Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ కు ప్రధాన మంత్రి సమాధానం


గౌరవనీయులైన స్పీకర్ మేడమ్,

మాననీయ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ముందు ఆ ప్రతిపాదన కు మద్దతు గా సభ లో కొన్ని విషయాలను తెలియచేయాలని నేను అనుకొంటున్నాను. ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై పలువురు సభ్యులు వారి అభిప్రాయాలను నిన్న వెల్లడించారు. శ్రీ మల్లికార్జున్, శ్రీ మహ్మద్ సలీమ్, శ్రీ వినోద్ కుమార్, శ్రీ నరసింహం తోట, శ్రీ తారీఖ్ అన్ వర్, శ్రీ ప్రేం సింగ్, శ్రీ అన్ వర్, శ్రీ జయ్ ప్రకాశ్ నారాయణ్ యాదవ్, శ్రీ కల్యాణ్ బెనర్జీ, శ్రీ పి. వేణుగోపాల్, శ్రీ ఆనందరావు అడ్ సుల్, శ్రీ ఆర్.కె. భారతి మోహన్ సహా 34 మంది గౌరవ సభ్యులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తీర్మానం పైన సవివరమైన చర్చ జరిగింది. కొందరు తీర్మానానికి అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ అర్ధవంతమైన చర్చ చోటు చేసుకొంది. రాష్ట్రపతి ప్రసంగం ఎప్పుడూ ఏ పక్షానికీ ఆపాదించలేదు. ఆయన ప్రసంగం ఎల్లప్పుడూ దేశ ఆశలను, ఆకాంక్షలను ప్రస్తావిస్తూ ఆ దిశగా తీసుకొంటున్న చర్యలను వివరిస్తుంది. ఆ కోణంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని అందరూ గౌరవించాలి. కేవలం వ్యతిరేకించాలన్న కాంక్షతో దానిని వ్యతిరేకించడం ఎంత వరకు సమంజసం ?

స్పీకర్ మేడమ్,

దేశంలో కొన్ని రాష్ట్రాలను గౌరవనీయులైన శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి కూడా ఏర్పాటు చేశారు. మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఉత్తర్ ప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్ నుండి ఛత్తీస్ గఢ్, బిహార్ నుండి ఝార్ ఖండ్ ను వేరు చేశారు. అయితే నాటి ప్రభుత్వం ఎంత దూరదృష్టితో వ్యవహరించిందంటే ఆ రాష్ట్రాల విభజన, అధికార బదిలీ, తదితర లాంఛనాలన్నీ ఎంతో సరళంగా సాగిపోయాయి. నాయకత్వానికి దూర దృష్టి ఉంటే సరైన నిర్ణయాలే తీసుకుంటారు; రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తొందరపాటు నిర్ణయాలను తీసుకోరు. శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి ఆ మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలచిపోతుంది. మీరు దేశాన్ని విభజించి విషబీజాలను నాటారు. 70 సంవత్సరాల స్వాతంత్ర్యం అనంతరం కూడా నేడు మీ పాపాల ఫలితాలను 125 కోట్ల మంది భారతీయులు అనుభవిస్తున్నారు.

ఆ విధంగా మీరు దేశాన్ని విచ్ఛిన్నం చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నాడు పార్లమెంట్ తలుపులను మూసివేసి, సభ లో గందరగోళం నిండి ఉండగా తెలంగాణ ఏర్పాటు కు తొందరపాటుగా చర్యలు తీసుకొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మనోభావాలను మీరు పరిగణన లోకి తీసుకోలేదు. మేం కూడా తెలంగాణ ఏర్పాటు కు అనుకూలమే, ఈ రోజు కూడా తెలంగాణ పురోగతి నే కోరుతున్నాం. కానీ మీరు ఆంధ్ర కు నాటిన విత్తనాలు, ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాన్ని విభజించేందుకు మీరు ప్రదర్శించిన తొందరపాటు నాలుగు సంవత్సరాల అనంతరం సైతం సమస్యలకు కారణం అవుతున్నాయి. అలాంటి చర్యలను మీ నుండి ఆశించలేదు.

స్పీకర్ మేడమ్,

నిన్న కాంగ్రెస్ నాయకుడు శ్రీ ఖర్గే ప్రసంగాన్ని నేను విన్నాను. ఆయన అధికార పక్షాన్ని ఉద్దేశించి మాట్లాడారా, లేక కర్నాటక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారా, లేక తమ పక్షం లోని విధానకర్తల ప్రాపకం కోసం మాట్లాడారా అనేది నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆయన బషీర్ బదర్ గారి పద్యమొకటి చదివారు. ఆ పద్యాన్ని కర్నాటక ముఖ్యమంత్రి కూడా వినే వుంటారని నేను అనుకొంటున్నాను. “దుశ్ మనీ జమ్ కర్ కరో, లేకిన్ యే గుంజాయిష్ రహే, జబ్ కభీ హమ్ దోస్త్ హో జాయే, తో శర్మిందా న హో” అంటూ సాగిన ఆ ప‌ద్యానికి.. వైరంలోనూ తిరిగి స్నేహితులు కావ‌డానికి ఎంతో కొంత అవ‌కాశం ఉంటుంది.. అని భావం.

దీనిని క‌ర్నాటక ముఖ్య‌మంత్రి కూడా విని వుంటార‌ని నేను భావిస్తున్నాను. బ‌షీర్ బ‌ద‌ర్ గారి ప‌ద్యం లోని ఇతర వాక్యాల‌ను కూడా శ్రీ ఖర్గే చ‌దివి వుంటే బాగుండేది. అప్పుడు మీ భావాలు ఏమిటన్నది దేశానికి తెలిసి ఉండేది. అదే ప‌ద్యంలో బ‌షీర్ బ‌ద‌ర్ గారు ఇది కూడా చెప్పారు..

“జీ చాహ్ తా హై స‌చ్ బోలో, జీ బ‌హుత్ చాహ్ తా హై స‌చ్ బోలో, క్యా క‌రే, హౌస్ లా న‌హీ హోతా”.. అని. అయితే ఈ స‌త్యాన్ని చెప్పే ధైర్యం ఆయ‌న‌కు లేదు.

క‌ర్నాటక ఎన్నికల త‌రువాత శ్రీ ఖర్గే అదే స్థానంలో ఉంటారో లేదో నాకు తెలియ‌దు. ఆ ర‌కంగా ఇది ఆయన వీడ్కోలు ప్ర‌సంగం గా కూడా భావించ‌వ‌చ్చు. ఏ స‌భ్యుడైనా మొట్ట‌మొద‌టి సారిగా పెదవి విప్పి మాట్లాడుతున్నారంటే ఆ ప్ర‌సంగాన్ని అందరూ ఎంతో గౌర‌వంగా వింటారు. అలాగే వీడ్కోలు ప్ర‌సంగాన్ని కూడా అంతే ఆస‌క్తిగా ఆలకిస్తారు. కొంద‌రు గౌరవ స‌భ్యులు నిన్న అదే గౌర‌వంతో శ్రీ ఖర్గే ప్ర‌సంగాన్ని విని వుంటారు. ప్ర‌జాస్వామ్యానికి అది చాలా ముఖ్యం. నిరసన తెలిపే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంది.. కానీ స‌భ‌ ను అగౌర‌వ‌ ప‌రచే హ‌క్కు మాత్రం ఉండ‌దు.

మేడమ్ స్పీకర్,

నిన్న ప్రతిపక్షం మా విధానాలను ఎలాంటి ఆధారాలతో లేదా వాస్తవాలతో పని లేకుండా విమర్శించడం నేను చూశాను. అదే సమయంలో వారు వారి గత విజయాలను యథాప్రకారం ఏకరువు పెట్టారు. కానీ ఒక్క విషయం మరచిపోవద్దు. భారతదేశం సరళీకృతం అయింది. మన తరువాత సరళీకరణ విధానాలను రూపొందించిన పలు దేశాలు మన కన్నా ఎంతో పురోగమించాయి. దేశ విభజన అనంతరం దేశం మీ చేతి లోనే ఉంది. దేశాన్ని మీరు పాలించారు. అయినప్పటికీ దేశం సామర్థ్యం మేరకు పురోగమించ లేదన్న విషయాన్ని మనం అంగీకరించి తీరాల్సిందే. తొలి మూడు, నాలుగు దశాబ్దాల కాలంలో ప్రతిపక్షం నామమాత్రంగా ఉంది. ఆ రోజులలో ప్రసార మాధ్యమాలు ఇంతగా విస్తరించలేదు. ఉన్న ప్రసార మాధ్యమాలు కూడా ప్రభుత్వం దేశానికి ప్రయోజనం చేకూరుస్తుందన్న నమ్మకంతో ప్రభుత్వానికే మద్దతు పలికేవి. రేడియో మీరు పాడమన్నట్టే పాడేది. టెలివిజన్ వచ్చిన తరువాత అది కూడా మీకే అంకితమైపోయింది. అప్పట్లో న్యాయ వ్యవస్థ లో అత్యున్నత హోదాలలోని వారిని కాంగ్రెస్ పార్టీ యే నియమించేది. అన్ని రకాల విలాసాలు మీవే. ఆ రోజులలో న్యాయస్థానాలలో సవాలు చేయడానికి పిఐఎల్ లు లేవు, తగినంత సంఖ్యలో ఎన్ జి ఒ లు లేవు. అలా సర్వత్రా సానుకూలమైనటువంటి వాతావరణంలో మీరు ఎదురనేది లేకుండా పెరిగారు. నిరసనలు లేవు. పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు మీ జెండాలే ఎగిరేవి. కానీ మీరు మొత్తం సమయాన్ని ఒకే ఒక కుటుంబం భజన లో గడిపే వారు. దేశ చరిత్రను కూడా విస్మరించి ఒకే ఒక కుటుంబాన్ని దేశం శాశ్వతంగా గుర్తుంచుకొనేటట్టు చేసేందుకు సర్వ శక్తులను కేంద్రీకరించారు. స్వాతంత్ర్యం తరువాత దేశ వాసులలో దేశాన్ని ముందుకు నడిపించాలనే ఒక కోరిక ఉండేది. మీరు కొంత బాధ్యతతో వ్యవహరించి వుంటే ప్రజాబలంతో దేశం ఉన్నత శిఖరాలకు ఎదిగేది. కానీ మీకు వ్యక్తిగత అజెండాయే గొప్పదయింది. మీరు సరైన నిర్ణయాలను తీసుకొని వుంటే, మీ ఆలోచనలలో హుందాతనం ఉంటే, మీరు విధానాలను బాధ్యతాయుతంగా రూపొందించి వుంటే కాలం కన్నా దేశం ఎంతో ముందు ఉండేదన్న వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. దానిని మీరు కాదనలేరు. 1947 ఆగస్టు 15 కు ముందు భారతదేశం లేదని, ఆ తరువాతనే భారతదేశం ఉందనే భావం కాంగ్రెస్ నాయకులలో ఉండడం దురదృష్టకరం. నిన్న మరో ఆశ్చర్యకరమైన మాటను కూడా నేను విన్నాను. అది అహంకారపూరితంగా చెప్పిందా లేక వానాకాలంలో తన కుర్చీని కాపాడుకొనేందుకు తెలివితక్కువతనంతో చెప్పిందా.. ఏమనాలి ? నెహ్రూ యే దేశానికి ప్రజాస్వామ్యాన్ని తీసుకువచ్చారు; కాంగ్రెస్ పార్టీ యే తీసుకు వచ్చిందన్నదే ఆ మాట. ఖర్గే సాహెబ్, ఇది ఎంత బాధాకరమైన విషయం. బౌద్ధ మతం వర్ధిల్లిన కాలంలో లిచ్ఛవీ సామ్రాజ్యం ఉన్నప్పుడు కూడా మన దేశంలో ప్రజాస్వామ్యం ఉన్న విషయం మీకు తెలుసా అని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. దేశానికి ప్రజాస్వామ్య భిక్షను పెట్టింది నెహ్రూ లేదా కాంగ్రెస్ పార్టీ కానే కాదు.

