పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ రోజు జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం ‘కేరళ’ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
కేంద్ర మంత్రివర్గం ఆమోదం అనంతరం కేరళ (పేరు మార్పు) బిల్లు-2026ను భారత రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారం తన అభిప్రాయాలను తెలియజేయడానికి కేరళ రాష్ట్ర శాసనసభకు రాష్ట్రపతి పంపిస్తారు. కేరళ రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలను స్వీకరించిన అనంతరం, భారత ప్రభుత్వం తదుపరి చర్యలను చేపడుతుంది. అలాగే ‘కేరళ’ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చడానికి కేరళ (పేరు మార్పు) బిల్లు-2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ఆమోదం తీసుకుంటారు.
“కేరళ” రాష్ట్రం పేరును “కేరళం”గా మార్చడానికి ఆ రాష్ట్ర శాసనసభ 24.06.2024న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అది దిగువ పేర్కొన్న విధంగా ఉంది:
‘‘మలయాళం భాషలో మా రాష్ట్రం పేరు ‘కేరళం’. 1956 నవంబర్ 1న భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నవంబర్ 1నే కేరళ పిరవి దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. స్వాతంత్ర్య ఉద్యమకాలం నుంచే మలయాళం మాట్లాడే ప్రజలందరి కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాలనే బలమైన డిమాండు ఉంది. అయితే, రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో మా రాష్ట్రం పేరు ‘కేరళ’గా నమోదయింది. ఈ పేరును రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారం ‘కేరళం’గా సవరించడానికి సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ అసెంబ్లీ ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తోంది.’’
అనంతరం, రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారం ‘కేరళ’ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చడం ద్వారా రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ను సవరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేరళ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.
రాష్ట్రాల ప్రస్తుత పేర్లను మార్చేందుకు రాజ్యాంగంలోని మూడో అధికరణ వీలు కల్పిస్తుంది. మూడో అధికరణ ప్రకారం, ఏ రాష్ట్రం పేరునైనా పార్లమెంట్ మార్చవచ్చు. మూడో అధికరణలోని నిబంధనల ప్రకారం, రాష్ట్రపతి సిఫార్సు లేకుండా పార్లమెంటులోని ఏ సభలోనూ ఈ ప్రయోజనం కోసం బిల్లును ప్రవేశపెట్టకూడదు. అయితే ప్రతిపాదించిన బిల్లులో ఏదైనా రాష్ట్ర భూభాగం, సరిహద్దులు లేదా పేరు ప్రభావితమవుతుంటే, ఆ బిల్లుపై అభిప్రాయం తెలియజేయాలని ఆ రాష్ట్ర శాసనసభకు రాష్ట్రపతి పంపిస్తారు. అయితే నిర్దేశిత కాల పరిమితిలోపు లేదా రాష్ట్రపతి అనుమతించిన అదనపు వ్యవధిలోగా ఆ రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయాలను తెలియజేయాలి. నిర్దేశిత లేదా అనుమతించిన గడువు ముగిసిన తర్వాత మాత్రమే బిల్లును ప్రవేశపెట్టాలి.
‘కేరళ’ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చే అంశం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆమోదంతో ‘కేరళ’ పేరును ‘కేరళం’గా మార్చడానికి సంబంధించిన క్యాబినెట్ ముసాయిదా నోట్ను న్యాయ వ్యవహారాలు, న్యాయ విభాగం, న్యాయ మంత్రిత్వ శాఖ సూచనల కోసం పంపించారు. ‘కేరళ’ పేరును ‘కేరళం’గా మార్చే ప్రతిపాదనకు న్యాయ వ్యవహారాలు, న్యాయ విభాగం, న్యాయ మంత్రిత్వ శాఖ అంగీకరించాయి.
****