పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలో సుమారు రూ.24,815 కోట్ల వ్యయంతో చేపట్టే రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వివరాలిలా ఉన్నాయి:
ప్రాజెక్టు పేరు
మార్గం పొడవు (కి.మీ)
పట్టాల పొడవు (కి.మీ)
మొత్తం వ్యయం (రూ.కోట్లలో)
ఘజియాబాద్-సీతాపూర్
3వ, 4వ లైన్లు
403
859
14,926
రాజమండ్రి(నిడదవోలు)-విశాఖ పట్నం(దువ్వాడ) 3వ, 4వ లైన్లు
198
458
9,889
మొత్తం
601
1,317
24,815
రైలు మార్గాల సామర్థ్యం పెరుగుదలతో రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగవుతుంది. తద్వారా భారత రైల్వేల కార్యాచరణ సామర్థ్యం, సేవా ప్రదానంలో విశ్వసనీయత కూడా ఇనుమడిస్తాయి. ఈ మల్టీ ట్రాక్ నిర్మాణ ప్రతిపాదన సాకారమయ్యాక కార్యకలాపాల క్రమబద్ధీకరణ, రద్దీ తగ్గింపు సాధ్యమవుతాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘నవ భారత్’ దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఆయా ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధితో అక్కడి ప్రజలకు ‘స్వావలంబన’ దిశగా ఉపాధి-స్వయం ఉపాధి అవకాశాలను పెంచాలన్నది ఆయన ఆలోచన.
సమగ్ర ప్రణాళిక, భాగస్వాములతో సంప్రదింపుల ద్వారా బహుళ-రవాణా అనుసంధానాన్ని, రవాణా సదుపాయాల సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి సారిస్తూ పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళికకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. ఇవి పూర్తయితే ప్రజలకు, వస్తుసేవల రవాణాకు నిరంతరాయ అనుసంధానం కలుగుతుంది.
ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 15 జిల్లాలను కలుపుతూ సాగే ఈ రెండు ప్రాజెక్టులు భారత రైల్వేల ప్రస్తుత నెట్వర్క్ను సుమారు 601 కిలోమీటర్ల మేర పెంచుతాయి.
ప్రతిపాదిత సామర్థ్య పెంపుదలతో ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం సహా ఉత్తరప్రదేశ్లోని దుధేశ్వర్నాథ్ ఆలయం, గఢ్ముక్తేశ్వర్ గంగా ఘాట్, దర్గా షా విలాయత్ జామా మసీదు (అమ్రోహా), నైమిశారణ్యం (సీతాపూర్) తదితర ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు రైల్వే అనుసంధానం మెరుగవుతుంది.
బొగ్గు, ఆహార ధాన్యాలు, సిమెంట్, పెట్రోలియం, పీఓఎల్, ఇనుము-ఉక్కు, కంటైనర్లు, ఎరువులు, చక్కెర, రసాయన లవణాలు, సున్నపురాయి తదితర వస్తువుల రవాణాలో ప్రతిపాదిత ప్రాజెక్టులు కీలక మార్గాలుగా ఉపయోగపడతాయి. రైల్వేలు పర్యావరణ హిత, ఇంధన పొదుపు సామర్థ్యం గల రవాణా విధానంలో భాగం కాబట్టి, వాతావరణ కార్యాచరణ లక్ష్యాల సాధనతోపాటు దేశ రవాణా వ్యయం తగ్గింపులో దోహదం చేస్తాయి. తద్వారా 7.33 కోట్ల మొక్కలు నాటడంతో సమానమైన 180.31 కోట్ల కిలోల కర్బన ఉద్గారాల ముప్పు తగ్గుతుంది.
ఘజియాబాద్ – సీతాపూర్ 3వ.. 4వ లైన్ (403 కి.మీ.)
· ఘజియాబాద్ – సీతాపూర్ ఇప్పటికే డబుల్ లైన్ సెక్షన్ కాగా, ఇది ఢిల్లీ-గువహటి హై డెన్సిటీ నెట్వర్క్ (హెచ్డీఎన్ 4)లో కీలక అంతర్భాగం.
· దేశంలోని ఉత్తర-తూర్పు ప్రాంతాల మధ్య అనుసంధానం మెరుగుదలలో ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకం.
