Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరప్రదేశ్ లో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపనల సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం


మహిళలు మరియు సజ్జనులారా,

భగవాను శివునికి సంవత్సరం లో అత్యంత ప్రీతిపాత్రమైన నెల అయినటువంటి శ్రావణ మాసం ఇప్పుడిక వచ్చేసింది.  దేశం లోని వేరు వేరు ప్రాంతాలకు చెందిన భగవాన్ శివుని భక్తులు వారి వారి ప్రణాళిక లతో ఇక్కడకు తరలివస్తారు.  ఒక రకంగా, ఇది పండుగల కాలం ఆరంభం కావడానికి సూచిక.  దీపావళి తో ఈ పండుగల కాలం ముగుస్తుంది.

మిత్రులారా,

పండుగ లతో పాటు, దేశం లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా మొదలయ్యాయి.  మంచి వర్షాలు వ్యవసాయానికి, పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థకు శుభ సూచకం.  అయితే, ఈ భారీ వర్షపాతం దేశం లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు కష్టాలు తెస్తోంది.  ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  కష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా కృషి చేస్తున్నాయి.

మిత్రులారా,

సున్నితమైన ప్రభుత్వం కావడం వలన; సామాన్య ప్రజల జీవితాలను సులువుగాను, సమస్యలు ఉండని విధంగాను మలచడం మా ప్రాథమిక బాధ్యత.  ఇదే మా ఏకైక లక్ష్యం.  ఈ లక్ష్య సాధన కోసమే మేం గత నాలుగు సంవత్సరాలుగా ముందుకు అడుగులు వేస్తున్నాము.  ఈ ప్రయత్నంలో ఈ రోజు లఖ్ నవూ లోని ఈ హాలు లో గుమికూడిన సభికులు ఓ భాగం.  పట్టణ జీవితాలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్ధేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు చిక్కింది.   ఉత్తర ప్రదేశ్ లోని నగరాలకు సంబంధించిన ప్రాజెక్టు లకు శంకుస్థాపన చేసే భాగ్యం నాకు లభించింది.  అలాగే ఇళ్ళు లేని సోదర సోదరీమణులకు ఇంటి తాళాలను అందించే అదృష్టం కూడా నాకు దక్కింది.  ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా పరివర్తన తీసుకు రావాలనే ప్రతిపాదన తో ముందుకు సాగుతున్నందుకు ఈ రోజు నాకు  ఆనందంగా ఉంది.

మిత్రులారా,

గత 5 నెలల్లో లఖ్ నవూ లోని నా పారిశ్రామిక మిత్రులను కలవడం ఇది రెండో సారి.   ఇంతకు ముందు,  ఫిబ్రవరి లో ఉత్తర ప్రదేశ్ పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా నేను లఖ్ నవూ వచ్చాను.   ఆ సదస్సు సందర్భంగా ఉత్తర ప్రదేశ్ లో 4. 25 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు నాకు చెప్పారు.   ఆ ప్రతిపాదనలు  ఈ రోజు  కార్యరూపం దాల్చినందుకు నాకు సంతోషంగా ఉంది.

60 వేల కోట్ల రూపాయలు పెద్ద మొత్తం కాదని- సతీశ్ గారు ఎందుకు సంకోచంగా అంటున్నారో నాకు తెలియదు.  ఆయన వినయ పూర్వకమైన, మనస్సాక్షి కి లోబడిన స్వరం 60 వేల కోట్ల రూపాయల విలువ ను తగ్గించింది.  నేను ముఖ్యమంత్రి గా సుదీర్ఘకాలం పాటు పనిచేశాను.. నేను పారిశ్రామిక కార్యకలాపాలతో సంబంధం కలిగివున్న రాష్ట్రానికి చెందిన వాడిని.  60 వేల కోట్ల రూపాయలు అంటే చిన్న మొత్తం ఏమీ కాదు.  ఇది చాలా భారీ మొత్తం!  మీరు ఏమి సాధించారో మీకు తెలియడం లేదు!