చర్చలు, గోష్ఠులు, వోటింగులతో నిర్ణయాలను తీసుకొన్న వ్యవస్థ బౌద్ధ సంఘ కాలం నాటిది. ఖర్గే గారూ, మీరు కర్నాటక కు చెందిన వారు. జగద్గురు మాన్య శ్రీ బసవేశ్వర్ కన్నా ఒక కుటుంబానికే అంకితమై పోయి మీరు కర్నాటక ఎన్నికలలో నెగ్గి ఈ రోజు ఈ స్థానం లో ఉన్నారు. కానీ మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. 12 వ శతాబ్ది కాలంలో అనుభవ మండపం ఏర్పాటు చేసి గ్రామంలో నిర్ణయాలన్నీ ప్రజాస్వామికంగా తీసుకున్న బసవేశ్వరుల వారు జన్మించిన కర్నాటక కు చెందిన వారు మీరు. అంతే కాదు, ఆ కాలంలో మహిళా సాధికారిత కు పట్టం కట్టబడింది. గ్రామ సభలో మహిళలు ఉండడం తప్పనిసరి చేశారు. 12వ శతాబ్దిలో జగద్గురు బసవేశ్వరుల వారి కాలం లోనే దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం మన నర నరాలలో, సంప్రదాయాలలో ఉంది. బిహార్ చరిత్ర ఇందుకు ప్రబల నిదర్శనం. ప్రాచీన చరిత్ర ను ఒక సారి గుర్తు చేసుకొటే లిచ్ఛవి సామ్రాజ్య కాలంలో 2500 సంవత్సరాల క్రితమే దేశంలో గణతంత్రం, ప్రజాస్వామ్యం ఉన్నాయి. ప్రజల ఆమోదం, నిరాకరణ.. ఈ రెండింటికీ మనం గుర్తింపు ను ఇచ్చాం.

మీరు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతారా ? ఎన్నికల సమయంలో మన్ మోహన్ సింగ్ ప్రభుత్వం లోని ఒక మంత్రి జహంగీర్ తరువాత శాహ్ జహాన్, శాహ్ జహాన్ తరువాత ఔరంగజేబు పాలకులు అయ్యారన్నారు. కానీ ఆ కాలంలో ఎన్నికలు జరిగాయా ? ఇక్కడ కూడా అదే పరిస్థితి. మీరా ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడేది ? ఏ తరహా ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నాను. హైదరాబాద్ విమానాశ్రయానికి స్వాగతం చెప్పడానికి వచ్చిన షెడ్యూల్డు కులానికి చెందిన ఒక ముఖ్యమంత్రి ని అప్పటి ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ అవమానించారు. నెహ్రూ జీ పేరుతో మీరే ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడతారు, కానీ శ్రీ రాజీవ్ గాంధీ దళిత ముఖ్యమంత్రి ని, ఎన్నికైన ప్రజాప్రతినిధి ని హైదరాబాద్ విమానాశ్రయంలో అవమానానికి లోను చేశారు. ఒక దళిత ముఖ్యమంత్రి కి జరిగిన ఈ అవమానమే మహా నటుడు శ్రీ ఎన్ .టి. రామారావు చలనచిత్ర జీవితాన్ని వదలి తెలుగుదేశం పార్టీ స్థాపించేందుకు ప్రేరణ అయింది.

మీరా మాకు ప్రజాస్వామ్యాన్ని గురించి బోధించేది ? ఈ దేశంలో 90 సార్లు రాజ్యాంగం లోని 356 వ అధికరణం దుర్వినియోగం జరిగింది. అప్పట్లో ఎదుగుతున్న పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ మీరు దొంగ దెబ్బ తీశారు. పంజాబ్ లో అకాలీదళ్ కు మీరు ఏం చేశారు ?, తమిళనాడు లో ఏం జరిగింది ?, కేరళ లో ఏం జరిగింది ? దేశంలో ప్రజాస్వామ్యాన్ని వర్ధిల్లకుండా చేసింది మీరే. మీ కుటుంబ ప్రజాస్వామ్యాన్నే వాస్తవ ప్రజాస్వామ్యం గా మీరు భావిస్తారు. మీరు దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ప్రజాస్వామ్యం ఏమిటి ? నీలం సంజీవరెడ్డి గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీయే ఎంపిక చేసింది. రాత్రికి రాత్రి ఆయన కు వెన్ను పోటు పొడిచింది. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఆయన కూడా ఆంధ్రాకు చెందిన వారే. శ్రీ సంజీవరెడ్డి, శ్రీ అంజయ్య.. ఇద్దరినీ మీరే అవమానించారు. మీరు ప్రజాస్వామ్యాన్ని గురించి ఎలా మాట్లాడుతారు ? అంతదాకా ఎందుకు, డాక్టర్ మన్ మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా ఆయన నాయకత్వంలోని మంత్రివర్గం ఒక నిర్ణయాన్ని తీసుకొంటే ఆయన మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్సును మీ పార్టీ కార్యకర్తలలోనే ఒకరు చింపి ముక్కలు చేశారు. మీ నోటి నుండి ప్రజాస్వామ్యం అనే మాట అంత బాగుండదు. దయచేసి మీరు మాకు ప్రజాస్వామ్య పాఠాలను బోధించకండి.

ఈ రోజు ఒక సంఘటనను మీకు గుర్తు చేయాలని నేను అనుకొంటున్నాను. నాయకుడిని ఎన్నుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ లో ఎన్నికలు జరిగాయన్నది నిజమేనా ? అప్పట్లో 15 కాంగ్రెస్ కమిటీలలో 12 కమిటీలు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారిని నాయకునిగా ఎన్నుకొన్నాయి, కేవలం మూడే మూడు ఆయనకు అనుకూలంగా వోటు వేయకూడదని నిర్ణయించాయి. అయినా ఆయనకు బదులుగా పండిత్ నెహ్రూ గారిని ఎన్నుకొన్నారు. ఏ తరహా ప్రజాస్వామ్యం అది ? స్వాతంత్ర్య సాధన తరువాత సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు ప్రధాన మంత్రి అయి వుంటే ఈ రోజు కశ్మీర్ లోని ఒక భాగం పాకిస్తాన్ అదుపులో ఉండేది కాదు.

కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఇటీవ‌ల డిసెంబ‌ర్‌లో ఎన్నికయ్యారు. ఇది ఎన్నికా ? లేక ప‌ట్టాభిషేక‌మా ? మీ పార్టీ నుండి ఒక యువ‌కుడు తాను ఈ ప‌ద‌వికి అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌నుకుంటున్న‌ట్టు చెప్పాడు. మీరు అత‌డిని అనుమ‌తించ‌లేదు. మ‌ళ్లీ మీరు ప్ర‌జాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఈ గొంతు ను నొక్కేందుకు జ‌రిగే ప్ర‌య‌త్నాల‌న్నీనిరుప‌యోగ‌మైపోతాయ‌ని నాకు తెలుసు. విమ‌ర్శ‌ ను ఎదుర్కొవ‌డానికి ఎవ‌రికైనా ధైర్యం ఉండాలి. అందువ‌ల్ల స్పీక‌ర్ మేడ‌మ్‌, విభిన్న‌మైన ప‌ని సంస్కృతి మా ప్ర‌భుత్వం యొక్క ప్ర‌త్యేక‌త‌. కేవ‌లం కొత్త ప‌థ‌కాలను ప్ర‌క‌టించ‌డంలో మాకు విశ్వాసం లేదు. అంతేకాదు, కేవ‌లం ప‌థ‌కాలను ప్ర‌క‌టించి ప‌త్రిక‌ల‌లో ప‌తాక శీర్షిక‌ల‌కు ఎక్కి, ఆ త‌రువాత ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం మాకు న‌చ్చ‌దు. ఇది మా ప‌ని సంస్కృతి కాదు. సాధించ‌డానికి అవ‌కాశం ఉన్న‌ వాటిని మాత్ర‌మే మేము ప్ర‌క‌టిస్తాం. గ‌త ప్ర‌భుత్వం పూర్తి చేయ‌కుండా వ‌దలివేసిన మంచి ప‌నుల‌ను పూర్తి చేయ‌డానికి మేం ప్ర‌య‌త్నిస్తాం. ఎందుకంటే, ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌భుత్వాలు వ‌స్తుంటాయి, పోతుంటాయి; కానీ, దేశం ఎన్న‌టికీ ఉంటుంది. మేం అలాంటి తాత్విక‌త‌ను విశ్వ‌సిస్తాం. ఇవే ఫైళ్లు, అదే అధికారులే కదా ఇప్పుడూ ఉన్న‌ది ? ఇది నిజం కాదా. గ‌త ప్ర‌భుత్వం రోజుకు 11 కిలోమీట‌ర్ల జాతీయ ర‌హ‌దారుల‌ను మాత్ర‌మే నిర్మించ‌గ‌లిగితే ప్ర‌స్తుత ప్ర‌భుత్వం రోజుకు 22 కిలోమీట‌ర్ల జాతీయ ర‌హ‌దారుల‌ను నిర్మిస్తుండ‌డానికి కార‌ణ‌ం ఏమిటి ? ప్ర‌తి ప్ర‌భుత్వం రహదారులను నిర్మిస్తూ ఉంటుంది. గ‌త ప్ర‌భుత్వం త‌మ ప్ర‌భుత్వ ప‌ద‌వీ కాలం లోని చివ‌రి మూడు సంవ‌త్స‌రాల‌లో 80 వేల కిలోమీట‌ర్ల రోడ్ల‌ను మాత్ర‌మే నిర్మిస్తే మా ప్ర‌భుత్వం గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో ఒక ల‌క్షా 20 వేల కిలోమీట‌ర్ల రోడ్ల‌ను నిర్మించింది. గ‌త ప్ర‌భుత్వం వారి పాల‌న చివ‌రి 3 సంవ‌త్స‌రాల‌లో 1100 కిలోమీట‌ర్ల కొత్త రైల్వే లైన్ లను నిర్మించ‌గా మా ప్ర‌భుత్వం 2100 కిలోమీట‌ర్ల రైల్వే లైన్ లను నిర్మించింది. గ‌త ప్ర‌భుత్వం త‌మ పాల‌న చివ‌రి మూడేళ్ల‌లో 2500 కిలోమీట‌ర్ల రైలు లైన్ లను విద్యుదీక‌రించ‌గా, ఈ ప్ర‌భుత్వం గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో 4300 కు పైగా కిలోమీట‌ర్ల రైల్వే లైన్ లను విద్యుదీక‌రించింది. ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్‌వ‌ర్క్ ప‌థ‌కం మా ప్ర‌భుత్వ ఆలోచ‌న నుండి రూపుదిద్దుకొంది. ఈ గణ్యత మాకు ద‌క్కుతుంది. మీరు ఎంచుకొన్న ప‌ని విధానం ఎలాంటిది ? మీరు ప‌క్ష‌పాతంతో కూడిన రాజ‌కీయాల‌ను న‌మ్మారు. 2011 నుండి 2014 వ‌ర‌కు మీరు ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్‌వ‌ర్క్‌ ను కేవ‌లం 59 పంచాయతీల‌ లోనే ఏర్పాటు చేయ‌గ‌లిగారు. మేం ఎన్నికైన తరువాత అతి త‌క్కువ వ్య‌వ‌ధిలో మేం ల‌క్ష పంచాయతీ ల‌లో ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్ వ‌ర్క్‌ ను ఏర్పాటు చేయ‌గ‌లిగాం. ఒక‌ వైపు గ‌త ప్ర‌భుత్వం చివ‌రి మూడేళ్ల‌లో ప‌ట్టుమ‌ని 60 కంటే త‌క్కువ‌ గ్రామాల‌కు ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్ వ‌ర్క్ ను వేసిన చ‌రిత్ర‌, మ‌రో వైపు త‌క్కువ స‌మ‌యంలో ఒక ల‌క్ష గ్రామాల‌లో ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్ వ‌ర్క్ ను వేసిన చ‌రిత్ర ఉన్నాయి. ఈ గ‌ణాంకాలు పోలిక‌ కు ఏమాత్రం అందేవి కావు. గ‌త ప్ర‌భుత్వం 939 న‌గ‌రాల‌లో శహ‌రీ ఆవాస్ యోజ‌న‌ ను అమలు చేసింది. ఇవాళ ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజ‌న (అర్బ‌న్‌) ప‌థ‌కం దేశం లోని 4320 న‌గ‌రాల‌లో అమ‌లు చేయ‌బ‌డుతోంది. మీ అంకెలు, వెయ్యి లోపే ఉంటే , మావి 4000 కంటే ఎక్కువ. గ‌త ప్ర‌భుత్వం నవీకరణ యోగ్య శక్తి వ‌న‌రుల‌ను త‌మ చివ‌రి మూడు సంవ‌త్స‌రాల‌లో 12 వేల ఎమ్ డబ్ల్యు అద‌న‌పు సామర్ధ్యాన్ని మాత్ర‌మే చేర్చ‌గ‌లిగితే గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో ఈ ప్ర‌భుత్వం 22 వేల ఎమ్ డబ్ల్యు ను అద‌నంగా చేర్చ‌గ‌లిగింది. శిప్పింగ్ ప‌రిశ్ర‌మ‌, కార్గో హ్యాండ్లింగ్ రంగాలు నకారాత్మకమైన వృద్ధిని సూచిస్తుండ‌గా ఈ ప్ర‌భుత్వ హ‌యాంలో ఈ రంగాలు గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో 11 శాతం వృద్ధిని సాధించాయి. మీరు వాస్త‌వాన్ని ఏమాత్రం గ్ర‌హించి వున్నా ఈ గంద‌ర‌గోళం ఉండేది కాదు. ఖ‌ర్గే గారు రైల్వేలు, క‌ర్నాట‌క.. ఈ రెంటిని గురించి ప్ర‌స్తావించ‌డం నాకు సంతోషం క‌లిగించింది. మీరు బీద‌ర్‌, గుల్బ‌ర్గా రైల్వేలైన్ ను గురించి ప్ర‌స్తావించారు. దేశ ప్ర‌జ‌ల‌కు వాస్త‌వం తెలియాలి. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ దీనిని ప్ర‌స్తావించ‌లేదు. క‌నీసం ప్రారంభోత్స‌వం రోజు కూడా దీని ప్ర‌స్తావ‌న లేదు. 110 కిలోమీట‌ర్ల ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు ను అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ప్ర‌భుత్వం మంజూరు చేసింది. ఈ వాస్త‌వాన్ని మీరు అంగీక‌రించాలి. 2013 వ‌ర‌కు మీ ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. మీరే రైల్వే మంత్రి. అది మీ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం కూడాను. అట‌ల్ గారి ప్ర‌భుత్వం తరువాత ఎన్నో ఏళ్లు గ‌డచిపోయాయి. 37 కిలోమీట‌ర్లు మాత్రమే పూర్తి చేశారు. కేవ‌లం 37 కిలోమీట‌ర్లు!. ఇంకా చెప్పాలంటే, ఈ చిన్న‌ ప‌ని కూడా ముఖ్య‌మంత్రి ఎడ్యూర‌ప్ప గారి చొర‌వ తో చేప‌ట్ట‌బ‌డింది. కేంద్ర ప్ర‌భుత్వం కోరిన విధంగా ఆయ‌న అనుమ‌తులు ఇచ్చారు. అప్పుడు మాత్ర‌మే మీ ప్ర‌భుత్వం అట‌ల్‌ గారి క‌ల‌ల‌ను ముందుకు తీసుకు వెళ్లింది. అంతేకాదు, అది ఎన్నిక‌ల స‌మ‌యం. అందువ‌ల్ల ఈ రైల్వే లైన్ ను ప్రారంభించ‌డం మీ ఎన్నిక‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అనుకున్నారు. 110 కిలోమీట‌ర్ల రైల్వే లైన్ కు బ‌దులుగా మీరు కేవ‌లం 30.5 కిలోమీట‌ర్ల రైల్వే లైన్ కే సంతోష ప‌డ్డారు. మేం చొర‌వ తీసుకొని మిగిలిన 72 కిలోమీట‌ర్ల రైల్వే లైన్‌ ను స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో పూర్తి చేశాం. ఈ రైల్వే ప్రాజెక్టు ప్ర‌తిప‌క్షానికి చెందిన పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నందున దీనిని ప‌క్క‌న పెట్టాల‌ని మేం ఏనాడూ అనుకోలేదు. ఇది మీ నియోజ‌క‌వర్గం, కానీ ఈ ప‌ని దేశానికి సంబంధించిన‌ది. మేం ఈ ప‌నిని దేశ సంక్షేమం కోసం పూర్తి చేశాం. నేను ఈ రైల్వే లైన్‌ ను ప్రారంభించ‌డం మీకు బాధ‌ క‌లిగించిన‌ట్టుంది. కానీ ఈ బాధ‌ కు మందును మీకు ఈ దేశ ప్ర‌జ‌లు ఏనాడో ఇచ్చారని నేను అనుకొంటున్నాను.

