పిఎంఇండియా
డిసెంబర్ 27, 28వ తేదీల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో అయిదో ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు జరగనుంది. జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలపై వ్యవస్థీకృత, నిరంతర చర్చల ద్వారా కేంద్ర–రాష్ట్ర భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ సదస్సు కీలక ఘట్టంగా నిలవనుంది.
ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా సహకార సమాఖ్య స్ఫూర్తితో సాగుతున్న ఈ సదస్సు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసే వేదికగా నిలుస్తుంది. భారతదేశ మానవ వనరుల సామర్థ్యాన్ని వెలికితీసేందుకు, అందరికీ ప్రయోజనాలు అందేలా భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన వృద్ధిని వేగవంతం చేసేందుకు ఈ సదస్సు ఒక ఉమ్మడి ప్రణాళికను రూపొందిస్తుంది.
ఒక ఉమ్మడి అభివృద్ధి అజెండాను ఖరారు చేసే లక్ష్యంతో డిసెంబర్ 26 నుంచి 28, 2025 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. భారత జనాభాను కేవలం సంఖ్యాపరంగా మాత్రమే చూడకుండా పౌరులను మానవ వనరులుగా తీర్చిదిద్దటానికి ఈ సదస్సు కీలకంగా నిలుస్తుంది. ఇందులో భాగంగా విద్యా వ్యవస్థలను బలోపేతం చేయటం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లటం, దేశవ్యాప్తంగా భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా ఉపాధి అవకాశాలను కల్పించటం వంటి అంశాలపై సమగ్ర వ్యూహాలను రూపొందిస్తారు.
కేంద్ర మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్, రాష్ట్రాలు, యూటీలు, పలు రంగాల నిపుణుల మధ్య జరిగిన విస్తృత చర్చల ఆధారంగా అయిదో జాతీయ సదస్సు ‘వికసిత్ భారత్ కోసం మానవ వనరులు‘ అనే ఇతివృత్తంపై దృష్టి సారించనుంది. ఇందులో రాష్ట్రాలు, యూటీలు అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులు, వ్యూహాలను పొందుపరుస్తారు.
ఈ ప్రధాన ఇతివృత్తం ద్వారా సుదీర్ఘ చర్చలకు గుర్తించిన అయిదు కీలక రంగాలు: బాల్య విద్య, పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, క్రీడలు, ఇతర కార్యక్రమాలు.
వీటితో పాటు రాష్ట్రాల్లో నిబంధనల సరళీకరణ, పాలనలో సాంకేతికత: అవకాశాలు, ముప్పు, నివారణా చర్యలు, స్మార్ట్ సరఫరా వ్యవస్థ, మార్కెట్ అనుసంధానానికి అగ్రి–స్టాక్, ఒక రాష్ట్రం, ఒక ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రం, ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ, ఎల్డబ్ల్యూఈ అనంతరం భవిష్యత్ ప్రణాళికలపై ఆరు ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు.
వారసత్వం, రాతప్రతుల పరిరక్షణ డిజిటలైజేషన్, అందరికీ ఆయుష్ – ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో విజ్ఞాన అనుసంధానం వంటి అంశాలపై అదనపు ప్రత్యేక చర్చలు జరుగుతాయి.
గత నాలుగేళ్లుగా ఈ జాతీయ ప్రధాన కార్యదర్శుల సదస్సును నిర్వహిస్తున్నారు. మొదటి సదస్సు జూన్ 2022లో ధర్మశాలలో జరగ్గా.. జనవరి 2023, డిసెంబర్ 2023, డిసెంబర్ 2024లో న్యూఢిల్లీలో తదుపరి సదస్సులు జరిగాయి.
ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు, పలు రంగాల నిపుణులు పాల్గొంటారు.
***