ఇక్కడ అధికారులను కూడా నేను అభినందిస్తున్నాను.  మీరు ఊహాతీతంగా పని చేశారు.  మూలధనం పెట్టుబడి సమయంలో ఎటువంటి అవాంతరాలు ఎదురవుతాయో నాకు తెలుసు.  కేవలం ఒక పిటిశన్ తో 2-3 సంవత్సరాల పాటు పని ఆగిపోతుంది.  పర్యావరణ కార్యకర్తలు దానిని నిలిపివేస్తే, వారు ఆ పని మీదే ఉంటారు.  ఆ విషయం మీడియా ప్రతినిధి కి చేరితే, సతీశ్ గారు, అప్పుడు ఆ ప్రాజెక్టు ను ఇవ్వడానికి ప్రభుత్వం కూడా భయపడుతుంది; ఎందుకంటే ప్రత్యర్ధులు వ్యూహాత్మక ప్రణాళిక ను సిద్ధం చేసుకొని వుంటారు.  అటువంటి పరిస్థితుల్లో, అవరోధాలన్నిటినీ 5 నెలల్లో అధిగమించి, 60 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం నిజంగా ఒక అసాధారణమైన విజయం.  ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, నేను ఇవన్నీ అనుభవించాను.  అవసరమైన చోట తమ భూములను ఇచ్చిన రైతులను కూడా నేను అభినందిస్తున్నాను.  ప్రభుత్వం లో కొత్తగా చేరిన ఉద్యోగులూ, పట్వారీలే ఈ అవరోధాలన్నింటినీ తప్పక పరిష్కరించి వుంటారు.  అందువల్లే, ఈ పెట్టుబడి పెట్టడానికి సాధ్యమయ్యింది.  ఈ దేశం ప్రధాన మంత్రి చేత లేదా పట్వారీల చేత పాలించబడుతుంది.  అందువల్ల, విజయవంతమైన నాయకత్వం తో, ముఖ్యమంత్రి నుండి పట్వారీ వరకు ఇంత తక్కువ సమయంలో ఒకే విధంగా ఆలోచించగలిగారు.

ఇక రెండో విషయానికే వస్తే, ప్రతీదీ ఒకే వ్యక్తి ఇష్టాయిష్టాలకు వదలివేయనందుకు నేను చాలా సంతోషించాను.  వివిధ రంగాలకు మనం విధానాలను రూపొందించుకున్నాము, ప్రతిదీ పారదర్శకంగా ఉంచాము.  వీటిని ఎవరైనా ఆన్ లైన్ లో చూసి వారికి ఆ విధానం నప్పుతుందో లేదో ఎవరికి వారే తెలుసుకోవచ్చు.   ఇది విధానాలపై ఆధారపడ్డ రాష్ట్రం.  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సాధించిన గొప్ప విజయాలలో ఇది ఒకటి.  అందువల్ల, మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఈ 60 వేల కోట్ల రూపాయలను ఒక చిన్న మొత్తంగా భావించవద్దు.  ఇది ఒక అసాధారణమైనటువంటి విజయం.  ఈ రంగం లో నేను చాలా కాలం పనిచేశాను కాబట్టి ఇందుకు ఎంత కృషి అవసరమో నాకు చాలా బాగా తెలుసు.    దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.  ప్రతి ఒక్కరూ ఈ  తీవ్రత ను భరించాలి.  అయితే, ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధి కి కట్టుబడి వుంటారో, అప్పుడు కొత్త మార్గాలు వాటంతట అవే తెరుచుకుంటాయి.

ఇక్కడ సంతోషించడానికి మరో కారణం ఉంది.  చూడండి, సైకిల్ ట్యూబ్ లో నిర్ణీత పాయింట్ వరకు తగినంత గాలి నింపితేనే, అది నడుస్తుంది.  ఒక్కోసారి ట్యూబ్ లో ఏదో ఒక మూల ఒక గాలి బుడగ మిగిలిపోతుంది.  అలాంటి సమయం లో కూడా మీటర్ నిర్ణీత పాయింటు వరకు గాలి ఉన్నట్లు చూపిస్తుంది, కానీ ఆ గాలి బుడగ వల్ల సైకిల్ ముందుకు కదలదు.  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కి కృషి చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.   రాష్ట్ర సమతుల అభివృద్ధి అవసరం ఉంది.  కేవలం నోయెడా, గాజియాబాద్ మాత్రమే అభివృద్ధి చెందడం ద్వారా రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుంది, అయితే, ఈ రకంగా ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి చెందితే చాలదు.  సాధించిన ప్రగతి పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది.  ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయి లో చర్యలను చేపట్టడం నిజంగా అభినందనీయం.