స్పీక‌ర్ మేడ‌మ్‌,

బాడ్ మేర్‌ లో రిఫైన‌రీ ని గురించి కూడా వారు మాట్లాడుతున్నారు. కేవ‌లం ఎన్నిక‌ల‌కు ముందు శంకుస్థాప‌న చేసేస్తే స‌రిపోతుంద‌ని వారు భావిస్తున్నారు. మీరు బాడ్ మేర్‌ లో శంకుస్థాప‌న చేశారు. కానీ, మేం అధికారం లోకి వ‌చ్చిన తరువాత పత్రికలను గ‌మ‌నిస్తే, శంకుస్థాప‌న మాత్రం చేశారు కానీ, మిగిలిన‌దంతా కాగితాల‌కే ప‌రిమిత‌మైన‌ట్టు గ‌మ‌నించాం. క్షేత్ర‌ స్థాయిలో ప‌నులు ఏవీ చేపట్ట‌ని సంగతిని గ‌మ‌నించాం. దీనికి అనుమ‌తులు లేవు. భూమి లేదు, లేదా కేంద్ర ప్ర‌భుత్వంతో తుది ఒప్పందాన్ని చేసుకోలేదు. మీరు చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్ద‌డానికి, తిరిగి దీనికి ఒక స‌రైన రూపం క‌ల్పించ‌డానికి కేంద్ర‌ ప్ర‌భుత్వం, రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది. అన్నింటినీ చ‌క్క‌దిద్ది మేం ఇప్ప‌డు ప‌నులను ప్రారంభించాం.

నేను, అసమ్ లోని ఢోలా- సాదియా సేతువు ను ప్రారంభించిన‌పుడు అది చాలా మందికి మింగుడు ప‌డ‌లేదు. ఇది వాళ్ల చొర‌వ‌ తో వచ్చింద‌ని చెప్పుకోవ‌డం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కూడా అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ప్ర‌భుత్వం ఆలోచ‌న నుండి రూపుదిద్దుకొంద‌ని, ఆ ప్ర‌భుత్వం దీనిని ఆమోదించింద‌ని చెప్పే నిజాయతీ వారిలో లేదు. దీనిపై క్ష‌ణ్ణంగా అధ్య‌య‌నం చేసిన ఒక బిజెపి నాయ‌కుడు దీనిని డిమాండ్ చేశారు. 2014 తరువాత మేం అదికారంలోకి వ‌చ్చాక ఈశాన్య రాష్ట్రాల ప్ర‌గ‌తిని ప్రాధాన్య‌ంగా పెట్టుకొని ఈ ప్రాజెక్టు ప‌నులను వేగ‌వంతం చేశాం. ఫ‌లితంగా ఈ సేతువు క‌ల సాకార‌మైంది. పొడ‌వైన సొరంగం, పొడ‌వైన గొట్టపు మార్గం, స‌ముద్రంపై పొడ‌వైన వంతెన నిర్మాణం, వేగ‌వంత‌మైన రైలుకు ఈ ప్ర‌భుత్వం చొర‌వ తీసుకొంద‌ని చెప్ప‌డానికి సంతోషిస్తున్నాను. ఇలాంటి నిర్ణ‌యాలను తీసుకొనే సామ‌ర్ధ్యం ఈ ప్ర‌భుత్వానికి మాత్ర‌మే ఉంది. ఇందులో చాలా వ‌ర‌కు ప‌నులు నిర్ణీత కాలంలోగా పూర్త‌ి అయ్యాయి. అంతేకాదు, ఏక కాలంలో రికార్డు సంఖ్య‌లో 104 ఉప‌గ్ర‌హాల‌ను అంత‌రిక్షంలోకి ప్ర‌యోగించింది కూడా ఈ ప్ర‌భుత్వ హ‌యాం లోనే.

మాన్య రాష్ట్ర‌ప‌తి త‌మ ప్ర‌సంగంలో పేర్కొన్న వాస్త‌వాల‌ను మనం తోసిపుచ్చ‌లేం. ప్ర‌జాస్వామ్యం అంటే ఏమిటో, ప్ర‌భుత్వం లోని ప్ర‌తి ఒక్క‌రినీ ఎలా గౌర‌వించాలో నేను చెప్పాల‌నుకొంటున్నాను. ఎర్ర‌ కోట బురుజుల‌ మీది నుండి ప్ర‌ధాన‌ మంత్రులు చేసిన ప్ర‌తి ప్ర‌సంగాన్ని గ‌మ‌నించండి. దేశ ప్ర‌గ‌తికి ఏదో ఒక ర‌కంగా ప్ర‌తి ప్ర‌భుత్వం ఎంతో కొంత చేసింద‌న్న వాస్త‌వాన్ని ఎవ‌రైనా ప్ర‌స్తావించారా ? ఏ కాంగ్రెస్ నాయ‌కుడైనా ఎప్పుడైనా ఈ వాస్త‌వాన్ని ప్ర‌స్తావించారా ? గ‌త ప్ర‌భుత్వాలు, రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు, అలాగే ఈ దేశ పౌరులు వారి చేయూత‌ ను అందించార‌ని ఈ న‌రేంద్ర మోదీ చెప్పాడు. దీనిని బ‌హిరంగంగా ఒప్పుకొనే ధైర్యం మాకు ఉంది. ఇదీ మా స్వ‌భావం.

