పిఎంఇండియా
రాజ్యసభ నుంచి పదవీ విరమణ పొందుతున్న వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. పదవీ విరమణ పొందే సహచరులను గౌరవించే అవకాశం లభించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి సందర్భాలు సభను పార్టీలకతీతంగా ఒక్కటి చేస్తాయని, అందరిలో ఒకే భావనను నింపుతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సభ్యులు తిరిగి సభకు వచ్చినా, సామాజిక సేవ వైపు మళ్లినా.. వారి అనుభవం దేశానికి గొప్ప ఆస్తిగా నిలుస్తుందన్నారు. ఎన్నో మార్పులతో కూడిన రాజకీయ రంగంలో ప్రయాణం ఎప్పటికీ ముగియదని.. అనుభవజ్ఞులైన నాయకులకు నూతన అవకాశాలను అందిస్తుందని ఆయన అన్నారు. “రాజకీయాల్లో ఎప్పుడూ ముగింపు ఉండదు. మీ అనుభవం, కృషి దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి” అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
సభకు వీడ్కోలు పలుకుతున్న సభ్యుల సహకారాన్ని కొనియాడుతూ.. శ్రీ దేవెగౌడ, శ్రీ మల్లికార్జున ఖర్గే, శ్రీ శరద్ పవార్ వంటి అనుభవజ్ఞులను రోల్ మోడల్స్గా తీసుకోవాలని కొత్త తరం ఎంపీలకు ప్రధానమంత్రి సూచించారు. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ జీ మృదు స్వభావాన్ని, క్లిష్ట పరిస్థితుల్లోనూ సభ విశ్వాసాన్ని కాపాడుతూ ఆయన వ్యవహరించిన తీరుని ప్రశంసించారు. అంకితభావంతో కూడిన సేవ, సమాజం అప్పగించిన బాధ్యతల పట్ల నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. “సమాజం ఇచ్చిన బాధ్యతలకు కట్టుబడి ఉండటాన్ని ఈ సీనియర్ నాయకుల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
మారుతున్న సభ సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ.. నేటి 24×7 మీడియా వాతారవరణం అందరినీ అప్రమత్తం చేసినప్పటికీ పార్లమెంటు చరిత్రలో హాస్యం, చమత్కారం ఇప్పటికీ అంతర్భాగంగా ఉన్నాయని పీఎం శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రతి రెండేళ్లకోసారి ఒక బృందం పదవీ విరమణ పొందటం వల్ల నిరంతరం జ్ఞానమార్పిడి జరుగుతుందని, నూతనంగా వచ్చే సభ్యుల ద్వారా వారసత్వ పరిరక్షణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సంస్థాగత కొనసాగింపు, ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేసేందుకు కీలకమని శ్రీ నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.”ఈ వారసత్వం పార్లమెంటరీ వ్యవస్థను సుసంపన్నం చేసే నిరంతర ప్రక్రియ” అని ప్రధానమంత్రి కొనియాడారు.
రాజ్యసభకున్న విశిష్ట ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. మన పార్లమెంటరీ వ్యవస్థకు “రెండో అభిప్రాయం” అపారమైన బలాన్ని చేకూరుస్తుందని పీఎం శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిర్ణయాలు ఒక సభ నుంచి మరొక సభకు వెళ్లే ప్రక్రియ, శాసన నిర్మాణంలో కీలకమైన కోణాన్ని జోడించడమే కాక, దేశానికి మెరుగైన ఫలితాలని అందిస్తుందన్నారు. ఈ ప్రజాస్వామ్య వారసత్వం జాతీయ నిర్ణయాధికారంలో పారదర్శకతను, విశ్లేషణను పెంపొందిస్తుందని తెలిపారు. “పార్లమెంటరీ వ్యవస్థకు రెండో అభిప్రాయం అందించే విలువైన సహకారాన్ని సుమున్నతంగా గౌరవించుకోవాలి” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
పదవీ విరమణ పొందుతున్న సభ్యుల పదవీ కాలంలో పాత, కొత్త పార్లమెంటు భవనాల్లో సేవలందించిన అరుదైన గౌరవాన్ని పొందారని ప్రధానమంత్రి అన్నారు. నూతన పార్లమెంటు భవనంలో జరిగిన ఈ చరిత్రాత్మక మార్పులో భాగస్వాములవటం.. వారి ప్రజా జీవితంలో ఒక సరికొత్త, కీలక జ్ఞాపకంగా నిలిచిపోతుందని అన్నారు. సభను “గొప్ప బహిరంగ విశ్వవిద్యాలయం“గా శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ సభ దేశంలోని సంక్లిష్ట అంశాలపై అవగాహన కల్పించే విశిష్టమైన విద్యను సభ్యులకు అందిస్తుందని తెలిపారు. “దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించటానికి, వ్యక్తిగత ఎదుగుదలకు ఇక్కడ గడిపిన ఆరేళ్లు ఎంతో కీలకం” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
సభ్యుల పార్లమెంటరీ అనుభవం ద్వారా దూరదృష్టి, సామర్థ్యం పెరిగాయని శ్రీ నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. పదవీ విరమణ పొందుతున్న సభ్యులు అధికార వ్యవస్థలో ఉన్నా, స్వతంత్రంగా సామాజిక సేవ చేస్తున్నా దేశ నిర్మాణానికి వారు అందించిన అమూల్యమైన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. పదవీ విరమణ పొందుతున్న ప్రజాప్రతినిధుల సుదీర్ఘ, అంకితభావంతో కూడిన సేవలను పీఎం శ్రీ నరేంద్ర మోదీ మరోసారి కొనియాడుతూ, వారి నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు. “పదవీ విరమణ పొందుతున్న సభ్యులందరి సహకారానికి మరోసారి అభినందనలు, వారి సేవలకు ప్రశంసలు తెలియజేస్తున్నా” అంటూ శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ముగించారు.
***
Speaking in the Rajya Sabha. https://t.co/TV2X34E4D1
— Narendra Modi (@narendramodi) March 18, 2026