కొంతమంది ఈ నాటి కార్యక్రమాన్ని భూమిపూజ ఉత్సవం గా అభివర్ణిస్తున్నారు.   సంప్రదాయ పరంగా ఇది భూమిపూజ కార్యక్రమం అయినా, నేను దీనిని రికార్డు ను బద్దలుకొట్టిన కార్యక్రమం గా పిలుస్తాను.  పురాతన పని వ్యవస్థ ను మార్చి చాలా తక్కువ సమయం లో అధునాతన పద్ధతుల్లో ఈ ప్రక్రియ ను చేపట్టారు.  గతం లో ఉత్తర ప్రదేశ్ లో ఇటువంటి కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందని ఎవరైనా చెబితే, నేను నమ్మను.  రాష్ట్ర పాలన లో ఉత్తర ప్రదేశ్ ఖచ్చితంగా నూతన విధానాలను అవలంబిస్తోంది.  యోగి గారి నాయకత్వం లోని  ప్రభుత్వం పెట్టుబడిదారులతో స్థిరమైన సంబంధాలను కొనసాగిస్తూ, వారి ఆలోచన లను, ఆసక్తి ని పెట్టుబడులుగా మార్చడానికి అనువైన వాతావరణాన్ని కల్పించడం నాకు ఆనందంగా ఉంది.  ఆన్ లైన్ లో అవగాహనపూర్వక ఒప్పందాలను గురించిన సమాచారాన్ని తెలుసుకోవడం లేదా అనుమతుల కోసం ‘‘నివేశ్ బంధు’’ వంటి ఏక గవాక్ష వేదిక ల ఏర్పాటు మొదలైన చర్యల ద్వారా పని సంస్కృతి మెరుగు పడడంతో పాటు ఉత్తర ప్రదేశ్ లో వ్యాపారానికి అనువైన వాతావరణం నెలకొనడానికి దోహదపడుతుంది.  గతం లో ఉత్తర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడం ఒక పెద్ద సవాలుగా ఉండేది.  ఆ సవాళ్లు ఇప్పుడు అవకాశాలుగా మారాయి.  ఉపాధి, వ్యాపారం, మంచి రహదారులు, సమృద్ధి గా విద్యుత్తు, మంచి వర్తమానం, ఉజ్వల భవిష్యత్తు రూపంలో ఈ అవకాశాలు ఉత్తర ప్రదేశ్ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తున్నాయి.  ఇదే వేగంతో మీరు ముందుకుపోతే త్వరలోనే ఉత్తర ప్రదేశ్ ట్రిలియన్ డాలర్ ఆర్ధిక లక్ష్యాన్ని అధిగమిస్తుందని నేను భావిస్తున్నాను.  నా పారిశ్రామిక వేత్తల మిత్రుల నిబద్ధత కుగాను వారిని నేను అభినందిస్తున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు.

పారిశ్రామికవేత్తల పక్షాన నిలబడడానికి మేము భయపడము.  పారిశ్రామిక వేత్తలతో ఫోటో తీసుకోడానికి సైతం కొంత మంది ప్రజలు వెనుకాడడం మీరు చూసే ఉంటారు.  అయితే, ఒక్క పారిశ్రామికవేత్త కూడా వేరే వారి ఇళ్లకు వెళ్లి వాళ్ళను ప్రాధేయపడినట్లు మనం గమనించము.  అమర్ సింగ్ గారు ఇక్కడ కూర్చుని ఉన్నారు.  ఆయన మొత్తం చరిత్ర చెబుతారు.  అయితే, మన ఉద్దేశ్యం మంచిదీ, నిజాయతీ తో కూడినదైనప్పుడు మనం ఎవరి వెనుక నున్నా భయపడవలసిన పని లేదు.  మహాత్మ గాంధీ గారు వంటి స్వచ్ఛమైన మనసుతో బిర్లా గారి కుటుంబం తో కలవడానికి కూడా  ఎప్పుడూ వెనుకాడవలసిన అవసరం లేదు.  ఆయన ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉన్నందువల్ల, ఆయన ఎప్పుడూ బిర్లా గారితో కలవడానికి వెనుకాడలేదు.  బహిరంగంగా కలవడాన్ని నివారించి, అన్ని విషయాల్లోనూ కల్పించుకుని, ఎవరికీ తెలియకుండా కలిసే వారే, ఎక్కువగా భయపడుతారు.  జాతి నిర్మాణంలో- ఒక రైతు, ఒక శిల్పకారుడు, బ్యాంకర్, ప్రభుత్వ ఉద్యోగి, కార్మికుడు ఎటువంటి కర్తవ్యాన్ని నిర్వహిస్తారో- అదే విధంగా ఒక పారిశ్రామికవేత్త చేసే శ్రమ కూడా అంతే కీలకమైంది.  వారిని అవమానించి, వారిని దొంగలుగా చిత్రించడం చాలా అన్యాయం.  అక్రమాలు చేసే వారిని తప్పకుండా దేశం నుండి గెంటివేయాలి లేదా జైళ్లలో పెట్టాలి.  గతం లో వీరిపై ఎలాంటి చర్య తీసుకోలేదు ఎందుకంటే ప్రతిదీ, ప్రతి మనిషి వెనుక గుట్టుగా జరిగేవి.  అయితే, ప్రతి ఒక్కరికీ తెలుసు, ఎవరి వెనుక ఎవరు ఉన్నారో !

అందువల్ల, దేశాన్ని ముందుకు తీసుకు పోవడానికి ప్రతి ఒక్కరి సహాయం కావాలి.    125 కోట్ల భారతీయులను గౌరవించడం ప్రతి భారతీయుని బాధ్యత.  ఈ రోజు ప్రారంభించిన ఈ ప్రాజెక్టులు 2 లక్షల మంది కంటే ఎక్కువ యువజనులకు ఉపాధి కల్పిస్తాయి, ఇక్కడ నెలకొల్పే ఫ్యాక్టరీలు స్థానిక ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తాయి.  ప్రతి ఒక్కరు- ఒక రైతు, ఒక కార్మికుడు లేదా ఒక యువజనుడు ప్రయోజనం పొందుతారు.