నేను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు గుజ‌రాత్ స్వ‌ర్ణోత్స‌వాల‌ను జ‌రిపాం. ఆ సంద‌ర్భంలో స్వ‌ర్ణోత్స‌వాల‌లో గ‌వర్న‌ర్ ప్ర‌సంగాన్ని ఏర్పాటు చేశాం. గ‌వర్న‌ర్ ప్ర‌సంగం ఎలా ఉంటుంది ? గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం కూడా రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంలా ఉంటుంది. అది ఆ నాటి ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాల‌ను వివ‌రిస్తుంది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఆ నాటి రాష్ట్ర‌ ప్ర‌భుత్వం చేసిన ప‌నుల‌ను ప్ర‌స్తావిస్తుంది. అయితే , రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుండి 50 సంవ‌త్స‌రాల పాటు కాంగ్రెస్ పార్టీ ప‌రిపాలించింది. ఆ కాలంలోని గ‌వ‌ర్న‌ర్లు అంద‌రి ప్ర‌సంగాల‌ను ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించి వాటన్నింటినీ భద్ర‌ప‌ర‌చ‌డం జ‌రిగింది. ఇదీ ప్ర‌జాస్వామ్య‌ం అంటే..!
మీరు ప్ర‌తి ఒక్క‌టి మీరు, మీ కుటుంబం చేసింద‌ని చెప్పుకొంటున్నారు. కేవ‌లం ఈ ర‌క‌మైన ఆలోచ‌నా విధానం వ‌ల్లే మీరు ఇవాళ అక్క‌డ కూర్చోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇవాళ రైల్వే లైన్ లను పెద్ద ఎత్తున విస్త‌రిస్తున్నాం. నౌకా కేంద్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టాం. గ్యాస్‌పైప్‌లైన్ లను వేస్తున్నాం. గ‌తంలో మూసివేసిన ఎరువుల క‌ర్మాగారాల‌ను తిరిగి తెరిపిస్తున్నాం. కోట్లాది ఇళ్ల‌ల్లో మరుగుదొడ్లను నిర్మిస్తున్నాం, కొత్త ఉపాధి అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ లోని మిత్రుల‌ను, ఉపాధి, నిరుద్యోగం లను గురించి మాట్లాడే వారిని నేను ఒక విష‌యం అడ‌గ‌ద‌లచాను. మీరు ఎప్పుడైనా నిరుద్యోగం గురించిన లెక్క‌లు ప్ర‌స్తావించేట‌పుడు దేశం మొత్తానికి సంబంధించిన లెక్క‌లు చెప్తారు. మ‌రి ఉపాధికి సంబంధించిన లెక్క‌లు మాత్రం దేశం మొత్తానికి సంబంధించిన‌వి ఎందుకు ప్ర‌క‌టించ‌రు ? ఇప్పుడు మీరు న‌న్ను న‌మ్మ‌రు. అందుకే నేను మీ దృష్టికి కొన్ని విష‌యాలు తీసుకురాదలచాను. మీరు రికార్డుల‌ను కూడా ప‌రిశీలించుకోవ‌చ్చు. ప‌శ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం, క‌ర్నాట‌క ప్ర‌భుత్వం, ఒడిశా ప్ర‌భుత్వం, కేర‌ళ ప్ర‌భుత్వం గ‌త మూడు నాలుగు సంవ‌త్స‌రాల‌లో సుమారు కోటి మందికి ఉపాధి ని క‌ల్పించిన‌ట్టు చెప్పుకొన్నాయి. మా ప్ర‌భుత్వం అక్క‌డ అధికారంలో లేదు. క‌నీసం ఎన్‌ డిఎ కూడా అక్క‌డ లేదు. ఈ వాస్త‌వాన్ని కూడా మీరు నిరాక‌రిస్తారా ? మీరు దానిని ఉపాధిగా గుర్తించ‌రా ? నేను ఇక్క‌డ అబివృద్ధి చెందిన దేశాలను గురించి మాట్లాడ‌డం లేదు. బిజెపి పాలిత రాష్ట్రలు లేక ఎన్‌ డిఎ పాలిత రాష్ట్రాలను గురించి మాట్లాడ‌డం లేదు. నేను మాట్లాడుతున్న‌ది మీ పార్టీలు, మీ అనుకూల ప‌క్షాలు పాలిస్తున్న రాష్ట్రాలను గురించి. ఆ రాష్ట్రాలు త‌మ త‌మ రాష్ట్రాల‌లో ఉపాధి స్థాయి పెరిగింద‌ని చెప్తున్నాయి. క‌ర్నాట‌క రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఉపాధి అవ‌కాశాలు పెరిగాయ‌ని ఇస్తున్న స‌మాచారం అస‌త్య‌మ‌ని అంటారా ? చెప్పండి.

అందువ‌ల్ల, దేశ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేయ‌కండి. ఉపాధి అవ‌కాశాలను కల్పించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొన్న చ‌ర్య‌లు ఈ రాష్ట్రాల‌లో స‌త్ఫ‌లితాల‌ను ఇచ్చాయి. ఏడాదిలో 70 ల‌క్ష‌ల కొత్త ఇపిఎఫ్ ఖాతాలు న‌మోదైన విష‌యం మీకు తెలుసు. ఇవి 18-25 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌ వయస్సు కల యువ‌త‌కు సంబంధించిన ఖాతాలు. ఇది ఉపాధి కాదా ? అంతేకాదు, వైద్యులు, ఇంజ‌ినీయర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్ లు త‌మ త‌మ వ్యాపారాలలో, కంపెనీల‌లో కొత్త ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించారు. వారు త‌మ వ్యాపారాల‌ను విస్త‌రించారు. రాబ‌డి పెరిగింది. దీనిని గుర్తించ‌డానికి మీరు సిద్ధంగా లేరు. సంఘటిత రంగంలో 10 శాతం మంది ఉద్యోగులు ఉంటే, అసంఘటిత రంగంలో 90 శాతం మంది ఉన్నారు. ఇవాళ మేం లాంఛనప్రాయ రంగం లోని వారిని క్రమబద్ధ రంగం లోకి తీసుకు వచ్చేందుకు ప్రోత్సాహ‌కాలను ఇచ్చే విధంగా ప‌లు ప‌థ‌కాలు ప్రవేశపెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. అంతేకాదు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాలు ప‌ని కోసం ఇత‌రుల‌ను బ‌తిమాలే ప‌రిస్థితులు లేవు. వారు స్వ‌తంత్రంగా గౌర‌వ‌ప్ర‌దంగా బ‌త‌కాల‌ని అనుకొంటున్నారు. నేను చాలా మంది ఐఎఎస్ అధికారుల‌ను త‌మ పిల్ల‌లు ఏం చేయాల‌ని అనుకొంటార‌ని అడిగాను. వారు వారి బాట‌ లోనే ప్ర‌భుత్వ స‌ర్వీసు లో చేరాల‌ని అనుకొంటామ‌ని చెప్తార‌ని అనుకొన్నాను. కానీ ఈరోజు వారు చెప్తుతున్నారు.. కాలం మారింది; స‌ర్‌, మేం మా తండ్రి, తాత‌ల బాట‌ లోనే ప్ర‌భుత్వ స‌ర్వీసు లో చేరాం, కానీ మా పిల్లలు ప్ర‌భుత్వ స‌ర్వీసు లో చేర‌డానికి ఆస‌క్తిని క‌నబ‌ర‌చ‌డం లేదు. మా పిల్ల‌లు స్టార్ట్- అప్‌ లను ప్రారంభించాల‌ని అనుకొంటున్నార‌ని చెప్పారు. మా బిడ్డ విదేశాల‌లో చ‌దువుకొన్నాడు. అత‌ను ఇప్పుడు స్టార్ట్- అప్ ను పెట్టాల‌ని అనుకొంటున్నాడని చెప్తున్నారు. విదేశాల‌లో చ‌దువుకొని తిరిగి వ‌స్తున్న యువ‌త‌ ఆలోచ‌న‌లు ఇలా ఉన్నాయి. క‌నుక‌, దేశం లోని ప్ర‌తి రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్యత‌ర‌గ‌తి యువ‌త ఆకాంక్ష‌ల‌ను ముందుకు తీసుకు పోవ‌డానికి కృషి చేయాలి. మ‌నం వారిని నిరుత్సాహ ప‌ర‌చ‌రాదు. అందుకే ముద్రా యోజ‌న‌, నైపుణ్యాభివృద్ధి ప‌థ‌కం, వ్యాపారావ‌కాశాల శిక్ష‌ణ కార్య‌క్ర‌మం వంటి ప‌లు చర్య‌లను యువ‌త ఆకాంక్ష‌లు సాకారం చేసే దిశ‌గా ప్రారంభించ‌డం జ‌రిగింది. ఫ‌లితంగా ఇవాళ‌ ప్ర‌ధాన‌ మంత్రి ముద్రా యోజ‌న ప‌థ‌కం కింద ప‌ది ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైబ‌డిన రుణాల‌కు ఆమోదం తెలపడం జ‌రిగింది. ఇది చిన్న మొత్తం కాదు. ఈ రుణాల‌కు సంబంధించి మ‌ధ్య‌వ‌ర్తుల జోక్యాన్ని గురించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఇది ఈ ప్ర‌భుత్వ ప‌ని సంస్కృతి. మా నిబంధన‌ల, విధానాల ఫ‌లితంగా ఎవ‌రైనా స‌రే ఏ పూచీకత్తు లేకుండానే రుణం కోసం బ్యాంకు కు వెళ్ల‌వ‌చ్చు. 10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువ‌ కల రుణాలు ఆమోదం పొందాయి. ఇందులో 4 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ఇప్ప‌టికే ఇవ్వ‌డం జ‌రిగింది. పైపెచ్చు, రుణం ఆశించిన వారిలో 3 కోట్ల మంది కొత్త వ్యాపారులు. వీరు ఎంతో కాలంగా త‌గిన అవ‌కాశాలు ల‌భించ‌ని అణ‌గారిన వ‌ర్గాలు. దేశంలో ఉపాధి అవ‌కాశాల‌ను పెంచ‌డానికి జ‌రిగిన ప్ర‌య‌త్నం కాదా ఇది ? ఓహో, మీరు మీ క‌ళ్లు మూసుకున్నారు కాబోలు. అందుకే మీరు ప‌దే ప‌దే మీ గురించి చెప్పుకొంటున్నారు. ఈ ర‌క‌మైన ఆలోచ‌న ధోర‌ణి మిమ్మ‌ల్ని వృద్ధి లోకి రానివ్వ‌డం లేదు. అట‌ల్ గారు ఒక అద్భుత‌మైన వాక్యం చెప్పారు. కొద్ది బుద్ధుల‌తో ఎవ‌రూ గొప్ప‌వాళ్లు కాలేరు అని. అంతేకాదు, విరిగిన మ‌న‌సుతో ఎవ‌రూ నిల‌బ‌డ‌లేరు. అందువ‌ల్ల మీరు ఎన్న‌టికీ ఇలా ఎద‌గ‌లేరు. మీరు ఎన్న‌టికీ ఇదే చోటులో ఉండిపోతారు.

మీరు ప‌దే ప‌దే మీ గొప్ప‌లు చెప్పుకొంటున్నారు. మీకు నేను ఒక విష‌యం గుర్తు చేయ‌ద‌లచాను. 1980 లలో 21వ శ‌తాబ్దాన్ని గురించిన మాట ప‌దే ప‌దే వినిపిస్తూ ఉండేది. అప్ప‌ట్లో ఒక కాంగ్రెస్ నాయ‌కుడు 21వ శ‌తాబ్ద‌పు క‌ల‌లను గురించి ప్ర‌జ‌ల‌కు చెప్తుండే వారు. ఆయ‌న యువ‌కుడు, కొత్త నాయ‌కుడు. ఆయ‌న వారి తాత గారు గెలిచిన స్థానాల కంటే ఎక్కువ స్థానాలను గెలిచారు. ఆ స‌మ‌యంలో నేను ఒక ఆస‌క్తిదాయకమైన వ్యంగ్య చిత్రాన్ని చూశాను. ఒకాయ‌న రైల్వేప్లాట్‌ఫారం మీద నిల‌బ‌డి ఉంటాడు. ఆయ‌న ముందు రైలు వెళ్తూ ఉంటుంది. ఆ రైలు పైన 21 వ శ‌తాబ్దం అని రాసి ఉంటుంది. ఆ వ్య‌క్తి ఆ రైలు వెంట‌ ప‌డి అందులో ఎక్క‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంటాడు. ఆ ప‌క్క‌నే ఉన్న ఒక వృద్ధుడు చెప్తుంటాడు, వేచి ఉండండి, ఏదో ర‌కంగా రావ‌డానికే అది వెళుతోంది. మీరు ఏమీ చేయాల్సిన అవ‌స‌రం లేదు అని అంటుంటాడు. 21 వ శ‌తాబ్ద‌పు క‌ల‌ల గురించి 1980 లోనే ప్ర‌జ‌ల‌కు చెప్తూ వ‌చ్చారు. 21వ శ‌తాబ్దం గురించి వల్లిస్తూ వ‌చ్చిన ఆ ప్ర‌భుత్వం క‌నీసం విమాన‌యాన విధానాన్ని కూడా రూపొందించ‌లేకపోయింది. 21వ శ‌తాబ్దానికి సంబంధించిన విమాన‌యాన విధాన‌మే లేక‌పోతే మ‌రి ఇంకెందుకు ? ఎద్దుల‌ బండి కోస‌మా మీరు ఆ వేగంతో వెళుతున్నారు.