· ఈ సెక్షన్ పరిధిలో ప్రస్తుత లైన్ సామర్థ్య వినియోగం 168 శాతం కాగా, ఈ ప్రాజెక్టు చేపట్టని పక్షంలో 207 శాతం దాకా ఉండేదని అంచనా.
· ఈ మార్గం ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్, హాపూర్, అమ్రోహా, మొరాదాబాద్, రాంపూర్, బరేలీ, షాజహాన్పూర్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్ జిల్లాల మీదుగా నిర్మితమవుతుంది.
· అంతేకాకుండా ఘజియాబాద్ (యంత్రాలు, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్), మొరాదాబాద్ (ఇత్తడి వస్తువులు, చేతివృత్తుల పరిశ్రమ), బరేలీ (ఫర్నిచర్, వస్త్రాలు, ఇంజనీరింగ్), షాజహాన్పూర్ (కార్పెట్లు, సిమెంట్ సంబంధిత పరిశ్రమలు), రోజా (థర్మల్ పవర్ ప్లాంట్) వంటి ప్రధాన పారిశ్రామిక కేంద్రాల మీదుగా వెళుతుంది.
· నిరంతరాయ రవాణా కోసం హాపుర్, సింభావోలి, మొరాదాబాద్, రాంపూర్, బరేలీ, షాజహాన్పూర్, సీతాపూర్ వంటి రద్దీ స్టేషన్లను తప్పిస్తూ వెళ్లే విధంగా ఈ మార్గం నిర్మాణ ప్రణాళిక రూపొందించారు. ఆ మేరకు ఆ మార్గాలలో 6 కొత్త స్టేషన్లను ప్రతిపాదించారు.
· ఈ ప్రాజెక్ట్ పరిసరాల్లోని ప్రసిద్ధ పర్యాటక/ఆధ్యాత్మిక ప్రదేశాలలో దుధేశ్వర్నాథ్ ఆలయం, గఢ్ముక్తేశ్వర్ గంగా ఘాట్, దర్గా షా విలాయత్ జామా మసీదు (అమ్రోహా), నైమిశారణ్యం (సీతాపూర్) తదితరాలున్నాయి.
· ఈ మార్గంలో బొగ్గు, ఆహార ధాన్యాలు, రసాయన ఎరువులు, ఉక్కు వంటి 35.72 ‘ఎంటీపీఏ’ అదనపు సరకు రవాణా సామర్థ్యం సమకూరుతుందని అంచనా.
· అంచనా వ్యయం: దాదాపు రూ.14,926 కోట్లు
· ఉపాధి కల్పన: 274 లక్షల మానవ పనిదినాలు.
· కర్బన ఉద్గారాల నివారణ: ఈ మార్గం నిర్మించడం వల్ల 5.15 కోట్ల మొక్కలు నాటితే కలిగే ప్రయోజనానికి సమానంగా సుమారు 128.77 కోట్ల కిలోల కర్బన ఉద్గారాల నివారణ సాధ్యమవుతుంది.
· రవాణా వ్యయం ఆదా: రహదారులపై రవాణాతో పోలిస్తే ఏటా రూ.2,877.46 కోట్లు మిగులు.
ఘజియాబాద్ – సీతాపూర్ 3వ.. 4వ లైన్ (403 కి.మీ.)
———————————————————
రాజమండ్రి (నిడదవోలు) – విశాఖపట్నం (దువ్వాడ) 3వ, 4వ లైన్లు (198 కి.మీ.)
· రాజమండ్రి (నిడదవోలు) – విశాఖపట్నం (దువ్వాడ) సెక్షన్ హౌరా – చెన్నై హై డెన్సిటీ నెట్వర్క్ (హెచ్డీఎన్)లో కీలక అంతర్భాగం.
· హౌరా – చెన్నై హై డెన్సిటీ నెట్వర్క్ మార్గాన్ని నాలుగు వరుసలకు విస్తరించే ప్రణాళికలో ఒక భాగంగా ప్రతిపాదిత ప్రాజెక్టును చేపడుతున్నారు.
· ఈ మార్గం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల మీదుగా వెళుతుంది.
· ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో విశాఖపట్నం కూడా ఒకటిగా ఉంది.
· విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, కాకినాడ వంటి తూర్పు తీర ప్రధాన ఓడరేవులను ఈ మార్గం అనుసంధానిస్తుంది.
