Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో దాదాపు ₹5,650 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం.. జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తమిళనాడులోని చారిత్రక నగరం తిరుచ్చిలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతోపాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా పరిణామాత్మక అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ మేరకు రూ.5600 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్య రహిత ఇంధనం, పెట్రోలియం సంబంధిత తయారీ, హైవే-రైల్వే, గ్రామీణ రహదారుల రంగాల్లో ఈ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ-  “ఇవన్నీ తమిళనాడు యువతకు ఇంధన లభ్యత, బహుళ రవాణా అనుసంధానం సహా వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయి” అని పేర్కొన్నారు.

సుస్థిర ఇంధనంపై దృష్టితో తలపెట్టిన భారత్ పెట్రోలియం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్‌వర్క్‌కు  ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.3,700 కోట్ల విలువైన ప్రాజెక్టు దాదాపు 9 లక్షల కుటుంబాలు సహా అనేక వాణిజ్య సంస్థలకు ‘పైప్డ్ నేచురల్ గ్యాస్’ (పీఎన్‌జీ) సరఫరాతో పాటు నీలగిరి, ఈరోడ్ జిల్లాల రూపాంతరీకరణకు తోడ్పడుతుంది. దీనివల్ల ఒనగూడే పర్యావరణ ప్రయోజనాలను శ్రీ  మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తూ- “కేవలం ఎనిమిదేళ్లలో ఈ ప్రాజెక్ట్ చూపే సానుకూల పర్యావరణ ప్రభావం ఏకంగా 4 కోట్ల మొక్కలు నాటడంతో సమానం” అని వివరించారు.

చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ‘లూబ్ బ్లెండింగ్ ప్లాంట్‌’ను జాతికి అంకితం చేయడాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ బలోపేతం దిశగా కీలక చర్యగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఇటువంటి భారీ సౌకర్యాలలో ఇదొకటి కాగా, రాష్ట్రంలో, రాష్ట్రేతర ప్రాంతాల్లోగల వివిధ పరిశ్రమల అదనపు డిమాండ్‌ను ఇది తీర్చగలదన్నారు. “లూబ్రికెంట్ల స్థానిక ఉత్పాదన పెరుగుదలతో దిగుమతులు తగ్గడమేగాక దేశానికి భారీగా నిధులు ఆదా అవుతాయి” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద నిర్మించిన 370 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ రహదారుల వినియోగం ద్వారా గ్రామీణ అనుసంధాన ప్రాముఖ్యం స్పష్టం కాగలదని ఆయన అన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, మార్కెట్ల సౌలభ్యం దిశగా ఈ రహదారులు గ్రామీణులకు ఇతోధికంగా తోడ్పడతాయని తెలిపారు. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రధాన స్రవంతితో అనుసంధానం కాగలదని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- “ఈ రోజు ప్రారంభించిన గ్రామీణ రహదారులలో ప్రతి ఒక్కటీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధితోపాటు జీవన సౌలభ్యాన్ని పెంచుతుంది” అని ప్రధానమంత్రి వివరించారు.

ఈ ప్రాంతం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా- గంగైకొండ చోళపురం వద్ద కొత్త హైవే బైపాస్ ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రకటించారు. పవిత్ర స్థలం నుంచి భారీ ట్రాఫిక్‌ను మళ్లించడం ద్వారా రాజేంద్ర చోళ చక్రవర్తి నిర్మించిన ఆలయ వైభవాన్ని రక్షించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అలాగే యునెస్కో గుర్తింపు పొందిన స్మారక చిహ్నంతోపాటు అక్కడికి వచ్చే సందర్శకుల భద్రతకు భరోసా ఇస్తుంది. ఈ కొత్త మౌలిక సదుపాయాల గురించి శ్రీ మోదీ వివరిస్తూ- “దీని అంతరార్థం అందరికీ మెరుగైన భద్రత” అని ఆయన స్పష్టం చేశారు.

అమృత భారత్ కార్యక్రమం కింద ఇటీవల 8 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, పునరాభివృద్ధి నేపథ్యంలో నేటి ప్రాజెక్టులు రాష్ట్ర రవాణా రంగంలో ఆధునికీకరణ వేగం పెంచుతాయని చెబుతూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా తమిళనాడులో పర్యాటకం, స్థానిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడంతోపాటు నాగర్‌కోయిల్, కోయంబత్తూర్, రామేశ్వరం, తిరునల్వేలి, మైలాడుతురై, కారైక్కూడి వంటి కీలక ప్రదేశాలను ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తూ కొత్త రైలు సర్వీసులను కూడా ఆయన ప్రారంభించారు. చివరగా- రాష్ట్ర భవిష్యత్తుపై తన దార్శనికతను పునరుద్ఘాటిస్తూ- “రాష్ట్ర ప్రగతి కోసం మేం రాత్రింబవళ్లు చేస్తున్న కృషిని ఇకపైనా కొనసాగిస్తాం” అని హామీ ఇస్తూ ప్రసంగం ముగించారు.

 

***