పిఎంఇండియా
డిసెంబర్ 20వ తేదీన పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఉదయం సుమారు 11:15 గంటలకు నదియా జిల్లాలోని రాణాఘాట్ లో జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
సుమారు రూ. 3,200 కోట్ల విలువైన రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేయనున్నారు.
నదియా జిల్లాలో ఎన్హెచ్-34లోని 66.7 కిలోమీటర్ల పొడవైన బరజగులి – కృష్ణానగర్ సెక్షన్ను నాలుగు లైన్లుగా విస్తరించే పనులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. దీంతోపాటు ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఎన్హెచ్-34లోని 17.6 కిలోమీటర్ల పొడవైన బరాసత్–బరజగులి సెక్షన్ను నాలుగు లైన్లు రహదారిగా అభివృద్ధి చేసే పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
ఈ రెండు ప్రాజెక్టులు కోల్కతా, సిలిగురి మధ్య ఒక కీలకమైన అనుసంధాన వారధిగా పనిచేయనున్నాయి. ఇవి ప్రయాణ సమయాన్ని సుమారు 2 గంటల వరకు తగ్గించేందుకు సహాయపడతాయి. తద్వారా ట్రాఫిక్ తగ్గి, వాహనాల రాకపోకలు వేగంగా, సులభంగా జరగనున్నాయి. వాహనాల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గనున్నాయి. కోల్కతాకు పశ్చిమ బెంగాల్లోని ఇతర జిల్లాలతో పాటు పొరుగు దేశాలతో కూడా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. ఈ ప్రాజెక్టులు స్థానికంగా ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడంతోపాటు ఆ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడనున్నాయి.
***