మిత్రులారా,

ఉత్తర ప్రదేశ్ లోని 22 కోట్ల మంది ప్రజలకు, వారి ప్రేమను వడ్డీ తో సహా తిరిగి ఇస్తానని నేను హామీ ఇచ్చాను.  ఆ హామీ ని నెరవేర్చే ప్రక్రియలో ఈ ప్రోజెక్టు ల ప్రారంభం- ఒక కీలక అడుగు.  ఉత్తర ప్రదేశ్ లో ఆర్ధిక, పారిశ్రామిక అసమతుల్యత ను తొలగించడానికి- ఈ ప్రాజెక్టులు సహాయపడతాయి.   ఇవి రాష్ట్రం లోని ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమై ఉండవు.  ఇవి నోయెడా, గ్రేటర్ నోయిడా, మేరఠ్, ముజఫర్ నగర్, ఝాన్సీ, హర్దోయీ, అమేఠీ, రాయ్ బరేలీ, జౌన్ పుర్, మీర్జాపుర్, గోరఖ్ పుర్ లకు కూడా విస్తరిస్తాయి.  ఈ ప్రాజెక్టుల ద్వారా చేపట్టే చర్యలు  “డిజిటల్ ఇండియా” , మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమాలకు మంచి ప్రేరణగా నిలుస్తాయి.   ఉత్తరప్రదేశ్ లో వేగవంతమైన ఇంటర్ నెట్ పంపిణీ లేదా ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ఏర్పాటు లేదా ఇన్ ఫర్ మేశన్ టెక్నాలజీ  కేంద్రాల ఏర్పాటు వంటివి ఉత్తర ప్రదేశ్ కు కొత్త దిశానిర్దేశం తో పాటు ఆ రాష్ట్ర యువత కు కొత్త అవకాశాలు కలుగజేస్తాయి.  డిజిటలైజేశన్ తో  సామాన్య ప్రజల జీవితాలు  సులభతరం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రణాళిక లో ఇది ఒక భాగం.  ఎటువంటి వివక్ష కు ఆస్కారం లేని ఒక వ్యవస్థ ను నిర్మించాలని మేము అనుకుంటున్నాము.  ఈ ప్రక్రియ వేగవంతంగా ఉండాలి, సున్నితంగా ఉండాలి.  పేదలు, ధనికుల మధ్య అదే విధంగా ఉన్నత వర్గం, తక్కువ వర్గం మధ్య ఎటువంటి వివక్ష ఉండకూడదు.  ‘‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’’ (అందరితో కలసి- అందరి వికాసం) వంటి అందరి పట్ల సమానమైన విధానం ఉండాలి.

మిత్రులారా,

ఎంతో వేగవంతమైన, పారదర్శకమైన సేవల కోసం డిజిటల్ ఇండియా కార్యక్రమం ఒక కీలకమైన పాత్ర ను పోషిస్తోంది.  మన గ్రామాల్లో 3 లక్షలకు పైగా ఉన్న సాధారణ సేవా కేంద్రాలు గ్రామీణుల జీవితాల్లో పరివర్తనను తీసుకు వస్తున్నాయి.  టికెట్లు కొనుగోలు చేయడానికి, టెలిమెడిసిన్, జన్ ఔషధి, ఆధార్, విద్యుత్తు బిల్లు, టెలిఫోన్ బిల్లు లు చెల్లించడం వంటి అనేక సేవలను పొందడానికి ఇప్పుడు గ్రామీణ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కరలేదు.  గ్రామాల లోని ఈ సాధారణ సేవా కేంద్రాల ద్వారా లభించే ఉచిత వై ఫై, తక్కువ ధరకు ఇంటర్ నెట్ ల వంటి సౌకర్యాలు పేదల జీవితాలను, మధ్య తరగతి ప్రజల జీవితాలను సరళతరం  చేస్తున్నాయి.

మిత్రులారా,

అనేక సంవత్సరాలుగా ఇన్ ఫర్ మేశన్ టెక్నాలజీ రంగం మన బలంగా ఉంది.  ఈ రోజున  ఇన్ ఫర్ మేశన్ టెక్నాలజీ రంగం రికార్డ్ స్థాయిలో ఉంది.  40 లక్షల మందికి పైగా ఈ పరిశ్రమ తో అనుబంధం కలిగి వున్నారు.  అయితే, వీరంతా పెద్ద పట్టణాలకు, మెట్రో నగరాలకే పరిమితం అయ్యారు.  ఈ పరిశ్రమ ను చిన్న పట్టణాలకు, నగరాలకు ముఖ్యంగా గ్రామాలకు విస్తరించేలా చెయ్యాలని ప్రభుత్వం కృషి చేస్తోంది.

