పిఎంఇండియా
హెచ్ ఐ వి, ఎయిడ్స్ (నివారణ మరియు నియంత్రణ) బిల్లు, 2014లో ఆధికారిక సవరణలను ప్రవేశపెట్టేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
హెచ్ ఐ వితో బాధ పడుతున్న, హెచ్ ఐ వి వ్యాధి సోకిన వారి హక్కుల రక్షణ కోసం హెచ్ ఐ వి, ఎయిడ్స్ బిల్లు 2014ని రూపొందించారు. హెచ్ ఐ వి రోగుల పట్ల వివక్ష ప్రదర్శించడాన్ని నిలువరించడంతో పాటు ఫిర్యాదులపై దర్యాప్తునకు అవసరమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయడం ద్వారా చట్టపరమైన బాధ్యతను కల్పించి ప్రస్తుత వ్యవస్థలను పటిష్ఠం చేయడం ఈ బిల్లు లక్ష్యం. హెచ్ ఐ వి, ఎయిడ్స్ రోగుల పట్ల వివక్షను నిర్మూలించడంతో పాటు వారి చికిత్స, చికిత్స జరుగుతున్న ప్రదేశం వంటి వివరాలను కూడా గోప్యంగా ఉంచేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. అంతే కాదు, ఇటువంటి వ్యక్తులకు చేసే వైద్య పరీక్షలు, చికిత్స, క్లినికల్ రిసర్చ్ కు సంబంధించిన సమాచారానికి సంపూర్ణ రక్షణను కల్పించడం వల్ల వారికి మరింత మెరుగైన వైద్య చికిత్సలు అందుబాటులోకి వస్తాయి.
హెచ్ ఐ వి పాజిటివ్ గా కనుగొన్న వ్యక్తులతో పాటు వారితో నివసిస్తున్న వారి పట్ల కూడా ఎటువంటి వివక్షను ప్రదర్శించే అవకాశం లేకుండా ఈ బిల్లులో కొన్ని అంశాలు పొందుపరిచారు. అవి.. :
(i) ఉపాధి కల్పన సంస్థలు
(ii) విద్యాసంస్థలు
(iii) ఆరోగ్య సంరక్షణ సేవలు
(iv) నివాసం, ప్రాపర్టీలు అద్దెకు ఇవ్వడం
(v) ప్రభుత్వ సంస్థలో లేదా ప్రయివేటు సంస్థలో ఏదైనా హోదాను పొందడం
(vi) బీమా ప్రయోజనం కల్పించడం (యాక్చుయరియల్ అధ్యయనాలు మినహా). ఆరోగ్య సంరక్షణ లేదా ఉపాధి కల్పన లేదా విద్యాసంస్థలలో ప్రవేశం కోసం హెచ్ ఐ వి పరీక్షలు నిర్వహించుకోవాలన్న షరతు విధించడాన్ని కూడా నిషేధించారు.
18 సంవత్సరాల లోపు వయసున్న హెచ్ ఐ వి బాధితులలో ప్రతి ఒక్కరికీ నలుగురితో కలసి ఒకే ఇంట్లో నివసించే హక్కుతో పాటు ఇళ్ళ లోని వసతులన్నింటినీ ఉపయోగించుకునే హక్కు ఉంటుంది. హెచ్ ఐ వి పాజిటివ్గా గుర్తించిన వ్యక్తులకు సంబంధించిన సమాచారం ప్రచురించడం, వారి పట్ల సమాజంలోను, చుట్టుపక్కల వారిలోను ఏహ్యతా భావం కలిగేందుకు దోహదపడడం వంటి చర్యలు కూడా నిషేధం. అలాగే మైనర్లకు కూడా సంపూర్ణ సంరక్షణ అందించాలి. హెచ్ ఐ వికి, ఎయిడ్స్ కు సంబంధించిన అంశాలను అర్ధం చేసుకోగల శక్తి ఉన్న 12 ఏళ్ల నుండి 18 ఏళ్ల మధ్య వయస్కులకు కూడా పాఠశాలల్లో ప్రవేశం, బ్యాంక్ ఖాతాల నిర్వహణ, ఆస్తి నిర్వహణ, సంరక్షణ, చికిత్స వంటి అంశాలలో ఇతరులతో పాటు 18 ఏళ్ల లోపు వయస్కులైన ఇతర వ్యక్తులకు సంరక్షకులుగా ఉండే హక్కు కల్పించారు.