స్పీక‌ర్ మేడ‌మ్‌, మేం ఒక విమాన‌యాన విధానాన్ని ప్రారంభించాం. చిన్న ప‌ట్ట‌ణాల‌లో చిన్న ర‌న్‌వేల ను వాడడం ప్రారంభించాం. ప్ర‌స్తుతం మ‌న‌కు 16 కొత్త ఎయిర్ స్ట్రిప్‌లు ఉన్నాయి. విమాన‌యాన రంగంలో ఎన్నో నూత‌న అవ‌కాశాలు ఉన్నాయి. ఆ దిశ‌గా మేము ప్ర‌య‌త్నిస్తున్నాం. రెండో అంచె, మూడో అంచె ప‌ట్ణణాల‌లో విమానాలు రాక‌పోక‌లను సాగించ‌నున్నాయి. ప్ర‌స్తుతం 450 వ‌ర‌కు విమానాలు న‌డుస్తున్నాయి. ఈ చొర‌వ‌తో మేం ఈ ఏడాది 900 కొత్త విమానాలను కొనుగోలు చేయ‌నున్నాం. మా గ‌ట్టి సంక‌ల్పంతో ఇది సాధ్య‌ం అవుతోంది. మేం సాంకేతిక విజ్ఞానాన్ని వాడ‌డ‌మే కాదు, ప‌నుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌ద్ధ‌తి ప్ర‌కారం గ‌మ‌నిస్తుంటాం. డ్రోన్ ల స‌హాయంతో రహదారులు, రైల్వే మార్గాల ప‌నుల‌ను మేం ప‌ర్య‌వేక్షిస్తున్నాం. ఉప‌గ్ర‌హ సాంకేతిక విజ్ఞానాన్ని ఉప‌యోగించి జియో ట్యాగింగ్ చేస్తున్నాం. అంతేకాదు, ప్ర‌భుత్వం నిర్మించిన మరుగుదొడ్ల ఛాయాచిత్రాలను తీసి మొబైల్ ఫోన్‌ ల‌తో ట్యాగ్ చేస్తున్నాం. సాంకేతిక విజ్ఞానం స‌హాయంతో ప‌నుల‌ను ప‌ర్యవేక్షిస్తున్నందువ‌ల్ల ప‌నులు వేగంగా సాగుతున్నాయి. ఇలా ప‌ర్య‌వేక్షించ‌డ‌వల్ల పార‌ద‌ర్శ‌క‌త్వానికి వీలు ఏర్ప‌డింది.

మేం ఎన్నిక‌ల‌లో గెల‌వ‌గానే, మోదీ మీ ఆధార్ ప‌థ‌కాన్ని ఎత్తివేస్తార‌ని అంటూ మీ పార్టీ అనుమానాలను రేకెత్తించింది. మోదీ పై దాడికి ఆధార్‌ ను వాడుకొన్నారు. ఎందుకంటే మోదీ ఆధార్‌ ను ఎత్తివేస్తార‌ని మీరు అనుకున్నారు. మోదీ ఆధార్‌ ను సాంకేతిక ప‌రిజ్ఞానంతో అనుసంధానం చేస్తే దానిని సానుకూలంగా స్వీక‌రించ‌లేక‌పోతున్నారు. మోదీ దీనిని కొత్త పంథాలో తిరిగి తీసుకువ‌స్తార‌ని మీరు ఊహించ‌లేక‌పోయారు. స‌మాజం లోని అత్యంత నిరుపేద‌లు ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌యోజ‌నాన్ని పొందుతుంటే అది మీకు న‌చ్చ‌డం లేదు. బొమ్మ ప‌డితే గెలుపు నాదే, బొరుసు ప‌డితే ఓట‌మి నీదే అనే త‌త్వం మీది. కానీ ఇది స‌రి కాదు. ఇలాంటి విధానం ఎంత‌మాత్రం ప‌నిచేయ‌బోదు. ఇవాళ దేశ‌వ్యాప్తంగా 115 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ఆధార్ కార్డులు ఉన్నాయి. కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన 450 ప‌థ‌కాల‌కు సంబంధించి ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కం కింద న‌గ‌దు ను లబ్ధిదారుల ఖాతాల‌లో నేరుగా జ‌మ చేయ‌డం జ‌రుగుతోంది. చాలా సంవ‌త్స‌రాల పాటు మీరు కేవ‌లం కాగితాల మీద వితంతువులైన వారికి పెన్ష‌న్ లు ఇచ్చారు. ఇందులో చాలామంది మ‌హిళ‌లు అస‌లు లేనే లేరు. ఈ డ‌బ్బును మ‌ధ్య‌వ‌ర్తులు తీసుకొనే వారు. వయో వృద్ధులు, దివ్యాంగుల విష‌యం కూడా ఇలాంటిదే. వీరికి ఉద్దేశించిన డ‌బ్బును మ‌ధ్య‌వ‌ర్తులు తీసుకొనే వారు. ఇలా 57,000 కోట్ల రూపాయ‌లు మ‌ధ్య‌వ‌ర్తులకు వెళ్లాయి. ఇవాళ ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ పథ‌కానికి ఆధార్‌ ను వాడుతుంటే మీకు సంతోషంగా లేదు. ఎందుకంటే మ‌ధ్య‌వ‌ర్తుల వ్యాపారం పోయింది. గుర్తుంచుకోండి.. మోసం చేసే వారు, దేశాన్ని దోచుకొనే వారి రాబ‌డి పోయింది.

స్పీక‌ర్ మేడ‌మ్‌,

దేశం లోని 4 కోట్ల మంది పేద‌, మ‌ధ్య త‌ర‌హా ఆదాయం క‌లిగిన కుటుంబాల‌కు ఉచిత విద్యుత్తును సమకూర్చడానికిగాను మేం సౌభాగ్య ప‌థ‌కాన్ని అమ‌లు చేశాం. అలాంటి ప‌థ‌క‌మే మేమూ ప్రారంభించామ‌ని వారు అన‌వ‌చ్చు. అలాంటి ప‌థ‌కం ఉంద‌ని నేను ఒప్పుకొంటాను. కానీ ప్ర‌జ‌ల‌కు విద్యుత్తు ను స‌ర‌ఫ‌రా చేశారా ? నాడు త‌గిన‌న్ని విద్యుత్తు స‌ర‌ఫ‌రా మార్గాలు ఉండేవా ? క‌రెంటు స్తంభాల‌ను కూడా నిలబెట్ట‌లేదు. మీ హ‌యాంలో ప్ర‌జ‌లు 18వ శ‌తాబ్ది ప‌రిస్థితులలో జీవించే వారు. కానీ మీరు మాత్రం ఆ ప‌థ‌కం మాదే అంటూ గొప్ప‌లు చెప్పుకొంటున్నారు. మేం అభివృద్దిని విడిగా చూడం. అంద‌రినీ క‌లుపుకు పోయే స‌మ‌గ్ర‌మైన దృక్ప‌థంతో, దీర్ఘ‌కాల దార్శనిక‌త‌ను మేం అనుస‌రిస్తున్నాం. నేను ఇప్పుడు విద్యుత్తు అంశాన్ని గురించి మాట్లాడాల‌ని అనుకొంటున్నాను. త‌ద్వారా మీకు మా ప్ర‌భుత్వ ప‌ని విధానం అర్ధ‌మ‌వుతుంది. దేశంలోని 25 కోట్ల కుటుంబాల‌కుగాను 4 కోట్ల కుటుంబాల‌కు విద్యుత్ క‌నెక్ష‌న్ లేదు. అంటే దీనికి అర్థం దేశం లోని దాదాపు 20 శాతం జ‌నాభా ఇంకా చీక‌టి లోనే జీవిస్తోంది. ఇది ఎంత‌మాత్రం గ‌ర్వ‌కార‌ణం కాదు. మీరు ఈ స‌మ‌స్య‌ను మాకు ఇచ్చిపోయారు. దీనిని ప‌రిష్క‌రించ‌డానికి మేం కృషి చేస్తున్నాం. అయితే ఈ ప‌నిని మేం ఎలా చేస్తున్నాం ? ఈ ప‌నిని మేం నాలుగు భాగాలు.. విద్యుత్తు ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా, పంపిణీ, క‌నెక్ష‌న్.. గా విభ‌జించాం. వీటిన‌న్నిటినీ అభివృద్ధి చేస్తున్నాం. అన్నింటి క‌న్నా ముఖ్య‌మైన విష‌యం సౌర విద్యుత్తు ఉత్ప‌త్తి పైనా, జ‌ల‌ విద్యుత్తు పైనా, బొగ్గు, పరమాణు విద్యుత్తు ల‌పైనా మేం దృష్టిపెట్టాం. విద్యుత్తు స‌ర‌ఫ‌రా నెట్ వ‌ర్క్ ను చాలా వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. గ‌త 3 సంవ‌త్స‌రాల్లో 1.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టుల‌ను చేప‌ట్టాం. గ‌త ప్ర‌భుత్వం త‌న చివ‌రి మూడు సంవ‌త్స‌రాల్లో చేప‌ట్టి ప్రాజెక్టుల విలువ‌ కంటే 83 శాతం ఎక్కువ‌. 2014 త‌రువాత విద్యుత్తు స‌ర‌ఫ‌రా లైన్ ల విస్త‌ర‌ణ‌లో పెరుగుద‌ల 31 శాతం. గ‌త మూడు సంవ‌త్స‌రాల్లో ట్రాన్స్ ఫార్మ‌ర్ సామ‌ర్థ్యాన్ని 49 శాతం పెంచాం. క‌శ్మీర్ నుండి క‌న్యాకుమారి దాకా, కచ్ఛ్ నుండి కామ రూప్ దాకా విద్యుత్తు స‌ర‌ఫ‌రా కు సంబంధించిన మొత్తం నెట్ వ‌ర్క్ ను ఏర్పాటు చేశాం. విద్యుత్తు పంపిణీ వ్య‌వ‌స్థను బ‌లోపేతం చేయ‌డానికి ఉజ్జ్వల్ డిస్ కమ్ అశ్యూరెన్స్ యోజ‌న అంటే ‘ఉద‌య్’ ప‌థ‌కాన్ని రూపొందించి, ఆయా రాష్ట్రాల‌తో ఎమ్ఒయు చేసుకోవ‌డం జ‌రిగింది. విద్యుత్తు ప్రసార కంపెనీలు వాటి ఆర్ధిక నిర్వ‌హ‌ణ‌ను మేలుగా చేప‌ట్టేలా చ‌ర్యలు తీసుకొన్నాం. ఆ త‌ర్వాత సౌభాగ్య ప‌థ‌కాన్ని ప్రారంభించి దీని ద్వారా ల‌బ్ధిదారుల గృహాల‌కు విద్యుత్తు ను స‌ర‌ఫ‌రా చేస్తున్నాం. ఒక వైపు విద్యుత్తు క‌నెక్ష‌న్ పై దృష్టి పెడుతూనే మ‌రో వైపు విద్యుత్తు ఆదా పైన గ‌ట్టిగా కృషి చేస్తున్నాం. ఇంత‌వ‌ర‌కూ మేం 28 కోట్ల ఎల్ ఇడి బ‌ల్బుల‌ను పంపిణీ చేశాం. విద్యుత్తు బిల్లుల విష‌యంలో 15 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఆదా చేశాం. స‌మ‌యం వృథా ను అరిక‌ట్టడానికి, డ‌బ్బు వృథా ను అరిక‌ట్ట‌డానికి మేం నిజాయతీ గా ప్ర‌య‌త్నించాం.

మేడమ్ స్పీక‌ర్‌,

అన్న‌దాత‌లకు సంబంధించిన అంశాన్ని రాజ‌కీయం చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 70 సంవ‌త్స‌రాలైన త‌రువాత కూడా ఒక ల‌క్ష కోట్ల రూపాయ‌ల విలువైన పండ్లు, కూర‌గాయ‌లు, ధాన్యం, పూలు మొద‌లైన వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు వృథా అయిపోతున్నాయి. స్టోర్ రూముల‌ వ‌ర‌కు తెచ్చి వాటిని విపణి వ‌ర‌కు తీసుకు పోయే లోపు స‌రైన స‌మ‌ర్థ‌వంత‌మైన స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ లేక‌పోవ‌డంవ‌ల్ల‌నే ఇలా జ‌రుగుతోంది. ఈ వ్య‌వ‌స్థ‌ను బలోపేతం చేయ‌డానికి ప్ర‌ధాన మంత్రి కిసాన్ సంప‌ద యోజ‌న‌ ను ప్రారంభించడమైంది. త‌ద్వారా రైతులు స‌రైన గోదాముల సౌక‌ర్యాల‌ను, అందుబాటు ధ‌ర‌లలో పొంద‌గ‌ల‌రు. వారి ఉత్ప‌త్తులు చెడిపోకుండా ఉంటాయి.