మిత్రులారా,

ప్రభుత్వం లో ఒంటరిగా ఆలోచించే సంస్కృతి ఇప్పుడు క్రమం గా తగ్గిపోయింది.   తప్పులు ఎంచే  విధానానికి స్వస్తి పలికి పరిష్కారాలు, సమకాలీకరణలను ప్రోత్సహించడం జరుగుతోంది.  ప్రభుత్వ పథకాలకు, చర్యలకు మధ్య నేరుగా సంబంధం ఉంటుంది.  ఈ విషయాన్ని రుజువుచేయడానికి డిజిటల్ ఇండియా కార్యక్రమం, మేక్ ఇన్ ఇండియా మిశన్ లు మంచి ఉదాహరణగా నిలుస్తాయి.   డిజిటల్ లావాదేవీలు పెరగడానికి మొబైల్ ఫోన్ ల ధరలు తగ్గడం ఒక కారణం.   మొబైల్ ఫోన్ లు భారదేశం లోనే ముమ్మరంగా తయారు కావడం వల్ల మొబైల్ ఫోన్ ల ధరలు గణనీయంగా తగ్గాయి.  ఈ రోజున మన దేశం ప్రపంచానికే ఒక మొబైల్ ఫోన్ ల తయారీ కేంద్రంగా రూపుదిద్దుకొంటోంది.  మొబైల్ తయారీ లో మనం ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాము.  తయారీ విప్లవం లో ఉత్తర ప్రదేశ్ ముందున్నందుకు నేను ఆనందిస్తున్నాను.  ప్రస్తుతం, ఉత్తర ప్రదేశ్ లో 50 కంటే ఎక్కువగా మొబైల్ తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి.  ప్రపంచం లోనే అతి పెద్ద మొబైల్ తయారీ యూనిట్ ఉత్తర ప్రదేశ్ లో ఇటీవల ప్రారంభమైంది.  ఈ రోజు ప్రారంభమైన ఫ్యాక్టరీలలో మొబైల్ తయారీ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి.

మిత్రులారా,

ప్రస్తుత పరిస్థితిని రూపొందించడానికి గత నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది.  ఈ నిర్ణయాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, ప్రక్రియను సులభతరం చేయడానికి సంబంధించి అనేక చర్యలు ఉన్నాయి.  ఇవి పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని సమకూర్చాయి.  అనేక సంవత్సరాలుగా జిఎస్ టి నిలచిపోయింది. ఇప్పుడు, ఇది, దేశానికి పన్ను పరిధి నుంచి విముక్తిని ప్రసాదించింది.  దీని ద్వారా పారిశ్రామిక ప్రపంచం భారీ ప్రయోజనాన్ని పొందింది.

గత కొన్ని సంవత్సరాలుగా, దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి అనేక ముఖ్యమైన చర్యలు తీసుకోవడం జరిగింది.  ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించే దిశలో భాగంగా స్వదేశీ వనరుల నుండి మాత్రమే వస్తువులను, సేవలను కొనుగోలు చేయడానికి కృషి చేయాలని వివిధ శాఖలు, సంస్థలను ప్రభుత్వం కోరింది.  తద్వారా మేక్ ఇన్ ఇండియా ను ప్రోత్సహిస్తోంది.  ఈ చర్య చిన్న పరిశ్రమలకు కూడా ఊతమిస్తోంది.  గత ఏడాది కాలంలో, ఈ మార్పుల వల్ల ఉత్తరప్రదేశ్ రెండు సార్లు ప్రయోజనం పొందింది.  యోగి గారి నాయకత్వంలో అమలవుతున్న విధానాలవల్ల నేరాల శాతం తగ్గింది.  మిత్రులారా, ‘సంపూర్ణ దృష్టి- సమ్మిళిత చర్య’ అనే భావనతో బిజెపి ప్రభుత్వం పనిచేస్తోంది.

ఈ వేదికపై నుండి పారిశ్రామికవేత్తలకు మరోసారి భరోసాను ఇస్తున్నాను.  నాకు ఈ స్పర్ధ ఆరంభం మాత్రమే.  ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి వుంది.  ప్రక్రియ వేగాన్ని పెంచవలసిన అవసరం ఉంది.  జాతి నిర్మాణం లో మీదొక ముఖ్యమైన విభాగం.  మీరు తీసుకునే తీర్మానాలు దేశం లోని కోట్లాది యువజనుల ఆశలతో, ఆకాంక్షలతో ముడిపడి ఉన్నాయి.  భవిష్యత్తు లో వారి కలలను పండించే దిశగా బలమైన నిర్ణయాలను తీసుకొనేందుకు అవసరమైన ఆలోచనలు, సామర్ధ్యం రెండూ మన దగ్గర ఉన్నాయి.