“ఏ వ్యక్తి కూడా న్యాయస్థానానికి సమాచారం అందించవలసిన సందర్భంలో మినహా తనంత తానుగా సిద్ధపడితే తప్ప తనకు హెచ్ ఐ వి ఏ దశలో ఉందన్న అంశానికి సంబంధించిన సమాచారం ఎవరికీ అందించవలసిన అవసరం లేదు.” ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 లక్షల మంది హెచ్ ఐ వి బాధితులు ఉన్నట్టు అంచనా. గత దశాబ్ది కాలంగా హెచ్ ఐవి తీవ్రత తగ్గినా కొత్త ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అందిస్తున్న కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది. స్థిర అభివృద్ధి లక్ష్యాల కింద 2030 నాటికి ఎయిడ్స్ ను పూర్తిగా నిర్మూలించేందుకు సహాయకారిగా నిలుస్తుంది. హెచ్ ఐవి పాజిటివ్ గా గుర్తించిన వ్యక్తులకు సంబంధించిన రికార్డులు నిర్వహించే సంస్థలు వారి వద్ద ఉన్న డేటా రక్షణకు సంపూర్ణ చర్యలు తీసుకోవాలి. ఈ బిల్లుకు అనుగుణంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఈ దిగువ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది...
(i) హెచ్ ఐ వి, ఎయిడ్స్ వ్యాప్తిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలి
(ii) హెచ్ ఐ వి, ఎయిడ్స్ బాధితులకు యాంటి- రిట్రో వైరల్ థెరపీ అందించాలి, ఇన్ఫెక్షన్ ల నివారణకు చర్యలు తీసుకోవాలి
(iii) మహిళలు, బాలలకు సంబంధించి అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు ఎయిడ్స్ బాధితులకు కూడా అందించాలి
(iv) ఆయా వయసులకు, ఆయా లింగభేదానికి అనుగుణంగా హెచ్ ఐ వి, ఎయిడ్స్ పై అవగాహన పెంచేందుకు విద్యాకార్యక్రమాలు నిర్వహించాలి
(v) హెచ్ ఐ వి లేదా ఎయిడ్స్ బాధితులైన పిల్లల సంరక్షణ, చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాలు జారీచేయాలి. సంరక్షణ లేదా కస్టడీలో ఉన్న ప్రతి ఒక్కరికీ హెచ్ ఐ వి నివారణ, పరీక్ష, చికిత్స, కౌన్సెలింగ్ సర్వీసులు అందుకునే హక్కు ఉంటుంది. న్యాయస్థానాలు కూడా హెచ్ ఐ వి పాజిటివ్ గా గుర్తించిన వ్యక్తుల కేసులను వారి గోప్యతను కాపాడుతూనే ప్రాధాన్యత ప్రతిపత్తిపై పరిష్కరించాలి.
ఈ బిల్లుకు సంబంధించి ఎటువంటి ఆర్థిక భారం ఉండదు. ఇందులో పొందుపరిచిన కార్యకలాపాల్లో అధిక శాతం ప్రస్తుతం వివిధ శాఖలు అమలు పరుస్తున్నవే కాకుండా శిక్షణ, సమాచారం, డాటా నిర్వహణ ల వంటి భిన్న కార్యకలాపాలు వివిధ మంత్రిత్వ శాఖల సమన్వయంతో అమలుజరుగుతున్నవే. చట్టం ఉల్లంఘనలకు సంబంధించి వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు, చట్టానికి కట్టుబడని వారికి శిక్షలు విధించేందుకు రాష్ర్టప్రభుత్వాలు అంబుడ్స్ మన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అంబుడ్స్ మన్ ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల నుంచే అర్హులైన వారికి డెప్యుటేషన్ పై నియమించవచ్చు లేదా అదనపు బాధ్యతగా అప్పగించవచ్చు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 లక్షల మంది హెచ్ ఐ వి బాధితులు ఉన్నారని ఒక అంచనా. గత దశాబ్ది కాలంగా హెచ్ ఐ వి తీవ్రత తగ్గినా, కొత్త ఇన్ఫెక్షన్ లను నిరోధించడంలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కు మద్దతు ఇస్తుంది. స్థిర అభివృద్ధి లక్ష్యాల కింద “2030 నాటికి ఎయిడ్స్ ను నిర్మూలించేందుకు” సహాయకారిగా నిలుస్తుంది.