స‌రఫరా గొలుసు సంబంధిత ప్రాథమిక సౌక‌ర్యాల‌ను బ‌లోపేతం చేయాల‌ని ప్ర‌భుత్వం నిశ్చయించింది. వృథా ను అరిక‌ట్ట‌డం ద్వారా ఆదా చేసే ఒక ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు పెట్టి ఫూడ్ ప్రాసెసింగ్ రంగంలో మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు పెంచుతాం. మ‌న దేశంలో వ్య‌వ‌సాయం ఎంత ముఖ్య‌మో ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ కూడా అంతే ముఖ్యం. రెండూ ఒక‌దాని మీద మ‌రొక‌టి ఆధార‌ప‌డిన రంగాలు. ప‌శు సంవ‌ర్ధ‌క రంగంలో స‌రైన సౌక‌ర్యాలు లేక‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌తి ఏడాది దాదాపు 40 వేల కోట్ల రూపాయాల‌ను న‌ష్ట‌పోతున్నాం. దీనిని అరిక‌ట్ట‌డానికిగాను ఈ రంగంపైనే మేం దృష్టిపెట్టాం. బ‌ల‌మైన రీతిలో ఉండేలా కామ‌ధేను కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టాం.

ప‌శు సంవ‌ర్ధ‌క రంగంలో వున్న‌వారికి కామ‌ధేను కార్య‌క్ర‌మం తో భారీ స్థాయిలో మేలు జ‌రుగుతుంది. 2022 కల్లా రైతుల ఆదాయాల‌ను రెట్టింపు చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకొంటున్నాం. 1980 ల‌లో 21వ శ‌తాబ్దాన్ని గురించి మాట్లాడిన‌ప్పుడు మీరు ఆమోదించారు. అయితే ఇప్పుడు మోదీ ఈ 2018 లో 2022 ను గురించి మాట్లాడుతుంటే దీనిని ఆమోదించ‌డానికి మీకు ఇబ్బందిగా ఉంది. 1980 వ ద‌శ‌కంలో 21వ‌ శ‌తాబ్ది క‌ల‌ల‌ను మీరు చూపించే వారు. దేశానికి స్వాంత్ర్యం వ‌చ్చి 2022 కల్లా 75 సంవ‌త్స‌రాలు నిండుతాయి. ఆ స‌మ‌యానికిగాను చేరుకోవలసిన ప్ర‌త్యేక‌ ల‌క్ష్యాల‌ను రూపొందించి వాటి గురించి మా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తుంటే, ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తిని ఇవ్వ‌డానికి కాల‌ప‌రిమితి ప్ర‌కారం ప‌ని చేస్తుంటే మీకు మింగుడుప‌డ‌డం లేదు. 2022 వ సంవత్సరానికల్లా రైతుల ఆదాయ‌న్ని రెట్టింపు చేయాల‌నే మా ల‌క్ష్యం ప‌ట్ల మీరు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఏనాడూ భారీ స్థాయిలో క‌ల‌లు క‌న‌లేదు. కుత్సిత‌మైన ఆలోచ‌న‌ల‌తో దేనినీ సాధించ‌లేం. ఇన్ పుట్ వ్య‌యాన్ని త‌గ్గించ‌డం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయ‌లేమా ? భూసార ప‌రీక్ష‌ల కార్డు, సోలర్ పంపులు, వేప పూత పూసిన యూరియా మొద‌లైన వాటిని రైతుల‌కు అందుబాటులోకి తీసుకు రావ‌డం వ‌ల్ల రైతులు పెడుతున్న పెట్టుబడి ఖ‌ర్చులు తగ్గుతున్నాయి. అలాగే రైతులు వారి వ్య‌వ‌సాయ భూముల గ‌ట్ల మీద వెదురు పంట‌ను పెంచ‌డం ద్వారా వారి ఆదాయ అవ‌కాశాల‌ను పెంచుకోవ‌డానికి వీలుగా మేం ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. వెదురు పంట‌కు ఖ‌చ్చిత‌మైన విపణి ఉంది. మీరు గ‌తంలో అమ‌లు చేసిన త‌ప్పుడు విధానం కార‌ణంగా, వేల కోట్ల‌ రూపాయల విలువైన వెదురును మ‌న దేశం దిగుమ‌తి చేసుకోవాల్సి వ‌చ్చింది. మీరు వెదురును వృక్షాల జాబితాలో ఉంచ‌డం వ‌ల్ల దాన్ని న‌రికి లబ్ధి పొంద‌డం క‌ష్టమైన ప‌నిగా మారిపోయింది. దీని కార‌ణంగా ఈశాన్య భార‌తం లోని ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డ్డారు. మా ప్ర‌భుత్వం ఈ విధానంలో మార్పు చేసి ఎంతో ధైర్యంగా వెదురును గ‌డ్డి జాతి మొక్క‌ల జాబితా లోకి తెచ్చింది. దీని కార‌ణంగా రైతుల ఆదాయం పెరుగుతుంది. రైతులు వారి పొలాల మూల‌ల్లో వెదురును నాటుకోవ‌డం వ‌ల్ల దాని నీడ పంట‌ల‌ పైన ప్ర‌భావం చూప‌దు. ఈ ప‌ని చేయ‌డం వ‌ల్ల రైతుల ఆదాయం గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. అలాగే పాల ఉత్ప‌త్తిని పెంచాల‌నుకొంటున్నాం. తేనెటీగ‌ల పెంప‌కాన్ని ప్రోత్సాహించాల‌నుకొంటున్నాం. ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. తేనెటీగ‌ల పెంప‌కంలో 40 శాతం పెరుగుద‌ల‌ను సాధించాం. ఈ నిజం చాలా కొద్దిమందికి మాత్ర‌మే తెలుసు. ప్రస్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంప్ర‌దాయ ఆరోగ్య భ‌ద్ర‌త‌ పైన, సుల‌భ‌త‌ర‌మైన జీవ‌నం మీదా దృష్టి పెట్టారు. దాంతో ర‌సాయ‌నిక వ్యాక్స్ ను వాడే వారు, తేనెటీగ‌ల వ్యాక్స్ ను వాడుతున్నారు. నేడు ప్ర‌పంచవ్యాప్తంగా తేనెటీగ‌ల వ్యాక్స్ కు డిమాండ్ అధికంగా ఉంది. కాబ‌ట్టి మ‌న రైతులు వ్య‌వ‌సాయంతో పాటు తేనెటీగ‌ల పెంప‌కాన్ని చేప‌ట్టాలి. తేనెటీగ‌ల వ్యాక్స్ కార‌ణంగా రైతుల ఆదాయం గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. తేనెటీగ‌లు స‌మృద్ధిగా ఉంటే పంట‌ల పెరుగుద‌ల‌కు అవి దోహ‌దం చేస్తాయ‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. రైతుల ఆదాయాన్ని పెంచ‌డానికి ప‌లు రంగాలు అందుబాటులో ఉన్నాయి. పాల ఉత్ప‌త్తి, కోళ్ల పెంప‌కం, చేప‌ల పెంప‌కం, వెదురు పెంప‌కం మొద‌లైన రంగాలు రైతుల ఆదాయాల‌ను పెంచుతాయి. ఆధార్ ను అమ‌లు చేయ‌డం క‌ష్ట‌మ‌ని న‌మ్మిన వారే జిఎస్ టిని అమ‌లు చేయ‌కుండా చేస్తామ‌ని న‌మ్మారు. వారు ప్ర‌భుత్వం నాశ‌నం కావాల‌ని భావించారు. ఇప్పుడు ఆధార్‌, జిఎస్ టీ రెండూ అమ‌ల‌వుతున్నాయి. ఇప్పుడు వారు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డానికి, స‌మ‌స్య‌ల‌ను సృష్టించ‌డానికి కొత్త కొత్త మార్గాల‌ను వెతుకుతున్నారు. వారు ఇప్పుడు ఈ ఆట ఆడుతున్నారు. ఏదైనా ప‌ని దేశాన్ని నిరాశ‌లో కూరుకుపోయేలా చేస్తుంద‌నుకొంటే ఆ ప‌నిని ప్ర‌తి రాజ‌కీయ పక్షం ప‌క్క‌న పెడుతుంది. కానీ ఒక ముఠా కు చెందిన స‌భ్యులు ప్ర‌జ‌ల‌ను నిరాశ‌ప‌రచే మార్గంలో న‌డుస్తున్నారు. ఈ రోజున జిఎస్ టి అనేది లాజిస్టిక్స్ కు గ‌ణ‌నీయంగా ల‌బ్ధిని చేకూర్చింది. గ‌తంలో ర‌వాణా మార్గాల్లోని టోల్ ట్యాక్స్ లు, ట్రాఫిక్ జామ్ ల కార‌ణంగా అనేక విధాలుగా వృథా జ‌రిగేది. ఈ రోజున దానిని నివారిస్తున్నాం. మ‌న ర‌వాణా సామ‌ర్థ్యం 60 శాతం పెరిగింది. ఒక ట్ర‌క్కు 5- 6 రోజుల్లో చేసే ప‌నిని రెండు, రెండున్న‌ర రోజుల్లో పూర్తి చేస్తోంది. దీని కార‌ణంగా దేశం పెద్ద మొత్తంలో ప్రయోజనాన్ని పొందుతోంది. దేశ ప్ర‌గ‌తిలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ముఖ్య పాత్ర‌ను పోషిస్తోంది. వదంతులను వ్యాప్తి చేయ‌డం ద్వారా మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌ లోకి నెట్టే ప‌నులు చేయ‌డానికి కొంత‌మంది ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌న దేశంలోని మ‌ధ్య‌త‌ర‌గ‌తి సుప‌రిపాల‌న‌ను, మెరుగైన సౌక‌ర్యాల‌ను కోరుకొంటోంది. ఒక వ్య‌క్తి రైలు టికెట్ కొన్న త‌రువాత రైలులో ల‌భించే సౌక‌ర్యాల‌న్నిటిని ఒక హ‌క్కుగా కోరుకొంటాడు. అత‌ను త‌న కుమారుడిని బడికి పంపితే అక్క‌డ త‌న బిడ్డ‌కు మంచి విద్య ల‌భించాల‌ని ఆశిస్తాడు. ఒక ఆహార ప‌దార్థాన్ని కొనుగోలు చేస్తే అది మంచి నాణ్య‌త‌తో ఉండాల‌ని భావిస్తాడు. అత‌నికి సరైన విద్యాసంస్థ‌ల‌ను, అందుబాటు ధ‌ర‌లలో గృహాల‌ను, స‌రైన రహదారులను, మెరుగైన ర‌వాణా సౌక‌ర్యాల‌ను, ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ప్రాథమిక సౌక‌ర్యాలను వంటి వాటిని క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్రభుత్వానిదే. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు మెరుగైన జీవ‌నాన్ని పొంద‌డానికి వీలుగా, వారి ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డానికిగాను గ‌త 1.5 సంవ‌త్స‌రాలుగా ప్ర‌భుత్వం త‌నంత‌ట తాను అనేక చ‌ర్య‌ల‌ను తీసుకుంటోంది. ఈ విష‌యం తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. ప్ర‌పంచంలోనే తీసుకుంటే, మ‌న దేశంలో ప్రారంభ స్థాయిలో ఆదాయ‌ ప‌న్ను 5 శాత‌ం ఉంది. ఇది ప్ర‌పంచంలోకెల్లా అతి త‌క్కువ స్థాయి. అభివృద్ధి చెందిన‌ ఏ దేశంలోను ఇలాంటి ఆదాయ‌పు ప‌న్నును అమ‌లు చేయ‌డం లేదు. 2000 సంవ‌త్స‌రం కంటే ముందు ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెటు లో ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితిని 50 వేల రూపాయ‌ల‌ నుండి 2.5 ల‌క్ష‌ల‌కు పెంచ‌డం జ‌రిగింది. ఈ ఏడాది 40 వేల రూపాయ‌ల స్టాండ‌ర్డ్ త‌గ్గింపునకు మేం అనుమ‌తిని ఇచ్చాం. అలాగే సీనియ‌ర్ సిటిజన్ ల‌కు ప‌న్ను మిన‌హాయింపు సౌక‌ర్యాన్ని క‌ల్పించాం. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అందే ప్ర‌యోజ‌నాల‌ను పెంచ‌డం ద్వారా వారికి ప్ర‌తి ఏడాది 12 వేల కోట్ల రూపాయ‌ల ల‌బ్ది చేకూరుతోంది. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ( న‌గ‌రాల్లో) కు 31 వేల కోట్ల రూపాయ‌లను కేటాయించాం. మొద‌టి సారిగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు రుణాల రూపంలో ల‌బ్ధి పొంద‌బోతున్నారు. ఈ ప‌నిని మా ప్ర‌భుత్వ‌మే చేసింది. మేం నూత‌న ఐఐటి ల‌ను, ఐఐఎమ్ ల‌ను, ఎఐఐఎమ్ఎస్ ల‌ను ప్రారంభించాం. 11 నూత‌న న‌గ‌రాల్లో మెట్రో రైళ్ల‌ను ప్రారంభిస్తున్నాం. 32 ల‌క్ష‌ల ఎల్ ఇడి వీధి దీపాల‌ను ఏర్పాటు చేశాం. ఈ ప‌నులు చేయ‌డం వ‌ల్ల మ‌ధ్య‌, చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు ల‌బ్ధి ని పొందుతున్నాయి. ఈ విష‌యాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. ఎమ్ఎస్ ఎమ్ఇ రంగానికి చెందిన ప్ర‌జ‌లు మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు చెందిన‌ వారు. 2.5 కోట్ల ట‌ర్నోవ‌ర్ క‌లిగిన కంపెనీల‌కు ప‌న్ను రేటును త‌గ్గించాం. దీనిని 30 శాతాన్నుండి 25 శాతానికి తెచ్చాం. ఈ ప‌నిని మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల సంక్షేమం కోసం చేశాం. 2 కోట్ల రూపాయ‌ల వ్యాపార లావాదేవీలు నిర్వ‌హించే వ్యాపారులు వారి బ్యాంకుల‌ ద్వారానే ఆ ప‌ని ని చేయ‌గ‌ల‌రు. ప్ర‌భుత్వం వారి ఆదాయాన్ని ట‌ర్నోవ‌ర్ లో 6 శాతంగానే ప‌రిగ‌ణిస్తుంది త‌ప్ప 8 శాతం కాదు. దీని వ‌ల్ల వారికి ప‌న్నుల రూపంలో 2 శాతం ల‌బ్ధి దక్కనుంది. జిఎస్ టి కింద 1.5 కోట్ల రూపాయ‌ల టర్నోవ‌ర్ క‌లిగిన వారు కాంపోజిష‌న్ ప‌థ‌కం కింద‌కు వ‌స్తారు. వారు వారి ట‌ర్నోవ‌ర్ లో 1 శాతం ప‌న్నును చెల్లిస్తే స‌రిపోతుంది. ఇది ప్ర‌పంచంలోనే అతి త‌క్కువ మొత్తం.