తయారీ రంగానికి సంబంధించిన భారీ ప్రాజెక్టులు సిద్ధంగా ఉండడంతో, దేశం లో పెట్టుబడుల ఉపసంహరణ మరింత సులభతరం అవుతుంది.  సరకు రవాణా వ్యయం గణనీయంగా తగ్గుతుంది.  తరువాతి తరం మౌలిక సదుపాయాలు ప్రజలతో పాటు పారిశ్రామిక రంగానికి కూడా ప్రయోజనం చేకూరుస్తాయి.

మిత్రులారా,

ఇన్ ఫర్ మేశన్ టెక్నాలజీ,  ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ రంగాలకు ఉత్తర ప్రదేశ్ లో అపారమైన అవకాశాలు ఉన్నాయి.  సమీప భవిష్యత్తులో కొత్త మౌలిక సదుపాయాల ద్వారా ఎమ్ఎస్ఎమ్ఇ రంగం కూడా ప్రయోజనం పొందనుంది.  ఇంకా నగదు లావాదేవీలు జరుపుతున్న చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తలు ఇకమీదట డిజిటల్ లావాదేవీలకు మారాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

మిత్రులారా,

125 కోట్ల భారతీయుల కలలను సాకారం చేయడానికి సుస్థిరమైన అభివృద్ధి, నిర్విరామమైనటువంటి కృషి చాలా ముఖ్యం.  సుస్థిరమైన అభివృద్ధికి విద్యుత్తు సంబంధిత మౌలిక సదుపాయాలు చాలా కీలకం.  సరసమైన ధరలో నిరంతర విద్యుత్తు సరఫరా ప్రజలకు చాలా ముఖ్యావసరం.  వ్యవసాయానికి, పరిశ్రమలకు కూడా విద్యుత్తు చాలా అవసరం.  అందువల్లే ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి పైన, సరఫరా పైన దృష్టిని కేంద్రీకరిస్తోంది.  దేశం ఈ రోజు సాంప్రదాయక విద్యుత్తు నుండి జీవ విద్యుత్తు వైపు అడుగులు వేస్తోంది.  మరీ ముఖ్యంగా సౌర విద్యుత్తు పైన ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.  అంతర్జాతీయ సౌర విద్యుత్తు కూటమి దిశగా మనం చేపట్టిన చర్యలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.   సౌర విద్యుత్తు కు ఉత్తర ప్రదేశ్ కేంద్రం గా మారనుంది.  కొన్ని నెలల క్రితం మీర్జాపుర్ లో ఒక భారీ సౌర విద్యుత్తు ప్లాంట్ ప్రారంభమైంది.  ఈ రోజు, మరో ప్లాంటు కు శంకుస్థాపన జరిగింది.

సోదర సోదరీమణులారా,

ఈ రోజు, సౌర సాంకేతిక పరిజ్ఞానం, సౌర పంపుల వంటి యంత్రాలకు భారతదేశం తో పాటు ఆఫ్రికా వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా చాలా డిమాండ్ ఉంది.  భారతదేశం లో శుభ్రమైన, జీవ ఇంధన రంగం లో  ప్రారంభమైన ఈ వినూత్న వాతావరణాన్ని మంచిగా ఉపయోగించుకొని ముందుకు సాగవలసిందిగా – నా మిత్రులైన పారిశ్రామికవేత్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.

మిత్రులారా,

విద్యుత్తు ఉత్పత్తి నుండి ప్రతి ఇంటికీ పంపిణీ వరకు పనులు మునుపెన్నడూ లేని విధంగా ముందుకు సాగుతున్నాయి.  గత నాలుగు సంవత్సరాలలో మన విద్యుత్తు కొరత 4.2 శాతం నుండి 1శాతం కంటే తక్కువ కు తగ్గింది.  ఒకప్పుడు కుంభకోణాలకు నిలయమైన బొగ్గు ఇప్పుడు రికార్డు స్థాయిలో ఉత్పత్తి అవుతోంది.  ఈ రోజున బొగ్గు కొరత కారణంగా పవర్ గ్రిడ్ లు స్తంభించిపోవడం లేదు.

అంతే కాక, విద్యుత్తు రంగం లో చేపట్టిన అన్ని సంస్కరణలూ దేశ ప్రజల ధనాన్ని ఆదా చేశాయి.

యుడిఎవై (ఉదయ్) పథకం విద్యుత్తు పంపిణీ సంస్థ లకు కొత్త జీవం పోసింది.  ఉజాలా పథకం కింద ఏర్పాటు చేసిన ఎల్ఇడి దీపాల వల్ల  గత మూడేళ్ళలో విద్యుత్తు బిల్లులలో 50 వేల కోట్ల రూపాయల మేర ఆదా అయ్యింది.  ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు, వీధి దీపాల కోసం బిల్లులు చెల్లించే నగర పాలక సంస్థలు దీని వల్ల లబ్ధిని పొందాయి.  ఒకవేళ మోదీ 50 వేల కోట్ల రూపాయల రాయితీ ని ప్రకటించి వుంటే అది బహుళ ప్రచారానికి నోచుకొనేది.  ప్రజలు కూడా చాలా సంతోషించి ఉండే వారు.  అయినప్పటికీ ప్రజలకు 50 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యే విధంగా పథకాన్ని రూపొందించాము.  సరైన ఆలోచనలతో ముందుకు వెళ్తే దేశం సరైన అభివృద్ధి తో పరివర్తన చెందుతుంది.

