Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లోని సనంద్‌లో ‘సీజీ సెమీ అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ-టెస్ట్ ప్లాంటు’ ప్రారంభోత్సవ విశేషాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

గుజరాత్‌లోని సనంద్‌లో ‘సీజీ సెమీ అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ-టెస్ట్ ప్లాంటు’ ప్రారంభోత్సవ విశేషాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని సనంద్‌లో ‘సీజీ సెమీ అవుట్‌సోర్స్‌డ్  సెమీకండక్టర్ అసెంబ్లీ-టెస్ట్ (ఓశాట్‌) ప్లాంటు’ను ఇవాళ ప్రారంభించారు. ఈ కర్మాగారం ప్రాధాన్యాన్ని వివరిస్తూ- జాతీయ లక్ష్యాల సాకారంలో భారత్‌ నిబద్ధతకు ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. దేశం తన బలమైన సంకల్పాలను ఎలాంటి సంకోచం లేకుండా విస్పష్ట వాస్తవాలుగా రూపుదిద్దడంలో స్థిరంగా ముందుకు సాగుతున్నదని ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన వరుస సందేశాల్లో:

   “సీజీ సెమీ అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ-టెస్ట్ కర్మాగారాన్ని ప్రారంభించడానికి సనంద్‌కు మరోసారి రావడం ఎంతో అద్భుతమనిపిస్తోంది. భారత్‌ను సెమీకండక్టర్స్, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీల కూడలిగా మలచడంలో మా కృషి ఇక మరింత వేగం పుంజుకుంటుంది.”

   “సనంద్‌లో ప్రారంభమైన సీజీ సెమీ ప్లాంట్ భారత సెమీకండక్టర్ రంగ ప్రస్థానాన్ని మరింత వేగిరపరుస్తూ సాంకేతికత, విశ్వాసం, భాగస్వామ్యానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది.”

“ఎలక్ట్రానిక్స్ విప్లవంలో సెమీకండక్టర్ల తయారీ తదుపరి దశ. అందుకే, మనం కేవలం మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌కు మాత్రమే కాకుండా, యావత్ ప్రపంచానికీ శక్తినిచ్చే చిప్‌లను మనం తయారు చేస్తాం.”

“నేటి సెమీకండక్టర్, ఏఐ విప్లవ శకంలో నా యువ మిత్రులకు నాదొక ప్రత్యేక అభ్యర్థన… మీరంతా గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని, సాకారానికి కృషి చేయండి” అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

 

***