గౌర‌వ‌నీయులైన స్పీక‌ర్ మేడ‌మ్‌,

జ‌న్ ధ‌న్ యోజ‌న లో భాగంగా 31 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరిపించ‌డం జ‌రిగింది. ఆరోగ్య బీమా ప‌థ‌కం వల్ల 18 కోట్లకు పైగా పేద ప్ర‌జ‌లు ల‌బ్ధి ని పొంద‌గ‌ల‌రు. ఇందుకు గాను వారు ప్ర‌తి రోజూ 90 పైస‌లు ప్రీమియమ్ గానీ, లేదా నెల‌కు ఒక రూపాయి ప్రీమియమ్ ను గానీ చెల్లిస్తే స‌రిపోతుంది. ప్ర‌మాదంలో ఉన్న పేద కుటుంబాలు ఈ ప‌థ‌కం కింద 2 వేల కోట్ల రూపాయ‌లు పొందాయి. ఇంతటి ఉదాత్త‌మైన ఈ ప‌నిని మేం చేశాం.

3 కోట్ల 30 ల‌క్ష‌ల మంది పేద మాతృమూర్తులు, వారి బిడ్డ‌లు ఉజ్జ్వల యోజ‌న ప‌థ‌కం ద్వారా ల‌బ్ది ని పొందుతున్నారు. గ‌తంలో గ్యాస్ క‌నెక్ష‌న్ కావాలంటే ఎంపీల వెంట తిర‌గాల్సి వ‌చ్చేది. మేం ఇప్పుడు గ్యాస్ క‌నెక్ష‌న్ ను ప్ర‌జల ఇంటి ముందుకు తెచ్చాం. ఈ సంఖ్య‌ను 8 కోట్ల‌కు పెంచాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకొన్నాం.

పేద ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త మీద మ‌నం దృష్టి పెట్ట‌వ‌ద్దా ? ఇందుకోసం ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న‌ ను ప్ర‌వేశ‌పెట్టాం. చేతిలో డ‌బ్బు లేక‌పోవ‌డం కార‌ణంగా పేద ప్ర‌జ‌లు చికిత్స తీసుకోలేక చ‌నిపోయే వారు. అనారోగ్యం పాలైన పేద ప్ర‌జ‌లు అప్పులు చేసి చికిత్స తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డేవారు కాదు. ఎందుకంటే వారి పిల్ల‌లు అప్పుల‌ పాల‌వుతార‌నేది వారి భయం. ఈ భ‌యం నుండి వారిని బయట‌ ప‌డేయ‌డానికిగాను మేం నిర్ణ‌యం తీసుకొన్నాం. ఇది స‌రైన‌ది కాదా ? మేం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కంలో మార్పులు చేయాలంటే మీరు స‌రైన మార్పుల‌ను సూచించండి. మీరు ఇచ్చే సూచ‌న‌లను, స‌ల‌హాలను మేం త‌ప్ప‌కుండా తీసుకొంటాం. త‌ద్వారా ప్ర‌భుత్వం 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు చికిత్సల‌కు ఖ‌ర్చుపెట్టే వారికి ఆ మేర‌కు ప్ర‌తి ఏడాది సాయం చేస్తుంది. కానీ దుర‌దృష్టం కొద్దీ మీరు వారిని త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. మీ ద‌గ్గ‌ర స‌రైన ప్ర‌ణాళిక ఉంటే ద‌య‌చేసి దానిని నాకు సూచించండి. మేము దానిని ఆచ‌రిస్తాం.

స్పీకర్ మేడమ్,

ప్రభుత్వం తీసుకొన్న చర్యల వల్ల ప్రజల ఆలోచన విధానం కూడా మారింది. జన్ ధన్ యోజన పేదల ఆత్మస్థైర్యాన్ని పెంచింది. నిరుపేద కూడా తన ఖాతాలో డబ్బులు జమ చేసుకొని, రూపే డెబిట్ కార్డు ను ఉపయోగిస్తున్నాడు. ధనవంతుల కుటుంబాలలో ఈ రోజు తాను కూడా ఒకడినని భావిస్తున్నాడు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ మహిళల ఆత్మస్థైర్యాన్ని పెంచింది. బాధల నుండి వారిని విముక్తం చేసిన వాటిలో ఇది ఒకటి. దాచుకొన్న సొమ్ము పోతుందేమోనని చేస్తున్న ఉద్యోగాన్ని వదలి కొత్త ఉద్యోగానికి వెళ్లాలంటే కార్మికులు భయపడే వారు. క్లెయిము చేయని 27 కోట్ల రూపాయలను సార్వత్రిక ఖాతా సంఖ్య (యుఎఎన్) ద్వారా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాం. ఇపుడు ఓ పేద కార్మికుడు తనతో పాటు తన బ్యాంకు ఖాతాను వెంట తీసుకుపోవచ్చు.

అవినీతి, నల్లధనం : మీకు నిద్రపట్టడం లేదని నాకు తెలుసు. అసహనానికి మీరు చెప్తున్న కారణాలను నేను అర్థం చేసుకోగలను. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారు ప్రశాంతంగా ఉండలేరు. ఎవరూ తప్పించుకోజాలరు! నలుగురు మాజీ ముఖ్యమంత్రులు అవినీతికి పాల్పడ్డట్లు భారతదేశ చరిత్రలో తొలి సారి న్యాయస్థానం ప్రకటించింది. వారు శేష జీవితాన్ని కారాగారంలో గడపవలసివుంటుంది. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. దేశ సంపదను దోచుకొన్న వారు వెనుకకు రాక తప్పదు. ఈ ప్రయత్నాలకు సంబంధించి మడమ తిప్పేది లేదు. నేను ఓ సైనికుడిని. అందువల్లనే ఈ రోజు దేశంలో నిజాయతీ తో కూడిన వాతావరణం ఉంది. నిజాయతీ కి పట్టం కడుతూ మనం సంబరాలు చేసుకొంటున్నాం. ఆదాయపు పన్ను ను కట్టేందుకు అనేక మంది ప్రజలు నేడు ముందుకు వస్తున్నారు. జమ చేస్తున్న ప్రతి పైసా సద్వినియోగం అవుతుందని తెలిసే ఈ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు.

దీనిని మరింత వివరంగా చెప్పాలని అనుకొంటున్నాను.. పదే పదే అబద్ధాలు చెప్పడం కొంత మందికి అలవాటుగా మారిపోయింది. వాస్తవ పరిస్థితులను ఆర్థిక మంత్రి ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. అయినప్పటికీ నిజాలకు పాతర వేసి పదే పదే అబద్ధాలను వల్లిస్తున్నారు. వసూలు కాని రుణాల (ఎన్ పిఎ) విషయాన్నే తీసుకొందాం. అధ్యక్షా, మీ ద్వారా ఎన్ పి ఎకు సంబంధించిన వాస్తవాలను దేశ ప్రజల ముందు ఉంచాలని ఉంది. ఎన్ పిఎ సమస్యకు 100 శాతం బాధ్యత ఇంతకు ముందున్న ప్రభుత్వానిదే అన్న సంగతి ముందు దేశ ప్రజలందరికీ తెలియాలి. దీనిలో ఇతరులకు ఒక్క శాతం బాధ్యత కూడా లేదు. బ్యాంకులపై ఒత్తిడి తెచ్చేలా విధానాలను రూపొందించుకొన్నారు. రుణాలను సొంత మనుషులకే ఇచ్చుకొన్నారు. వారు రుణాలను తిరిగి చెల్లించే పరిస్థితి లేదు. బ్యాంకులు, రాజకీయ నాయకులూ, ప్రభుత్వం, దళారులు కలసిపోయి రుణాలను పునర్వ్యవస్థీకరించారు. బ్యాంకుల నుండి బయటకు వెళ్లిన డబ్బు వెనుకకు రాలేదు. లావాదేవీలన్నీ కూడా కాగితాల మీదే ఉన్నాయి. దేశాన్ని యథేచ్ఛగా దోచుకొనే వైనం అలా కొనసాగుతూ పోయింది. లక్షల, వందల కోట్లను ఇచ్చేశారు. మేం అధికారంలోకి వచ్చిన తరువాత ఇది నా దృష్టికి వచ్చింది. ఒక వేళ దీనిపై రాజకీయం చేయదలచుకొంటే దేశ ప్రజల ముందు అన్ని వాస్తవాలనూ ఆనాడే ఉంచే వాడిని. బ్యాంకుల దు:స్థితి ని గురించి చెప్పి ఉంటే అది ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేసేది. మీరు చేసిన పాపాలకు సంబంధించి రుజువులు నా దగ్గర ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని నేను మౌనంగా ఉన్నాను. ఇది దేశ సౌభాగ్యం కోసం చేసిందే. మీరు ఆరోపణలు చేస్తున్నప్పటికీ నేను క్షమిస్తోంది కూడా దేశ సౌభాగ్యం కోసమే. ఇపుడు బ్యాంకులను బలోపేతం చేశాం కాబట్టి, దేశ ప్రజల ముందు నిజాల్ని ఉంచే సమయం వచ్చింది. ఈ సభలో ఉండి నేను చెప్తున్నాను.. మీరు చేసిన తప్పిదాల వల్లనే వసూలు కాని రుణాల సమస్య ఉత్పన్నం అయిందని నేను చాలా స్పష్టంగా అంటున్నాను. ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. వసూలు కాని రుణాల సమస్య ఉత్పన్నం కావడానికి అవకాశం ఉన్న ఏ ఒక్క రుణాన్ని కూడా మా ప్రభుత్వం ఇవ్వలేదు. మీరు నిజాలకు పాతర వేశారు. అసలు సంఖ్యలను బయటకు చెప్పడం లేదు. ఎన్ పిఎలు 36 శాతం ఉన్నట్లు మీరు చెప్పారు. వాస్తవాలను బహిర్గతం చేయాల్సిందిగా 2014 లో మిమ్మల్ని అడిగాం. లేదని బొంక వద్దు. మేం అధికారంలోకి వచ్చిన అనంతరం కాగితాలలో చూస్తే వాస్తవంగా అది 82 శాతంగా ఉంది. 2008 మార్చి నెల లో బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.18 లక్షల కోట్లు. 2014 వచ్చే సరికి ఇది రూ.52 లక్షల కోట్లకు చేరుకొంది. కాబట్టి, బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాలు రూ.52 లక్షల కోట్లు అయింది. ఇంత పెద్ద తేడా కేవలం 6 ఏళ్ల వ్యవధిలో! దేశాన్ని మీరు దోచుకొన్నారు. వ్యవస్థ ను పునర్వ్యవస్థీకరిస్తున్నాం. రుణాలు ఖచ్చితంగా ఎప్పుడు ఇచ్చారు ?, చెల్లింపులు ఎప్పుడు జరిగాయి ? అనే విషయాలను వెలికితీస్తున్నాం. మీరు దళారులను స‌మ‌ర్థించే పనిలోనే ఉన్నారు. ఎందుకంటే మీకు కావలసింది వాళ్లే. ఇందులో మీకు వ్యక్తిగత లాభం ఉన్నందునే ఇందులో మీరు పాలుపంచుకొన్నారు. దేశాన్ని ప్రక్షాళన చేసే పనిలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను భరిస్తాం. ప్రక్షాళన అన్నది ఈ ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు. ప్రక్షాళన అన్నది నా దేశ ప్రజల హక్కు. వారి ఆలోచనలలో కూడా ఇదే ఉంది. అందుకే మేం ఈ పని చేశాం.