మిత్రులారా,

ఈ రోజున విద్యుత్తు చాలా సులువుగా అందుబాటులో ఉంది.  ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో రూపొందే ‘విద్యుత్తును సులువుగా పొందే దేశాల జాబితా’ లో భారతదేశం 82 ర్యాంకులు ఎగబాకింది.  ఈ విషయంలో కొనియాడదగ్గ అభివృద్ధి ని సాధించాము.  ఈ రోజున ప్రతి గ్రామానికీ విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించడానికి కృషి జరుగుతోంది.  వచ్చే ఏడాది మార్చి నెల కల్లా దేశం లోని ప్రతి గ్రామానికి విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్య సాధన దిశగా పనులను వేగవంతం చేస్తున్నాము.

కొంత మంది ప్రజలు మా వెంట పడడానికి కారణాలు వెతుక్కోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.  మేము ఏదైనా చేశామని చెప్పగానే వాళ్లు ‘లేదు, దానిని చేయలేదు’ అని అంటారు.  ‘‘మీరు మోదీని విమర్శించి ఖండించాలనుకుంటే, 70 సంవత్సరాల నుండి పెండింగు లో ఉన్న ప్రాజెక్టులను చూడండి’’ అని నా విమర్శకులకు నేను చెబుతాను.  మీరు నిజంగా వాస్తవాలను తెలుసుకోవాలని అనుకుంటే, 70 సంవత్సరాలు గా పెండింగులో ఉన్న కొన్ని విషయాలను మీరు గమనించే వుంటారు.. అంతరాయం లేకుండా దేశానికి విద్యుత్తును సరఫరా చేయాలనే లక్ష్యాన్ని సాధించడానికి మేము కూడా ప్రయత్నిస్తున్నాము.  ఆ విధంగా, విద్యుత్తు సరఫరా నెట్ వర్క్ పటిష్టం అవుతోంది.

ఈ పథకం లో భాగం గానే ఈ రోజున ఘటంపుర్, హాపుర్ ల మధ్య ట్రాన్స్ మిశన్ లైను ను ప్రారంభించడమైంది.  గత ప్రభుత్వం హయాం లో దెబ్బతిన్న ట్రాన్స్ మిశన్ విధానాన్ని పునరుద్ధరించడానికి యోగి గారి ప్రభుత్వం ముందుకు వచ్చింది.  ఉత్తర ప్రదేశ్ కు చెందిన లఖ్ నవూ నుండి మనకు పార్లమెంటు సభ్యులు ఉన్నారు.  ప్రతి భారతీయుడు సుసంపన్నంగా, సామర్ధ్యంతో, సున్నితంగా ఉండే విధంగా చూడాలని, ధనికుడు, పేద, కార్మికుడు, పెట్టుబడి దారు.. అదే విధంగా పరిపాలనా అధికారి, పౌరుడు అనే వ్యత్యాసాలు లేకుండా ఉండే సమాజం కావాలని కోరుకొంటున్నట్లు   మన పూర్వ ప్రధాని, గౌరవనీయులు అటల్ బిహారీ వాజ్ పేయీ గారు చెబుతూ ఉండే వారు.

కలలు కనడం ఒక్కటే కాదు, దాని సాకారానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ను కూడా అటల్ గారు రూపొందించారు.  ఆ రహదారులు చేతి మీద గీతల్లా ఉండాలని ఆయన ఒక సారి చెప్పారు.  ఆ ఆలోచన ఫలితంగానే, ఆయన మౌలిక సదుపాయాల మీదే దృష్టి ని కేంద్రీకరించారు.   21వ శతాబ్దపు అవసరాలకు తగినట్లుగా ఈ ఆలోచన లను తదుపరి స్థాయికి  తీసుకువెళ్లేందుకు మనం కష్టపడి కృషి చేస్తున్నాము.

