లు 3డి యానిమేషన్ వీడియోలను కూడా తయారుచేసారు. నేను మీ అందరికీ ఆ వీడియోలను షేర్ చేస్తాను. వాటి సహాయంతో మనందరం కలిసి ఆసనాలూ, ప్రాణాయామం చెయ్యగలము. ఆరోగ్య సంరక్షణ అనేది సులభంగానూ, అందుబాటులోనూ ఉండాలి. ప్రజలందరికీ చవకైన, సులభమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి విస్తృత స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేడు దేశవ్యాప్తంగా  మూడువేలకంటే ఎక్కువ సార్వజనిక ఔషధ కేంద్రాలు తెరవబడ్డాయి. వాటిల్లో దాదాపు 800 కన్నా ఎక్కువ మందులు తక్కువ ధరకే లభ్యమౌతున్నాయి. ఇటువంటివే మరిన్ని కేంద్రాలు తెరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరం ఉన్నవారికి ఈ సార్వజనిక ఔషధ కేంద్రాల వివరాలను తెలిపి, వారి మందుల ఖర్చుని తగ్గించాల్సిందని నేను ’ మనసులో మాట ’ శ్రోతలను కోరుతున్నాను. దీనివల్ల వారికెంతో సహాయం లభిస్తుంది. హృద్రోగులకు heart stent ధర 85% వరకూ తగ్గించడం జరిగింది. knee implants ధరను కూడా బాగా నియంత్రించి 50 నుండీ 70% వరకూ తగ్గించడం జరిగింది. “ఆయుష్మాన్ భారత యోజన” లో భాగంగా దాదాపు పది కోట్ల కుటుంబాలకి, అంటే దాదాపు ఏభై కోట్ల ప్రజలకి ఒక సంవత్సరకాల వైద్యానికి గానూ ఐదు లక్షల రూపాయిల ఖర్చులను భారత ప్రభుత్వం, ఇన్సురెన్స్ కంపెనీ కలిపి ఇస్తాయి. దేశంలో ఉన్న 479 వైద్య కళాశాలల్లో MBBS సీట్ల సంఖ్యను పెంచి, దాదాపు 68 వేల సీట్లు చేసాము. దేశవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్యం, ఆరోగ్య సదుపాయాలూ అందించేందుకు గానూ వివిధ రాష్ట్రాల్లో కొత్త AIIMS తెరుచుకోబోతున్నాయి.  ప్రతి మూడు జిల్లాలకూ మధ్య ఒక కొత్త వైద్య కళాశాల నిర్మించబడుతుంది. దేశానికి 2025 నాటికల్లా టి.బి నుండి విముక్తి లభించాలని లక్ష్యం ఏర్పరిచాము. ఇది చాలా పెద్ద పని. ప్రజలందరినీ జాగృతం చెయ్యడానికి  మీ సహాయం కావాలి. దేశం టి.బి నుండి విముక్తిని పొందడానికి మనందరమూ కలసికట్టుగా ప్రయత్నం చెయ్యాలి.