· తూర్పు తీరప్రాంతం వెంబడి సాగుతుంది కాబట్టి, ఈ రైల్ కారిడార్లో అత్యంత రద్దీగల, ప్రధానంగా సరకు రవాణా ఆధారిత విభాగాలలో ఇదొకటిగా ఉంది.
· ఈ సెక్షన్ లైన్ సామర్థ్య వినియోగం ఇప్పటికే 130 శాతానికి చేరడంతో తరచూ రద్దీతోపాటు కార్యకలాపాల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత ఓడరేవులు, పరిశ్రమల విస్తరణ వల్ల కొత్త ప్రాజెక్టుతో లైన్ సామర్థ్యం మరింత పెరుగుతుంది.
· ప్రాజెక్ట్ సెక్షన్లో గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల పొడవైన రైలు వంతెన, 2.67 కి.మీ. వయాడక్ట్, 3 బైపాస్లు ఉంటాయి. ఈ కొత్త అలైన్మెంట్ ప్రస్తుత మార్గంతో పోలిస్తే సుమారు 8 కి.మీ. మేర తక్కువ పొడవు గలది కావడంతో అనుసంధానం, కార్యకలాపాల సామర్థ్యం మెరుగవుతాయి.
· ప్రతిపాదిత సెక్షన్ అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం వంటి కీలక ప్రదేశాలకు సంధానం మెరుగుదల ద్వారా పర్యాటక రంగానికీ ప్రోత్సాహం లభిస్తుంది.
· బొగ్గు, సిమెంట్, రసాయన ఎరువులు, ఇనుము-ఉక్కు, ఆహార ధాన్యాలు, కంటైనర్లు, బాక్సైట్, జిప్సం, సున్నపురాయి తదితరాలతో కూడిన 29.04 ‘ఎంటీపీఏ’ మేర అదనపు సరకు రవాణా సామర్థ్యం సమకూరుతుందని అంచనా.
· అంచనా వ్యయం: దాదాపు రూ.9,889 కోట్లు.
· ఉపాధి కల్పన: 135 లక్షల మానవ పనిదినాలు.
· కర్బన ఉద్గారాల నివారణ: 2.06 కోట్ల మొక్కలు నాటితే కలిగే ప్రయోజనానికి సమానంగా సుమారు 51.49 కోట్ల కిలోల కర్బన ఉద్గారాల నివారణ సాధ్యమవుతుంది.
· రవాణా వ్యయం ఆదా: రహదారులపై రవాణాతో పోలిస్తే ఏటా రూ. 1,150.56 కోట్లు మిగులు.
ఆర్థిక సాధికారత:
· ఆకాంక్షిత జిల్లాలకు లబ్ధి: విశాఖపట్నం జిల్లాకు అనుసంధానం మెరుగవుతుంది.
· పర్యాటక, పరిశ్రమల రంగం ద్వారా ఈ ప్రాంతంలో అదనపు ఆర్థిక అవకాశాల లభ్యత.
· రైల్వే అనుసంధానం మెరుగుదలతో పౌరులకు ఆరోగ్య సంరక్షణ, విద్య పరంగా మరింత సౌలభ్యం.
రాజమండ్రి (నిడదవోలు) – విశాఖపట్నం (దువ్వాడ) 3వ, 4వ లైన్లు (198 కి.మీ.)
——————————————————–
రైల్వేలపై ప్రధానమంత్రి శ్రద్ధ:
· కేంద్ర బడ్జెట్ 2026-27లో రూ.2,65,000 కోట్ల మేర రికార్డు స్థాయి నిధుల కేటాయింపు.
· ఉత్పాదన సామర్థ్యంలో అమెరికా, ఐరోపాలను అధిగమిస్తూ దేశంలో 1600కు పైగా రైలు ఇంజన్ల తయారీ.
· భారతీయ రైల్వే 2026లో 1.6 బిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా ప్రపంచంలోని మూడు అగ్రగామి రవాణా సంస్థల జాబితాలో స్థానం సంపాదించగలదని అంచనా.
· భారత్ నుంచి ఆస్ట్రేలియాకు మెట్రో కోచ్లు సహా యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాలకు బోగీల ఎగుమతి కూడా ప్రారంభం.
***