దేశంలో అతి పెద్ద ఎక్స్ ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్సప్రెస్ వే, బుందేల్ ఖండ్ వద్ద రక్షణ పారిశ్రామిక కారిడార్ వంటిప్రాజెక్టుల పరంపరను అత్యంత వేగంగా పూర్తి చేయాలని మేము కృషి చేస్తున్నాము.  మిత్రులారా, దేశం లోని 125 కోట్ల భారతీయులకు, యువజనులకు ప్రపంచం లోని అత్యుత్తమమైన విధానాలను అందుబాటు లోకి తీసుకురావాలని ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.  ప్రజల భాగస్వామ్యంతో నూతన భారతాన్ని ఆవిష్కరింపజేసి, కోట్లాది ప్రజల స్వప్నాలను సాకారం చేయాలన్నదే మాముందున్న ఏకైక ప్రణాళిక.  దేశం కోసం అలాగే ఉత్తర ప్రదేశ్ కోసం మీరు చేస్తున్న కృషి కి నేను హృదయపూర్వకంగా మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను.  ఒకటి లేదా రెండు నెలల క్రితం నేను ముంబయి కి వెళ్లి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాను.  సాధారణంగా ప్రజలు వారిని ఆహ్వానిస్తారు; అయితే వారితో ఏదైనా మాట్లాడడానికి సాహసించరు.  వారు చాలా ధనవంతులు, పెద్ద పెద్ద వ్యాపారాలతో సంపన్నులైనప్పటికీ, వారు భారదేశంలో వ్యవసాయంపై పెట్టే కార్పొరేట్ పెట్టుబడి ఒకే ఒక్క శాతం మాత్రమే ఉన్న విషయాన్ని వారికి వివరిస్తూ వారికి ఒక ప్రజంటేశన్ ను చూపించాను.  ఇది ప్రపంచం లోని అన్ని దేశాలతో పోలిస్తే చాలా తక్కువ.  కార్పొరేట్ రంగం వ్యవసాయం లో ఎలా పెట్టుబడి పెట్టవచ్చో తెలియజేస్తూ వారితో నేను సగం రోజు ను వెచ్చించాను.  ఈ ఒక్క శాతంలో కూడా ట్రాక్టర్ మరియు యూరియా ల తయారీదారులే ఎక్కువగా ఉన్నారు.  వారు ఏ విధంగా రైతులకు సహాయ పడగలరు, వ్యవసాయంలో అదనపు విలువను లేదా సాంకేతికతను ఏవిధంగా జోడించగలరు అనే విషయాలపై తమ ఆలోచనలను తెలియజేయవలసినదిగా నేను పారిశ్రామికవేత్తలను కోరాను.  గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, ప్యాకేజింగ్ మొదలైనవి రైతులకు ఎక్కువగా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.  ఆ దిశగా కృషి చేయవలసిందిగా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశాను.  ఒక మేధోమధన బృందం గా ఏర్పడి వివిధ విషయాలను చర్చించవలసిందిగా వారిని కోరాను.  వ్యవసాయం లోకి ఎంత ఎక్కువగా కార్పొరేట్ పెట్టుబడులు వస్తాయో ఎక్కువ దిగుబడి సాధించే విధంగా రైతుల సామర్ధ్యం అంత పటిష్టంగా పెరుగుతుంది.  ఒక్కొక్కసారి దిగుబడిలో అధిక శాతం వృథా పోతుంది.   దేశంలో పండించిన ఫలాల గుజ్జు  నుండి మనం పండ్ల రసాలను తయారుచేయవచ్చని  సూరి గారు కొద్ది  సేపటి క్రితం చెప్పారు.  ఈ  నిర్ణయం రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది.  రసాలను ఆస్వాదించిన వినియోగదారు కూడా ఆరోగ్యంగా, బలంగా ఉంటారు.  పౌరులు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది.

సూక్ష్మంగా చెప్పాలంటే, పారిశ్రామికవేత్తలను గ్రామాలతో అనుసంధానం చేయాలన్నది నా కోరిక.   ఇటువంటి చిన్న విషయాలను గ్రామీణ జీవితాల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలో ఇప్పుడు మనం ఆలోచించవలసి ఉంది.  రానున్న రోజుల్లో ఇది చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది.  దీనిపై మనం దృష్టి పెట్టాలి.  త్వరలోనే మంచి ఫలితాలు వస్తాయని నేను విశ్వసిస్తున్నాను.  మనం ఇప్పుడు 60 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించుకున్నాము.  యోగి గారు చెప్పినట్లు మరో 50 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పూర్తి కావస్తున్నాయి.  ఇది నిజంగా ఒక గొప్ప విజయం.  మీ మొత్తం బృందాన్ని మరొకసారి నేను అభినందిస్తున్నాను.

మీ అందరికీ ధన్యవాదాలు.  అంతేకాదు, ఉత్తర ప్రదేశ్ నుండి పార్లమెంటు సభ్యునిగా ఉన్న నేను రాష్ట్రాభివృద్ధి ని గురించి తెలుసుకోవడం నాకు ఆనందంగా వుంది.  ఉత్తర ప్రదేశ్ ప్రజల పట్ల ఇది నా బాధ్యత.  అదే విధంగా వారికి కూడాను నాపైన హక్కుంది.  అందువల్ల రెండు సార్లు గాని, ఐదు సార్లు గాని, లేదా 15 సార్లు గాని ఉత్తర ప్రదేశ్ ను నేను సందర్శిస్తాను;  మీ కోసం, మీ సేవ కోసమే నేను ఉన్నాను.

అనేకానేక ధన్యవాదాలు.

**