Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘కర్మయోగి సాధన సప్తాహం’ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

‘కర్మయోగి సాధన సప్తాహం’ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


సామర్థ్య నిర్మాణ కమిషన్ (సీబీసీ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘కర్మయోగి సాధన సప్తాహం’ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు.

సామర్థ్య నిర్మాణ కమిషన్ (సీబీసీ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కర్మయోగి సాధనా సప్తాహంను ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి మాట్లాడుతూ..పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

వేగంగా మారుతున్న ప్రపంచ వ్యవస్థలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు తనను తాను ఆధునీకరించుకోవాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచానికి అనుగుణంగా భారత్‌ కూడా శరవేగంగా దూసుకుపోతుందని అన్నారు. ‘‘21వ శతాబ్దంలో మన ప్రభుత్వ సేవలు సందర్భోచితంగా, బాధ్యతాయుతంగా ఉండేలా చూసే ఆ ప్రయత్నంలో కర్మయోగి సాధనా సప్తాహం ఒక ముఖ్యమైన వారధి వంటిది’’ అని తెలిపారు.

నేటి పరిపాలన  మార్గదర్శక తత్వాన్ని వివరిస్తూ..పౌరుడిని అత్యున్నతంగా భావించే ‘నాగరిక్ దేవో భవ’ అనేదే పరిపాలనను నడిపించే ప్రధాన మంత్రమని ప్రధానమంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రజా సేవలను పౌరుల పట్ల మరింత సమర్థవంతంగా, మరింత సున్నితంగా ఉండేలా పునర్నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. ‘‘పాలనను నిజమైన పౌర కేంద్రీకృతంగా మార్చడం ద్వారా దానికి సరికొత్త గుర్తింపునిస్తున్నాం’’అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

సామర్థ్య నిర్మాణ కమిషన్ ఆవిర్భావం గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అనేక సంస్థలు వివిధ అంశాలపై దృష్టి సారించి పనిచేస్తున్నప్పటికీ, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఒక ప్రత్యేక విభాగం ఉండాల్సిన అవసరం స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ‘‘ఈ ఆలోచన నుంచే సామర్థ్య నిర్మాణ కమిషన్‌ ఆవిర్భవించింది. ఇది వ్యవస్థలోని ప్రతి కర్మయోగిని సాధికారికం చేయడంపై దృష్టి సారిస్తుంది’’ అని పేర్కొన్నారు. సీబీసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలిపారు. ఐగాట్ మిషన్ కర్మయోగి విజయవంతాన్ని గుర్తుచేస్తూ.. ఈ ప్రయత్నాలు ఆధునిక, సమర్థవంతమైన, అంకితభావం కలిగిన, సున్నిత మనస్తత్వం గల కర్మయోగిల బృందాన్ని నిర్మిస్తాయని శ్రీ మోదీ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాన్ని వికసిత్‌ భారత్ విస్తృత దార్శనికతతో ముడిపెడుతూ.. ఇటీవల సేవా తీర్థ్ ప్రారంభోత్సవంలో తాను చేసిన ప్రసంగాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, భారీ నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. ‘‘నేటి భారత్‌ తీవ్ర ఆకాంక్షలతో ఉంది. ప్రతి పౌరుడికి కలలు, లక్ష్యాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చడానికి పూర్తి మద్దతు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

పౌరుల జీవన సౌలభ్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే పరిపాలనకు గీటురాయి కావాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రతిరోజూ కొత్త విషయాలను నేర్చుకోవాలని, నిజమైన కర్మయోగి స్ఫూర్తితో తమను తాము మలచుకోవాలని ఆయన కోరారు. ‘‘పౌరుల జీవన ప్రమాణాలు రోజురోజుకూ మెరుగుపడేలా మన పరిపాలన ఉండాలి, ఇదే మన అసలైన ప్రమాణం’’ అని శ్రీ మోదీ చెప్పారు.