గత 4 సంవత్సరాలుగా ఈ పనిలోనే ఉన్నాం. ఇతర దేశాల అనుభవాలను కూడా పరిశీలించి, బ్యాంకులకు మరిన్ని నిధులను అందించే దిశగా ఎంతో ఆలోచించాం. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేశాం. బ్యాంకులను బలోపేతం చేసిన తరువాత కూడా మీ అబద్ధాలను భరిస్తున్నా. ఈ రోజు దేశ ప్రజలకు స్పష్టంగా చెప్తున్నాను.. మీరు ఈ దేశాన్ని రూ.18 లక్షల కోట్ల నుండి రూ.52 లక్షల కోట్ల వరకు దోచుకొన్నారు. 18 నుండి 52 కు మధ్య ఉన్న తేడా మీరు దోచుకొన్న డబ్బుకు చెల్లించవలసిన వడ్డీ. ఇవన్నీ మీరు ఒడిగట్టిన పాపాలు. ఈ డబ్బంతా మా ప్రభుత్వం ఇచ్చింది కాదు. ఇంత పాపానికి పాల్పడిన మిమ్మల్ని ఈ దేశం ఎన్నటికీ క్షమించదు. చేసిన పాపాలకు మీరు ఒక రోజు మూల్యం తప్పక చెల్లించవలసివుంటుంది.

ఇవి.. పిరికి వారు చేసే రాజకీయాలు. మీద బురద చల్లి దూరంగా పారిపోతారు. మీరు అనుకొన్నదే చేయండి.. మీరు బురద చల్లే కొద్దీ కమలం మరింత వికసిస్తుంది. ఆరోపణల జోలికి వెళ్లకుండా ఓ కొత్త విషయాన్ని వెల్లడిస్తున్నాను. నిజానిజాలను దేశమే నిర్ణయిస్తుంది. మీరు కతర్ తో 20 ఏళ్ల కాల వ్యవధితో ఒక ఒప్పందం చేసుకొన్నారు. మేం కతర్ తో మాట్లాడి మా అభిప్రాయాన్ని వెల్లడించాం. పని మీరు ప్రారంభించినప్పటికీ, భారతదేశం సంతకం చేసింది కనుక, దానిని మేం పూర్తి చేస్తాం. ప్రతి ప్రభుత్వం ఈ తరహా బాధ్యతలు తీసుకోక తప్పదు. గ్యాస్ కొనుగోలు విషయమై, కతర్ తో మరోసారి చర్చించి 8 వేల కోట్ల రూపాయలను ఆదా చేశాం. నిష్కళంకమైన ఈ సభలో నిలబడి దేశ ప్రజలకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను.

మీరు అదనంగా 8000 కోట్ల రూపాయలను చెల్లించారు. ఎలా ?, ఏమిటి ? అన్న ప్రశ్నలు తెర పైకి రావచ్చు.. దీనిని దేశానికే వదిలిపెడదాం. ఇంతకు మించి దీనిని గురించి నేనేమీ చెప్పదలచుకోలేదు. గ్యాస్ కు సంబంధించి గతంలో ఆస్ట్రేలియాతో ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది. మనం వారి వద్ద నుండి గ్యాస్ ను కొనుగోలు చేస్తున్నాం. వారితో కూడా మరోసారి చర్చలు జరిపి రూ.4,000 కోట్లు ఆదా చేశాం. వారికి సమయాన్ని పెంచడం వల్ల రూ.4,000 కోట్లు ఆదా అయ్యాయి. ఈ ప్రజా ధనాన్ని ఎప్పుడు, ఎలా, ఎందుకు ఖర్చు పెట్టారో చెప్పండని దేశం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. దీనికి సమాధానాలు కావాలని మిమ్మల్ని నిలదీస్తారు.

ఎల్ఇడి బల్బులు : మీరు ప్రభుత్వంలో ఉన్నపుడు ఎల్ఇడి బల్బు ను 300- 350 రూపాయలకు ఏ కారణంతో విక్రయించారో చెప్పండి ? భారత ప్రభుత్వం ఒక్కో బల్బు ను 300- 350 రూపాయలకు కొంటోంది. అదే బల్బు, అదే సాంకేతికతతో, అదే నాణ్యతతో ఇపుడు కేవలం 40 రూపాయలకు కంపెనీలు విక్రయిస్తున్నాయి. దీనికి సమాధానం మీరు చెప్పాలి. మీ హ‌యాంలో సౌర విద్యుత్తు 13, లేదా 14 లేదా 15 రూపాయల ధర ఎందుకు పలికేది ? మీరు దేశాన్ని దోచుకున్నారు. మీరు పాటించిన ధర్మం ఇదే. మరి ఇప్పుడు సౌర విద్యుత్తు 2 నుండి 3 రూపాయలకే ఎందుకు లభిస్తోంది ? మేం మిమ్మల్ని అభిశంసించడం లేదు. ఆ పని ని అవసరమైతే ఈ దేశ ప్రజలు చూసుకొంటారు. నా పరిమితులలో నేను ఉండదలచుకొన్నాను. ఇవీ నిజాలు. అందువల్ల
ప్రస్తుతం ఈ దేశం పరువు ప్రతిష్ఠలు పెరిగాయని చెబుతున్నాను.
ఈ రోజు ప్రపంచంలో మన పాస్ పోర్టుకు ఉన్న విలువ ఎన్నో రెట్లు పెరిగింది. మన పాస్ పోర్టు ఉన్న వారు విదేశాలలో ఎవరితో భేటీ అయినా, సగర్వంగా వారివైపు తలెత్తి చూస్తున్నారు. దేశంలో ఉన్న సమస్యలను మీరు విదేశాలలో తప్పుగా అన్వయించడానికి మీకు సిగ్గుగా లేదా ? డోక్లామ్ సమస్య వచ్చినపుడు మీరు చైనా తో మాట్లాడుతారు. ప్రజాస్వామ్య సూత్రాలను మర్చిపోతారు.. బాధ్యతాయుత ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలి ? ఒకసారి గుర్తు చేసుకోండి. ఇందిరాగాంధీ గారు బేనజీర్ భుట్టో తో సిమ్లా ఒప్పందం చేసుకొన్నారు. అప్పట్లో ఏకైక పెద్ద ప్రతిపక్షంగా మా పార్టీనే ఉంది. సమయం తీసుకొని అటల్ బిహారీ వాజపేయి గారు ఇందిరా గాంధీ గారితో భేటీ అయ్యారు. తీసుకొన్న నిర్ణయం తప్పుదారిలోకి వెళ్తోందని ఆమెను హెచ్చరించారు. ఆ తరువాత ఎలాంటి ఇబ్బందీ రాకుండా దేశాన్ని కాపాడుకోగలిగాం. ఈ దేశ ప్రజల క్షేమమే మా బాధ్యత. మన సైన్యం సర్జికల్ స్ట్రయిక్ లు చేసినపుడు మీరు దానిని ప్రశ్నించడం మొదలు పెట్టారు. కామన్ వెల్త్ గేమ్స్ గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదని నమ్ముతున్నాను. వారి మనస్సులలో నేటికీ ఇంకా ఎన్నో అనుమానాలు అలాగే ఉండిపోయాయి. భారతదేశం – ఆఫ్రికా సదస్సు ను 54 దేశాలతో ఈ ప్రభుత్వం నిర్వహించింది. బ్రిక్స్ సదస్సు, ఫీఫా అండర్- 17 ప్రపంచ కప్ నూ నిర్వహించాం. అనేక భారీ కార్యక్రమాలకు మేం శ్రీకారం చుట్టాం. జనవరి 26న ఆసియాన్ నుండి పది మంది నేతలు వచ్చారు. మన త్రివర్ణ పతాక ఆకాశంలో రెపరెపలాడుతోంది. నేను ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి సార్క్ దేశాలను ఆహ్వానించాం. ఇలాంటివి మేం చేయలేకపోయామే అని మీరు ఆశ్చర్యపోయారు. సంకుచితమైన వారు పెద్ద పెద్ద ఆలోచనలు చేయలేరు.

మేడమ్ స్పీకర్ ,

మేం అనుకొన్న ఓ సరికొత్త భారతాన్ని ఆవిష్కరిస్తున్నాం.. అది మా కోరిక. మహాత్మ గాంధీ ఒక ‘యంగ్ ఇండియా’ గురించి పని చేశారు. స్వామి వివేకానందుల వారు నవ భారతావని ని గురించి మాట్లాడారు. మన పూర్వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ కూడా నవ భారతావని ని గురించే చెప్పారు. రండి, సరికొత్త భారతావనిని ఆవిష్కరించడానికి ప్రతిన చేద్దాం. విమర్శలు ఉండడం ప్రజాస్వామ్యానికి మంచిదే. ఈ సంఘర్షణ ఉంటేనే దాని నుండి మనం అమృతాన్ని సృష్టించవచ్చు. తప్పుడు ఆరోపణలు చేయడాన్ని మాత్రం ప్రజాస్వామ్యం హర్షించదు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను అవమానించే హక్కు మీకు లేదు. రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించే వారు ఆయన ప్రసంగాన్ని మరో సారి చదవండి. ఒకసారి చదివినపుడు మీకు అర్థం కాకపోయి ఉండవచ్చు; దయచేసి మళ్లీ చదవండి. భాష పరంగా సందేహాలు ఉంటే పక్క వారి సాయం తీసుకోండి. రాసింది అక్షర సత్యం. దానిని మీరు కాదనలేరు. రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడిన గౌరవ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. రాష్ట్రపతి ప్రసంగానికి ఏకగ్రీవంగా ఆమోదం చెబుదాం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు కృత‌జ్ఞ‌త‌లు.

***