Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్థాన్ ముఖ్యమంత్రి తో కూడిన ఉన్నత స్థాయి సమావేశంలో కరవు, నీటి ఎద్దడి పరిస్థితి ని సమీక్షించిన ప్రధానమంత్రి

రాజస్థాన్  ముఖ్యమంత్రి తో కూడిన ఉన్నత స్థాయి సమావేశంలో కరవు, నీటి ఎద్దడి పరిస్థితి ని సమీక్షించిన ప్రధానమంత్రి


రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న కరవు, నీటి ఎద్దడి పరిస్థితి పై ఏర్పాటైన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అధ్యక్షత వహించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీమతి వసుంధరా రాజే ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత ప్రభుత్వానికీ, రాజస్థాన్ ప్రభుత్వానికీ చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు.

జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) క్రింద రాష్ట్ర బకాయిలు సర్దుబాటు చేసిన తర్వాత 911 కోట్ల 64 లక్షల రూపాయలు రాష్ట్రానికి విడుదల చేశారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) లో వాటా కింద 2015-16 ఆర్ధిక సంవత్సరానికి విడుదల చేసిన 827 కోట్ల 25 లక్షల రూపాయలకు ఇది అదనం. దీనికి తోడు 2016-17 సంవత్సరానికి SDRF మొదటి వాయిదా కింద 434కోట్ల 25 లక్షల రూపాయలు విడుదల చేశారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ – రాజస్థాన్ గత 67 సంవత్సరాలలో 61 సంవత్సరాలు కరవు పరిస్థితులను ఎదుర్కొందని చెప్పారు. త్రాగునీటి కొరత వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆమె వివరించారు. “ముఖ్యమంత్రి జల్ స్వావలంబన్ అభియాన్” గురించి ఆమె ప్రధానమంత్రి కి వివరిస్తూ – వచ్చే నాలుగేళ్ళలో 7 లక్షల జల సంరక్షణ కట్టడాల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు చెప్పారు. వీటిలో ఒక లక్ష నిర్మాణాలు 2016 జూన్ 30వ తేదీ నాటికి పూర్తవుతాయి. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం కోసం నర్మదా నది జలాలను వినియోగిస్తున్నారు.

జల సంరక్షణ, వర్షపు నీటి పరిరక్షణ కోసం ఒక సమగ్రమైన పద్ధతిలో ప్రజా ఉద్యమం చేపట్టవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. NCC, NSS, NYKS, స్కౌట్స్ & గైడ్స్ వంటి యువజన సంస్థలు ముందుకు వచ్చి నీటి నిల్వ కోసం నిర్మాణాల ఏర్పాటులో పాలుపంచుకోవాలని కోరారు.

వ్యర్ధ జలాల యాజమాన్యం గురించి, భవనాలపై పడే వర్షపు నీటి సంరక్షణ ప్రాముఖ్యత గురించీ ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఈ విషయంలో ప్రప్రంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలపై కూడా చర్చించారు. నీటి నిల్వ కోసం రాష్ట్రంలో సంప్రదాయ పద్ధతిలో ఉపయోగిస్తున్న నిర్మాణాలు (బావ్ దిస్) లను ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున పునరుద్ధరించాలని ప్రధానమంత్రి చెప్పారు. నాగోర్ జిల్లా కుచమన్ నగరంలో విజయవంతమైన బావ్ డీ ఉదాహరణను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ – దీన్ని రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున చేపడతామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ఒక నగరాన్ని ఆదర్శనగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆ నగరంలో వ్యర్ధ ఘన పదార్ధాల యాజమాన్యం, వ్యర్ధ జలాల యాజమాన్యం, చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర సాగునీటి విధానంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థలో గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించి అమలుచేయాలని ఆయన వివరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలనే తీర్మానంతో ఈ సమావేశం ముగిసింది.