పరిపాలనా సంస్కృతిలో ప్రాథమిక మార్పు రావాలని పిలుపునిస్తూ, పాత వ్యవస్థ ‘అధికారి’అనే హోదాకు అమితమైన ప్రాధాన్యతనిచ్చిందని, అయితే నేడు దేశం పూర్తిగా కర్తవ్య స్పూర్తిపై దృష్టి సారిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విధులను నెరవేర్చడం ద్వారానే రాజ్యాంగం హక్కులను కల్పిస్తుందని ఆయన గుర్తు చేశారు. ‘‘ప్రతి నిర్ణయానికి ముందు, మీ కర్తవ్యం ఏంటో మీరు ఆలోచించినప్పుడు.. మీ నిర్ణయాల ప్రభావం దానంతట అదే అనేక రెట్లు పెరుగుతుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రస్తుత పనిని భవిష్యత్తు అనే విశాల కోణంలో చూడాలని ప్రధానమంత్రి శ్రీ మోదీ కోరారు. తమ వ్యక్తిగత నిర్ణయాలు లక్షలాది మంది జీవితాలను ఎలా మార్చగలవో, అలాగే వ్యక్తిగత పరివర్తన సంస్థాగత పరివర్తనకు ఎలా దారితీస్తుందో నిరంతరం ఆలోచించాలని సూచించారు. తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ, ఇటువంటి పరివర్తనాత్మక పనులకు అపారమైన శక్తి అవసరమని పేర్కొన్నారు. ‘‘ఈ శక్తి కేవలం నిస్వార్థ సేవా భావం ద్వారా మాత్రమే లభిస్తుంది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

సాంకేతికత ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ.. గత పదకొండేళ్లుగా పాలన, సేవల పంపిణీ, ఆర్థిక వ్యవస్థతో సహా ప్రభుత్వ కార్యకలాపాల్లో సాంకేతికత విడదీయలేని భాగమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కృత్రిమ మేధ రాకతో ఈ మార్పులు మరింత వేగవంతం కానున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘‘సాంకేతికత, డేటాపై పటిష్టమైన అవగాహన ఉన్నవారే ఉత్తమ నిర్వాహకులుగా, ఉత్తమ ప్రజా సేవకులుగా రాణిస్తారు. నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే ప్రాతిపదిక కావాలి’’ అని శ్రీ మోదీ చెప్పారు. ఈ సాధన సప్తాహంలో ఏఐ రంగంలో సామర్థ్య పెంపు, నిరంతర అభ్యాసంపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆకాంక్షించారు.

దేశ సమాఖ్య నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ..  అన్ని రాష్ట్రాల ఉమ్మడి విజయమే దేశం సాధించే విజయమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దశాబ్దాల కాలంగా ఉన్న అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, వెనుకబడిన రాష్ట్రాలు, బిమారు రాష్ట్రాలుఅనే వర్గీకరణలు ఇప్పుడు తొలగిపోతున్నాయని, రాష్ట్రాల మధ్య ఉన్న అంతరాలను సమాన కృషితో పూడ్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మనం విభాగాల మధ్య ఉన్న అడ్డంకులను తొలగించి, మెరుగైన సమన్వయం, ఉమ్మడి అవగాహన, సంపూర్ణ ప్రభుత్వ విధానంతో ముందుకు సాగాలి. అప్పుడే ప్రతి లక్ష్యం విజయం సాధిస్తుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

సామాన్య పౌరుడికి స్థానిక ప్రభుత్వ కార్యాలయమే మొత్తం ప్రభుత్వ ముఖచిత్రమని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేశారు. అధికారుల పనితీరు, ప్రవర్తన, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థలపై ప్రజలకు ఉండే నమ్మకాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయని చెప్పారు. ‘‘మనం ఏ స్థాయిలో, ఏ పని చేసినా ప్రజల నమ్మకాన్ని కాపాడాలి. అదే మన ప్రజాస్వామ్యానికి పునాది’’ అని శ్రీ మోదీ అన్నారు. సామర్థ్య నిర్మాణ కమిషన్‌ను మరోసారి అభినందిస్తూ.. ‘వికసిత్‌ భారత్’ దిశగా భారత్‌ సాగిస్తున్న ప్రయాణంలో ఈ ‘కర్మయోగి సాధన సప్తాహం’ ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

***