 

నా ప్రియమైన దేశప్రజలారా, ఏప్రిల్ 14 వ తేదీన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నోఏళ్ల క్రితమే పారిశ్రామికీకరణ గురించి చెప్పారు.  ఆయన దృష్టిలో పరిశ్రమ అనేది ఎంతో శక్తివంతమైన మాధ్యమం. దీని ద్వారా నిరుపేద వ్యక్తి కి కూడా ఉద్యోగావకాశాలు లభించగలవు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ఒక గొప్ప పారిశ్రామిక శక్తిగా కల గన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా Make in India ప్రచారం విజయవంతంగా నడుస్తోంది అంటే ఆనాటి ఆయన ఆలోచనే దానికి ప్రేరణ. నేడు భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన దేశంగా నిలబడింది. యావత్ప్రపంచం లో  అందరికంటే ఎక్కువ  Foreign Direct Investment, FDI  భారతదేశానికే వస్తోంది. ప్రపంచం మొత్తం  పెట్టుబడికీ, నవీకరణకూ, అభివృధ్ధి కీ కేంద్రంగా భారతదేశాన్ని చూస్తున్నాయి. పట్టణాలలోనే పరిశ్రమల అభివృధ్ధి జరుగుతుంది అనే ఆలోచన తోనే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పట్టణాభివృధ్ధి, నగరీకరణ పై నమ్మకం పెట్టారు. వారి ఈ ఊహను నిజం చెయ్యడానికే నేడు దేశంలో smart cities mission, urban mission మొదలైనవి మొదలుపెట్టడం జరిగింది. దీని వల్ల దేశంలోని పెద్ద పట్టణాలలోనూ, చిన్న నగరాలలోనూ కూడా మంచి రోడ్లు, మంచినీటి వ్యవస్థ, ఆరోగ్య సదుపాయాలు, విద్య, డిజిటల్ కనెక్టివిటీ సౌకర్యాలు మొదలైన అన్ని రకాల సౌలభ్యాలూ లభించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్టర్ బాబా సాహెబ్ గారికి ఆత్మ నిర్భరత, స్వయం సమృధ్ధి లపై గట్టి నమ్మకం ఉంది. ఏ వ్యక్తీ కూడా ఏదరికంలోనే జీవితాన్ని గడపడం అనేది ఆయనకు ఇష్టం లేదు. ఇంతే కాదు, పేదలకు ఏదో పంచిపెట్టేస్తే వారి పేదరికం దూరమయిపోతుంది అన్న విషయాన్ని ఆయన ఒప్పుకునేవారు కాదు. నేడు ముద్రా పథకం, స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా ల ప్రారంభాలు మన యువ ఆవిష్కారులకూ, యువ వ్యాపారస్తులకూ జన్మనిస్తున్నాయి. 1930 నుండీ 1940 వరకూ గడిచిన దశాబ్దంలో భారతదేశంలో కేవలం రోడ్ల, రైళ్ల మాటలే వినిపించేవి. ఆ సమయంలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పోర్ట్ ల గురించీ, నీటి మార్గాల గురించీ మాట్లాడారు. డాక్టర్ బాబా సాహెబ్ గారే జల శక్తిని దేశ శక్తిగా గుర్తించారు.  దేశాభివృధ్ధి కోసం నీటి వాడకం పెరగాలని సూచించారు. వివిధ  river valley authorities నీ, నీటితో సంబంధం ఉన్న రకరకాల కమీషన్స్ అన్నీ కూడా డాక్టర్ బాబా సాహెబ్ గారి కలలే. ఇవాళ దేశంలో పోర్టుల కోసం, జల మార్గాల కోసం చారిత్రాత్మక ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశంలోని  వివిధ సముద్రతీరాల్లో కొత్త కొత్త పోర్టులు తయారవుతున్నాయి. పాత పోర్టుల్లోని ప్రాధమిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నారు. నలభైల కాలంలో ఎక్కువగా రెండవ ప్రపంచయుధ్ధం, ఉద్భవిస్తున్న ప్రచ్ఛన్న యుధ్ధం , విభజన గురించిన చర్చలు ఎక్కువగా జరిగేవి. ఒక విధంగా ఆ సమయంలోనే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశపు నూతన శక్తికి పునాదిని వేసారు. వారు సంయుక్త రాజ్యాంగ పధ్ధతి, సామూహిక వ్యవస్థ ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. దేశాన్ని అభివృధ్ధిలోకి తీసుకురావడానికి కేంద్రం, రాష్ట్రం రెండూ కలిసి పనిచెయ్యాలని కోరారు. నేడు మనం పరిపాలనకు చెందిన ప్రతి  అంశంలోనూ సహకార సమాఖ్యవాదం, co-operative federalism, కంటే కూడా ముందుకు నడిచి competitive co-operative federalism మంత్రాన్ని స్వీకరించాం. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, బలహీన వర్గాలతో ముడిపడి ఉన్న నాలాంటి ఎందరో వ్యక్తులకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప ప్రేరణ. పైకి రావడానికి పేరున్న కుటుంబంలోనో గానీ, ధనిక కుటుంబంలోనో జన్మించాల్సిన అవసరం లేదని; భారత దేశంలో పేద కుటుంబంలో జన్మించిన వారు కూడా తమ కలలను కనచ్చు. వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు, విజయాన్ని పొందచ్చు అని ఆయన మనకు చూపెట్టారు. చాలామంది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని హేళన చేసారు కూడా. ఆయనను వెనకకు నెట్టడానికి ప్రయత్నించారు. ఒక పేద, వెనుకబడిన కుటుంబానికి చెందిన వ్యక్తి ముందుకు నడవకుండా, జీవితంలో ఏమీ సాధించలేకుండా ఉండేలా చేసేందుకు సాధ్యమయినన్ని ప్రయత్నాలు చేసారు. కానీ న్యూ ఇండియా చిత్రం దీనికి భిన్నమైనది. ఆ ఇండియా అంబేద్కర్ కలలు కన్నది. పేదవారిది. వెనుకబడిన వర్గాల వారిది. డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీ నుండీ మే 5వ తేదీ వరకూ “గ్రామ స్వరాజ్య ప్రచారం” ఏర్పాటు చేయబోతున్నారు. దీని ద్వారా యావత్ భారత దేశంలో గ్రామాల అభివృధ్ధి, పేదవారికి మేలు, సామాజిక న్యాయం మొదలైన విషయాలపై వివిధ కార్యక్రమాలు ఉంటాయి. మీ అందరికీ నా విన్నపం ఏమిటంటే, ఈ ప్రచారంలో మీరంతా ఉత్సాహవంతంగా పాల్గోండి.

 

నా ప్రియమైన దేశప్రజలారా, రాబోయే రోజుల్లో ఎన్నో పండుగలు రాబోతున్నాయి. భగవాన్ మహావీర జయంతి, హనుమాన్ జయంతి, ఈస్టర్, బైసాఖీ మొదలైనవి. భగవాన్ మహావీర జయంతి ఆయన త్యాగాన్నీ, తపస్సునీ గుర్తు చేసుకోవాల్సిన రోజు. అహింసా సందేశ ప్రచారకర్తగా భగవాన్ మహావీర్ గారి జీవితమూ, వారి ప్రవచనా మార్గమూ మనందరికీ ప్రేరణను అందిస్తుంది. దేశవాసులందరికీ మహావీర జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఈస్టర్ చర్చ వస్తూనే ప్రేరణాత్మకమైన యేసు ప్రభువు ఉపదేశాలు గుర్తుకు వస్తాయి. ఆయన ఎప్పుడూ మానవతకు శాంతి, సద్భావము, న్యాయము,దయ, కరుణ సందేశాలను అందించారు. ఏప్రిల్ లో పంజాబ్ లోనూ, పశ్చిమ భారత దేశంలోనూ బైశాఖీ ఉత్సవం జరుపుకుంటారు. అదే రోజుల్లో బీహార్ లో జుడ్ శీతల్, సతువాయిన్ , అస్సాం లో బిహు, పశ్చిమ బెంగాల్ లో పోయిలా వైశాఖ్ ల హర్షోల్లాసాలు నిండి ఉంటాయి. ఈ పండుగలన్నీ ఏదో ఒక రూపంలో మన వ్యవసాయం తోనూ, ధాన్యపు రాసులతోనూ, అన్నదాతలతోనూ ముడిపడి ఉంటాయి. దిగుబడి రూపంలో లభించే అపురూపమైన కానుకలకు మనం ఈ పండుగల మాధ్యమం ద్వారా ప్రకృతికి ధన్యవాదాలు సమర్పిస్తాము. మరోసారి మళ్ళీ మీ అందరికీ రాబోయే అన్ని పండుగల సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు. అనేకానేక ధన్యవాదాలు.