పిఎంఇండియా
స్మార్ట్ నగరాల అభివృద్ధికి బాసటగా నిలిచేందుకు న్యూ యార్క్ కు చెందిన బ్లూంబర్గ్ ఫిలాంత్రపీస్ (బీపీ), కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో కుదుర్చుకున్న ఒక అవగాహనపూర్వక ఒప్పందానికి
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ ప్రతిపాదన ప్రకారం బ్లూంబర్గ్ ఫిలాంత్రపీస్ స్మార్ట్ సిటీస్ మిషన్ అమలులో నాలెడ్జ్ పార్ట్ నర్ గా పనిచేస్తుంది. కేంద్ర మత్రివర్గం 2015 ఏప్రిల్ 29 నాటి సమావేశంలో స్మార్ట్ సిటీస్ మిషన్ కు ఆమోదముద్ర వేసింది. ప్రధాన మంత్రి 2015 జూన్ 25న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే రోజు స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రకటనతో పాటు మార్గదర్శకాలు కూడా విడుదల అయ్యాయి.
స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా పట్టణ ప్రాంత ప్రజల జీవన నాణ్యత మరింత మెరుగుపడే దిశగా చక్కని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. ప్రధాన సవాళ్లను పరిష్కరించడానికి దోహదం చేసే విధి విధానాలను నగర మేయర్లకు, స్థానిక నాయకులకు బ్లూంబర్గ్ ఫిలాంత్రపీస్ గవర్నమెంట్ ఇన్నొవేషన్ ఇనీషియేటివ్స్ యే సమకూర్చుతుంది. అలాగే, ప్రభుత్వ రంగ సంస్థలు కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టేటట్లుగా కూడా తోడ్పడుతుంది. నాలెడ్జ్ పార్ట్ నర్ గా బ్లూంబర్గ్ ఫిలాంత్రపీస్ నగర ప్రాంతాలలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సైతం అండదండలు అందిస్తుంది. స్మార్ట్ సిటీస్ మిషన్ కు తోడ్పాటును అందించడంలో భాగంగా చేపట్టే కార్యక్రమాలకు అయ్యే ఖర్చులను బ్లూంబర్గ్ ఫిలాంత్రపీస్ తనే భరిస్తుంది. ఈ ఖర్చుల భారం భారత ప్రభుత్వంపై ఏమీ పడబోదు.